Children of billionaires | వాళ్లంతా దిగ్గజ వ్యాపారుల ముద్దుబిడ్డలు. వారసత్వంగా పగ్గాలను అందుకున్నారు. తల్లిదండ్రుల నుంచి ఒంట బట్టించుకున్న మెలకువలతో.. తమ సంస్థలను లాభాల బాటలో నడిపిస్తున్నారు. కొందరు మాత్రం.. అంతటితోనే సరిపెట్టుకోవడం లేదు. అదే వ్యాపారంతో సర్దుకోవడం లేదు. సృజనాత్మకతను జోడించి.. తమ సామ్రాజ్యాన్ని విభిన్న రంగాలకు విస్తరిస్తున్నారు. ‘రిస్క్.. రివార్డు’ సూత్రాన్ని ఫాలో అవుతూ.. సంపద సృష్టికి కొత్త భాష్యం చెబుతున్నారు. బిలియన్ డాలర్ల పెట్టుబడులైనా సరే.. సునాయాసంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. సాహసోపేతమైన అడుగులతో కంపెనీ చరిత్రను తిరగరాస్తున్నారు. రిటైల్, డిజిటల్ సర్వీసెస్, పోర్టు మేనేజ్మెంట్, ఐటీ, సిమెంట్, పెయింట్స్, హెల్త్ కేర్.. ఇలా ఇప్పుడు ఏ రంగాన్ని చూసుకున్నా.. వారసుల హవానే కనిపిస్తున్నది. కార్పొరేట్ కారిడార్లలో.. ‘ఆర్థిక శక్తి కేంద్రంగా భారత్ ఏం సాధించగలదో చెప్పడానికి, రాబోయే రోజుల్లో కార్పొరేట్ ప్రపంచాన్ని కళ్లకు కట్టడానికి.. వీరి గురించి మాట్లాడితే చాలు!’ అనే మాట వినిపిస్తున్నది.
వ్యాపార ప్రపంచం.. ఎప్పటికప్పుడు మార్పులకు లోనవుతూ ఉంటుంది. నిరంతర అనిశ్చితి, ఊహించని సవాళ్లు.. ఈ రంగంలో సర్వసాధారణం. ఇక్కడ మనుగడ సాగించాలంటే.. ఆయా సంస్థలు కూడా పరివర్తన చెందాల్సిందే! అవసరాలకు అనుగుణంగా తమను తాము మార్చుకోవాల్సిందే! గత 30 ఏండ్లుగా భారత వ్యాపార ప్రపంచం ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్నది. గొప్పగా వెలుగులీనే వ్యాపారసంస్థలు కూడా తమ ‘కోర్ బిజినెస్’ను ఓసారి లోతుగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కొత్త మార్గాలను అన్వేషించక తప్పని పరిస్థితి నెలకొన్నది. అయితే.. ఇదేమంత సులువైన విషయం కాదు. ఇక్కడ ఎలాంటి పొరపాట్లూ చేయకూడదు. వేగంగా నిర్ణయాలు తీసుకోగలిగిన సామర్థ్యం, నిర్దిష్టత, కచ్చితత్వం కావాలి. ‘ఎక్కడికైనా వెళ్లొచ్చు.. ఏదైనా చేయవచ్చు’ అనే చొరవ ఉన్నప్పుడే.. సరైన ఫలితాలు వస్తాయి. ఇక్కడే వారసుల పాత్ర ముందుకు వస్తున్నది. అపరిమితమైన ఆత్మవిశ్వాసం, అభిలాష, అనేక విధాలుగా సాహసాన్ని ప్రదర్శించే స్వభావం పుష్కలంగా ఉన్న ఈ యువతరం.. చకచకా నిర్ణయాలు తీసుకుంటూ, అద్భుత ఫలితాలను రాబడుతున్నది. తమదైన నాయకత్వ ప్రతిభతో దూసుకుపోతున్నది. వ్యాపార ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్నది. అలాంటి కొందరు నవతరం వారసుల గురించి ఈ కథనం..
వయసు : 41 ఏండ్లు
హోదా : సీఈఓ, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా
విద్యార్హతలు : లండన్లోని వెస్ట్ మినిస్టర్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ స్టడీస్లో బీఏ (ఆనర్స్) డిగ్రీ.
