ఏ పెండ్లి విందుకో పిలుపు రాగానే నాలుక ఆనందంతో నాగిని డ్యాన్స్ చేస్తుంది. వెజ్- నాన్వెజ్ వంటకాలు, స్వీట్లు, ఐస్క్రీమ్లు, పండ్లు, ఉత్తరాది- దక్షిణాది రుచులు .. బఫేలో
వంటకాల చిట్టా పెద్దదే! అయితే, చాలామంది ఏం తినాలో తెలియక.. తికమకపడిపోతుంటారు. చివరికి ఏమీ తినకుండానే ప్లేటు పడేస్తుంటారు. కొందరేమో అతిగా ఆరగించి అనారోగ్యం పాలవుతుంటారు. ఇలాంటి సమయంలోనే నాలుకను అదుపులో పెట్టుకోవాలి.
☞ డైనింగ్ హాల్లో కాలుపెట్టగానే ఆవురావురుమంటూ ప్లేటు పట్టుకుని వరుసలో నిలబడకండి. అక్కడున్న పదార్థాలను ఒక్కొక్కటిగా చూస్తూ ఓ సారి కలియతిరగండి.
☞ ముందుగా మీ ప్లేట్ను తాజా పండ్లు, కూరగాయలతో నింపేసుకోండి.
☞ వాటితో పాటే ఓ గిన్నెలో సూప్ తీసుకోండి.
☞ పళ్లెం ఖాళీకాగానే, సిరిధాన్యాలతో చేసిన పదార్థాలవైపు అడుగేయండి. రాజ్మా, చోలే, పనీర్ సబ్జీతో కొద్దిగా అన్నం (బ్రౌన్రైస్ అయితే ఉత్తమం), నూనె లేకుండా చేసిన రొట్టెలు తీసుకోవచ్చు.
☞ మాంసాహారులు అయితే.. గ్రిల్డ్, బాయిల్డ్, స్టీమ్డ్ చికెన్కు చోటు కల్పించండి. ఈ కాంబినేషన్తో ప్రొటీన్ పరిపూర్ణంగా లభిస్తుంది. ఎప్పుడు కూడా మసాలా దట్టించిన పదార్థాల వలలో పడకండి. వేపుళ్లు కూడా అంతే ప్రమాదకరం. కృత్రిమమైన రంగులు జోడించిన ఆహారాలు కంటికి ఇంపుగా ఉన్నా, పొట్టకు హాని చేస్తాయి.
☞ రుచుల వేటలో పడి మంచినీళ్లను విస్మరించకండి. పండ్ల రసాలు ఉంటే.. మరీ మంచిది. కాకపోతే, ఐస్ముక్కలు, చక్కెర జోడించకుండా ఇవ్వమని అడగండి.
☞ బేకరీ పదార్థాల జోలికి వెళ్లొద్దు. ఐస్క్రీమ్ కూడా మితంగానే. కేకులు, మిఠాయిలు మిమ్మల్ని ఊరించవచ్చు. ఓ చిన్న ముక్కకే పరిమితం అయితే మంచిది.
☞ మితమే హితమన్న సూత్రాన్ని మరచిపోవద్దు. విందు తర్వాత కాసేపు అటూ ఇటూ తిరుగుతూ అతిథులతో కబుర్లు చెప్పుకోండి. కుర్చీకే పరిమితం కావొద్దు. వీలైతే మరుసటి రోజు బ్రేక్ఫాస్ట్కు ఇడ్లీలాంటి తేలికపాటి ఆహారం తీసుకోండి.
