Kasi Majili Kathalu Episode 90 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : ధారానగర నివాసి అయిన పితృదత్తకు కలలో కనిపించిన నాగరాజు వల్ల ఫణిదత్తుడనే పుత్రుడు కలిగాడు. కొడుకుతోపాటు ఆమె పాటలీపుత్రానికి వలస వెళ్లింది. ఫణిదత్తుడు మల్లయుద్ధ వీరుడిగా రూపుదిద్దుకున్నాడు. కాశీలో జరిగిన కుస్తీపోటీలకు వెళ్లినప్పుడు ఫణిదత్తుడు గంగనీళ్లలో ఎవరో స్త్రీని రక్షించబోయి మునిగిపోయాడు.
ఫణిదత్తుణ్ని గంగలో ముంచివేసిన బలమైన చెయ్యి అతణ్ని మరోలోకానికి తీసుకుపోయి విడిచిపెట్టి, ఎటో వెళ్లిపోయింది. స్పృహ వచ్చిన తరువాత చూసుకుంటే ఎదురుగా గొప్ప శివాలయం కనిపించింది. బహుశా తాను మరణించి, శివసాయుజ్యాన్ని పొంది ఉంటానని భావించాడు ఫణిదత్తుడు. ప్రదక్షిణ పూర్వకంగా ఆలయంలోకి ప్రవేశించాడు. లోపల శివలింగం చెంత కూర్చుని, భక్తివివశయై వీణాగానం చేస్తున్న ఒక నారీమణి దర్శనమిచ్చింది. ఆమె ఫణిదత్తుని రాకను గమనించలేదు. తాను కూడా స్వామికి నమస్కరించి, ధ్యానం చేసుకున్నాడు. కొంతసేపటికి ఆ యువతి వీణ పక్కన పెట్టి, ఎక్కడికో వెళ్లసాగింది. బహుశా తనతోపాటు గంగలో మునిగి చనిపోయింది ఆమే కాబోలని అనుకుంటూ.. ఈ లోకంలో విశేషాలను ఆమెతోపాటు వెళ్లి చూద్దామనే ఉద్దేశంతో ఆమెను అనుసరించాడు ఫణిదత్తుడు. ఆమె చాలాదూరం నడిచి వెళ్లి ఒక పూలతోటలో ఒకచోట నిలబడి ఎవరినో పిలిచింది. అక్కడ భూమిలోనున్న ఇనుప కవాటం తెరిచి ఇద్దరు సుందరీమణులు పైకి వచ్చారు. ఈమె చేయిపుచ్చుకుని తమతోపాటు తీసుకువెళ్లారు. తిరిగి తలుపు మూయకపోవడం వల్ల ఫణిదత్తుడు కూడా ఆ మార్గంలో ప్రవేశించగలిగాడు.
కొంతదూరం వారివెంట లోపలికి నడిచిన తరువాత మేటిరత్నాలతో నిర్మించిన గొప్ప భవంతి కన్నులపండుగ చేసింది. అక్కడ మరో ఐదుగురు సుందరీమణులు వీళ్లను కలుసుకున్నారు. అందరూ సమాన రూపం, వయసు కలిగి ఉన్నారు.
‘ఓహో! నాతోపాటు వీరంతా ముక్తిని పొందినవారేనన్నమాట’ అనుకుంటూ వారిని అనుసరించాడు. లోనికి వెళ్లిన తరువాత కూడా ఫణిదత్తుణ్ని గమనించకుండా వాళ్లంతా తమలోతాము మాట్లాడుకోసాగారు.
“అక్కా! మనం ఇంకెన్నాళ్లు ఇక్కడ పడి ఉండాలి? చండిక కాశీపురానికి వెళ్లిందా? ఎవరైనా బలశాలిని మన సహాయం కోసం తీసుకువచ్చిందా?!” అని ఒక కన్య ప్రశ్నించింది.
“తీసుకువచ్చానని చెప్పింది మరీ..” అంటూ పక్కకు తిరిగింది, ఫణిదత్తుడు గుడిలో చూసిన కన్య. సరిగ్గా అప్పుడు మాత్రమే ఆ ఎనిమిది మంది కన్యలకూ తొలిసారి ఫణిదత్తుడు కనిపించాడు.
