సరస్వతీ దేవి కొలువైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల పల్లెలు. కార్పొరేట్ పాఠశాలలు, ఇంగ్లిష్ మీడియం హైస్కూళ్లు లేని మామూలు గ్రామాలు. అయితేనేం.. ఆ గ్రామాల యువకులు నిజంగా సరస్వతీ పుత్రులే అయ్యారు. ప్రభుత్వ బళ్లలోనే చదువుకొని సర్కారు కొలువులు కొడుతున్నారు. ఉపాధ్యాయులుగా, రెవెన్యూ, పోలీసు, వైద్యశాఖలలో అధికారులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని మిగతా యువకులూ గవర్నమెంట్ నౌకరీ సాధించేందుకు సమాయత్తమవుతున్నారు.
ఆదిలాబాద్ రూరల్ మండలం చాందా(టి) గ్రామంలో 600 కుటుంబాలు ఉంటాయి. జనాభా ఐదు వేలు. అయితేనేం, ఇక్కడ మూడొందల మంది సర్కారు కొలువులు సాధించారు. వీరిలో 55 మంది ఉపాధ్యాయులు. 38 మంది పోలీసు శాఖలో, మరో ఇద్దరు వైద్యులుగా విధులు నిర్వర్తిన్నారు. మరికొందరు వివిధ శాఖల్లో పనిచేస్తున్నారు. ఇంకొందరు, ఇప్పటికే ఉద్యోగ విరమణ పొందారు. ఈ గ్రామానికి చెందిన ఆరే బాపురావు 1960లో మొదటిసారిగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించారు. ‘డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్’గా పనిచేశారు. బాపురావును స్ఫూర్తిగా తీసుకొని పలువురు యువకులు సర్కారు కొలువులు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఇదే గ్రామానికి చెందిన 10 మంది ఉన్నత విద్యలు అభ్యసిస్తున్నారు. మరికొందరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా నౌకరీలు చేస్తున్నారు. వీరంతా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకొన్నవారే.
జాబ్ మేళా.. సొనాల
బోథ్ మండలం సొనాల గ్రామంలో వెయ్యి కుటుంబాలున్నాయి. ఇక్కడ జిల్లాస్థాయి అధికారి మొదలు గ్రామ సిబ్బంది వరకూ సుమారు 410 మంది వివిధ హోదాల్లో ప్రభుత్వోద్యోగాలు చేస్తున్నారు. మరో 120 మంది యువకులు ప్రైవేటు రంగంలో స్థిరపడ్డారు. 1950లో గ్రామానికి చెందిన జి.రాజేశ్వర్, శివరాజ్గౌడ్ మొదటగా ప్రభుత్వ కొలువులు సంపాదించారు. అప్పట్లో హెచ్ఎస్సీ చదివిన వారికి గవర్నమెంట్ టీచర్గా ఉద్యోగం వచ్చేది. అలా విధుల్లో చేరినవారు తోటివారిలో స్ఫూర్తిని నింపారు. దీంతో మరి కొంతమంది ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చారు. తదనంతర కాలంలో ఉపాధ్యాయులుగా 220 మంది, ఆర్టీసీలో 42 మంది, పోలీసు శాఖలో 28 మంది, వైద్యశాఖలో 19 మంది చేరారు. పలువురు ఎంపీడీఓలు, వ్యవసాయాధికారులు, జూనియర్ లెక్చరర్లు అయ్యారు. పంచాయతీరాజ్, పోస్టల్, పశు సంవర్ధక శాఖ, బ్యాంకులు, విద్యుత్, అటవీ శాఖలలో గెజిటెడ్ హోదా, నాలుగో తరగతి ఉద్యోగులుగానూ విధులు నిర్వర్తిస్తున్నారు.
పాఠశాల అభివృద్ధి కోసం..
చాందా(టి) గ్రామంలోని ప్రభుత్వ ఉద్యోగులంతా కలిసి ‘మిత్ర’ పేరుతో పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటు చేశారు. తాము చదువుకున్న పాఠశాలలో రూ. 2 లక్షలతో మౌలిక వసతులు కల్పించారు. వారాంతాల్లో స్థానిక యువతకు వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహిస్తున్నారు. నిరుపేద విద్యార్థులకు చేయూతనందిస్తున్నారు. సొనాల ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉద్యోగాలు సాధించిన వారంతా కలిసి ‘ఉద్యోగ సంఘం’గా ఏర్పడ్డారు. స్కూల్ బ్యాంకు ఖాతాలో కొంత మొత్తం నగదును జమ చేసి, ఏటా వచ్చే వడ్డీతో పదో తరగతిలో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందిస్తున్నారు.
హిందీ పండిట్ల ఘన్పూర్..
బోథ్ మండలం ఘన్పూర్లో రెండొందల కుటుంబాలు ఉన్నాయి. మొత్తం జనాభా 920. వీరిలో 67 మంది సర్కారు కొలువులు చేస్తున్నారు. మహా రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఈ పల్లెలో యువకులు హిందీ భాషపై పట్టు పెంచుకొంటూ హిందీ పండిట్ ఉద్యోగాలు సంపాదించారు. ఎస్జీటీ ఉపాధ్యాయులు, హిందీ- తెలుగు పండిట్లు ఎంతోమంది. పోలీసు, వ్యవసాయ శాఖలతోపాటు పలు విభాగాల్లో కొలువులు చేస్తున్నారు. పండుగలు, శుభకార్యాల సమయంలో కలుస్తూ, గ్రామానికి చెందిన విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపుతున్నారు. ఆసక్తి ఉన్నవారిని పోటీ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు.
ఆదర్శంగా తీసుకొంటూ
మా గ్రామంలో ఇంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినందుకు గర్వంగా ఉంది. మేమంతా సర్కారు పాఠశాలలోనే చదువుకున్నాం. మా ఊరి ఉద్యోగులను ఆదర్శంగా తీసుకుని కష్టపడి చదివాం. మేమూ కొలువులు సంపాదించుకున్నాం. కొత్తగా ఉద్యోగం పొందినవారిని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సన్మానిస్తూ, మిగతా వారిలో స్ఫూర్తిని నింపుతున్నాం.- తుల సదానందం, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, సొనాల
గొప్ప అనుభూతి..
1998లో మా గ్రామం నుండి 20 మంది డీఎస్సీ రాశాం. అందులో 16 మంది టీచర్ ఉద్యోగాలు సాధించాం. జిల్లా స్థాయిలో ఇదో రికార్డు. ఎలాంటి కోచింగ్ లేకుండా ఇండ్లవద్దనే చదువుకొని, సర్కారు ఉద్యోగాలు తెచ్చుకున్నాం.- రడాపు మధుసూదన్, ప్రధానోపాధ్యాయుడు, సొనాల