Bobby Deol | బాలీవుడ్ సీనియర్ నటుడు బాబీ డియోల్ ప్రస్తుతం తన కెరీర్లో దూసుకుపోతున్నాడు. విలన్ పాత్రల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన, వరుసగా భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ముఖ్యంగా ‘యానిమల్’, ‘కంగువ’, ‘హరిహర వీరమల్లు’ వంటి చిత్రాలతో దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించిన బాబీ డియోల్, తాజాగా తనపై మరియు హీరోయిన్ అలియా భట్పై వస్తున్న సోషల్ మీడియా ప్రచారాలపై ఘాటుగా స్పందించారు. అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ చిత్రంలో బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో అలియా భట్, బాబీ డియోల్ మధ్య విభేదాలు తలెత్తాయని, ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని సోషల్ మీడియాలో పలు కథనాలు వైరల్ అయ్యాయి. ఈ ప్రచారం అభిమానుల్లో కూడా ఆసక్తిని రేకెత్తించింది.
ఈ నేపథ్యంలో ప్రముఖ టెలివిజన్ కార్యక్రమంలో పాల్గొన్న బాబీ డియోల్, ఈ వార్తలను పూర్తిగా ఖండించారు. తనకు సంబంధించిన ఈ రూమర్ను మొదట చూసినప్పుడు తానే ఆశ్చర్యపోయానని చెప్పారు. ఒక స్నేహితుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాన్ని తనకు పంపించగా, దాన్ని చూసి నవ్వు వచ్చిందని పేర్కొన్నారు. జనాలకు ఖాళీ సమయం ఎక్కువైందనుకుంటా. అందుకే కూర్చొని లేని కథలను సృష్టిస్తున్నారు. నిజంగా అలాంటివి ఎలా ఆలోచిస్తారో కూడా అర్థం కావడం లేదు అంటూ బాబీ డియోల్ అసహనం వ్యక్తం చేశారు. అలియా భట్ గురించి మాట్లాడిన ఆయన, ఆమెను అత్యంత ప్రతిభావంతమైన నటిగా అభివర్ణించారు. అలియాతో కలిసి పనిచేయడం చాలా మంచి అనుభవం. ఆమె తన పాత్ర కోసం ఎంత కష్టపడుతుందో సెట్స్లో దగ్గరగా చూసాను. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల కోసం ఆమె చేసిన ప్రిపరేషన్ నిజంగా ఆశ్చర్యపరిచింది అని ప్రశంసించారు.
అలాగే తాను ఇటీవల రణ్బీర్ కపూర్తో కలిసి ‘యానిమల్’ చిత్రంలో నటించానని, ఇప్పుడు అలియా భట్తో కలిసి పనిచేసే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. వీరిద్దరూ తనకు ఎంతో ఇష్టమైన నటీనటులని వెల్లడించారు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై మరోసారి స్పందించిన బాబీ డియోల్, “అంతా బాగానే జరుగుతుంటే కూడా కొందరు లేని విషయాలను సృష్టించి ప్రచారం చేస్తుంటారు. ఒక రూమర్ ముగియకముందే మరో కొత్త కథ మొదలవుతుంది. ప్రతి వార్తకు స్పందిస్తూ నిజం చెప్పుకోవడం సాధ్యం కాదు” అని అన్నారు. ఇన్స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా వేదికల్లో వచ్చే వార్తలలో చాలా వరకు నిజం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. “సోషల్ మీడియాలో కనిపించే వార్తల్లో ఎక్కువ శాతం ఊహాగానాలే. వాటిని నమ్మే ముందు వాస్తవాలు తెలుసుకోవాలి” అని సూచించారు.