‘ఒక జన్మలో నేర్చుకున్న జ్ఞానం ఏడు జన్మలకు పనికివస్తుంది’ అంటాడు తమిళనాడుకు చెందిన తత్వవేత్త తిరుక్కురళ్. ఆ రాష్ట్రంలోని మదురై జిల్లా మేలూర్ తాలూకా కొడికులం గ్రామానికి చెందిన ఆయి అమ్మాళ్కు ఈ మాటలు స్ఫూర్తినిచ్చాయి. ఆమె తమ ఊళ్లో ప్రభుత్వ పాఠశాల కోసం రెండు ఎకరాలకుపైగా భూమిని దానం చేసింది. సుమారు పదికోట్ల రూపాయల విలువ ఉండే ఆ భూమిని తన కూతురు జనని స్మారకంగా దానం చేయడం విశేషం. ఆయి అమ్మాళ్ ఉదార గుణానికి ఎన్నో ప్రశంసలు దక్కాయి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆమెకు పురస్కారం కూడా ప్రదానం చేశారు. ఆయి అమ్మాళ్ తమ కూతురు జనని పొత్తిళ్లలో ఉన్నప్పుడే భర్తను పోగొట్టుకున్నది. కారుణ్య నియామకం కింద ఆమెకు భర్త ఉద్యోగం ఇచ్చారు.
“నా భర్త చనిపోయిన తర్వాత నా ఆశలన్నీ మా బిడ్డ జననిపైనే పెట్టుకున్నాను. కెనరా బ్యాంకులో క్లర్క్గా పనిచేస్తూనే.. నా కూతురిని కంటికి రెప్పలా కాపాడుకున్నాను” అని ఆయి అమ్మాళ్ కూతురుతో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటుంది. ఇక జనని బీకామ్ చదువుతూనే సామాజిక కార్యకర్తగా చురుగ్గా ఉండేది. రెండేండ్ల కింద అకస్మాత్తుగా మరణించింది. జనని తమ ఊళ్లో ఉండే అభాగ్యుల పిల్లలకు ఆపన్న హస్తం అందించేది. దృష్టిలోపం ఉన్నవాళ్లను ఆర్థికంగా ఆదుకునేది. ఆడిటర్ కావాలనేది ఆమె కల. కానీ, అకస్మాత్తుగా జనని మరణించింది. తన కూతురి ఆశయాన్ని ఎలాగైనా కొనసాగించాలని ఆయి అమ్మాళ్ నిర్ణయించుకుంది.
చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని ఆమె నమ్మకం. ఇంతలో ప్రభుత్వం జనని గ్రామంలో ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలగా మార్చాలని తలపెట్టింది. ఆయి అమ్మాళ్ దీన్ని ఓ మంచి అవకాశంగా భావించింది. విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలు సమకూరడానికి తమకు వారసత్వంగా వచ్చిన భూమిలో రెండెకరాలు విరాళంగా ఇచ్చింది. ఆ పాఠశాలకు జనని పేరు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. అలా తమ ఊళ్లో పన్నెండో తరగతి వరకు చదువుకునేందుకు పిల్లలకు వీలు కల్పించింది. ఉన్నత విద్య అందుబాటులోకి రావడంతో ముందుముందు తమ ఊరినుంచి ఐఏఎస్ అధికారులు, డాక్టర్లు, ఆడిటర్లు తయారవుతారని ఆయి అమ్మాళ్ ఆనందం వ్యక్తంచేస్తున్నది. వారి విజయాల్లో తన కూతురిని చూసుకుంటానని చెబుతున్నది. ఒక్కసారిగా ఆమె పేరు ప్రచారంలోకి రావడంతో సహాయం అర్థిస్తూ ఎంతోమంది ఉత్తరాలు రాశారు. మరెంతోమంది ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే… “నా చేతుల్లో ఏమీ లేదు. దేవుడు ఏది ఇస్తే అది తీసుకుంటాను” అంటున్నది ఆయి అమ్మాళ్.