నడి వయసువాళ్లు ఆరు గంటలకు మించి నిద్రించడమంటే.. ఓ మోస్తరు వ్యాయామం చేసినంత ఉపయోగమట. యాభై ఏండ్లు పైబడిన సుమారు తొమ్మిదివేల మందిపై జరిగిన అధ్యయనంలో ఈ విషయం నిర్ధారణ అయ్యింది. మిగిలినవారితో పోలిస్తే.. వ్యాయామం చేసినప్పటికీ, తగినంత నిద్ర లేనివారిలో గుర్తింపు (కాగ్నిటివ్) సామర్థ్యం వేగంగా తగ్గిందట. నిర్ణయాలు తీసుకోవడంలో కాగ్నిటివ్ సామర్థ్యమే కీలకం.
చదవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, నేర్చుకున్నది గుర్తుంచుకోవడం, తర్కబద్ధంగా ఆలోచించడం, జాగరూకత కలిగి ఉండటం కూడా దీనికిందికే వస్తాయి. తగినంత నిద్ర ఉంటే మెదడు రీచార్జి అవుతుంది. మనసు విశ్రాంతి పొందుతుంది. అదే సమయంలో, నిద్ర తగ్గితే మెదడు పనితీరు కూడా మందగిస్తుంది. అందువల్ల మెదడు చురుగ్గా ఉండాలంటే వ్యాయామం ఒక్కటే సరిపోదు… కంటినిండా కునుకు కూడా ముఖ్యమే. పైగా వయసుతో సంబంధం లేకుండా అందరూ తగినంతగా నిద్రించాల్సిందే అనేది పరిశోధకుల సలహా.
ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. వీటిని తప్పించుకోవడానికి సైక్లింగ్, వ్యాయామం, తోటపని లాంటి శారీరక శ్రమకు సంబంధించిన పనులను రోజూ కనీసం 20- 25 నిమిషాలు చేస్తే మంచిదని అంటున్నది ఓ తాజా పరిశోధన. క్రమం తప్పకుండా చేసే శారీరక శ్రమ ద్వారా మనం రోజులో ఎంతసేపు కూర్చున్నాం అనేదానితో సంబంధం లేకుండా ఆరోగ్య సమస్యల ముప్పు తగ్గుతుందని ‘బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్’ మెడిసిన్లో ప్రచురితమైన ఈ అధ్యయనం తెలిపింది.
ప్రపంచంలో 350 కోట్లకు పైగా ప్రజలు రోజులో కనీసం మూడు గంటల కంటే ఎక్కువసేపు స్మార్ట్ఫోన్లకు అతుక్కుపోతున్నారని జర్మనీ అధ్యయనం పేర్కొంటున్నది. సోషల్ మీడియాలో గడపటం, చాటింగ్ చేయడం, మెయిల్స్ చెక్చేసుకోవడం లాంటివి మన సమయాన్నే కాదు, ఆరోగ్యాన్నీ హరిస్తాయి. కాబట్టి, స్మార్ట్ఫోన్లు వాడే సమయాన్ని కొంతమేరకైనా నియంత్రించుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో కనీసం ఒక్క గంట తగ్గించుకున్నా మంచిదేనట.
ఇలా చేయడం వల్ల మనసు ఇతర వ్యాపకాల మీదికి మళ్లుతుంది. అధ్యయనంలో పాల్గొన్నవారిలో ఇలా చేసినవాళ్లు చేయని వాళ్లకంటే ఎక్కువ సంతోషంగా, మరింత చురుగ్గా, తక్కువ కుంగుబాటుతో ఉన్నారట. అలాగని స్మార్ట్ఫోన్ను పూర్తిగా దూరం పెట్టకుండా, వాడే సమయం తగ్గించుకుంటే మేలంటున్నారు పరిశోధకులు.