సాధించిన విజయాలు : ప్రపంచ చిత్రపటంలో కొవిడ్-19 వ్యాక్సిన్ ప్రధాన తయారీదారుగా, సరఫరాదారుగా భారత్కు గుర్తింపు రావడంలో ప్రముఖ పాత్ర. సీరం సంస్థను బహుముఖంగా విస్తరించడంలో కీలక భూమిక. ప్రపంచస్థాయి సాంకేతికతను భారత దేశానికి రప్పించడంలోనూ, ప్రపంచంలోనే అత్యంత చౌకగా 171 దేశాలకు టీకాలను అందించడంలోనూ అపారమైన పేరు ప్రఖ్యాతులు.
అదార్ పూనావాలా.. ఈ పేరును కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్-19 వైరస్ను అదుపు చేయడానికి అవసరమైన టీకాను చౌకగా అందించి, ప్రపంచవ్యాప్తంగా మానవతావాదిగా పేరు తెచ్చుకున్నారు. 2011లో సీరం సంస్థ సీఈఓగా అదార్ పగ్గాలు చేపట్టిన నాటి నుంచే.. దానిని ఇండియాలో ముందు వరుసలో నిలిచే బయోటెక్ కంపెనీగా మలిచారు. ఇమ్యునాలజికల్ డ్రగ్స్తోపాటు వ్యాక్సిన్లు తయారు చేస్తూ, అతి తక్కువ ధరకు టీకాలు అందించాలనే నిబద్ధతను కొనసాగించారు. ఆయన నాయకత్వంలోనే ‘సీరం’ సంస్థ ప్రపంచస్థాయి సాంకేతికతను భారత్కు రప్పించగలిగింది. అదే సమయంలో 171 దేశాలకు అత్యంత చౌకగా కొవిడ్-19 టీకాలను అందించగలిగింది.
లండన్లోని వెస్ట్ మినిస్టర్ యూనివర్సిటీ నుంచి 2001లో బిజినెస్ స్టడీస్లో బీఏ (ఆనర్స్) పూర్తిచేసిన వెంటనే.. సీరం సంస్థలో చేరాడు పూనావాలా. వ్యాపారాన్ని అంతర్జాతీయ మార్కెట్లో విస్తరించాలని ఆశించాడు.
“20 ఏండ్ల క్రితం నేను కంపెనీలో చేరినప్పుడు నాకు ఒకే కల ఉండేది. అది సంస్థను గ్లోబల్ బ్రాండ్గా మలచడం. తద్వారా భారత్కున్న అసాధారణమైన సామర్థ్యాన్ని చాటడం” అని చెబుతారు అదార్. “అంతర్జాతీయంగా మా ఉనికిని చాటుకోవడానికి, ఎగుమతులపై దృష్టి పెట్టి విస్తరించాం. ఇప్పుడు అమెరికా, కెనడా, యూకేలాంటి రెగ్యులేటెడ్ మార్కెట్లు ఉన్న దేశాలతో పాటు, అనేక అభివృద్ధి చెందిన దేశాలు కలిపి మొత్తం 171 దేశాల్లో ఉన్నాం. మా ముందుతరంతో పోలిస్తే మేము భిన్నంగా ఉన్నామని చెప్పేందుకు కారణం.. ఆవిష్కరణలకు అత్యంత ప్రాధాన్యమివ్వడమే!” అంటారాయన. అదార్ తండ్రి సైరస్ 1966లో ఈ కంపెనీని స్థాపించారు. మొత్తం ఉత్పత్తయ్యే డోసులను పరిగణనలోకి తీసుకుంటే, ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీదారుగా నేడు ‘సీరం సంస్థ’ ఖ్యాతి గడించింది. కొవిడ్-19 వ్యాక్సిన్ల తయారీ, సరఫరాలో భారత్ను అంతర్జాతీయ యవనికపై నిలపడంలో అదార్ తనదైన పాత్రను పోషించారు. వ్యాపారంలో కొత్తదనాన్ని ప్రవేశపెట్టాలని ఆయన ఫైనాన్స్ రంగంలోకీ ప్రవేశించారు. అసాధారణ పట్టుదల, తిరుగులేని నిబద్ధత, రాజీలేని తత్వంతో ప్రపంచ వ్యాక్సిన్ తయారీ ముఖచిత్రాన్ని పూనావాలా మార్చివేశారు. వ్యాపారానికి కొత్త నిర్వచనాన్ని అందించే.. ‘ఛేంజ్ మేకర్’గా ప్రశంసలు అందుకుంటున్నారు. ఎకనామిక్ టైమ్స్, బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, 2021లో టైమ్స్ అత్యంత ప్రభావశీలుర అవార్డు, ఆసియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ నుంచి బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వంటివి పూనావాలా దక్కించుకున్నారు.
