Ramaayanam | ఇంతకుముందు వరమ్మ పెద్దకొడుకు ‘బొంబాయి టైలర్’ గురించి మాట్లాడుకున్నాం కదా! ఇక ఆఖరి కొడుకు సత్తయ్య.. ప్రభుత్వ లైబ్రరీలో అటెండర్గా పని చేసేవాడు. లైబ్రరీకి సోమవారం సెలవు. చాలాసార్లు లైబ్రేరియన్లు వచ్చేవారు కారు గనుక.. మేము ఇతణ్నే లైబ్రేరియన్ అనుకునేవాళ్లం.
నాన్నకు లైబ్రరీలో మెంబర్షిప్ కార్డు ఉండేది. ఆ కార్డు మీద ఒక పుస్తకం ఇంటికి ఇచ్చేవారు. పదిహేను రోజుల్లో అది చదివి తిరిగి ఇచ్చేస్తే.. మళ్లీ ఇంకో పుస్తకం ఇస్తారన్నమాట. మేము ఎనిమిదో తరగతి నుంచీ పుస్తకాలు ఎక్కువగా చదివేవాళ్లం. సెలవుల్లో అయితే నవలలు, కథల పుస్తకాలు తెచ్చి వేగంగా చదివి ఇచ్చేసేవాళ్లం. మా తాతయ్యకు కూడా తీసుకొచ్చేవాళ్లం. అమ్మ చాలా పుస్తకాలు అది వరకే చదివేసి ఉండేది. సత్తయ్య కూడా లైబ్రరీలో ఉండటం వల్ల పుస్తకాలు బాగానే చదివేవాడనుకుంటా. ఆ ప్రభావం వల్లనో, సినిమాలు ఎక్కువగా చూడటమోగానీ.. మొత్తం ఆంధ్రా యాసలో మాట్లాడేవాడు. “అమ్మాయిగారూ! అదేంటండీ.. మొన్న తీసుకెళ్లారు. నవల అప్పుడే చదివేసారాండీ?!” అనేవాడు. తెలంగాణలో అమ్మాయిగారూ, అబ్బాయిగారూ అనరు. మమ్మల్ని వేరే వాళ్లు కూడా అంటే గింటే పెద్దమ్మాయి, చిన్నమ్మాయి అనేవాళ్లు గానీ.. గారూ అనే పదం ఉండదు.
సత్తయ్య తనపేరును సత్యంగా మార్చుకోవడమే కాదు.. అందర్నీ అలాగే పిలవమనేవాడు. “అమ్మాయిగారూ! అయ్య బాబోయ్.. అసమర్థుని జీవయాత్ర చదివేసారా!? వేరే ఇవ్వమంటారా!? అమ్మనాయనో.. శరత్ నవల తీసుకున్నారా?! మీకు అర్థమవుతుందానండీ! అమ్మగారిని అడిగి తెలుసుకుంటారా?!.. అన్నట్టు మనింట్లో తినుబండారాలు ఏవైనా చేశారాండీ? ఇంటికి రమ్మంటారా? అమ్మగారిని అడిగి కొన్ని ఇస్తారాండీ?!” అని అడిగేవాడు. అమ్మకు చెబితే.. “పాపం! రమ్మనక పోయినారే! నిన్ననే అప్పాలు చేసినం గద!” అనేది. సత్తయ్య ఇంటికి వచ్చేవాడు. అతని మాటలు విని మా నాయనమ్మ.. “అయ్యో! నువ్వు మేర ఒరమ్మ కొడుకువు గాదు పిలగా! మరి గట్ల మాట్లాడుతున్నవూ.. ఎక్కణ్నుంచో దిగొచ్చినట్టు! నాకైతె నీ మాటే తెలుస్త లేదు!” అనేది. “అంతేనంటారా! ఏం చెయ్యమంటారండీ మరి?!” అని నవ్వేవాడు.
