ఆరోజు ఇక నేను ఎలాగైనా సరే.. చనిపోవాల్సిందేనని నిర్ణయించుకున్నాను. నిజం.. ‘ఇక నేను బతకడం దండగ’ అనిపించింది. అందుకే ఈ నిర్ణయం! ఈ ప్రపంచంలో ఉన్న దారులన్నీ మూసుకొని పోయి.. బతకడం కంటే చావడం మేలు అనుకునే క్షణం.. జీవితంలో ఎంతమందికి వస్తుందో తెలీదు కానీ, ఒంటరి ఆడపిల్లనైన నాకు ఇరవై ఏళ్లు నిండకుండానే వచ్చింది.
నాపేరు సైది. దేవరకొండ తాలూకాలో అడివికి దగ్గర ఉన్న మారుమూల లంబాడా తండా మాది. నేను పుట్టక ముందే మా అమ్మ – నాయినకు నలుగురు ఆడ పిల్లలు పుట్టినరట. మగ పిల్లగాడు కావాలని వరుసగా కంటనే పోయినరు. నాకు ఊహ తెలిసేటప్పటికే పెద్ద అక్కకు పెండ్లి అయిపోయింది. పెద్ద అక్క తర్వాత పుట్టిన ఇద్దరు పిల్లలు పురిట్లోనే పోయినరట. నాలుగో అక్కను.. అందంగా ఉందని పుట్టిన ఏడాదికే, ఎవరో హైదరాబాద్లో ఉండేటోళ్లు కొనుక్కొని పోయినరట. పిల్లలను కనడమే తప్ప సాకలేని నాయిన ఐదువేలకు బిడ్డను అమ్మినడు. ఆ తర్వాత రెండేళ్లకు నేను పుట్టిన్నంట. ఇయ్యన్నీ మా అమ్మ చెప్పిన ముచ్చట్లు.
మా దేవరకొండ లంబాడా తండాల్లో కొడుకు పుడితే బాగా సంబరం చేసుకుంటరు. పదేళ్లు సాకితే ఏ ఆసామి దగ్గర జీతానికి పెట్టినా డబ్బులు వస్తాయని. అదే ఆడపిల్ల పుడితే ఎవలకో ఒకలకు అమ్ముతరు. మా తండాలో కొంతమంది ఏజెంట్లు ఉంటరు. పురిట్ల పాప నుంచి, నలబై ఏండ్ల నడికారు మనిషి దాంక ఎవరినైనా అమ్మిపెడతారు. చానామంది ఆడబిడ్డలు పుట్టేది మా తండా మట్టిల.. కానీ, కలిసేది మాత్రం ఏ బొంబాయి, పూనా మట్టిలోనో!
ఇరవై ముప్పై ఏళ్ల కిందట మా తండాలు ఇప్పటిలా ఉండేయి కాదు. ఎంత పిలిచినా చుక్క వాన వచ్చేది కాదు. కానీ, పిలవకుండానే కరువు వచ్చేది. అప్పట్లో వరుసగా ఏటా కరువులే. తాగడానికే గుక్కెడు నీళ్లు దొరికేయి కాదు. బుక్కెడు బువ్వ దొరక్క.. కళ్లు లోపలికి గుంజుకపోయి, బొక్కలు తేలిపోయి.. మడుసులు నడిచే అస్థిపంజరాల మాదిరి ఉండేవారు. తల్లికే తిండిలేకపోతే ఇంగ పసిపిల్లలకు పాలు ఏడికెల్లి వస్తయి. పిల్లలను సంపుకొని బొందల గడ్డ సమాధి చేసే కంటే.. అమ్ముకోవడం మేలు అనుకునేటోళ్లు. కన్నపేగును కూడా దూరం చేసుకునేంత కటిక పేదరికం ఆ రోజుల్లో ఉండేది.
