సెకండ్ హ్యాండ్ ట్రాక్టరైనా కొనుక్కుంటే చాలు తమ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ఆరాటపడే గుణశేఖర్ కథ ఇది. తన కుటుంబం చుట్టే ఈ కథంతా సాగినా.. ట్రాక్టర్ కొనడానికి అప్పిచ్చిన పెద్దమనిషి సిద్ధిరాజు, దానికి బీమా చేయించాలని చూసే వెంకటముని, పని కల్పించి సొమ్ము చెల్లించిన ఏలుమలై ఇలా రకరకాల పాత్రలు కథలోకి ప్రవేశిస్తుంటాయి. ఒక వ్యక్తి చుట్టూ చేరిన ఇన్ని పాత్రలు.. అతని జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పాయో ‘చింతల చేను’ నవలలో అందంగా ఆవిష్కరించారు రచయిత ఆర్సీ కృష్ణస్వామిరాజు.
నవల చదువుతున్నంత సేపు గ్రామీణ జీవనం మన కండ్లముందు వికసిస్తుంది. ఇందులోని పాత్రలు మన ఊహలకే పరిమితం కాకుండా రక్తమాంసాలున్న మనుషులుగా చెరగని ముద్రవేస్తాయి.
ఇంతవరకూ రాయలసీమ సాహిత్యం ఆ ప్రాంతపు కరువు, కల్తీ ఎరువులు, మార్కెట్ దోపిడికి నష్టపోయిన రైతన్నల కన్నీళ్ల గురించి వాపోయింది. కానీ, తొలిసారిగా భూమిని నమ్ముకున్న రైతు, ఆ రైతును నమ్ముకున్న ఇతర వృత్తిదారుల పరిస్థితులను వివరించింది. రైతు కష్టాలను కొత్తకోణంలో చూపిన నవల ఇది.
రచయిత: ఆర్సీ కృష్ణస్వామిరాజు
పేజీలు: 141, ధర: రూ.100
ప్రతులకు: 93936 62821
-రాజు పిల్లనగోయిన