వయసు : 32 ఏండ్లు
హోదా : ఎండీ, జేఎస్డబ్ల్యూ సిమెంట్, జేఎస్డబ్ల్యూ పెయింట్స్
విద్యార్హతలు : హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ
సాధించిన విజయాలు : 2017లో శివ సిమెంట్స్ స్వాధీనం, తమ గ్రూపు పెయింట్ వ్యాపారానికి సంబంధించిన వ్యూహరచన, సిమెంట్ వ్యాపారంలో జేఎస్డబ్ల్యూను అగ్రగామిగా
నిలపడం.
32 ఏండ్ల ఈ వారసుడు, 22 బిలియన్ డాలర్ల జేఎస్ గ్రూప్ సిమెంట్, పెయింట్ వ్యాపారాన్ని పర్యవేక్షిస్తున్నారు. కంపెనీ మొత్తం టర్నోవర్ రూ.8,500 కోట్లలో.. సిమెంట్ రంగం వాటానే రూ. 6,500 కోట్లు. సిమెంట్ వ్యవస్థాపక సామర్థ్యం ఏడాదికి 17 మిలియన్ టన్నులు. తండ్రి వ్యాపారంలోకి అడుగుపెట్టి మూడేళ్లు తిరక్కుండానే.. ‘శివ సిమెంట్’ను కొనుగోలు చేశారు. “జేఎస్డబ్ల్యూ సిమెంట్ అనేది దక్షిణాదిన, పశ్చిమాన మెరుగైన స్థానంలో ఉంది. శివ సిమెంట్ కొనుగోలుతో తూర్పు ప్రాంతంతోపాటు, ఉత్తరాదిన కూడా కంపెనీ పరిస్థితి మెరుగుపడుతుంది” అని చెబుతారు పార్థ్ జిందాల్.
హార్వర్డ్లో చదువుతున్న సమయంలోనే పార్థ్కు పెయింట్ల గురించిన ఆలోచనలు వచ్చాయి. అప్పటికే జేఎస్డబ్ల్యూ గ్రూప్.. స్టీల్, సిమెంట్ రంగాలలో ఉంది. చదువు పూర్తయ్యే సమయానికే పార్థ్ వ్యాపార వ్యూహం సిద్ధమైపోయింది. 2019లో పెయింట్ల వ్యాపారం ప్రారంభమైంది. ‘ఏ రంగైనా ఒకటే ధర’ అనే వైవిధ్యమైన సూత్రంతో, భారతదేశంలో ఐదో అతిపెద్ద పెయింట్ తయారీదారుగా మార్కెట్లోకి అడుగుపెట్టింది. పనితోపాటు పార్థ్కు స్క్వాష్ అన్నా ఇష్టం. అందుకే.. ఈ గ్రూపు ‘జేఎస్డబ్ల్యూ స్పోర్ట్స్’ పేరుతో క్రీడల్లోనూ అడుగుపెట్టింది. ఐపీఎల్ క్రికెట్ టీం ఢిల్లీ క్యాపిటల్స్లో 50 శాతం వాటాను కొనుగోలు చేసింది. ‘హర్యానా స్టీలర్స్’ కబడ్డీ జట్టు, ‘బెంగళూరు ఐఎస్ఎల్’ ఫుట్బాల్ జట్టును కూడా నిర్వహిస్తున్నది.