నేను మా నాయిన పోలికతోని నల్లగా పుట్టిన. కాకి నలుపు. అందుకే నన్ను ఎవలూ కొనుక్కోలేదు. నా వల్ల డబ్బులు రాలేదని నాయినకు కోపం. నా పోలిక ఆయనదే ఐనా కాలీ చ్వారీ (నల్ల పోరీ) అని తిట్టేవాడు. రోజూ సాయంత్రం తాగి వచ్చి అమ్మను, నన్ను బాగా కొట్టేవాడు. నన్ను
‘ఎటైనా వెళ్లిపో’ అని.. ‘ఏ చెరువులోనో దూకి సచ్చిపో’ అని గొడ్డును బాదినట్టు బాదేవాడు. అన్ని చిత్రహింసలు పడ్డ రోజు కూడా నేను చచ్చిపోవాలని అనుకోలేదు. కానీ, ఈరోజు అలాంటి పరిస్థితి వచ్చింది.
చిన్నపుడు అమ్మతోపాటే అడివిలోకి పోయేదాన్ని. పొయిలకు కట్టెలో, తునికి పండ్లో.. ఏవి దొరికితే అవి తెచ్చుకునేటోళ్లం. అమ్మ మోదుగు చెట్టును చూపించి ఒక ముచ్చట చెప్పేది.
మోదుగు విత్తనం నేల మీద పడితే చాలు. యాభై ఏండ్ల పాటు వర్షాలు కురవకపోయినా సరే.. ఆ గింజ తట్టుకొని నిలబడతదంట. వానలు పడి తడి తగలగానే, మళ్లీ మొలక వస్తుందట. మెల్లగ మొక్కై పెరిగి, పెద్ద చట్టై.. వేయి పూలై విరబూస్తుందట. మనిషి కూడా తన కష్టకాలంలో పానం నిలుపుకోవాలని.. ఆపదలు తట్టుకొని నిలబడాలని చెప్పేది.
మా తండా పక్కన పెద్ద తండాల స్కూలు ఉంది. అది ఆడపిల్లల స్కూలు, హాస్టల్ కూడా ఉంది. ఆ సార్లు మా తండాలో పిల్లల సర్వే కోసం వచ్చినపుడు నన్ను హాస్టల్ల జాయిన్ చేయమని అమ్మకు చెప్పినరు. అట్ల తిండి కోసం నేను హాస్టల్ల జాయిన్ అయిన. మా అమ్మను వదిలిపెట్టి ఉండలేను కానీ.. హాస్టల్లో నాయిన ఉండడు, కొట్టడు కద. అందుకని హాస్టల్కి పోయిన. బడి నడిచినన్ని రోజులు బానే ఉండేది. కానీ, దసరాకు, ఎండాకాలానికి సెలవులు వచ్చినయంటే గుబులు. ఇంటికి పోవాలంటే రంది. ఇంటికి పోతే నాయిన కొడుతడు. సంపుతడేమో అన్న భయం. అందుకే మా ఇంటికి పోయినా.. రాత్రి నాయినకు కనపడకుండా మా అమ్మమ్మ ఇంటికో, వేరే వాళ్ల ఇంటిదగ్గరో పడుకునేదాన్ని. అట్ల స్కూలు, హాస్టల్ తెరిచేదాక మిడుకు మిడుకుమంటూ బతికేదాన్ని.
ఓరోజు అటువంటి సెలవుల్లోనే.. నాయిన అడివిలో పాము కరిచి చనిపోయిండు. పాము కాటుకు ముఖం నల్లగా మారిన నాయినను చూసి.. నాకు మాట రాలేదు. జనం కోసమైనా ఏడ్వడానికి ఎంత తన్నుకున్నా దుఃఖం రాలేదు. నాయిన చనిపోయిన బాధకంటే.. ఇక నన్ను కొట్టడన్న సంగతే సంతోషంగా అనిపించింది.
నా చదువు గురించి చెప్పాలంటే అదో పెద్ద కథ. బాగ చదువుకోవాలని మా టీచర్లు చెప్పే ముచ్చట బాగా నచ్చేది. నేను బాగ చదువుకోని ఉద్యోగం సంపాదించి.. పుట్టెడు కష్టాలు పడిన మా అమ్మను సుఖంగా చూసుకోవాలని అనుకునేదాన్ని. కానీ, ఎంత ప్రయత్నించినా మా భాషకు.. టీచర్లు మాట్లాడే భాషకు చాలా తేడా ఉండేది. ఆ సదువు, మా భాష ఒక్కటి కాదు. నానా తిప్పలు పడి తెలుగు భాష పూర్తిగా నేర్చుకునే సరికి.. పిడుగులాగ ఇంగ్లిష్ భాష వచ్చింది. పొట్ట కోసినా ఇంగ్లిష్ పలకడం రాకపోయేది. మా సార్లు కొట్టికొట్టి చేతులు కాయలు కాసినయి కానీ.. ఇంగ్లిషు భాష మాత్రం రాలేదు. అసలు ఏమన్న అర్థమైతే కద.. చెప్పడానికి.
