మెదక్, ఫిబ్రవరి 27(నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారంలో అలసత్వాన్ని సహించమని అధికారులకు రాష్ర్ట ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ కేసుల పురోగతిపై శుక్రవారం మెదక్ కలెక్టరేట్లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీలపై తప్పుడు కేసులు నమోదు చేయడం తగదని, రాజకీయ కక్షలతో కేసుల పేరిట వేధింపులకు గురిచేస్తే సహించమన్నారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులను యంత్రాంగం అరికట్టాలన్నారు.
నర్సాపూర్, పెద్దచింతకుంట గిరిజనులపై జరిగిన దాడి కేసులపై కేసుల విచారణలో ఐవోలు మార్చాలని ఎస్పీని ఆదేశించారు. మెదక్ పట్టణంలో అంబేద్కర్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించి మార్చి 26 వరకు నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు. హవేళీఘనపూర్లో నెలకొన్న భూసమస్యను 45 రోజుల్లో పరిష్కరించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ బాధితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలని ఆదేశించారు. సైబరాబాద్, మల్కాజిగిరి, హైదరాబాద్లో బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేశామన్నారు. మెదక్ పట్టణంలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో షాప్ల నిర్మాణం చేపట్టాలన్నారు.
అనంతరం నర్సాపూర్ మండలం మమతాబాద్లోని గిరిజన ఆశ్రమ పాఠశాలను చైర్మన్ బక్కి వెంకటయ్య తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వసతులు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, అదనపు కలెక్టర్ నగేశ్, ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు, వివిధ శాఖల అధికారులు విజయలక్ష్మి, సింధు, డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.