అచ్చమైన తెలంగాణ, ఆంధ్రా పల్లె రుచులను నగరవాసులకు వడ్డిస్తున్నది.. గచ్చిబౌలిలోని ‘పల్లె విందు’ రెస్టారెంట్. ఈ భోజనశాల గోడల నిండా ముగ్గులే కనిపిస్తాయి. బంతి భోజనాలు, మట్టి పాత్రలు, అరటాకు వడ్డనలతో పల్లె వాతావరణం ప్రతిబింబిస్తుంది. పాతకాలం రుచులను నేటితరానికి పరిచయం చేయాలనే ఆలోచనతో రావి రాధాకృష్ణ, మూసాపేట్ గాయత్రి దీన్ని స్థాపించారు. ఈ రెస్టారెంట్లో ‘పంచకట్టు కోడిపులావ్’ చాలా ఫేమస్. అలనాటి మధుర గీతాలను ఆలకిస్తూ ఇక్కడ పల్లె రుచులను ఆరగించవచ్చు. ఇద్దరికి 800 వరకూ ఖర్చు అవుతుంది. తిరిగొస్తున్న సమయానికి సొంతూరికి వెళ్లొచ్చిన భావన కలగడం ఖాయం.
ఐస్క్రీం అంటే తియ్యగా, చల్లగా ఉంటుంది. కానీ ఇప్పుడు కారంగా, ఘాటుగా కూడా నోరూరిస్తున్నది. ఇలాంటి వైవిధ్యమైన హిమక్రీములు హైదరాబాద్లోనూ లభిస్తున్నాయి. క్రీం స్టోన్, హ్యూబర్ హోలీ వంటి సంస్థలు ఈ స్పైసీ ఐస్క్రీమ్లను అందిస్తున్నాయి. వీటిని మిరపకాయలు దట్టించి చేస్తారు. వెనిలా, చాక్లెట్, జామ, నిమ్మ ఫ్లేవర్లలోనూ ఇవి అందుబాటులో ఉన్నాయి. కారమంటే మమకారం ఉన్నవారికి ఈ రుచులు తప్పకుండా నచ్చుతాయి. ప్రయత్నించండి మరి!
ఏం కావాలి? ఆలుగడ్డలు: రెండు (మరీ చిన్నవి కాకుండా), వెల్లుల్లి రెబ్బలు: ఆరు, మైదా: పావు కప్పు, బియ్యపు పిండి: పావు కప్పు, కార్న్ఫ్లోర్: ఒక టేబుల్ స్పూన్, సోయా సాస్, టమాట సాస్, రెడ్ చిల్లీ సాస్: ఒక టీస్పూన్ చొప్పున, నువ్వులు: ఒక టేబుల్ స్పూన్, క్యాప్సికమ్: సగం, తేనె: ఒక టేబుల్ స్పూన్, ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చిమిర్చి: రెండు, వెనిగర్: అర టీస్పూన్, నూనె: వేయించడానికి సరిపడా, ఉప్పు: తగినంత.
ఎలా వండాలి? ముందుగా ఆలుగడ్డల తొక్కతీసి సన్నగా, పొడవుగా కట్చేసి నీళ్లలో బాగా కడగాలి. తర్వాత, ఉప్పు కలిపిన నీటిలో పదినిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో మైదా, బియ్యపుపిండి, ఉప్పు వేసి కొద్దికొద్దిగా నీళ్లుపోసి జారుగా కలుపుకోవాలి. మరో గిన్నెలో ఉడికించిన ఆలు, ఒక టీస్పూన్ కార్న్ఫ్లోర్, మైదా వేసి బాగా కలిపి.. పిండి మిశ్రమంలో కలపాలి. స్టవ్మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోయాలి. నూనె వేడయ్యాక ఆలుగడ్డ ముక్కల్ని విడివిడిగా వేసి సన్నటి మంటపై దోరగా వేయించుకోవాలి. స్టవ్మీద పాన్పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేయాలి. బాగా వేడయ్యాక సన్నగా తరిగిన వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, క్యాప్సికమ్, నువ్వులు వేయాలి. అవన్నీ వేగాక సోయా, టమాట, రెడ్ చిల్లీ సాస్లు వేసి తగినంత ఉప్పు, వెనిగర్ వేసి కలపాలి. వేయించిన ఆలుగడ్డ ముక్కల్ని కూడా వేసి పైనుంచి తేనె వేసుకుంటే హనీ చిల్లీ పొటాటో సిద్ధం.