వయసు : 45 ఏండ్లు
హోదా : ఎగ్జిక్యూటివ్ చైర్మన్, విప్రో లిమిటెడ్
విద్యార్హతలు : అమెరికాలోని వెస్లియన్ యూనివర్సిటీ నుంచి బీఏ (ఎకనమిక్స్)- హార్వర్డ్ బిజినెస్ స్కూలు నుంచి ఎంబీఏ
సాధించిన విజయాలు : కంపెనీని సమూలంగా మార్చే ప్రణాళిక రచన, అమలు. కంపెనీ విస్తృతిపైన మరింత దృష్టి. బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్లో భాగస్వామ్యం. కొత్త కంపెనీల కొనుగోలు. సెప్టెంబరు 22 నాటికి సంస్థ వార్షిక రన్రేట్ 10 బిలియన్ డాలర్ల మైలురాయిని చేరుకోవడం.
రిషద్ ప్రేమ్ జీ.. విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ పెద్ద కొడుకు. 2019 జూలైలో విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా పగ్గాలు అందుకున్నారు. వెంటనే సంస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. అదికూడా 77 ఏండ్ల సంస్థ విలువలకు ఏమాత్రం భంగం కలగకుండా! “గత 50 ఏండ్లలో మా సంస్థ విలువల్లో ఏ మాత్రం మార్పురాలేదు. 1971లో ‘విప్రో బిలీఫ్స్’ పేరుతో ఉంటే, 98 నాటికి ‘విప్రో ప్రామిస్’గా, ఇప్పుడు ‘విప్రో స్పిరిట్’గా పేర్లను మాత్రమే మార్చుకుంది” అని చెబుతారు రిషద్. అన్నిటికంటే మిన్నగా కంపెనీ సంప్రదాయం అనేది దాని విజయాన్ని నిర్ధారిస్తుందని నమ్ముతారాయన. ఈ క్రమంలోనే తన సామర్థ్యాన్ని కంపెనీ పూర్తిస్థాయిలో ప్రదర్శించడం లేదని భావించి, సంస్థ సంస్కృతిని సమూలంగా మార్చేందుకు నిర్ణయించారు. “సంస్కృతి అనేది కంపెనీలో అత్యంత ప్రధానమైనది. వ్యూహాలు, పెట్టుబడులు, ఆలోచనలు అనేవి వస్తుంటాయి, పోతుంటాయి. కానీ, సంస్థగా మీరు ఎలా ఉంటారనేది అత్యంత ప్రధానమైన అంశం. దానికే ఎక్కువ ప్రాధాన్యం ఉందని నమ్ముతాను” అంటారాయన. ఈ మార్పులను అమలులో పెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్నాపెద్ద 28వేల మంది విప్రో ఉద్యోగులతో 300 గంటలపాటు చర్చించి, వ్యవస్థాగత మార్పులకు రూపకల్పన చేశారు. కంపెనీ సంస్కృతికి సంబంధించిన విషయంలోనే కాదు.. దాని నిర్మాణం, నిర్వహణ తీరుతెన్నులను మార్చడానికీ సిద్ధమయ్యారు రిషద్. ఇందులో భాగంగా బోర్డులో కొత్త టాలెంట్ను.. ముఖ్యంగా మహిళా నాయకత్వాన్ని జత చేశారు. ప్రస్తుతం క్లౌడ్ కంప్యూటింగ్లో భాగస్వామ్యం, కొత్త కంపెనీల కొనుగోలు దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. క్లౌడ్ టెక్నాలజీస్లో ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడిని సొంతం చేసుకున్నారు. రిషద్ పగ్గాలు చేపట్టిన రెండేండ్లలోనే సంస్థ వార్షిక రన్రేట్ 10 బిలియన్ డాలర్ల మైలురాయిని చేరుకుంది. సంస్థను ఉద్యోగులు వదిలివెళ్లడం బాగా తగ్గింది. పోటీ సంస్థల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంటే, దేశంలో నాలుగో అతిపెద్ద సాఫ్ట్వేర్ ఎగుమతుల సంస్థ అయిన విప్రోలో.. ‘అట్రిషన్ రేటు’ బాగా తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. రిషద్ లండన్లోని బెయిన్ అండ్ కంపెనీ, అమెరికాలో జీఈ కంపెనీలో కొద్దికాలం పనిచేశారు. ఆ అనుభవంతోనే 2007లో విప్రోలో ప్రవేశించారు. ఆ తర్వాత చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్గా ఎదిగారు. ఈ సమయంలోనే ప్రొమాక్స్, గల్లాఘర్ సొల్యూషన్స్, ఓపస్ లాంటి అనేక స్టార్టప్లు ప్రారంభించారు. ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కాగానే కంపెనీల స్వాధీనానికి నడుం బిగించారు. కేప్కో, రైజింగ్ సంస్థలను కొనుగోలు చేశారు.