“పుణ్యపురుషా! మేమంతా నీకోసమే ఎదురుచూస్తున్నాం. మేమంతా వరుణకన్యలం. నాపేరు వారుణి” అంటూ తనను పరిచయం చేసుకున్నది తొలికన్యక.
“కాశీలో మరణించి, శివసాన్నిధ్యానికి చేరుకున్నానేమో అనుకున్నాను. అయితే ఇది రుద్రలోకం కాదా?! ఎక్కడైనా సరే, బలవన్మరణం చెందినవారికి వరుణలోకం ప్రాప్తిస్తుంది కాబోలు” అన్నాడు ఫణిదత్తుడు.
“మహాభాగా! ఇది రుద్రలోకమూ కాదు.. స్వర్గమూ కాదు. అధోలోకం. మీ వల్ల మాకొక సహాయం కావాల్సి ఉంది. అందుకే మిమ్మల్ని మేమిక్కడికి రప్పించుకున్నాం. దయచేసి మా కథ వినండి” అంటూ ఇలా చెప్పసాగింది.
“మేం వరుణుని దౌహిత్రులం. మణిమంతమనే నగరంలో నివసిస్తుంటాం. అది కూడా అధోలోకమే. బలి చక్రవర్తి పౌత్రుడైన శంబరుడనే రాక్షసుణ్ని విష్ణుమూర్తి పాతాళలోకానికి తొక్కివేశాడు. వాడొకసారి మా నగరానికి వచ్చి.. మమ్మల్ని చూశాడు. తనను పెళ్లాడమని మమ్మల్ని నిర్బంధించాడు. మేం ఒప్పుకోకపోవడంతో మయుడు కల్పించిన మాయ సహాయంతో మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి బంధించాడు. అయితే కొంతకాలానికే వాడు వాసుదేవునితో జరిగిన యుద్ధంలో నిహతుడయ్యాడు. కానీ, వాడు మేమిక్కడి నుంచి అవతలికి పోకుండా నాగలోకపు పొలిమేరలో ఒక సింహాన్ని కాపు ఉంచాడు. నాగలోకానికి, వరుణలోకానికి నడుమ ఒక గుర్రాన్ని కాపలా పెట్టాడు. ఆ రెండుమృగాలనూ సంహరించడం దేవదానవులకు సైతం సాధ్యం కాదు. అవి రెండూ అవతలివారిని ఇటువైపునకు రాకుండా, ఇటువారిని అటుపోనివ్వకుండా నిర్బంధిస్తున్నాయి. దేవతలకు సైతం చంపడానికి సాధ్యం కాని ఆ మృగాలను పుణ్యశీలుడైన మానవుడు మాత్రమే చంప గలడని మయుడు మొదటే చెప్పాడట. అందుకే చండిక అనే శివశక్తి మాకోసం భూలోకానికి వెళ్లి ఇప్పటివరకూ అనేకమందిని తీసుకువచ్చింది. వాళ్లంతా ఆ సింహం చేతిలో మరణించారు. ఇప్పుడు నువ్వు గనుక ఆ మృగాలను చంపగలిగితే నాగలోక చక్రవర్తివి కాగలవు”..
ఈ మాటలు విన్న ఫణిదత్తుడు.. “వరుణుడు పశ్చిమ దిక్పాలుడు కదా!? ఆయనే ఆ మృగాలను కట్టడి చేయలేకపోయాడా? సరే.. అది వరప్రభావం అని చెప్పారు కదా! నన్ను ధన్యుణ్ని చేయడానికే వారీ పని నాకు కల్పించి ఉంటారు. ఇంతకూ ఆ సింహం ఎక్కడుందో చెప్పండి” అని అడిగాడు.“పురుష సింహమా! ఆ మాయా సింహం దాని హద్దులు దాటి ఇవతలికి రాదు. నాగపురానికి పోయే దారిలో తారసపడుతుంది. అయితే దానిమెడలో ఒక శంఖం, చురకత్తి వేలాడుతూ ఉంటాయి. ఆ రెండిటినీ లాక్కున్నవారికే ఆ సింహాన్ని చంపడం సాధ్యపడుతుంది. జాగ్రత్త సుమా!” అన్నది వారుణి.
