ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్లి జీవించినా మన మూలాలు ఎప్పుడూ దూరం కావు. మనమే వాటికి దూరమవుతాం. ఈ కథల సంపుటిలోని కథలన్నీ ఈ తరహాలోనివే. చాలామంది తక్కువ పేజీల్లో ఎక్కువ కథలు రాస్తుంటారు. కానీ, పుస్తకంలో ఉన్నవి తక్కువ కథలే అయినా విస్తారంగా సాగుతాయి. అందుకూ ఒక కారణం ఉంది. కట్టె కొట్టె తెచ్చె అన్నట్టుగా కాకుండా కథను చెప్పే తరుణంలో పూర్వాపరాలు, ఉదాహరణలు వివరించడం వీటిలోని ప్రత్యేకత. ఓ కథలో విదేశీయుడైన లియమ్ తన మిత్రుడు హరితో కలిసి భారతదేశానికి వస్తాడు.
హరి ఇంటి వద్ద రాధను చూసి తెలియకుండానే ప్రేమలో పడతాడు. ఆమె కుటుంబం గురించి తెలుసుకొని వారిని మెప్పించే ఆమెను వివాహం చేసుకోవాలని భావించి తెలుగు నేర్చుకుంటాడు. సనాతన ధర్మాన్ని ఆచరిస్తాడు. ఒక విదేశీయుడు అందులో ఇతర మతంవాడు తన ప్రేమను నిరూపించుకునేందుకు ఇక్కడి సంప్రదాయాలను పాటించే తీరు ‘లియాం ప్రేమకథ’తో ప్రయాణం చేస్తే తెలుస్తుంది. పైపై మెరుపులను చూసి మోసపోవద్దని, కనిపించేదంతా నిజం కాదనే భావన ‘నల్లటి పాలు తెల్లటి నీళ్లు’ కథలో వ్యక్తమవుతుంది. ఇలాంటివే మరిన్ని కథలు. ఇందులో రచయిత ఉపయోగించిన భాష.. ఆనాటి ఆత్మీయతను గుర్తుచేస్తుంది. అది పాత శైలి కాదు. బంధాలను గౌరవించిన కాలపు స్వరం. తొందరలేకుండా తీరిగ్గా చదువుకునే పుస్తకమిది.
రచయిత: ప్రమీల సూర్యదేవర
పేజీలు: 153, ధర: రూ.200
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్, కాచిగూడ ఫోన్-9000413413
-రాజు పిల్లనగోయిన