thadandla shravan అతని బాల్యమంతా రామప్ప గుడి చుట్టూ తిరిగింది. ఆ ఆలయ శిల్పాలను ఆశ్చర్యంగా చూసిన చిన్నచిన్న కళ్లు.. ఇప్పుడు కెమెరాతో కన్నుగీటి ప్రపంచానికి అద్భుతంగా చూపుతున్నాయి. రామప్పగుడి కుడ్యాలపై నిలిచిన సాలభంజికలను అందమైన ఛాయాచిత్రాలుగా మలిచి ‘ఔరా!’ అనిపించుకున్నాడు. మరోవైపు తెలంగాణ సంస్కృతిలో భాగమైన జన జాతరల చిత్రాలను ఘనంగా తీసి అంతర్జాతీయ పురస్కారాలను అందుకుంటున్నాడు. తన ఫొటోగ్రఫీతో తెలంగాణ అస్తిత్వాన్ని చాటుతున్న ములుగు జిల్లా పాలంపేట యువకుడు తడండ్ల శ్రావణ్ పరిచయం…
పాలంపేట పేరు చెప్పగానే గుర్తొచ్చేది రామప్ప గుడే. కాకతీయ శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ ఆలయం యునెస్కో వారసత్వ సంపదగా ఇటీవల గుర్తింపును సాధించింది. ఇదే గ్రామంలో పుట్టిపెరిగిన శ్రావణ్ కూడా తనదైన కళ ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని గడించాడు. పర్యాటక ప్రదేశాలు, సాంస్కృతిక జాతరలు, ప్రకృతి అందాలను కెమెరాలో బంధించి పురస్కారాలు, ప్రశంసలు సొంతం చేసుకున్నాడు.
శ్రావణ్ తల్లిదండ్రులు రాజ్యలక్ష్మి, కిష్టయ్య. శ్రావణ్ ఐదో తరగతి వరకు పాలంపేట ప్రభుత్వ పాఠశాలలో చదివాడు. బాల్యంలో రామప్ప గుడికి తరచూ వెళ్లేవాడు. అక్కడి శిల్పాలను చూస్తూ మైమరచిపోయేవాడు. బాల్యంలో ఇదంతా తన దినచర్యలో భాగం. ‘పసితనంలో ఆ గుడి నా గుండెలో వేసిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోదు’ అంటాడు శ్రావణ్. అందుకే కెమెరా పట్టుకోగానే మొట్టమొదటిసారి రామప్పగుడినే క్లిక్మనిపించాడు. ఆ కళల కోవెలతో పెనవేసుకున్న తన కలలను విభిన్న కోణాల్లో ఫొటోలు తీసి సంబురపడేవాడు. రామప్ప గుడిలో మొగ్గతొడిగిన శ్రావణ్ అభిరుచి కాలక్రమంలో కొత్త అందాల అన్వేషణలో ఎల్లలు దాటింది. ఫొటోగ్రాఫర్గా తనకో గుర్తింపు తెచ్చింది.
ఐదో తరగతి వరకు పాలంపేటలో చదివిన శ్రావణ్.. ఆ తర్వాత శాయంపేట నవోదయ పాఠశాలలో పది వరకు చదువుకున్నాడు. ఇంటర్ పూర్తయ్యాక ఇంజినీరింగ్ చేశాడు. ఇంటర్ చదివే రోజుల్లో సరదాగా మొదలుపెట్టిన ఫొటోగ్రఫీని ఇప్పుడు తన వృత్తిగా, ప్రవృత్తిగా మలుచుకున్నాడు. పెండ్లిళ్లు, ఇతర కార్యక్రమాలకు ఫొటోగ్రాఫర్గా పనిచేస్తూ ఉపాధి పొందుతున్నాడు. ఎప్పుడు ఖాళీ దొరికినా అతనిలో ఓ పర్యాటకుడు నిద్రలేస్తాడు. వాగుల వెంట వెళ్లిపోతాడు. వంకలు దాటుతాడు. డొంకల్లో తిరుగుతాడు. అడవంతా గాలించి పచ్చదనంతో పరవశించిపోతున్న ప్రకృతి కాంతను పదిలంగా కెమెరాలో బంధిస్తాడు. పల్లె సౌందర్యాన్ని ఒడిసిపడతాడు. పర్యాటక విశేషాలను కొత్తగా ఆవిష్కరిస్తాడు. తెలంగాణలో జరిగే జాతరలకు హాజరవ్వడం రివాజుగా చేసుకున్నాడు. జాతర వైభవాన్ని ప్రతిబింబించే ఫొటోలను కెమెరాలో బంధిస్తాడు.