ఫణిదత్తుడు మల్లయుద్ధ వీరుడు కనుక తన రెండు అరచేతులనూ భుజాలపై తాటించుకుని, భుజస్ఫాలనం చేస్తూ ‘జయ పరమేశ్వరా’ అంటూ అక్కణ్నుంచి కదిలాడు. వరుణకన్యలు అతనికి ఒక ఖడ్గాన్ని ఇచ్చారు. ఇద్దరు వనితలు దారి చూపారు. ఫణిదత్తుడు సింహం వద్దకు చేరుకున్నాడు. సింహం నోరప్పళిస్తూ పైకి లేచి, ఒక్కసారి ఆవులించింది. నాలుగు కాళ్లనూ సాగదీసేముందు వాటిని నిక్కబెట్టి, భయంకరంగా గర్జించింది.
ఆ గర్జన విని, ఫణిదత్తునితోపాటుగా వచ్చిన వనితలు భయపడి పారిపోయారు. ఫణిదత్తుడు మాత్రం ముందుకు వెళ్లి, వాడిగోళ్లతో తనను చీల్చి వేయడానికి సిద్ధంగా ఉన్న సింహం ముందుకాళ్లను మోచేతి గుద్దులతో పడగొట్టాడు. తన చేతిలోని కరవాలం చేత దాని నాలుకను చీలికలు చేసి పారేశాడు. అదను చూసి దాని మెడలో వేలాడుతున్న చురకత్తిని, శంఖాన్ని స్వాధీనం చేసుకున్నాడు. సింహం ఆ వీరుడి పొట్టను తన వాడికోరలతో చీల్చివేయడానికి ప్రయత్నించింది. కానీ, అతను దానిని కిందపడవేసి మెడమీద కాళ్లు పెట్టి, నెత్తిమీద పిడిగుద్దులు కురిపించాడు. కత్తితో కాళ్లు నరికి, శంఖధ్వానం చేశాడు. ఆ శబ్దం విని, మణిమంతంలోని నాగులందరూ విస్మయులయ్యారు. వారుణి మొదలైన వరుణకన్యలందరూ అతనిపై పుష్పవర్షం కురిపించారు. “మహాపురుషా! మొదటగానే నీతో మనవి చేయడం మరిచాను. ఆ మృగాలు రెండిటినీ సంహరించినవారినే వరించాలని మేమంతా నిశ్చయించుకున్నాం. కనుక మాకు ప్రాణనాయకుడివై మమ్మేలుకో” అన్నది వారుణి.
అప్పుడతను చిరునవ్వుతో.. “తరుణీమణీ! నీ మాటలు వింటుంటే ఆశ్చర్యం కలుగుతున్నది. ఒక్కరికి అనేకమంది భార్యలుండటం అసమంజసం. లోకవిరుద్ధం కూడా కదా!” అన్నాడు.