వయసు : 35 ఏండ్లు
హోదా : సీఈఓ, అదానీ పోర్ట్స్, స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్
విద్యార్హతలు : అమెరికాలోని పర్డ్యూ యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్లో డిగ్రీ
సాధించిన విజయాలు : సంస్థ పోర్ట్ ఆపరేటర్
స్థాయి నుంచి సమీకృత రవాణా వ్యవస్థకు పరిష్కారం కనుగొనే స్థాయికి మారడానికి పునాది వేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 312 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో నిర్వహణ. 2025 నాటికి దానిని 500 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచాలనేది లక్ష్యం. 2025 నాటికి కర్బన ఉద్గారాల విడుదలను శూన్యస్థాయికి చేర్చాలనే సంకల్పం.
కరణ్ అదానీ.. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ పెద్ద కొడుకు. రూ.15,934 కోట్ల అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్ (ఏపీఎస్ఈజెడ్) సీఈఓ. 35 ఏండ్ల వయసులో దేశంలోని అతిపెద్ద కమర్షియల్ పోర్ట్ కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తున్నారు.
అమెరికాలో గ్రాడ్యుయేషన్ చేసిన కరణ్కు రెండు అవకాశాలిచ్చాడు అదానీ. ఒకటి విద్యుత్ రంగం, రెండోది పోర్టులు. కరణ్.. రెండో దానికే ఓటేశారు. దుమ్మూధూళితో నిండి ఉండే పోర్టు పనుల్లో తానే స్వయంగా మురికి కొట్టుకుపోవడమే కాదు.. అక్కడి ఉద్యోగుల సాధకబాధకాలనూ పూర్తిగా అర్థం చేసుకోవాలన్న తండ్రి మాటలను ఆచరణలో పెట్టారు. గౌతమ్ అదానీ సన్నిహితుడు మలై మహదేవ్ పర్యవేక్షణలో మరింతగా రాటుదేలారు. రాత్రంతా రైలులో ప్రయాణించి, తెల్లారేసరికల్లా ముంద్రాలో వాలిపోయేవారు కరణ్. పోర్టులోనే ఎక్కువ సమయం గడుపుతూ, ప్రతి విషయాన్నీ క్షుణ్నంగా నేర్చుకొనేవారు. సాంకేతిక విషయాలను లోతుగా అర్థం చేసుకునేవారు. “వ్యవస్థాపకత అంటేనే సమస్యలను పరిష్కరించడం. అది సమాజానికి సంబంధించినది కావచ్చు, వ్యాపారానికి సంబంధించినది కావచ్చు, కస్టమర్కు సంబంధించినది కావచ్చు” అంటారు కరణ్. అందుకే, సీఈఓగా కస్టమర్ల సమస్యల పరిష్కారంపైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. 2016 జనవరిలో సీఈఓగా కరణ్ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి సంస్థ లాభాల బాటలో నడుస్తున్నది. అది గణాంకాల్లో స్పష్టమవుతున్నది.
ఏపీఎస్ఈజెడ్ సంస్థ 2016 మార్చిలో 152 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోను నిర్వహిస్తూ, రూ.7,941కోట్ల రెవెన్యూతో రూ.2,867 కోట్ల లాభాలను గడించింది. ఆ తర్వాతి ఆరేండ్లలో కంపెనీ దినదినాభివృద్ధి చెందుతూ.. ప్రస్తుతం 312 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో రవాణాతో, రూ.15,394 కోట్ల రెవెన్యూ, రూ.4,795కోట్ల లాభాలతో దూసుకెళ్తున్నది. 2025నాటికి 500 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోను రవాణా చేయాలనే లక్ష్యంతో కరణ్ అదానీ వ్యూహాలు రచిస్తున్నారు.