ఏడో తరగతిల ముందో ఎనకో చూసి పరీక్ష రాసి నెట్టుకొచ్చిన. కానీ, పదో తరగతిల మాత్రం ఫెయిలై పోయిన. ఇప్పుడు హాస్టల్ నుంచి ఎల్లి
పోవాలె. మల్ల తండాకు పోవాలె. సప్లిమెంటరీ పరీక్ష రాసి పాసు కావాలె. పాసైతేనే ఇంటర్. లేదంటే అంతే.. అన్ని సబ్జెక్టులు పాసైన కానీ అది ఇంగ్లిష్ కాబట్టి ఫెయిలైన.
“అన్నీ పాసైన.. ఒకటే కద సారు ఫెయిలైంది. నన్ను పైక్లాసుకు పంపించండి సారూ!” అని మా సార్లను బతిమాలిన.
“అట్ల కుదరదు” అని చెప్పినరు. ఏం చేయాల్నో అర్థం కాలేదు. ఈ ఇంగ్లిష్ పాడుకానూ.. ఈ ఇంగ్లిష్ నాశనం కాను.. ఇంగ్లిష్ కాబట్టి నా బతుకు అన్యాయం ఐపోయిందని తిట్టుకున్న. నా ఇనుప సందుక పెట్టె నెత్తిన పెట్టుకొని.. వలవలా ఏడ్సుకుంట మా తండాకు పోయిన. ఒకటే దుఃఖం. అంత బాధలో కూడా నేను చచ్చిపోదాం అనుకోలేదు. కానీ.. నేను ఇప్పుడు చేసిన తప్పు నాకు చావు తప్ప ఇంకో మార్గం లేకుండా చేసింది.
పదో తరగతి ఫెయిలై తండాకు వచ్చిన. మా అమ్మకు తెలిసినా ఏమీ అనలేదు. అసలు పాస్, ఫెయిల్ ఏందో కూడా తనకు అర్థం కాలేదు. నేను ‘ఏ పని చేయాలా?’ అని ఆలోచిస్తున్నపుడు.. మా తండాలో సారా యాపారం చేసే వసురాం మా ఇంటికి వచ్చినడు. ఆయన మా తండాలో సారా కాచి.. దేవరకొండ టౌనుకు దొంగతనంగా తీసుకొని పోయి యాపారం చేస్తడు. లోపల సారా పాకెట్లు, పైన కూరగాయలు పోసి సైకిల్ మీద తీసుకుపోయేటోడు. కానీ, ఒకసారి పోలీసులకు దొరికిపోయిండు. అట్ల వసురాం మీద నిఘా పెరిగింది. అందుకని దేవరకొండలో సారా దుకాణం కాడికి.. నేను స్కూలుకు పోయే అమ్మాయిలాగా, బ్యాగులో సారా ప్యాకెట్లు తీసుకుని పోయి ఇవ్వాలి. స్టూడెంట్ కాబట్టి పోలీసులు అనుమానించరని వసురాం తాత ఉపాయం. ఉదయం పది, సాయంత్రం పది లీటర్లు.. సీక్రెట్గా చేరవేస్తే రోజుకు వంద రూపాయలు ఇస్తనన్నడు. నాకది బానే అనిపించింది. కాలేజీ బ్యాగులో సారా ప్యాకెట్లు పెట్టుకొని, వసురాం తాత ఇచ్చిన సైకిల్ మీద పోయేదాన్ని. కాలేజీ అమ్మాయి అనుకొని ఎవరూ అనుమానించేవాళ్లు కాదు.
