సకల కళలకు నిలయం భారతదేశం. విభిన్న సంస్కృతులకు ఆలవాలం. అందుకే, ‘కళా భారతి’గా పిలుచుకునే మన దేశంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో కళారూపం కనిపిస్తుంది. ఒక్కో గ్రామం.. తనకే ప్రత్యేకమైన కళతో అద్భుతః అనిపిస్తుంది. ఒడిశాలోని రఘురాజ్పూర్ కూడా అలాంటిదే! పురాతన పట్టాచిత్ర కళకు పుట్టినిల్లు అయిన ఈ గ్రామంలోని ప్రతి వీధీ, ప్రతి వాకిలీ ఓ కళాఖండమే!

ఒడిశాలోని పూరి జిల్లాలో ఉన్న రఘురాజ్పూర్ గ్రామం.. హస్తకళలకు ప్రసిద్ధి. ఇక్కడి ప్రతి ఇంట్లోనూ పురాతన పట్టాచిత్ర కళ.. వారసత్వంగా కొనసాగుతున్నది. అందుకే, మనదేశంలోనే మొట్టమొదటి వారసత్వ కళా గ్రామంగా ఈ పల్లె గుర్తింపు దక్కించుకున్నది. కళాకారులతోపాటు కళా పోషకులకూ స్వర్గధామంగా విరాజిల్లుతున్నది. ఇక్కడివాళ్లంతా ‘పట్టాచిత్ర’ కళారూపాన్ని వారసత్వంగా స్వీకరించారు. తరతరాలుగా ఆ కళనే నమ్ముకొని జీవిస్తున్నారు. ఈ అపురూప కళను వందల ఏళ్లుగా సంరక్షించుకుంటూ వస్తున్నారు. అందుకే, ఇక్కడ ఏ ఇంట, ఏ వ్యక్తిని చూసినా.. ఏదో ఓ కళారూపం తయారీలో నిమగ్నమై కనిపిస్తారు. దీంతో హస్తకళలంటే ఇష్టపడే వారు ఈ గ్రామంలో వాలిపోతుంటారు. దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశీ టూరిస్టులు కూడా సందర్శిస్తుంటారు.

వస్త్రం, వస్తువులపై చేతులతో రంగురంగుల బొమ్మలు ముద్రించడమే పట్టాచిత్ర కళ. ఈ ప్రత్యేకమైన కళా నైపుణ్యానికి రఘురాజ్పూర్ పెట్టింది పేరు. ఇక్కడి ప్రతి ఇంట్లోనూ కనీసం ఒక్కరైనా ఈ కళపై ఆధారపడి జీవిస్తుంటారు. తమ కళను ప్రదర్శించడానికి, ఇళ్ల గోడలనే కాన్వాస్గా మలిచి, అద్భుతమైన చిత్రాలు వేస్తుంటారు. అందుకే, గ్రామంలో ఏ వీధి చూసినా, ఏ ఇంటి గోడలను వీక్షించినా.. పట్టాచిత్ర కళారూపాలే దర్శనమిస్తాయి. ఇక ‘పట్టాచిత్ర’లో ఉపయోగించే మూలాంశాలు.. హిందూ పురాణాలు, జానపద కథల నుంచి ప్రేరణగా తీసుకున్నవే ఉంటాయి. దాంతో ఆయా కళా నైపుణ్యాలన్నీ ఎక్కువగా దేవుళ్లు, సంస్కృతి సంప్రదాయాలనే ప్రతిబింబిస్తాయి.

పురాణ గాథలు, ముఖ్యంగా జగన్నాథుని లీలలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక పెయింటింగ్లన్నీ వందశాతం సహజసిద్ధమైన రంగులతోనే రూపొందుతాయి. ఇక్కడ పట్టాచిత్రతోపాటు మరిన్ని కళలు కూడా మనుగడలో ఉన్నాయి. ఒడిస్సీ నృత్యానికి పునాది అయిన గోటిపువ నృత్యం ఇక్కడ పుట్టిందే. అమ్మాయిల వేషధారణలో అబ్బాయిలు చేసే ఈ నృత్యం ఎంతో మనోహరంగా ఉంటుంది. తాళపత్ర చిత్ర, కొబ్బరి చిప్పల బొమ్మలు, కాగితపు బొమ్మలు కూడా ఇక్కడ చూడొచ్చు.

దేశంలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల నుంచి పూరీకి బస్సు, రైలు సౌకర్యం ఉన్నది. అక్కడి నుంచి 15 కి.మీ ప్రయాణిస్తే.. రఘురాజ్పూర్కు చేరుకోవచ్చు. విమానంలో రావాలనుకునేవారు భువనేశ్వర్కు చేరుకోవాలి. అక్కడి నుండి 60 కి.మీ దూరంలో ఈ గ్రామం ఉంటుంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు.. ఎప్పుడైనా గ్రామాన్ని సందర్శించవచ్చు. ఒక పూట మొత్తం ఊళ్లోనే గడిపేలా ప్లాన్ చేసుకుంటే మంచిది.

పర్యాటకులు నేరుగా కళాకారుల వద్దకు వెళ్లి, వారు బొమ్మలు ఎలా గీస్తున్నారో చూడవచ్చు. ఆసక్తి ఉన్నవారు నేర్చుకోవడానికి వీలుగా ఇక్కడ వర్క్షాప్లు కూడా నిర్వహిస్తుంటారు. ఇక ఇక్కడి కళాఖండాలను నేరుగా కళాకారుల నుంచే కొనుగోలు చేయవచ్చు. దీనివల్ల కళాకారులతోపాటు కొనుగోలుదారులకూ ఆర్థికంగా మేలు కలుగుతుంది. మొత్తానికి కళలను, సంస్కృతిని ఇష్టపడే వారికి.. రఘురాజ్పూర్ సందర్శన ఒక గొప్ప అనుభవాన్ని అందిస్తుంది.