Nawabs Kitchen | మార్చి 7, 2022. తెలుగు, ఇంగ్లిష్ ప్రధాన దినపత్రికల్లో ఒక ఫుల్ పేజీ యాడ్ వచ్చింది. కోట్ల రూపాయల విలువైన ప్రకటన అది. అందులోనూ ఒక యూట్యూబ్ చానెల్ గురించి.. ‘క్రియేటింగ్ ఫర్ ఇండియా’ హ్యాష్ ట్యాగ్తో యూట్యూబ్ అధికారికంగా వెలువరించింది. దేశవ్యాప్తంగా క్రియేటివ్ ఆంత్రప్రెన్యూర్స్ 6,83,900 ఫుల్ టైం ఉద్యోగాలు సృష్టించారనేది యూట్యూబ్ లెక్క. ఆ లెక్కలో నిలిచి గూగుల్ అనుబంధ సంస్థ అయిన యూట్యూబ్ మనసు దోచింది ‘ నవాబ్స్ కిచెన్’.
ఖాజా మొయినుద్దీన్, శ్రీనాథ్రెడ్డి, భగత్రెడ్డి – ఈ ముగ్గురినీ దోస్తులు త్రీ మస్కెటీర్స్ అని ముద్దుగా పిలిస్తే.. గిట్టనివాళ్లు త్రీ ఇడియట్స్ అనేవాళ్లు. మీడియాలో పదమూడేండ్ల అనుభవం వీరిది. అయినా ‘ఏం సాధించాం?’ అన్న ప్రశ్న నిత్యం వెంటాడేది. ఇది కాదు జీవితం అనుకున్నారు. కట్ చేస్తే.. ‘నవాబ్స్ కిచెన్’ యూట్యూబ్ చానెల్తో విజయం సాధించారు. వేలమంది అనాథలు, నిరాశ్రయుల ఆకలి తీరుస్తున్నారు. ‘ఏదో సాధించాలి’ అనే ఆరాటంతో మొదలైన ముగ్గురు మిత్రుల సేవా ప్రయాణం ఎన్నో మలుపులు దాటుకుని గమ్యం చేరుకుంది. ప్రోగ్రామింగ్లో ఉన్నప్పుడు పనితోపాటు బయటి పరిస్థితులను బాగా పరిశీలించేవారు. ఆ పరిశీలనలో ముగ్గురి గుండెలనూ కదిలించిన విషయం.. అనాథల ఆకలి. ముగ్గురిదీ ఒకే ఐడియా. ఫుడ్ బేస్డ్ యూట్యూబ్ చానెల్ పెట్టాలనుకున్నారు. ఆ చానెల్ ద్వారా అనాథల ఆకలి తీర్చాలనుకున్నారు. నిజాయతీగా పనిచేసి ఎందరికో స్ఫూర్తి నింపాలని తీర్మానించారు. ముగ్గురిదీ దిగువ మధ్యతరగతి నేపథ్యమే. అయితేనేం, తలా ముప్పైవేల రూపాయలు వేసుకొని రూ.90 వేలతో 2017 సెప్టెంబర్లో ‘ఫుడ్ ఫర్ ఆల్ ఆర్ఫన్స్’ ట్యాగ్లైన్తో ‘నవాబ్స్ కిచెన్’ యూట్యూబ్ చానెల్ను లాంచ్ చేశారు.
నెల గడిచింది. మార్నింగ్ షిఫ్ట్ ఆఫీస్కు వెళితే ‘నవాబ్స్ కిచెన్’ షూటింగ్ సాయంత్రం పెట్టుకునేవారు. ఒకవేళ ఆఫీస్ సెకండ్ షిఫ్ట్ ఉంటే పొద్దున్నే పని చూసుకునేవారు. అలా ఐదు వీడియోలు చేశారు. వీటిలో ‘ఎగ్ ఫ్రైడ్ రైస్’ వీడియో బాగా వైరల్ అయ్యింది. ప్రజెంటేషన్కు నూటికి నూరు మార్కులు పడ్డాయి. వంట ఏదైనా కానీ పదిమంది అనాథల ఆకలి తీరుస్తుందన్న ముద్రపడింది. విషయం ఆఫీస్లో తెలిసింది. ‘యూట్యూబ్ చానెల్ రన్ చేసుకుంటారా? జాబ్ చేస్తారా? ఏదైనా ఒక్కటే చేయండి’ అన్నాడు బాస్. బాగా ఆలోచించి ‘జాబ్ మానేద్దాం’ అని ఫిక్సయ్యారు. అప్పుచేసి మరీ వీడియోలు చేశారు. కుకింగ్, ప్రజెంటేషన్, ప్లానింగ్ మొయిన్ పర్యవేక్షిస్తే.. కెమెరా వర్క్ భగత్ చూసుకునేవాడు. శ్రీనాథ్ ఎడిటింగ్, ప్రమోషన్ వ్యవహారాలు భుజాని కెత్తుకున్నాడు.
