స్మార్ట్ఫోన్ యుగంలో సంప్రదాయ రేడియో అవసరం చాలావరకు తీరిపోయి ఉండొచ్చు.. కానీ, దట్టమైన అడవులు, కొండ ప్రాంతాల ప్రజలకు ఆకాశవాణి అవసరం ఇంకా ఉంది. ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో అయితే మరీ ఎక్కువ. ఆ రాష్ట్రం ఉత్తర, తూర్పు అడవుల్లో 270కి పైగా ఏనుగులు 20 బృందాలుగా తిరుగుతుంటాయి. సంచారంలో భాగంగా ఆహారం కోసం అకస్మాత్తుగా సమీప పల్లెలపైకి దండెత్తుతాయి. ప్రాణాలకు, పంటలకు నష్టం కలిగిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో గజరాజుల ముప్పును తప్పించుకోడానికి అక్కడి ప్రజలు ఓ హెచ్చరికల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు.
అదే ‘హాథీ సమాచార్’ (ఏనుగుల సమాచారం). దాన్ని ఆ రాష్ట్రంలోని నాలుగు ఆకాశవాణి కేంద్రాల నుంచి ప్రసారం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం దేశంలో ఇదొక్కటే. 2017లో ప్రారంభమైన ‘హాథీ సమాచార్’లో ఏనుగులు ఏ ప్రాంతంలో ఉన్నది, ఏ దిశగా వెళ్తున్నది రేడియో ద్వారా పొద్దున ఐదు గంటలకు మొదలుపెట్టి రాత్రి ప్రసారాలు ముగిసేవరకు ఐదు నిమిషాలకోసారి వినిపిస్తున్నారు. అంబికాపుర్, రాయ్పుర్, బిలాస్పుర్, రాయ్గఢ్ ఆకాశవాణి కేంద్రాల నుంచి వెలువడే ఈ హెచ్చరికలు హిందీలో ఉంటాయి. ‘ఏనుగుల కదలికల గురించి ముందుగానే సమాచారం ఇస్తున్నాం. దీంతో మనుషులకు ప్రాణహాని చాలా వరకు తగ్గిపోయింది. నిజంగానే ఇది ప్రజలకు వరం లాంటిది’ అంటాడు అమలేందు మిశ్రా. ఈయన హాథీ సమాచార్లో ప్రొడ్యూసర్గా, రేడియో ప్రజెంటర్గా చేస్తున్నారు.
మారుమూల గ్రామాల ప్రజలు ఏనుగుల బారినుంచి ప్రాణాలు మాత్రమే కాదు.. పంటలు, ఇండ్లను కూడా కాపాడుకుంటున్నారు. కాగా, ఏనుగుల కదలికల సమాచారం ఎప్పటికప్పుడు అందించడానికి ఆకాశవాణి ఛత్తీస్గఢ్ అటవీశాఖతో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఏనుగులకు అమర్చిన శాటిలైట్ రేడియో కాలర్ల నుంచి వచ్చే సిగ్నల్స్ను అటవీశాఖ అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. వీటి ఆధారంగా ఆకాశవాణి కేంద్రాలకు సమాచారం ఇస్తారు. దాన్ని వెంటనే ప్రసారం చేసి ప్రజలను అప్రమత్తులను చేస్తారు. హాథీ సమాచార్ లేకముందు.. ఏనుగులు ఎక్కడినుంచి, ఎప్పుడు వచ్చి దాడి చేస్తాయో అనే భయంతో అటవీ ప్రాంతాలకు దగ్గర్లోని గ్రామాల ప్రజలు వణికిపోయేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి దాదాపుగా లేదు. ముందస్తు సమాచారం అందుతుండటంతో ఏనుగులు – మనుషులకు మధ్య పోరాటం కూడా చాలా వరకు తగ్గిపోయింది.