కొన్ని కబుర్లు విజ్ఞానదాయకాలు. జిజ్ఞాస ప్రేరకాలు. విన్న కొద్దీ వినాలనిపిస్తాయి. కబుర్లు చెబుతున్న పెద్ద మనిషిలో.. ఏ కృష్ణ పరమాత్మనో దర్శించుకుంటాం. ఎబ్బీయస్ ప్రసాద్ పడక్కుర్చీ కబుర్లు కూడా అంతే లోతైనవి. ఇప్పటికే రచయిత పడక్కుర్చీపై సృజనాత్మక పేటెంట్ సాధించేశారు.
‘పడక్కుర్చీ కబుర్లు-15 ’లో నాలుగు సుప్రసిద్ధ తెలుగు సైంటిఫిక్ నవలలను పరామర్శించారు. అందులో మూడు యండమూరివే.. చీకట్లో సూర్యుడు, అష్టావక్ర, యుగాంతం. మరొకటి చిత్తర్వు మధు ఐసిసియు. ‘పడక్కుర్చీ కబుర్లు-16’ లో నాలుగు అనువాద నవలల్ని పరిచయం చేశారు. ‘ద ప్రిన్స్ అండ్ ద పాపర్’, ‘ద కౌంట్ ఆఫ్ మాంట్క్రిస్టో’, ‘స్పార్టకస్’, ‘ఎ టేల్ ఆఫ్ టూ సిటీస్’.. దేనికదే ప్రత్యేకం.
రచయిత విశ్లేషణ కూడా ఆ ఘనతను నిలబెట్టేలా ఉంది. పదిహేడో భాగం పడక్కుర్చీ కబుర్లు ఆదిశంకరుల కృతులను పరామర్శించాయి. ‘శంకరులది ఆధ్యాత్మిక సోషలిజం. ఏ విషయాన్ని అయినా ఆయన తర్కబద్ధంగా చెప్పారు. మూఢభక్తితో నమ్మమని చెప్పలేదు. ఆలోచించి చూడమన్నారు’ అంటారు రచయిత. పద్దెనిమిదో భాగం పడక్కుర్చీ కబుర్లు.. నాలుగు చారిత్రక నవలలను పరిచయం చేస్తాయి.
పాలంకి సత్య ‘యుగాది’, అడివి బాపిరాజు ‘గోన గన్నారెడ్డి’, మల్లాది వసుంధర ‘తంజావూరు పతనం’, సత్యప్రభ ‘ఆంధ్ర మహా విష్ణువు గాథ’.. కథా గమనాన్ని వివరిస్తూనే చారిత్రక అంశాలసు స్పృశించారు. ఉద్గ్రంథాలను చదవలేని తరానికి ఇలాంటి సూక్ష్మ రచనలు.. సృజనాత్మక మోక్షాన్ని ప్రసాదిస్తాయి.
పడక్కుర్చీ కబుర్లు
– 15 నుంచి 18