శ్రీదోసగీత
రచన: నేతి సూర్యనారాయణ శర్మ
పేజీలు: 162; వెల: రూ. 150/-
ప్రతులకు: ఫోన్: 99517 48340, 91218 68065
అర్జునుడికి గీతోపదేశం చేస్తూ ‘అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితాః’ అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ 15వ అధ్యాయం పురుషోత్తమప్రాప్తి యోగంలో. శరీరంలో జఠరాగ్ని రూపంలో పరమాత్ముడు మనం తినే నాలుగు రకాలైన అన్నాలను జీర్ణం చేస్తున్నాడని అర్థం. అలాంటి గంభీరమైన భగవద్గీతను సరదాగా దోసకాయకు అన్వయిస్తూ నేతి సూర్యనారాయణ శర్మ రాసిన కథ ‘శ్రీదోసగీత’. ‘కూరలన్నిట్లో శ్రేష్ఠమైనది ఏది?’ అని అర్జునుడు అడిగిన ప్రశ్నకు సూక్ష్మంలో మోక్షంలా కృష్ణుడి చేత చేయించిన ఉపదేశమే దోసగీత. ఉపదేశంలో దోసకు కర్కటి, చర్మటికా, ఉర్వారుకం అన్న మారుపేర్ల గురించి రచయిత వివరించిన మూడు కథలు పాఠకుల ముఖాలకు నవ్వులు పులుముతాయి. ‘శ్రీదోసగీత’ను వైవిధ్యంతో కూడిన తన 18 కథల సంపుటికి శీర్షికగా ఎంచుకోవడంతోనే పాఠకులను హాస్యరసంలో ఓలలాడించాలన్న రచయిత లక్ష్యం వెల్లడవుతుంది. పాండవుల అజ్ఞాతవాసం నేపథ్యంలో భీముడు సృష్టించిన వంటకమే ‘పాఠోళీ’ అని నిరూపిస్తూ, పాఠోళీ గురించి అధ్యయనం చేయడానికి సాక్షాత్తూ భీముడే ఆగ్రా సమీపంలో ‘పాఠోళీ’ అనే గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చాడనే ఇతివృత్తంతో సరసంగా సాగించిన కథ ‘భారతంలో పాఠోళి’.
వంటలను సంప్రదాయబద్ధంగా చేసే హోటల్ బాబాయ్ జీవితాన్ని వివరిస్తూ హాస్య ప్రధానంగా సాగిన కథ ‘తెలుగు ఫలహారం’, ముక్కును వస్తువుగా తీసుకొని హాస్యాన్ని పండించిన కథ ‘ముక్కు పురాణం’, గోళ్ల నేపథ్యంలో సాగిన ‘గోటి పురాణం’, ఆవకాయ పచ్చళ్ల మహత్యాన్ని మనసుకు హత్తుకునేలా చెప్పిన ‘మామిళ్ల తోటకాడ మాటేస్తే’, ‘అల్లం అంటే నాకు తెలియదా? బెల్లంలా పుల్లగా ఉంటుంది’ అంటూ మొదలై అల్లసాని వారి అల్లిక జిగిబిగిలా సాగిన ‘అల్లిక జిగిబిగి’ ఇలా శ్రీదోసగీతలో ఉన్న ‘రాజనంది’ మినహా 17 కథలు పాఠకులకు తాము అప్పుడెప్పుడో మరిచిపోయిన నవ్వులను మళ్లీ తిరిగి తెచ్చిస్తాయి. తెలుగు ఫలహారం, మిస్టర్ శ్రీమతి కథలు హాస్యంగా సాగుతూనే పాత్రల జీవితంలో విషాదాన్ని చిత్రిస్తాయి. మొత్తానికి 162 పేజీల ‘శ్రీదోసగీత’ హాసం, మందహాసం, దరహాసం, చిరునవ్వు, విరగబడే నవ్వు, కడుపు చెక్కలయ్యే నవ్వు..ఇలా నవ్వుల్లో ఎన్ని ఉన్నాయో అన్నిటినీ మనకు పరిచయం చేస్తుంది.
శివమయం జగతి
శివలీలలు
రచన : కందుకూరి వేంకట
సత్యబ్రహ్మాచార్య,
పేజీలు : 208 వెల: రూ. 200,
ప్రతులకు : 94914 11090
శివలీలలు అనంతం. శివరూపాలు అనేకం. సాధారణంగా మనం శివుణ్ని లింగ మూర్తిగానే కొలుస్తాం. కానీ ఆలయాలకు వెళ్లినప్పుడు శిల్పాలుగా, ఉత్సవమూర్తులుగా అనేక రూపాలు కనిపిస్తుంటాయి. ఆ శిల్పాల వెనుక పురాణ నేపథ్యాలు ఉంటాయి. అర్ధనారీశ్వరుడు, శరభమూర్తి, ఏకపాదమూర్తి, సోమస్కందమూర్తి వంటి శివరూపాల వెనుక ఎన్నో లీలా విశేషాలున్నాయి. అటువంటి శివరూపాలలో అర్చనకు వీలుగా ఆగమ శాస్ర్తాలు అతిముఖ్యమైన ఇరవై అయిదు రూపాలను చెప్పాయి. వాటిని పరమేశ్వరుని పంచకృత్యాలు అంటే సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహ రూపాలుగా విభజించి చక్కని కథలను జతచేర్చి సంకలనం చేశారు సత్యబ్రహ్మాచార్య. ఆగమ, వాస్తుశాస్ర్తాలపై ఇప్పటికే అనేక పుస్తకాలను వెలువరించిన అనుభవం ఉన్నవారు బ్రహ్మాచార్య. ఈ శివలీలలు పుస్తకంలో ప్రతి రూపానికి ధ్యానశ్లోకాన్ని, శిల్పాన్ని, కథకు అనువైన చిత్రాన్ని కూడా పొందుపరిచారు. తెలుగుతోపాటు ఇంగ్లిషులో కూడా ఆయా రూపాల వివరణను క్లుప్తంగా అందించారు. ఈ శివరూపాలు భక్తులను పరవశింప చేస్తుంది.
బుక్ షెల్ఫ్
అవ్వ (కథలు)
రచన: డా. పెరుక రాజు
పేజీలు: 108
వెల: రూ. 100
ప్రచురణ: మై గిఫ్ట్
ప్రతులకు: ప్రముఖ
పుస్తక దుకాణాలు
ఫోన్: 78100 32847
రుద్రరాగాలు
(కవితా సంపుటి)
రచన: డా. పి. భాస్కరయోగి
పేజీలు: 145
వెల: రూ. 150
ప్రచురణ: విజ్ఞాన సేవా ప్రచురణలు
ప్రతులకు: నవోదయ,
ఇతర ప్రముఖ పుస్తక దుకాణాలు
పూలు పుప్పొడులు
(కవితా సంపుటి)
రచన: సోలా జానకీదేవి
పేజీలు: 96
వెల: రూ. 100
ప్రతులకు:
ఫోన్: 92931 49792
చంపకాలోచనమ్
(ఖండకావ్యము)
రచన: పాణ్యం దత్తశర్మ
పేజీలు: 84
వెల: రూ. 99
ప్రతులకు: నవోదయ, ఇతర ప్రముఖ పుస్తక దుకాణాలు
ఫోన్: 95502 14912