ఆరు నెలలు బానే గడిచింది. కాలం ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు కద. ఎవరో ఎక్సైజ్ పోలీసులకు ఉప్పందించారు. నన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని స్టేషన్లో పెట్టారు. రెండు రోజులైనా వసురాం తాత కానీ, ఎవ్వరు కానీ జామీను ఇవ్వడానికి రాలేదు. పోలీసులు నేనే సొంతంగా సారా కాసి యాపారం చేస్తున్న అనుకొని పదివేలు లంచం అడిగినరు. రోజుకు వంద రూపాయల కూలీ చేసే నా దగ్గర పదివేలు ఎక్కడియి. కాళ్లావేళ్లా పడి మొక్కినా వదిలిపెట్టలేదు. ఆడపిల్లనని కూడా చూడకుండా కొట్టినరు. అప్పుడే ఆ స్టేషన్లోనే ఉండే కానిస్టేబుల్ సార్ పరశురాములు నా మీద కనికరం చూపించాడు. రెండు వేలు ఎస్సై చేతుల్లో పెట్టి నన్ను ఇంటికి పంపించాడు. పరశురాములు సార్కు రెండు చేతులతో కాళ్లు మొక్కి ఇంటికి చేరుకున్న.
ఇక నేనే సొంతంగా సారా కాయడం, అమ్మడం మొదలు పెట్టాను. పోలీసు కానిస్టేబుల్ పరశురాములు కూడా పరిచయం ఉండటంతో నెలనెలా పోలీసోళ్లకు మామూళ్లు ఇచ్చేదాన్ని. పరశురాములు సార్కు నా సారా అంటే ఇష్టం. ఘాటుగా, తాగంగనే మత్తుగా ఉంటదని నా సారా కోసం తండాకు వచ్చేవాడు. కొంత కాలానికి.. “సారా కోసం కాదు.. నీకోసమే” అని మనసులో మాట బైట పెట్టాడు. అట్ల మెల్లగా ఇద్దరి మధ్య సావాసం పెరిగింది. అన్నిరకాలుగా దగ్గరైపోయినం. మా అమ్మకానీ, తండా వాళ్లు కానీ.. వచ్చేది పోలీసు కాబట్టి ఎదురు చెప్పలేకపోయారు. పైగా నాతో పోలీస్ స్టేషన్లో పనుల కోసం పైరవీ చేయించుకునే వారు.
కొన్నాళ్లకు ఓరోజు నాలో ఇంకో పానం పెరుగుతున్న సంగతి అర్థమైంది. నేరుగా పోలీస్ స్టేషన్కు పోయి పరుశురాములుకి ఆ సంగతి చెప్పాను. సంతోషపడతాడు అనుకుంటే.. ఏమీ మాట్లాడకుండా ఆసుపత్రికి తీసుకొని పోయాడు. “కడుపు తీసేస్కో!” అన్నడు. నేను ఒప్పుకోలేదు. పెళ్లి చేసుకోమన్నాను.
“సారాయి అమ్ముకొనే బజారు దానివి నువ్వు. నీలాంటి వాళ్లు పదిమందితో పోతాను. వాళ్లందరిని పెళ్లి చేసుకుంటానా లం..” అన్నాడు. “నాకెప్పుడో పెళ్లయ్యింది. నాకు భార్య, పిల్లలు ఉన్నారు” అని అప్పుడు బయట పెట్టాడు. నేను మొండికేసేసరికి అక్కడనే అందరి ముందూ కొట్టాడు.
“ఎక్కువ మాట్లాడితే సారా కేసులో మళ్లీ జైల్లో పెడతా” అని బెదిరించి, భయపెట్టి మా తండాకు పంపించాడు. ఎంత మోసం చేసిండు. వీణ్ని నమ్మి ఎంతపని చేసిన. అదిగో అప్పుడే నాకు జీవితం మీద విరక్తి పుట్టింది. కన్నకష్టాలు పడి పెంచింది అమ్మ. ఏ ముఖం పెట్టుకొని అమ్మకు మొఖం చూపించను. నేను చేసిన తప్పు తెలిస్తే అమ్మ బతుకుతుందా..? అందుకే ఇంటికి పోయే ధైర్యం చేయలేదు. థూ.. నేను బతకడం దండగ. అందుకే చచ్చిపోవాలని అనుకున్నాను. ఇంకాసేపట్లో నేను చచ్చిపోబోతున్నాను.
