‘గుళ్లోని దేవుడు నాకు అక్కర్లేదు. సాటి మనిషిలోని దేవుడే కావాలి. అందరినీ ఒకేలా చూసే వ్యవస్థ కావాలి. ఆ సమ సమాజం కోసమే నా తాపత్రయం. కష్టాల్లో ఉన్నవారికి జీవితాంతం సాయం చేయాలని నిర్ణయించుకున్నా. 22 ఏండ్లుగా ఆ మార్గంలోనే నడుస్తున్నా’ అని త్రికరణశుద్ధిగా చెబుతున్నారు రాపర్తి జగదీశ్బాబు. సేవా ప్రయాణంలో ఆయన కెరీర్ను త్యాగం చేశారు, ఆస్తులు అమ్ముకొన్నారు. కుటుంబ బంధాలు సంకెళ్లు అవుతాయన్న భయంతో బ్రహ్మచారిగానే ఉన్నారు.
యాచకులకు కూడా రూపాయి విదిలించని మనుషులున్న ఈ రోజుల్లో, కష్టాల్లో ఉన్నవారి కోసం తన జీవితాన్నే అంకితం చేశారు జగదీశ్బాబు. రోజూ వందమంది అన్నార్థులు ఆయన ఇంట్లో భోంచేయాల్సిందే. ఆంధ్రప్రదేశ్, విజయనగరం జిల్ల్లా కొత్తవలస మండలంలో ఎవరిని కదిలించినా.. మంగళపాలేనికి చెందిన జగదీశ్ గురించి చెబుతారు. ఆయన స్థాపించిన గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాలనూ వివరిస్తారు. ట్రస్ట్ నేతృత్వంలో ఇప్పటి వరకు లక్షా ముప్పై వేల మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందాయి. వీల్ చైర్లు, ట్రై సైకిళ్లు, వినికిడి యంత్రాలు, బ్లైండ్ స్టిక్స్.. వైకల్యాన్ని ఓడించడానికి అవసరమైన సకల సాధన సంపత్తినీ ఆయన సమకూరుస్తున్నారు.
జగదీశ్బాబుకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. తండ్రి భాస్కర కన్నప్ప వేద పండితుడు. తల్లి సుబ్బలక్ష్మి గృహిణి. ఓసారి స్వామి సుఖబోధానందను విమానం ఎక్కించేందుకు ఎయిర్పోర్టుకు వెళ్తుంటే.. ఓ దివ్యాంగుడు తారసపడ్డాడు. అతడికి రెండొందల రూపాయలు సాయం చేశారు జగదీశ్. అలా చేయడం తప్పనీ, వీలైతే అతనికి ఉపాధి కల్పించి ఓ మార్గం చూపమనీ స్వామీజీ హితవు చెప్పారు. ఆ సంఘటనతో జగదీశ్ ఆలోచనా విధానం మారింది. పూర్తిగా సేవవైపు దృష్టి సారించారు. నిధుల కోసం వారసత్వంగా వచ్చిన ఆస్తులను అమ్మేశారు. విద్యా సంస్థలకు ఆర్థికంగా సాయం చేశారు. అదే సమయంలో జగదీశ్ స్నేహితుడు రాజశేఖర్ రోడ్డు ప్రమాదంలో కాళ్లు పోగొట్టుకున్నారు. ఆ సంఘటను తనను కుంగదీసింది. కొంతకాలానికి, రాజశేఖర్ కృత్రిమ పాదాల కోసం తన తల్లితోపాటు రైల్లో జైపూర్ వెళ్తుండగా మహారాష్ట్ర సరిహద్దు దగ్గర ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన జగదీశ్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ షాక్ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఎక్కడ దివ్యాంగులు కనిపించినా స్నేహితుడు గుర్తొచ్చి ఏడ్చేసేవారు. సామాజిక బాధ్యతగా.. ఇరవై రెండు సంవత్సరాల క్రితం.. తన 24వ ఏట, మిత్రులతో కలిసి ‘శ్రీగురుదేవ చారిటబుల్ ట్రస్ట్’ను ఏర్పాటు చేశారు జగదీశ్.
జగదీశ్ బెంగళూరు విశ్వవిద్యాలయంలో బీటెక్ చేశారు. తర్వాత ఐఐటీ-ఖరగ్పూర్లో ఎంటెక్లో చేస్తూ.. నక్సల్స్ భావజాలం పట్ల ఆకర్షితులు అయ్యారు. ఆ విషయం తెలిసిన తల్లిదండ్రులు చదువు మాన్పించి వెనక్కి రప్పించారు. తీర్థయాత్రలకు వెళ్లిన తండ్రి ఆచూకీ తెలియకపోవడం, ఉద్యోగంలో సంతృప్తి లేకపోవడం, స్నేహితుడు రాజశేఖర్ మరణం.. అన్నీ కలిసి సేవ దిశగా అడుగులు వేయించాయి. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికోసం స్వగ్రామంలో రూ. 2 కోట్లతో 25 పడకల ఆస్పత్రిని నిర్మించారు జగదీశ్. ఇక్కడ ఆపరేషన్లు కూడా ఉచితంగా అందించనున్నారు. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం తదితర ప్రాంతాల్లోనూ కృత్రిమ అవయవాలు, పరికరాలు అందిస్తున్నారు. ‘ ఈ ప్రయాణంలో కేంద్ర మాజీ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి, స్టీల్ ఎక్సేంజ్ ఎండీ సురేశ్బాబు వంటి ఎందరో వెన్నుదన్నుగా ఉన్నారు. అందరికీ కృతజ్ఞతలు’ అంటారు జగదీశ్.
సేవ నాకు ఎనలేని ఆనందాన్ని ఇచ్చింది. ఇదంతా అమ్మ వల్లే సాధ్యమైంది. నేను ఒక్కమాట చెప్పగానే.. ఎందుకూ అని అడగకుండా వచ్చి బాండ్ పేపర్లపై సంతకం చేస్తుంది. సేవా కార్యక్రమాల కారణంగా బంధువుల నుంచి కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. అణగారిన వారి కాళ్లు పట్టుకొని చేసే సేవ వారికి నచ్చదు. నన్ను వెలివేశారు. శుభకార్యాలకు పిలువరు. నాతో మాట్లాడరు. అయినా నేను సేవ ఆపను. వేలాది మందికి ఊతకర్రగా ఉన్నాననే ఆత్మసంతృప్తి మనసునిండా ఉంది. ఈ జన్మకు ఇది చాలు.
– రాపర్తి జగదీశ్బాబు
✍ డప్పు రవి
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
వాచ్మన్ నుంచి IIM ప్రొఫెసర్ దాకా.. కేరళ యువకుడి సక్సెస్ స్టోరీ
ఒకప్పుడు స్కూల్ డ్రాప్ అవుట్.. ఇప్పుడు మల్టీ మిలియనీర్.. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా?
కన్నబిడ్డలు కాదనుకున్న అమ్మానాన్నలకు కొడుకు అయ్యాడు
Gudipadu | తెలంగాణలోని ఈ గుడిలో గిరిజనులే పూజారులు
మరో పతంజలి పంకజ కస్తూరి నాయర్
కొడుకును కోల్పోయినా.. వందలాది బిడ్డలకు ప్రాణం పోస్తున్నాడు..