వాళ్లంతా గిరిజనులు. చదువు లేదు. సంపద లేదు. ఇండ్లు కూడా లేవు. కూలీ చేసుకోవడం, తినడం. అంతే వారి జీవితం. అలాంటి గిరిజన మహిళలు ఇప్పుడు, నెలకు రూ.6000 సంపాదిస్తున్నారు. పిల్లల్ని చదివిస్తున్నారు. స్వర వారి జీవితాల్లో వెలుగులు నింపింది.టెక్నాలజీ పెరుగుతున్నది. విద్యా సౌకర్యాలూ మెరగవుతున్నాయి. ఉపాధి మార్గాలు సులభతరం అవుతున్నాయి. కానీ గిరిజన పల్లెల్లో మాత్రం పరిస్థితిలో పెద్దగా మార్పుల్లేవు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేండ్లవుతున్నా ఇంకా చదువు, ఉపాధి మార్గాలు లేక విలవిల్లాడుతున్నారు. ఆరోగ్యంపై అవగాహన లేక మహిళలు, చిన్నపిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు. మరి మార్పు రావాలంటే ఏం చేయాలి? బాధ్యతగల పౌరులుగా మనమూ ‘ఆశ’లా ముందడుగు వేయాలి. ‘స్వర వావ్’ (వాయిస్ ఆఫ్ ఉమెన్) పేరుతో ఓ సంస్థను ఏర్పాటుచేసి గిరిజన మహిళల ఆర్థికాభివృద్ధికి కృషిచేస్తున్నది ఆశ.
అది 2018. కేరళలలోని దుంగర్పూర్. గాంధీ ఫెలోషిప్లో భాగంగా నిర్వహించిన ‘ఛేంజ్ లీడర్స్’ ప్రాజెక్ట్. టీమ్లీడర్ ఆశ స్కారియా. నెలల తరబడి అక్కడే ఉండి ప్రజలతో మమేకమయ్యారు. వారి పరిస్థితులు తెలుసుకున్నారు. గిరిజన మహిళల వెనుకబాటుకు కారణాలను తెలుసుకున్నారు. తరాలు మారినా గిరిజనుల తలరాతలు ఎందుకు మారడంలేదో అధ్యయనం చేశారు. వాళ్లను ఆధునికతకు, అభివృద్ధికి చిరునామాగా మార్చాలని అనుకున్నారు. ఆ ఆలోచనలోంచి వచ్చిన ‘స్వర వావ్’ ద్వారా గిరిజనులను సిరిజనులుగా మార్చేశారు..
దుంగర్పూర్ సరిహద్దుల్లోని గిరిజన మహిళలకు ‘స్కిల్ డెవలప్మెంట్ క్యాంప్’ నిర్వహించారు. స్వయం ఉపాధికి తోడ్పడే పలు రకాల పనుల్లో శిక్షణ ఇప్పించారు. అలా మెజారిటీ మహిళలు శిక్షణ పొందింది మాత్రం ‘టైలరింగ్’లోనే. చేంజ్ లీడర్స్ ప్రాజెక్ట్ బృంద సభ్యులు జైదీ, వివేక్, తన్వీర్ ఖారా, స్వస్తిక ధర్, గోకుల్ పద్మనాభంతో చర్చించి.. ఆశ ఈ శిక్షణా తరగతులను ఏర్పాటు చేశారు. వీటిని కేంద్ర గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు, సీఎస్ఆర్ పథకాలకు అనుసంధానం చేశారు. అనతికాలంలోనే దుంగర్పూర్ సమీప గిరిజన మహిళలలు ఫ్యాషన్ డిజైనర్ల స్థాయిలో వినూత్న డిజైనర్లను రూపొందిస్తూ విదేశాల్లోని భారతీయులకు అందిస్తున్నారు.
‘స్వర వావ్’ ఎన్జీవో ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒక్క దుంగర్పూర్లోనే 70 మందికి పైగా గిరిజన మహిళలో టైలరింగ్లో శిక్షణ తీసుకొని ప్రొఫెషనల్ రూరల్ డిజైనర్స్గా గుర్తింపు పొందారు. చాలా తక్కువ సమయంలో అనుకున్నదానికంటే ఎక్కువ ఫలితాలు రావడంతో దీనిని విస్తరించారు ఆశ. కేరళతో పాటు పశ్చిమబెంగాల్లోని గిరిజన మహిళలకు కూడా ‘స్వర వావ్’ ద్వారా టైలరింగ్లో శిక్షణ ఇస్తున్నారు. తయారీకి మాత్రమే పరిమితం కాకుండా, ఆన్లైన్లో వాటిని అమ్మకానికి పెట్టాలి? డబ్బులు ఎలా వస్తాయి? వ్యాపార సూత్రాలు ఏంటి? వంటి విషయాలపై కూడా అవగాహన కల్పించారు.
ప్రస్తుతం ‘స్వర వావ్’ ద్వారా ‘సేవా భారత్’ ఫౌండేషన్కు సేవలందిస్తున్నారు గిరిజన మహిళలు. ఫోన్ అంటే ఏమిటో కూడా తెలియని గిరిజన తండాల్లో ఇప్పుడు స్మార్ట్ఫోన్లు కనిపిస్తున్నాయి. ట్యాబ్లతో తమ ప్రోడక్ట్ గురించి తెలుసుకుంటున్నారు. ఈ సంవత్సరం పూర్తయ్యేసరికి.. ఒక్కో మహిళ నెలనెలా కనీసం రూ.6000తగ్గకుండా సంపాదించాలన్నదే తమ లక్ష్యమని చెప్తున్నారు ఆశ. మహిళలకు ఉపాధి మార్గం చూపించాలని ప్రారంభించిన ‘స్వర వావ్’ ద్వారా ఇప్పుడు మహిళా సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. మహిళల అక్రమ రవాణాపై కూడా దృష్టి సారిస్తున్నారు.
కేరళలోని ఎట్టుమనూరుకు చెందిన ఆశ స్కారియా ఉన్నత చదువులు చదివింది. మంచి ఉద్యోగం సంపాదించింది. ఒకసారి ప్రాజెక్ట్ పనిమీద దుంగర్పూర్ వెళ్లినప్పుడు అక్కడి గిరిజన మహిళల పరిస్థితి చూసి చలించిపోయింది. ఉద్యోగం మానేసి గిరిజన మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తూ ‘స్వర వావ్’ ఎన్జీవోను స్థాపించింది. టెక్నాలజీ అంటే ఏంటో తెలియని మహిళలచే ఆన్లైన్ వేదికగా చేనేత ఉత్పత్తులను రూపొందించేలా కృషి చేస్తున్నది. @swaravow ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా స్వర వావ్ (వాయిస్ ఆఫ్ ఉమెన్) గురించి ప్రచారం కల్పిస్తున్నది.