అమ్మ కొన్ని పత్రికలకు చందాలు కట్టి పోస్ట్లో తెప్పించేది. లైబ్రరీకి దాదాపు అన్ని పత్రికలు వచ్చినా.. అవి అక్కడే ఉండి చదవాల్సి వచ్చేది. చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, యువ, జ్యోతి, స్వాతి.. ఇలాంటి పత్రికల్ని చూస్తే ప్రాణం కొట్టుకునేది. అక్కడ చదవాలంటే లైబ్రరీలో టేబుల్స్ మీద పత్రికలున్నా.. కుర్చీల నిండా పాఠకులుండేవారు. పైగా రాత్రి ఏడుగంటల దాకా ఉండాల్సి వచ్చేది. మేము తప్ప అమ్మాయిలెవరూ లైబ్రరీకి వచ్చేవారు కాదు. మా బాధ చూడలేక సత్యమే ఓ ఉపాయం చెప్పాడు. “అమ్మాయిగారూ! మీరెళ్లండి. మీకేం పత్రికలు కావాలో చెప్పండి. నేను ఏడింటికి లైబ్రరీకి తాళం ఏసేటప్పుడు పట్టుకొచ్చి ఇస్తాను. మళ్లీ పొద్దున ఏడున్నరకు వచ్చి తీసుకెళ్తాను. నాకు తినుబండారాలు మాత్రం మర్చిపోకండి”.. అనగానే మేం ఎగిరి గంతేశాం. రాత్రి పూట అన్నం తినకుండా అతను తెచ్చే పుస్తకాల కోసం ఎదురుచూసేవాళ్లం. రాత్రి అన్నం తినగానే మొదలుపెట్టి.. పరీక్షలకు చదివినట్టు తొమ్మిదిన్నర దాకా చదివి పడుకునేవాళ్లం. యువలో యద్దనపూడి ‘మీనా’ అలా చదివిందే! మేము కూడా అమ్మను అడిగి చేగోడీలు, బిళ్లలు, కారప్పూస.. ఇలా ఏవో ఒకటి చేయించి సత్యంకు ఇచ్చేవాళ్లం. సత్యం చాలా తమాషాగా మాట్లాడేవాడు.
ఒక లైబ్రేరియన్ వరంగల్లో కాపురం ఉండేవాడు. వారంలో సగంరోజులు వచ్చేవాడే కాడు. అతని గురించి చెబుతూ.. “ఏముందండీ అమ్మాయిగారూ! పెద్దవాళ్లు చేస్తే లీలలు.. చిన్నవాళ్లు చేస్తే పాపాలు! అంతేగదండీ!” అనేవాడు. సత్యంకు కులమతాల పట్టింపులు లేవు. అతని ముగ్గురు పిల్లలకు జెండా వందన్, శబరికొండ, వేలాంగణి భవాని అని పేర్లు పెట్టాడు. ఇంటర్మీడియట్ తరువాత నేను అతణ్ని ఎక్కువగా చూడలేదు. హనుమకొండలో పనిచేస్తుండగా చనిపోయాడని చాలా రోజుల తర్వాత తెలిసింది. పాత ఇంట్లో వాళ్లక్క ఇప్పటికీ ఉంటున్నది. చెల్లెళ్లిద్దరూ కొత్త ఇండ్లు కట్టుకున్నారుగానీ.. ఏళ్ల తరబడి రాకపోవడంతో అందులో పాములు పుట్టలు పెట్టాయని ఊరివాళ్లు అంటుంటారు. ఆరేళ్ల క్రితం హనుమకొండలో జిల్లా గ్రంథాలయానికి గ్రంథాలయ వారోత్సవాలకు వెళ్లినప్పుడు.. “మేడమ్! బాగున్నరా!? నేను సత్యం కొడుకును. ఇక్కడే పనిజేస్తున్నా” అంటూ ఒక యువకుడు నా దగ్గరికి వచ్చి మాట్లాడాడు. అచ్చు సత్యం లాగానే ఉన్నాడు. సంతోషం, బాధా రెండూ కలిగాయి. ఇప్పటికీ ఎప్పుడైనా లైబ్రరీకి వెళ్తే.. సత్యం గుర్తొస్తాడు. “అమ్మాయిగారూ! ఏం పుస్తకం కావాలి?!” అని అడిగినట్టే అనిపిస్తుంది.
-నెల్లుట్ల రమాదేవి, రచయిత్రి