Political Strategist | ఎత్తుకు పై ఎత్తు. వ్యూహానికి ప్రతివ్యూహం, మాటకు మాట, తూటాకు తూటా.. నేతల అమ్ములపొదిలో ఉండాల్సిందే. తేడా వస్తే.. ప్రత్యర్థి బలపడిపోతాడు. తాడేనని తేలిగ్గా తీసుకున్నవాడే పామై బుసకొడతాడు. ఈ వ్యవహారాలన్నీ గోడ కట్టినంత శ్రద్ధగా చేయడానికి ఒక చేయితిరిగిన మేస్త్రీ కావాలి. ‘పొలిటికల్ స్ట్రాటజిస్టులు’ ఆ కొరత తీరుస్తున్నారు.
మనకు ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor ) సుపరిచితుడు. రాజకీయ నాయకుడికి తక్కువ, సలహాదారుకు ఎక్కువ అయిన ఈ స్ట్రాటజిస్టు .. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాడనీ, గెలిచే అవకాశం ఉన్నవాళ్లకే పనిచేస్తాడని పెదవి విరిచేవారు ఉన్నారు. అతను పనిచేస్తే గెలుపు నల్లేరు మీద నడకే అని ఆకాశానికి ఎత్తేవారూ ఉన్నారు. ఎవరెలా అనుకున్నా.. ప్రశాంత్ కిషోర్తో చేతులు కలపడానికి చాలామంది నేతలే సిద్ధంగా ఉన్నారు. ఆ స్థాయి గ్లామర్ లేకపోయినా.. దేశంలో రాజకీయ కన్సల్టెంట్లకు కొదవ లేదు. సునీల్ కనుగోలు, సౌరభ్వ్యాస్, గౌరవ్ రాథోడ్, పార్థదాస్, సందీప్ పాఠక్.. తదితరులు ఆ జాబితాలోకే వస్తారు.
కర్ణాటక మూలాలున్న సునీల్ చెన్నైలో పుట్టి పెరిగాడు. ప్రశాంత్ కిషోర్ ప్రారంభించిన ఐ-ప్యాక్లో ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించాడు. తను మంచి రాజకీయ చతురుడు. మాజీ గురువులా తెరవెనుక రాజకీయాల్లో నేర్పరి. 2014లో గుజరాత్ ఎన్నికల కోసం ఐప్యాక్తో కలిసి పనిచేశాడు సునీల్. మోదీని ప్రధాని అభ్యర్థిగా జనంలో తీసుకెళ్లడానికి చాలా కష్టపడ్డాడు. ఐప్యాక్ నుంచి వైదొలిగిన తర్వాత తమిళనాడులో డీఎంకే తరఫున ప్రచార వ్యూహకర్తగా మారాడు. ఆ ఎన్నికల్లో డీఎంకే ఓటమిపాలైనా ముఖ్యమంత్రి అభ్యర్థిగా స్టాలిన్కు ప్రజాదరణ లభించింది. ఉత్తరప్రదేశ్ బీజేపీ వ్యూహకర్తగా యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడానికి సాయపడ్డాడు సునీల్. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు డీఎంకే ప్రశాంత్ కిషోర్ను వ్యూహకర్తగా తీసుకోవడంతో ‘మైండ్షేర్ అనలిటిక్స్’ను స్థాపించి అన్నాడీఎంకే కోసం పనిచేశాడు.
బెంగళూరుకు చెందిన పొలిటికల్ కన్సల్టెన్సీ పేరు.. చాణక్య. దీని రూపకర్త పార్థదాస్. బీహార్లో రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వి యాదవ్తో కలిసి పనిచేశాడు పార్థ. వారి గెలుపు కోసం వ్యూహ, ప్రతివ్యూహాలు రచించాడు. ఐఐఎం పూర్వ విద్యార్థి అయిన పార్థదాస్కు రాజకీయాలంటే చాలా ఇష్టం. తన దగ్గరున్న ఓటర్ల డేటాబేస్తో ప్రచార తీరును మార్చేస్తాడు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తున్నాడు పార్థదాస్.
ప్రశాంత్ కిషోర్ అనుంగు శిష్యులే ఈ ఇద్దరూ. ఇద్దరికీ ఐఐటీ పట్టాలున్నాయి. డేటా అనాలసిస్ కొట్టినపిండి. వీళ్ల సర్వేలు ఎప్పుడూ లెక్క తప్పలేదని అంటారు. పార్టీలకు అతీతంగా అభ్యర్థులతో కలిసి పనిచేస్తున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 700 మంది అభ్యర్థులతో కలిసి పనిచేశారు. అందులో సచిన్ పైలట్, మిలింద్ దేవరా, హెచ్డీ దేవెగౌడ వంటి ప్రముఖులూ ఉన్నారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం వెనుక సందీప్ పాఠక్ ఉన్నాడు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు అత్యంత సన్నిహితుడు ఇతను. కాబట్టే, కేజ్రీవాల్ రాజ్యసభకు నామినేట్ చేశారు. ఆప్ కోర్ టీమ్లో కీలక సభ్యుడు కూడా. నేటి తరాన్ని తమవైపు తిప్పుకోగల వ్యూహకర్త, రాజకీయ చాణక్యుడు. పంజాబ్ ఘన విజయంతో వచ్చే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆప్ను గెలిపించాలనే పట్టుదలతో ఉన్నాడు. కాలం సహకరిస్తే మరో కిశోరమే అవుతాడు.
ఎన్నికల వ్యూహాలు.. క్షణక్షణానికి మారిపోతున్నాయి. ఒక రాష్ట్రం, ఒక పార్లమెంటరీ నియోజకవర్గం, ఒక అసెంబ్లీ పరిధి అని కాకుండా.. మైక్రో మేనేజ్మెంట్ వైపు అడుగు వేస్తున్నాయి. ఈ వ్యూహంలో ప్రతి ఇల్లూ ఒక యూనిట్. ప్రతి ఓటరూ ఒక టార్గెట్. సామాజిక మాధ్యమాలే చేపల వలలుగా పనిచేస్తున్నాయి. ఈ చేపల వేటలో మత్స్యకారుల పాత్ర.. వ్యూహకర్తలదే.