Recykal | ఇంట్లో వృథాగా పడున్న వస్తువుల్ని ఏం చేస్తాం? ఏ పాత సామాన్ల బండివాడికో వేసేస్తాం. వాళ్లు కూడా తీసుకోని వస్తువులు ఉంటే? ఎక్కడో ఒక దగ్గర పడేస్తాం. దీనివల్ల ఏమవుతుంది? ఇండ్ల మధ్యలో చెత్త పేరుకుపోతుంది. దుర్గంధం వస్తుంది. పర్యావరణం పాడవుతుంది. సరిగ్గా ఇలాంటి సమస్యకే పరిష్కారం కనిపెట్టింది.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ‘రీసైకల్’ అనే స్టార్టప్.
మార్ట్జాక్.. కిరాణా దుకాణాలు ఆన్లైన్ లావాదేవీలు నిర్వహించుకునే వెసులుబాటు కల్పించే స్టార్టప్. ప్రారంభంతోనే సంచలనాలు సృష్టించింది. దీంతో ఓ సింగపూర్ సంస్థ ఆ అంకురాన్ని అనూహ్యమైన మొత్తానికి సొంతం చేసుకుంది. అభయ్ దేశ్పాండే హఠాత్తుగా కుబేరుల జాబితాలో చేరాడు. ఆ తర్వాత ఏ యువకుడైనా ఏం చేస్తాడు? ఆ డబ్బుతో లగ్జరీ ఫ్లాట్ కొంటాడు. స్పోర్ట్స్ కారు ఖరీదు చేస్తాడు. ప్రపంచం చుట్టొస్తాడు. మరికొన్ని స్టార్టప్స్ మీద పెట్టుబడి పెడతాడు. అభయ్ మాత్రం.. నేరుగా చెత్త వ్యాపారంలోకి వచ్చాడు. ‘రీసైకల్’ను స్థాపించాడు. ‘యాప్’ల సాయంతో వ్యర్థాలను సేకరించడమే ‘రీసైకల్’ కాన్సెప్ట్.
డిమాండ్-సప్లయ్లో సమతుల్యత, పారదర్శకత లేకపోవడంతో వ్యర్థాల రీసైక్లింగ్లో పరిశ్రమలు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా వ్యర్థాల నిర్వహణలో అనధికార సంస్థలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. లావాదేవీలన్నీ ఆఫ్లైన్లో జరుగుతాయి. సరైన పద్ధతిలో వ్యర్థాల సేకరణ జరగదు. ప్రామాణికమైన పద్ధతుల్లో వాటి రీసైక్లింగ్ చేయరు. దీనివల్ల పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుంది. ఇలాంటి సవాళ్లను అధిగమించి వ్యర్థాల సేకరణకు క్లౌడ్ టెక్నాలజీని అనుసంధానించి వ్యర్థాలను సృష్టించేవారు, సేకరించేవారు, రీసైకిల్ చేసేవారు.. ఈ ముగ్గురినీ సమన్వయ పరిచి సమగ్ర పద్ధతిలో వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి పర్యావరణాన్ని కాపాడుతున్నాడు అభయ్ దేశ్పాండే. ఆయన సోదరుడు అభిషేక్ దేశ్పాండే ‘రీసైకల్’ సహ వ్యవస్థాపకుడు. అనిరుధ్ జలాన్, విక్రమ్ ప్రభాకర్, ఏక్తా నరేన్, అఫ్సర్ అహ్మద్, చేతన్ బారేగర్ బృంద సభ్యులుగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘అసలేం జరుగుతున్నది ఇక్కడ?’ అన్న ప్రశ్న మొదట్లో ఈ బృందాన్ని ముప్పుతిప్పలు పెట్టింది. సమాధానం కోసం చెత్త ఏరుకునేవాళ్ల వెంట పడ్డారు. వాళ్ల ఇండ్లకు వెళ్లారు. కల్లు కాంపౌండ్లలో కబుర్లలో దించారు. ‘దీనికి మేం పెట్టుకున్న ముద్దుపేరు హార్వర్డ్ డిప్లొమా ఇన్ వేస్ట్ మేనేజ్మెంట్..’ అంటూ నవ్వేస్తాడు అభి. ‘ప్రయాణికులకు ఉబెర్ ఎలాగో, చెత్తాచెదారానికి మేం అలా’ హఠాత్తుగా మరో పంచ్ విసురుతారు. అంటే, వీళ్లు సొంతంగా చెత్త సేకరించరు, కొనరు, రీసైకిల్ చేయరు. చెత్త ఏరుకునేవారికి, రీ సైకిల్ చేసేవారికి మధ్య ఈ స్టార్టప్ అనుసంధానకర్త. అభి మిత్రబృందం రూపొందించిన యాప్ సాయంతో చెత్త ఏరుకునేవారు రీ సైకిల్ వ్యాపారులకు సరుకు అమ్ముకోవచ్చు. దీనివల్ల మధ్యవర్తుల గొడవ ఉండదు. ‘రీసైకల్’ ప్రధానంగా కార్పొరేట్ సంస్థల మీద దృష్టి పెట్టింది. ఆ కార్యాలయాలూ, కార్ఖానాలలోని చెత్తను నేరుగా రీసైకిల్ యూనిట్లకు తరలిస్తుంది. దీనివల్ల రెండు వైపుల నుంచీ కమీషన్ ముడుతుంది. చెత్త ఏరుకునేవారి బ్యాంకు ఖాతాలో డబ్బులు పడిపోతాయి. ‘వాళ్లలో ఆదాయపు పన్ను కడుతున్నవారూ ఉన్నారు’ అని గర్వంగా చెబుతాడు అభి.
గత ఏడాది ‘రీసైకల్’ ద్వారా 86,000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు సేకరించారు. ప్రస్తుతం నెలకు 20,000 మెట్రిక్ టన్నులు సమీకరిస్తున్నారు. ఈ సంవత్సరం 30,000 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్, 40,000 మెట్రిక్ టన్నుల ఇ-వ్యర్థాలను సేకరించి రీసైకిల్ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నదీ సంస్థ. వ్యర్థ పదార్థాల నిర్వహణ, రీసైక్లింగ్ విధానం వంటి పారిశ్రామిక సమస్యలను, సవాళ్లను డిజిటల్ టెక్నాలజీ ద్వారా పరిష్కరించే ప్రయత్నం ఇప్పటివరకు ఎవరూ చేయలేదు. ఆ విధమైన ప్రయత్నం చేస్తున్న తొలి, ఏకైక సంస్థ ‘రీసైకల్’. హైదరాబాద్లో కూడా ‘రీసైకల్’ ప్రాజెక్ట్ నడుస్తున్నది. వ్యర్థాల నిర్వహణే కాదు అంతేస్థాయిలో సామాజిక, ఆర్థిక, పర్యావరణ వ్యవస్థల్లో ప్రభావం చూపిస్తున్నది. 2025 నాటికి రీసైకల్ సిస్టమ్ ద్వారా 3 మిలియన్ మెట్రిక్ టన్నుల వ్యర్థాల రీసైక్లింగ్కు సంస్థ కృషి చేస్తున్నది. ‘రీసైకల్ మార్కెట్ప్లేస్’ యాప్ ద్వారా రోజుకు 1,000 ఆర్డర్లు తీసుకుంటున్నారు. చిత్తశుద్ధి ఉంటే చెత్తశుద్ధి కష్టమేం కాదన్నమాట.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
వాచ్మన్ నుంచి IIM ప్రొఫెసర్ దాకా.. కేరళ యువకుడి సక్సెస్ స్టోరీ
ఒకప్పుడు స్కూల్ డ్రాప్ అవుట్.. ఇప్పుడు మల్టీ మిలియనీర్.. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా?
కన్నబిడ్డలు కాదనుకున్న అమ్మానాన్నలకు కొడుకు అయ్యాడు
Gudipadu | తెలంగాణలోని ఈ గుడిలో గిరిజనులే పూజారులు
మరో పతంజలి పంకజ కస్తూరి నాయర్
కొడుకును కోల్పోయినా.. వందలాది బిడ్డలకు ప్రాణం పోస్తున్నాడు..