దాంతో వారుణి.. “మనోహరా! మేం మానవకాంతల వంటివారం కాము. నిత్యయవ్వనులం. అనుదినం మా ప్రాయం కొత్తకొత్త అవుతూనే ఉంటుంది. మాతో క్రీడ మీకు బలకరమే కానీ, పీడాకరం కాదు. మేమెప్పుడూ పతి వ్రతలమై భర్త చిత్తవృత్తిని అనుసరించి మెలగుతుంటాం” అంటూ ఏమేమో చెప్పసాగింది. ఆమె మాటలకు అడ్డువచ్చి.. “ముందు ఆ గుర్రం ఎక్కడుందో చెప్పండి” అన్నాడు ఫణిదత్తుడు. అంతలో సింహవధను గురించి విన్న మణిమంతుని మంత్రులు అక్కడికి వచ్చారు. రక్తంతో తడిసి, మరో అంగారకుడేమో అనిపింప చేస్తున్న ఫణిదత్తుణ్ని చేరి.. “మహానుభావా! నీ ప్రతాపం సామాన్యమైనది కాదు. దేవదానవులకు సైతం లొంగని సింహాన్ని చంపి, వరుణ నాగలోకాలకు గొప్ప ఉపకారం చేసి పెట్టావు. దేవతాంశ వల్ల జన్మించిన మానవుడు కానీ, ఆ మృగాలను చంపలేడని గతంలోనే మయుడు వరమిచ్చాడు. మా ప్రభువు ప్రస్తుతం భూలోకయాత్రలో ఉన్నారు. వారు వచ్చిన తరువాత మిమ్మల్ని తగినవిధంగా సన్మానించగలరు. ఈలోపుగా ఆ గుర్రాన్ని కూడా చంపండి. ఇదిగో ఈ అశ్వదళాన్ని వెంటపెట్టుకుని వెళ్లండి” అని చెప్పారు. వారుణి కూడా చెప్పాల్సిన మాటలు చెప్పి.. చెల్లెళ్లతో కలిసి తన మేడలోనికి వెళ్లిపోయింది. ఫణిదత్తుడు గుర్రాన్ని చంపిన విధానం గురించి తెలుసుకునేలోపుగా.. పాటలీపుత్రంలో జరిగిన కథ కొంత తెలుసుకోవాల్సి ఉంది.
ఫణిదత్తుడు గంగలో మునిగి చనిపోయాడని నిశ్చయానికి వచ్చిన, అతని స్నేహితులందరూ తిరిగి పాటలీపుత్రానికి చేరుకున్నారు. కొడుకు మరణవార్త విని పితృదత్త కుంగిపోయింది.
అది జరిగిన కొంతకాలానికే పాటలీపుత్ర రాజు నందభూపాలుడు మరణించాడు. దాంతో రుక్మవర్మ రాజయ్యాడు. సహజంగానే ఫణిదత్తునిపై అసూయ కారణంగా అప్పటివరకూ ఖైదులో ఉన్న కామందకునికి శిక్ష రద్దుచేసి విడిచిపెట్టేశాడు. అతనికి తాను నిరపరాధినని నిరూపించుకునే రుజువులు సంపాదించుకోమని సలహా చెప్పాడు. దాంతో కామందకుడు ధారానగరానికి వెళ్లి, అక్కడి సభాపతిని కలుసుకున్నాడు. తనకు అనుకూలంగా పత్రాలు రాయించుకున్నాడు. వాటిని తీసుకుని పాటలీపుత్రానికి తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ సంగతి చారుల ద్వారా భోజరాజుకు తెలిసింది. సభాపతిని, నగరంలోని ఇతర బ్రాహ్మణ పెద్దలను పిలిపించాడు.
వారంతా ముక్తకంఠంతో.. “పెళ్లికాకుండా గర్భవతియై, పుత్రుణ్ని కన్న పితృ దత్తను మేము సమర్థించం. కులాచారాన్ని విడిచిపెట్టిన కాళిదాసును మాలో కలుపుకోలేం. అతను చేసిన సమస్యాపూరణను నిజమని సమర్థించలేం” అని చెప్పారు. భోజరాజు నిస్సహాయుడై కాళిదాసు వంక చూశాడు. అప్పుడు కాళిదాసు కళ్లు మూసుకుని.. “సర్పరూపంలో వచ్చి పితృదత్తను కూడిన మణిమంతుడా! వేగంగా వచ్చి దర్శనమివ్వు. ఆమెకు కలిగిన అపఖ్యాతిని పోగొట్టు” అని అర్థం వచ్చే శ్లోకం చదివి కొద్దిసేపు ధ్యానించాడు. కొలువులోని వారందరూ చూస్తుండగా సభలోనికి ఎక్కణ్నుంచో ఒక దివ్యనాగు చరచరా పాకుతూ వచ్చింది. కాళిదాసు ముందు పడగ విప్పి, అప్పటికప్పుడు రూపం మార్చుకుని మానవుడిలా కనిపించింది.