కెమెరా ఉంది కదాని ఫొటోలు తీసి ఊరుకోడు శ్రావణ్. తను తీసిన చిత్రాలతో తెలంగాణలోని వైచిత్రిని లోకానికి చాటాలనుకున్నాడు. ఎక్కడ ఫొటోగ్రఫీ పోటీ జరిగినా పాల్గొంటాడు. సిత్రమైన చిత్రాలను పోటీలకు పంపుతుంటాడు. గడచిన నాలుగేండ్లుగా పదుల సంఖ్యలో పోటీల్లో పాలుపంచుకున్నాడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజేతగా నిలిచి పురస్కారాలను అందుకున్నాడు. 2018లో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ఫొటో అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో మూడు కేటగిరీల్లో పాల్గొని ఒకటి, రెండు స్థానాలతోపాటు ప్రత్యేక అవార్డును గెలుచుకున్నాడు. 2019, 2020లో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫొట్రోగఫీతో ‘శభాష్’ అనిపించుకున్నాడు. 2019లో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సిగ్మా అకాడమీ ఆఫ్ ఫొట్రోగఫీ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ పోటీలో కాంస్య పతకం గెలుపొందాడు. ఇలా ఎక్కడ ఫొటోల పోటీ జరిగినా ఏదో ఒక అవార్డును గెలుచుకుంటున్నాడు. తన వ్యక్తిగత మైలురాయిని దాటుకుంటూనే తెలంగాణ వైభవాన్ని ఫొటోలద్వారా చాటి ‘చూపుతున్నాడు’. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో 36 బంగారు పతకాలు, 19 వెండి పతకాలు, 56 మెరిట్ పురస్కారాలు అందుకున్నాడు.
2021 అక్టోబర్లో మలేషియా తరఫున ఆసియా ఫొటోగ్రాఫర్స్ యూనియన్ నిర్వహించిన పోటీలో 25 దేశాలకు చెందిన ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆన్లైన్ వేదికగా జరిగిన ఈ పోటీలో శ్రావణ్ 8 అవార్డులను సొంతం చేసుకున్నాడు. ట్రావెలింగ్ విభాగంలో రెండు, పల్లెటూరి జీవనశైలి, సంస్కృతి సంప్రదాయాల అంశాలపై రెండు బంగారు పతకాలు, ఐసీపీఈలో బంగారు పతకంతోపాటు ఐదు ప్రశంసాప్రతాలు అందుకున్నాడు. ఈ చిత్రాలన్నీ తెలంగాణ పల్లెల్లోని ప్రజల జీవన శైలికి అద్దం పట్టేవే, రాష్ట్రంలో జరిగే సాంస్కృతిక పండుగలకు ప్రతీకగా నిలిచేవే. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి జాతర వైభవాన్ని ప్రతిబింబించేలా శ్రావణ్ తీసిన ఓ బహుమతి చిత్రం జాతర వైవిధ్యాన్నీ తెలియజేసింది. ప్రపంచానికి తెలంగాణను అందంగా పరిచయం చేసింది.
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రామప్ప దేవాలయాన్ని వైవిధ్యంగా కెమెరాలో బంధించాలని ప్రయత్నించాను. అవి చాలా బాగున్నాయని పర్యాటకశాఖ అధికారులు, తోటి ఫొటోగ్రాఫర్లు ప్రశంసించడంతో మరింత దృష్టి కేంద్రీకరించా. విభిన్న కోణంలో ఫొటోలు తీస్తూ అంతర్జాతీయ గుర్తింపు పొందాలనే లక్ష్యంతో పోటీలకు పంపడం అలవాటు చేసుకున్నా. అందుకు ప్రతిఫలంగా అవార్డులు, ప్రశంసలు వస్తున్నాయి. పెండ్లిళ్లు, శుభకార్యాలు ఉన్న సమయాల్లో బిజీగా ఉంటాను. శుభకార్యాలు లేని రోజుల్లో పర్యాటక ప్రదేశాలు, జాతరలు, అడవుల వెంట తిరుగుతూ నా మనసుకు నచ్చిన దృశ్యాలను ఫోటోలు తీస్తుంటాను. ఫొటోగ్రఫీలో మరిన్ని మెలకువలు నేర్చుకుంటున్నా.
తడండ్ల శ్రావణ్
✍ గోరంట్ల విజయ్ కుమార్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
వాచ్మన్ నుంచి IIM ప్రొఫెసర్ దాకా.. కేరళ యువకుడి సక్సెస్ స్టోరీ
ఒకప్పుడు స్కూల్ డ్రాప్ అవుట్.. ఇప్పుడు మల్టీ మిలియనీర్.. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా?
కన్నబిడ్డలు కాదనుకున్న అమ్మానాన్నలకు కొడుకు అయ్యాడు
Gudipadu | తెలంగాణలోని ఈ గుడిలో గిరిజనులే పూజారులు
మరో పతంజలి పంకజ కస్తూరి నాయర్
కొడుకును కోల్పోయినా.. వందలాది బిడ్డలకు ప్రాణం పోస్తున్నాడు..