ఈశా అంబానీ
వయసు : 30 ఏండ్లు
హోదా : డైరెక్టర్, రిలయన్స్ రిటైల్ వెంచర్స్
విద్యార్హతలు : స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ
సాధించిన విజయాలు : రిలయన్స్ రిటైల్ బిజినెస్లో పరివర్తన. ఫ్యాషన్, ఫుట్ వేర్, ఎలక్ట్రానిక్స్, జువెలరీ తదితర విభాగాల్లో ‘పవర్ హౌజ్’ స్థాయికి చేర్చడం. ఈ-కామర్స్ రంగంలో ముందడుగు. 2022 ఆర్థిక సంవత్సరంలో రిటైల్ వ్యాపారాన్ని రెండు లక్షల కోట్లకు చేర్చడం.
ఆకాశ్ అంబానీ
వయసు : 30 ఏండ్లు
హోదా : చైర్మన్, రిలయన్స్ జియో
విద్యార్హతలు : అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్లో డిగ్రీ
సాధించిన విజయాలు : రిలయన్స్ను డిజిటల్ సేవల్లో దూసుకుపోయేలా చేయడం. సోదరి ఈశాతో కలిసి వేర్వేరు పెట్టుబడిదారుల నుంచి 20 బిలియన్ డాలర్లను సేకరించడంలో కీలకపాత్ర.
ఈ మధ్యే ముగిసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) వార్షిక సర్వసభ్య సమావేశంలో.. ముకేశ్ అంబానీ తన వారసత్వ ప్రణాళికను ప్రకటించారు. టెలికంను ఆకాశ్, రిటైల్ను ఈశా, ఎనర్జీ బిజినెస్ను చిన్న కొడుకు అనంత్ పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. దశాబ్దం క్రితం వరకూ ఆర్ఐఎల్ అంటే.. కేవలం పెట్రోలియం, దాని శుద్ధి పరిశ్రమ మాత్రమే. అయితే, మారుతున్న కాలంలో సంస్థ అలాగే కొనసాగితే సరిపోదని ఆంతరంగికులు భావించేవారు. దాంతో 2006లో ‘రిలయన్స్ ఫ్రెష్’ పేరుతో స్టోర్ల రూపంలో కొత్త అడుగులు పడ్డాయి. ఆ తర్వాత కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, లైఫ్ స్టయిల్ వ్యాపారం మొదలైంది. అది కూడా క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో సాధారణంగా సాగుతూ ఉండేది. దాంతో చెప్పుకోదగ్గ విజయాలు అందలేదు. అప్పుడే.. అంబానీ కవలలు ఆకాశ్, ఈశా 2014లో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్వీఎల్)లో ప్రవేశించారు. వచ్చీరావడంతోనే వ్యాపార స్వరూప స్వభావాలను పూర్తిగా మార్చివేశారు. ఇప్పుడు ఫ్యాషన్, ఫుట్వేర్, ఎలక్ట్రానిక్స్, జువెలరీ.. ఇలా ఏ రంగంలో చూసుకున్నా రిలయన్స్ బ్రాండ్ ఉనికిని చాటుతున్నది. కనాలి, స్టీవ్ మేడన్, 7-ఎలెవన్, అజియో, జియో మార్ట్ లాంటి సంస్థలు ఇప్పుడు రిలయన్స్ బ్రాండ్స్ జాబితాలో ఉన్నాయి. వాటితోపాటు హామ్లీజ్, పర్పుల్ పాండా లాంటివి కూడా వచ్చిచేరాయి. ఆర్ఆర్వీఎల్.. అభివృద్ధి విషయంలోనే కాదు, కొనుగోళ్లు, స్వాధీనాల విషయంలోనూ అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నది. దీర్ఘకాలికంగా నిలబడగల వారితో మాత్రమే లావాదేవీలు నిర్వహిస్తున్నది. అలా కానివారికి దూరంగా జరుగుతూ వ్యూహాత్మకంగా మెలుగుతున్నది. 2020లో రిలయెన్స్ జియో ప్లాట్ ఫామ్లు, ఆర్ఆర్వీఎల్లో వాటాలు అమ్మి.. ఈ కవలలు 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రాబట్టగలిగారు. పెట్టుబడులు పెట్టిన వారిలో ఫేస్బుక్, గూగుల్ లాంటి ప్రసిద్ధ సంస్థలు ఉన్నాయి.