నవాబ్స్ కిచెన్ ద్వారా ఇప్పటివరకు 592 వీడియోలు చేశారు. 90వేల మందికిపైగా ఆకలి తీర్చారు. రుచికరమైన వంటలను ప్రపంచానికి పరిచయం చేస్తూ సక్సెస్ఫుల్ ఫుడ్ప్రెన్యూర్స్గా నిలుస్తున్నారు. ప్రతీ వీడియోకు రూ.25 వేలకుపైగా ఖర్చు అవుతుంది. కొత్తకొత్త వంటల గురించి బుక్స్, జర్నల్స్, ఇంటర్నెట్ ద్వారా శోధిస్తాడు మొయినుద్దీన్. ఇటీవల యూట్యూబ్ వాళ్లు 15 బెస్ట్ చానెల్స్ను సృజనాత్మక పారిశ్రామికవేత్తలుగా గుర్తించింది. ఇండియా మొత్తంలో ముగ్గురిని హీరో ఆఫ్ ది ఇయర్గా ప్రకటించింది. వారిలో తెలంగాణ నుంచి ఎంపికైన ఒకే ఒక్క యూట్యూబర్ ‘నవాబ్స్ కిచెన్’ ఖాజా మొయినుద్దీన్. ఈ ప్రక్రియ కోసం యూట్యూబ్ ఇండియా ఎనిమిది నెలలు అధ్యయనం చేసింది. మొయిన్పై 3.30 నిమిషాల పాట చిత్రీకరించింది. దాదాపు రూ.కోటి ఖర్చు చేసి ప్రధాన ఆంగ్ల, తెలుగు దినపత్రికల్లో ఫుల్పేజీ యాడ్ ఇచ్చింది. ఈ పురస్కారం నవాబ్స్ కిచెన్ను మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. అనాథల ఆకలి తీర్చడంతోపాటు వారికి నాణ్యమైన విద్యను అందించేందుకు ఓ విద్యాలయం ఏర్పాటు చేయాలన్నది తమ ఆశయమని చెబుతారు మొయినుద్దీన్, భగత్రెడ్డి, శ్రీనాథ్రెడ్డి. ‘నవాబ్స్ స్కూల్’ కల కూడా నిజం కావాలని కోరుకుందాం.
తాముచేస్తున్న పనివల్ల అనాథల ఆకలి తీరుతుందనే సంతృప్తి ఆ ముగ్గురినీ ముందుకు నడిపించింది. నార్సింగి, మణికొండ, ఉప్పల్, ఘట్కేసర్లోని అనాథాశ్రమాల నుంచి ప్రారంభమైన ఫుడ్ డ్రైవ్స్ హనుమకొండ, వరంగల్, గుంటూరు, తెనాలి వరకు వెళ్లాయి. ఓ దశ దాటాక రాబడి ప్రారంభమైంది. తొలి సంపాదన తలా రూ.14వేలు. ఊపిరి పీల్చుకున్నారు. నవాబ్స్ కిచెన్ను ‘చారిటీ’ కోణంలో చూసిన కొందరు స్పాన్సర్ షిప్కు సిద్ధమయ్యారు. కరోనా సమయంలో సేవలను వలస కూలీలకు కూడా విస్తరించారు. ఇప్పుడు, చానెల్ సబ్స్క్రయిబర్లు 25 లక్షల పైమాటే.
“Platform 65 | రైళ్లోనే రుచికరమైన భోజనం.. హైదరాబాద్లోని ఓ రెస్టారెంట్ వింత కాన్సెప్ట్”
“Engineers Biryani | జాబు వదిలేసి బిర్యానీ అమ్ముకుంటున్న ఇంజినీర్లు”
“ఈ జైలు భోజనం చాలా టేస్టీ !! మీరూ టేస్ట్ చేయాలని అనుకుంటున్నారా?”