ఎలా చచ్చి పోవడం.. బాయిలో దూకనా..? చెట్టుకు ఉరి పెట్టుకోవడమా..? ఆ క్షణంలో నేను ఏం చేస్తున్నానో గుర్తులేదు. నేను చచ్చిపోవడం ఒకటే నాకు కావాల్సిందని.. పిచ్చి పట్టినట్లు, దయ్యం ఆవహించినట్లు అనిపించింది.
తండా పక్కనే ఉన్న అడివిలోకి నడుచుకుంటూ పోయాను. ఏ చెట్టుకైనా ఉరేసుకుందామని చూశాను. దూరంగా పెద్ద మోదుగు చెట్టు కనిపించింది. కొమ్మల నిండా నిప్పుల పూలు పూసినట్లు.. తళతళా మెరిసిపోతున్న మోదుగు చెట్టును చూస్తే ఏదో గుర్తుకు వచ్చింది. అదేంటో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాను. అప్పుడు తటాలున మెరుపు మెరిసినట్లు.. అమ్మ చిన్నప్పుడు చెప్పిన మాటలు గుర్తు వచ్చాయి.
‘ఎన్ని కష్టాలు వచ్చినా మోదుగు చెట్టులాగా తట్టుకొని నిలబడాలె బిడ్డా! వానలు వచ్చేదాక ఎదురు చూడాలె. చినుకు పడినంక మొక్కై ఎదగాలె. పెద్ద మానై.. వెయ్యి పూలు పూయాలె’.. అమ్మ చెప్పిన మాటలు మళ్ల మళ్ల యాదికొచ్చినయి. అప్పుడు ఆలోచించిన.. అసలు మోసం చేసింది వాడు. నమ్మడం నా తప్పు కాదు కదా. నేనెందుకు చావాలి? మోసం చేసినందుకు వాడుకదా చావాలి. పుట్టెడు కష్టాలు పడి సాకింది అమ్మ. ఆమె కోసమైనా బతకాలి అనుకొని సక్కగ ఇంటి దారి పట్టిన. ఇంటికొచ్చిన నాకు ఊహించని దెబ్బ. ఏం జరిగిందో ఏమో.. అమ్మ చనిపోయింది. నా కోసం ఉదయం నుంచి వెతుకుతున్నరట. ఐదుగురు బిడ్డలను కన్నా సాదుకొనే అదృష్టం దొరకని తల్లి. ఒక్కదాన్ని నన్ను కంటికి రెప్పలా పెంచుకున్న అమ్మ వెళ్లిపోయింది. ఏం జరుగుతున్నదో అర్థం కాలేదు. కుప్పకూలి పోయాను. అక్క, బావ వాళ్లు, తండా మనుషులు మిగిలిన పనులు పూర్తి చేసి వెళ్లిపోయారు.
అమ్మ పోయిన తర్వాత ఒంటరినయ్యాను. నేను పోలీసోడి మడిసిగా ఉన్నంత కాలం అంతా బాగున్నరు. ఎప్పుడైతే వాడితో చెడిపోయిందని తెలిసిందో.. అందరూ మారిపోయారు. నన్ను చూసే చూపు.. పిలిచే పిలుపూ మారిపోయింది. కొన్ని కొండ చిలువలు అర్ధరాత్రుళ్లు వచ్చి చుట్టుకోవడానికి తడకలు తీసేవాళ్లు. వాళ్ల నుంచి తప్పించుకోవడానికి రాత్రుళ్లు అడివిలోకి పారిపోయేదాన్ని. అడవిలో పాములు, మృగాల కన్న తండా మనుషులే ఎక్కవ భయపెట్టేవాళ్లు.
ఎదిగీ ఎదగని వయసు. సరైన తిండి లేక నా ఒళ్లు పిండాన్ని మోయలేక పోయింది. పోలీసోడి పాపం.. రక్తం ముద్దలుగా వెళ్లిపోయింది. చానా రక్తం పోవడంతో ఆరునెలలు మంచంలో పడిపోయాను. తిండిపెట్టిన నాథుడు లేడు. అప్పుడప్పుడు గవర్నమెంటు స్కూలు దగ్గర పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టే యాళ్లకు పోయి, వాళ్ల దగ్గర అన్నం అడుక్కునేదాన్ని. అట్ల ఆరునెలలు నరక యాతన పడి మెల్లగా కోలుకున్నాను.
