గుండె, శ్వాసకోశ క్యాన్సర్ వ్యాధులకు ప్రధాన కారణం పొగే! కానీ, ధూమపానాన్ని వదిలిపెడితే ఆ ముప్పు తగ్గిపోతుందా? అనే ప్రశ్న అందర్నీ వేధిస్తూ ఉంటుంది. దీనికి జవాబు కనుక్కోవడానికి అమెరికాలో 5,51,388 మంది వయోజనులపై పరిశోధనలు చేశారు నిపుణులు. వీరి సగటు వయసు 48.9 ఏండ్లు. ఆ 11 ఏండ్ల పరిశీలన కాలంలో 74,870 మంది మరణించారు. ప్రస్తుతం, లేదంటే గతంలో ధూమపానం అలవాటు ఉన్నవారిలో.. 44 శాతం మంది మృతికి వివిధ కారణాలున్నాయి. 52.2 శాతం క్యాన్సర్తో, 34.7 శాతం గుండెవ్యాధులతో మరణించారు. 86.9 శాతం మంది అప్పటికే శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ వ్యాధులన్నిటికీ ప్రధాన కారణం ధూమపానమేనట. మిగిలిన వారితో పోలిస్తే..పొగతాగేవారు ముందుగానే మరణించడానికి రెండు రెట్లు ఆస్కారం ఉన్నట్టు ఈ పరిశోధనలో తేలింది. ధూమపానం మానేసిన వారికి ఈ ముప్పు కొంత తక్కువని కూడా వెల్లడైంది. 45 ఏండ్లు దాటిన తర్వాత సిగరెట్లు మానేకంటే, 35లోపే ఆ పనిచేస్తే మంచిదట.
కిడ్నీలో రాళ్లున్నాయా? అయితే వచ్చే ఐదేండ్లలో ఆ బాధ 30 శాతం ఎక్కువయ్యే అవకాశం ఉంటుందట. సరైన ఆహారంతోనే ఆ ముప్పును తగ్గించుకునే వీలుందని మేయో క్లినిక్ తాజా పరిశోధన వెల్లడించింది. దీనికోసం పరిశోధకులు తొలిసారిగా కిడ్నీలో రాళ్ల బాధ అనుభవిస్తున్న రోగులను ఎంచుకున్నారు. రోజువారీ ఆహారంలో పాల పదార్థాలు, ఆకుకూరల రూపంలో 1,200 మిల్లీగ్రాముల క్యాల్షియం తీసుకుంటే గనుక సమస్యను నివారించవచ్చని తెలుసుకున్నారు. అంతేకాదు అరటిపండ్లు, నారింజలాంటి పండ్లు, పుట్టగొడుగులు, కూరగాయల్లో ఉండే పొటాషియంను కూడా తగిన మొత్తంలో తీసుకోవాలని సూచించారు. ఇక ఇప్పటివరకు కిడ్నీల్లో రాళ్లు లేనివారైతే తగినన్ని ఆరోగ్యకరమైన ద్రవ పదార్థాలు తీసుకుంటే సరిపోతుందట.
రోజువారీ జీవితంలోని శ్రమ, ఒత్తిడి, చికాకు నుంచి సాంత్వన పొందడానికి.. మనల్ని మనం ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంచుకోడానికి
మంచిమంచి పాటలు వింటాం. మెచ్చిన గాయకుడి సంగీతాన్ని ఆస్వాదిస్తాం. అయితే, మనం తరచూ వినే పాటలు మన ఉద్వేగాలను తెలియజేస్తాయని మెక్మాస్టర్ విశ్వవిద్యాలయంలో మానసిక శాస్త్రం పరిశోధకుడు రవిన్ అలేల్ అధ్యయనంలో తేలింది. ‘బంధాలకు సంబంధించి మీరు వినే పాటలు మీ ఆలోచనలు, అనుభూతుల గురించి కచ్చితమైన అంచనా ఇస్తాయి’ అని రవిన్ నొక్కి చెబుతారు.