ప్రతి భావాన్నీ చిత్రికపట్టి శిల్పంలా తయారుచేయడం కొందరికే సాధ్యం. అనాయాసంగా అక్షర చిత్రాలను కండ్ల ముందు నిలబెట్టడం కూడా కొందరికే సాధ్యం. అలాంటివారిలో దాకరపు బాబూరావు ఒకరు. ఆయన కలం నుంచి జాలువారిన ‘మట్టి మొగ్గలు’ కవితా సంకలనం ఈ మాటను రుజువు చేస్తుంది. ఇందులో ఏ కవిత గురించి విశ్లేషించాలా అన్నది సమీక్షకుడికి జటిల ప్రశ్న.
“ఊపిరి కొమ్మల్లోంచి నువ్వెళ్లి/ పోయాకగానీ బతుకు విలువ/ నాకు తెలియలేదు…” అంటారు ‘శుద్ధీకరణ’ కవితలో. తల్లి చనిపోయిన దశలో కవి గొంతు ఇంకా చాలా మాట్లాడింది. “ఎంత దుఃఖాన్ని ఒంపితే/ ఈ గుండె భారాన్ని/ దించుకోగలను?” ఈ ఒక్క పదచిత్రం చాలదా… కవి గుండెలోతును తెలియజెప్పడానికి! ‘వానే…’ కవిత చివర్లో “..చాలాకాలం తర్వాత/ పసిప్రాయపు కాగితప్పడవనై/ తడుస్తూ వానలో కొట్టుకుపోవడం/ నా వంతయింది..” అంటారు కవి.
క్వారంటైన్పై రాసిన కవితలో “ఉన్నట్టుండి ఎగరకుండా రెక్కలెవ్వరో విరిచి/ అమాంతంగా పక్షిని పంజరంలోకి విసిరేసినట్టు… ఆంక్షల కంచెల్లో తెల్లని వెలిగీతలు/ ఇంటి చుట్టూ గీసి/ భయం వాకిట బందీ చేసినట్టు…” ఇంతకుమించి ఎవరు వర్ణించగలరు? బాబూరావు తప్ప! కవి అక్షరాక్షరంలో ప్రాణప్రతిష్ఠ చెయ్యడం వల్లే మట్టి మొగ్గలైనా అపరిమిత సౌరభం వెదజల్లాయి. మొగ్గ మొగ్గగానే ఉండదు. అది వికసిస్తుంది. అభ్యున్నతికి అది సంకేతం. శీర్షిక కూడా భావయుక్తంగా ఉంది. అన్నిటికంటే ముఖ్యం ఈ పుస్తకంలోని కవిత్వం క్లిష్టత లేకుండా సరళంగా ఉండటం. ఆ సరళతే దీనికి ప్రాణం. మొత్తం యాభై ఏడు కండగల కవితలు ఉన్న ఈ పుస్తకం చదువరులను ఆకట్టుకుంటుంది.
మట్టి మొగ్గలు
రచన: దాకరపు బాబూరావు
పేజీలు: 140
వెల: రూ. 150
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు.
-చంద్రప్రతాప్ కంతేటి