భోజరాజు ఆ ఫణిరాజుకు నమస్కరించి.. “మహాభాగా! నువ్వెవరు? నీ పేరేమిటి?” అని ప్రశ్నించాడు.
అప్పుడా నాగరాజు.. “నేను వాసుకి మనుమడిని. నాపేరు మణిమంతుడు అంటారు. ఈ మహామహుడు నన్ను మంత్రబద్ధుణ్ని చేసి, మెడకు తాడుకట్టి లాగినట్లు ఇక్కడికి లాక్కువచ్చాడు” అని కాళిదాసును చూపించాడు. “కిందటిసారి మీరు ఈ నగరానికి వచ్చినప్పుడు ఏం చేశారో గుర్తున్నదా?”. “ఉంది. కామరూపుడనై ఈ ఊరిలో స్వేచ్ఛావిహారం చేశాను. నదీతీరంలో ఒక చక్కని చిన్నదాన్ని చూసి, మోహించి విరహం ఆపుకోలేక ఆమెను నిద్రలోకలిశాను”.
“ఆ సంగతి ఆమెకు తెలుసా?!”. “లేదు. స్వప్నప్రాయంగానే ఆమెతో కలిసి నా మోహాన్ని తీర్చుకున్నాను”. “ఆ తరువాత మీరెప్పుడైనా ఆమెకోసం వచ్చారా?”. “లేదు. ఆ తరువాత ఆమె మాటే మరిచిపోయాను”. “దేవతా సమానులైన మీవంటివారు సాధువులైన మానవుల పట్ల ఇలా చేయడం తప్పు కాదా? మీవల్ల పాపం ఆమె ఎన్నో నిందలు మోయాల్సి వచ్చింది”. “భోజరాజా! బాల్యచాపల్యం వల్ల అప్పుడలాంటి పనికి ఒడికట్టాను. నాదే తప్పు. ఇప్పుడామెను ధర్మపత్నిగా స్వీకరిస్తాను. అనుమతిస్తారా?” అని అడిగాడు మణిమంతుడు.
“ప్రస్తుతం ఆమె పాటలీపుత్రంలో ఒక తగవులో అపరాధిగా ఉంది. నేనొక పత్రిక రాసిస్తాను. వేగంగా వెళ్లి ఆ రాజుకు పత్రం చూపి, పితృదత్తను కలుసుకోండి” అని చెప్పాడు భోజరాజు.
అతనిచ్చిన పత్రికలను తీసుకుని, కాళిదాసుకు నమస్కరించి మణిమంతుడు అక్కణ్నుంచి కదిలాడు. సభలోని బ్రాహ్మణ పెద్దలందరూ కాళిదాసు ప్రభావాన్ని తక్కువ చేసి చూసినందుకు మన్నించమని ఆయన పాదాలపై పడి వేడుకున్నారు. మణిమంతుడు కామగమనంతో పాటలీపుత్రం చేరుకున్నాడు. అప్పటికే తాను సంపాదించిన నకిలీ పత్రాల ఆధారంగా పితృదత్త తన భార్యేనని, ఆమెను తనకు స్వాధీనం చేయమని కామందకుడు రాజుముందుకు తగాదా తీసుకువచ్చాడు. మణిమంతుడు రుక్మవర్మను చేరి, తనతో తెచ్చిన పత్రికలను అతనికి చూపాడు. అందులో పితృదత్త భర్త ఈ నాగరాజే అని స్పష్టంగా భోజరాజుతోపాటుగా, ఆ ఊరి బ్రాహ్మణ సంఘం రాసిన పత్రం ఉంది. దానిని ఆమోదించడానికి రుక్మవర్మకు అహంకారం అడ్డువచ్చింది. అనేకరీతులుగా మణిమంతుణ్ని అవమానించబోయాడు. దాంతో కోపం ఆపుకోలేక రుక్మవర్మను, కామందకుణ్ని మణిమంతుడు కసిదీరా కాటువేశాడు.
(వచ్చేవారం.. ఫణిదత్తుని రాక)
-అనుసృజన: నేతి సూర్యనారాయణ శర్మ