ముకేశ్ అంబానీ ఈ ఏడాది జూన్లో రిలయన్స్ జియో బోర్డు నుంచి వైదొలిగి, తన పెద్దకొడుకు 30 ఏండ్ల ఆకాశ్కు పగ్గాలను అందించారు. దాంతో ఆయిల్, టెలికం, రిటైల్ రంగాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న.. 217 బిలియన్ డాలర్ల వ్యాపార సంస్థకు తర్వాతి తరం నాయకత్వం మొదలైంది. ఈ మార్పునకు ముందు.. ఆకాశ్ ఎనిమిది ఏండ్లపాటు టెలికం రంగంలో కీలకమైన డిజిటల్ సర్వీసెస్ విభాగాన్ని ముందుండి నడిపించారు.
ముకేశ్ అంబానీ 2003లో రిలయన్స్ ఇన్ఫోకామ్ను ప్రారంభించారు. రెండేళ్ల తర్వాత వ్యాపార విభజనలో అది తమ్ముడు అనిల్ పరమైంది. తిరిగి 2010లో టెలికం రంగంలోకి ప్రవేశించారు ముకేశ్. 2016 సెప్టెంబర్లో ‘జియో’ను ప్రారంభించారు. ముకేశ్ వారసుల సారథ్యంలో ‘జియో’.. దేశీయ టెలికం రంగంలో సమూల మార్పులకు కేంద్రంగా నిలిచింది. తాజా గణాంకాల ప్రకారం 41.3 కోట్ల మంది వినియోగదారులతో జియో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నది. ఇటీవల ముగిసిన 5జీ స్పెక్ట్రమ్ వేలంలో రూ. 88,078 కోట్ల పెట్టుబడికి జియో ముందుకొచ్చింది.
ప్రస్తుతం ఆకాశ్ నేతృత్వంలోని జియో.. కేవలం బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు కన్జ్యూమర్ సేవలతో తోటి ఆపరేటర్లతోనే కాదు.. దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ ఐటీ, ఐటీ ఆధారిత సేవల్లో పోటీపడుతున్నది. ఈ దూకుడులో ఎక్కువ భాగం ఆకాశ్, ఈశాలకే చెందుతుందని వారి గురించి తెలిసిన వారు చెబుతున్నారు. “ఓ కొత్త పని తలకెత్తుకోగానే ముందుగా దానికి సంబంధించిన ప్రజెంటేషన్ ఇస్తారు. ప్రశ్నలను ఆహ్వానిస్తారు. ఆ తర్వాత పరిణతితో ఆ పాత్రలోకి ప్రవేశిస్తారు” అని వారి వ్యవహారశైలి గురించి వివరిస్తూ.. రిలయన్స్ పెద్దలు చెప్పే మాట. ప్రస్తుత వేగాన్ని బట్టి చూస్తే, వచ్చే ఐదేండ్లు ఈ ఇద్దరు వారసులు తీరిక లేకుండా పనిచేస్తారని అనిపించక మానదు.
అప్పుడే.. అంబానీ కవలలు ఆకాశ్, ఈశా రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్లో ప్రవేశించారు. వచ్చీరావడంతోనే వ్యాపార స్వరూప స్వభావాలను పూర్తిగా మార్చివేశారు.
ఇప్పుడు ఫ్యాషన్, ఫుట్వేర్, ఎలక్ట్రానిక్స్, జువెలరీ.. ఇలా ఏ రంగంలో చూసుకున్నారిలయన్స్ బ్రాండ్ ఉనికిని చాటుతున్నది. కనాలి, స్టీవ్ మేడన్, 7-ఎలెవన్, అజియో, జియో మార్ట్ లాంటి సంస్థలు ఇప్పుడు రిలయన్స్ బ్రాండ్స్ జాబితాలో ఉన్నాయి.
బిల్ గేట్స్, వారెన్ బఫెట్, రతన్ టాటా.. అపర కుబేరులు చేసిన ఫస్ట్ జాబ్ ఏంటో తెలుసా?
“అదానీ నిమిషానికి ఎంత సంపాదిస్తాడో తెలుసా? సగటు వ్యక్తి జీవితకాలం కష్టపడినా అంత రాదు!!”