బతకడానికి సారా యాపారం కాకుండా ఏదైనా కష్టపడి పని చేయాలని అనుకున్నాను. అప్పుడే మా తండాలో అంగన్వాడీ సెంటర్ మొదలైంది. తండాలో పదో తరగతి చదివిన ఆడపిల్లను నేను ఒక్కదాన్నే ఉన్నాను. నాకు బతకడానికి కూడా ఏమీ ఆధారం లేదని తండా పెద్దలు ఒక మార్గం చూపించారు.
అలా మెల్లగా నా జీవితం అంగన్వాడీ
టీచర్గా మారింది. మా తండాలోనే ఖాళీ జాగాను బాగు చేసి, చిన్న పాక వేయించాను. నేనే పార తీసుకొని రాళ్లు రప్పలు తొలగించి.. పిల్లలకోసం ఆటస్థలం సిద్ధం చేశాను. చుట్టూ కంచె పాతాను. లోపల బంతి, చామంతి ఇలా చాలా పూలమొక్కలు పెంచాను. పిల్లలను తీసుకురావడం ఆడించడం, పాడించడం. ఇప్పుడు పిల్లలే నా లోకం. ఆ పిల్లలే నా పిల్లలు. అలా మెల్లగా నా గతాన్ని కుబుసంలా వదిలించుకొని కొత్త మనిషిగా తయారయ్యాను. జనాలు కూడా పాత సైదిని మర్చిపోయారు.
ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీళ్లు.. ఎక్కడో పురిట్లో ఆడపిల్లగా చనిపోవాల్సిన నేను. మా నాయిన కొట్టిన దెబ్బలకు ఏ బాయిలోనో దూకి సావాల్సిన నేను.. ప్రేమ పేరుతో మోసపోయిన నేను.. ఏ పేదరికమో, ఏ ఆకలితోనో.. ఏ మగపురుగులో కరిచి ఏనాడో మట్టిలో కలిసిపోవాల్సిన నేను.. అన్నిటినీ తట్టుకొని మోదుగు చెట్టులా నిలబడ్డాను. మోదుగు పువ్వులా నవ్వుతూ తండాలో పిల్లలకు తల్లిగా మారాను. ఒకనాడు గుడుంబా యాపారం చేసిన సైది.. ఇప్పుడు
‘సైదమ్మ టీచర్’ అయ్యింది.
చంద్రశేఖర్ స్వస్థలం సూర్యాపేట జిల్లాలోని బండమీది చందుపట్ల. హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. వృత్తి రీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడు. జీవిత సహచరి ‘తులసి’ పేరుతో కలిపి ‘చందు తులసి’ కలం పేరుతో కథలు రాస్తుంటారు. సినిమా రంగంలోనూ రచయితగా పనిచేస్తున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, మహిళల జీవితాలే ఈయన కథలకు ప్రధాన ఇతివృత్తాలు. 2015లో తొలికథ ‘ఊరవతల ఊడలమర్రి’ మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ‘నమస్తే తెలంగాణ బతుకమ్మ’ సంచికలో వచ్చిన ‘పాలపిట్టల పాట’ కథ నేషనల్ బుక్ట్రస్ట్ యువ కథా సంకలనానికి ఎంపికైంది. వివిధ భారతీయ భాషల్లోకి అనువాదమైంది. ‘బతుకమ్మ పుట్టింది’ కథ ‘గుర్రాల లక్ష్మీప్రసాద్ అవార్డు’ గెలుచుకున్నది. ‘నీళ్ల బిందె’, ‘బుక్కెడు బువ్వ’, ‘తల్లి గారిల్లు’ కథలు పలు కథా సంకలనాలకు ఎంపికయ్యాయి. గతంలో ‘గడి’, ‘తక్కెడ’ కథలకు నమస్తే తెలంగాణ – ముల్కనూరు ప్రజాగ్రంథాలయం కథల పోటీల్లో బహుమతులు అందుకొన్నారు.
‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2021’లో ద్వితీయ బహుమతి రూ.25 వేలు పొందిన కథ.
-పి.చంద్రశేఖర్ (చందు తులసి)
9985583022