సూర్యాపేట, జూలై 16 : సమైక్య రాష్ట్రంలో రేషన్ కార్డు కోసం కాళ్లు అరిగేలా తిరిగినా కనికరించే నాథుడే లేడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేదలందరికీ ఆహార భద్రత కార్డులు అందించాలని నిర్ణయించారు. ఒక్క సంతకంతో దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో ఇవ్వని ఆహార భద్రత కార్డులను అర్హత కలిగిన పేద కుటుంబాలన్నింటికీ అందజేశారు. కార్డుదారులకు ఒక్కో వ్యక్తికి ఆరు కిలోల బియ్యం అందిస్తున్నారు. అయితే.. కొత్తగా పెళ్లయిన వారికి, కుటుంబం నుంచి వేరుపడిన వారు ఆహార భద్రత కార్డు కోసం వివిధ దశల్లో దరఖాస్తు చేసుకున్నారు. వాటిని పరిశీలించి అర్హులకు కొత్త కార్డులు మంజూరు చేస్తున్నారు.
సూర్యాపేట జిల్లాలో 11,113 దరఖాస్తులు
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 11,113 మంది రేషన్ కార్డుల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం వివిధ స్థాయిల్లో విచారణ చేపట్టి 9,369 మంది అర్హులుగా గుర్తించి వారికి కార్డులు అందించాలని నిర్ణయించింది. తిరస్కరించిన 1,744 దరఖాస్తుల్లో అత్యధికంగా రెండు సార్లు దరఖాస్తు చేసుకున్న వారు, ఆర్థికంగా స్తోమత కలిగిన వారు ఉన్నారు. జిల్లాలోని 23 మండలాల్లో 610 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వాటి పరిధిలో 3,16,568 ఆహార భద్రత కార్డులు ఉండగా.. 9,26,907 మంది లబ్ధిదారులు ఉన్నారు. అదనంగా మరో 9,369 కార్డులు జత కానున్నాయి. దీంతో ఆహార భద్రత కార్డుల సంఖ్య 3,25,937కు చేరనున్నది. మొత్తం లబ్ధిదారుల సంఖ్య 3.50 లక్షలకు చేరుకోనున్నది.
నల్లగొండ జిల్లాలోని 31 మండలాల్లో 991 రేషన్ షాపులు ఉన్నాయి. వాటి పరిధిలో ఇప్పటి వరకు 4,26,807 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. 13,12,722 మంది లబ్ధిదారులు ఉన్నారు. కొత్తగా మరో 13,800 కార్డులు మంజూరు కావడంతో ఆహార భద్రత కార్డులు 4,40,607కు చేరుకోనున్నాయి. లబ్ధిదారుల సంఖ్య 13,52,202 మందికి చేరనుంది.
26 నుంచి పంపిణీకి ఏర్పాట్లు
ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేయనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అందజేయనున్నారు.