☞ విటమిన్-సి పుష్కలం. కండరాలు బలపడటానికి, చర్మ ఆరోగ్యానికి ఈ విటమిన్ చాలా అవసరం.
☞ పొటాషియం కూడా ఉంటుంది. రక్తపోటు నియంత్రణకు సహకరిస్తుంది.
☞ విటమిన్-ఎను అందిస్తుంది. దీనివల్ల నేత్రాలు, కేశాలు ఆరోగ్యంగా ఉంటాయి.
☞ ల్యూటిన్, జియాక్సాంథిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ దొరుకుతాయి. క్యాన్సర్ను ఇవి నియంత్రిస్తాయి.
☞ కొంత ఫాస్పరస్ కూడా లేకపోలేదు. దీనివల్ల ఎముకలు బలపడతాయి. ఆస్టియోపొరోసిస్, ఆర్థరైటిస్ గండం నుంచి గట్టెక్కిస్తుంది. కాక పోతే మరీ ఎక్కువగా తింటే మాత్రం అల్సర్లు, పొట్టలో మంట తదితర సమస్యలు రావచ్చు.
షెఫ్ చలపతిరావ్.. పేరు చెబితే వీఐపీలకు సైతం నోరూరుతుంది. ఈయన వండితే నలభీములు కూడా మారువేషంలో వచ్చి విందారగించి వెళ్తారని ఓ ప్రచారం. గతంలో అనేక స్టార్ హోటల్స్లో చీఫ్-షెఫ్గా పనిచేశారు చలపతిరావ్. ప్రస్తుతం ‘సింప్లీ సౌత్’ పేరుతో రెస్ట్టారెంట్ల సముదాయాన్ని నిర్వహిస్తున్నారు. పాక నిపుణుడు చలపతిరావ్ ఈమధ్య మీడియాతో పంచుకున్న జ్ఞాపకాలు..
నేనేం పుట్టుకతోనే షెఫ్ అయిపోవాలని కలలుకనలేదు. నిజానికి డాక్టర్ కావాలనుకున్నా. కానీ, నాకు పదేండ్ల వయసులో.. అమ్మ అనారోగ్యం పాలైంది. నాన్న, నేను, నా తోబుట్టువులు ఇంటిపనులు చేసుకున్నాం. వంటలో సాయపడటం నా డ్యూటీ. అలా పాకశాస్త్రం మీద ఆసక్తి పెరిగింది. తర్వాత, కొంతకాలానికి వేసవి సెలవులకు మావయ్య వాళ్ల ఇంటికెళ్లాను. ఆయన ఫ్రెండ్ ఓ పెద్ద షెఫ్. దీంతో పాకశాస్త్ర నిపుణుడు కావాలన్న కోరిక నాలో బలపడింది. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో సీటు సంపాదించాను. దాదాపు ఇరవై ఏండ్లు ఐటీసీ హోటల్స్లో వివిధ హోదాల్లో పనిచేశాను. ఆ తర్వాత నా కంటూ ఓ బ్రాండ్ విలువ సృష్టించుకునే ప్రయత్నంలో ఓ మిత్రుడితో కలిసి ‘సింప్లీ సౌత్’ ప్రారంభించాను. దక్షిణాది వంటకాలకు మెనూలో తగిన ప్రాధాన్యం కల్పించాలన్నదే మా ఉద్దేశం. దక్షిణాది అంటే పక్కా దక్షిణాదే! మేం పనీర్ కూడా ఉపయోగించం. పనీర్ పక్కా ఉత్తరాది సంస్కృతి. భారతీయ సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు చాలామందికి నేను వండి వడ్డించాను. పాక నిపుణుడిగా ఇంతకు మించిన తృప్తి ఏం ఉంటుంది? వీలు చూసుకుని మీరూ మా రెస్ట్టారెంట్కు రండి!