Marriage | కలిసి వేటాడటం, కలిసి కడుపునింపుకోవడం, కలిసి వాంఛలు తీర్చుకోవడం, కలిసి ఏ క్రూర మృగాలతోనో పోరాడటం, కలిసి ఓ గుహలో జీవించడం, కలిసి పంటలు పండించడం, తమ కలలపంటలకు ఆ గింజలతో గోరుముద్దలు తినిపించడం .. అవసరంలో నుంచి మొదలైన స్త్రీ పురుష బంధం యుగాలు గడిచేకొద్దీ ఉద్వేగపరంగానూ బలపడింది. ఆ అనుబంధానికి ధర్మబద్ధతను, సామాజిక గుర్తింపును ఇవ్వడానికి వివాహ వ్యవస్థను రూపొందించారు. నా కోసం నువ్వు, నీ కోసం నేను.. అంటూ మంత్రాల మధ్య మూడు ముళ్లు వేయించారు. అగ్ని సాక్షిగా ప్రమాణం చేయించారు.
ఆకాశమే ఆన అంటూ అరుంధతిని చూపించారు. కన్యాదాత చేతుల మీదుగా అప్పగింతలు చేయించారు. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు.. ఆ బంధాన్ని బలపరిచాయి. కథలుగా, ఉపకథలుగా, ఉదాహరణలుగా.. దాంపత్య గాథలను వివరించాయి. ప్రతి కథలోనూ అంతర్లీనంగా ఓ అనుబంధ సూత్రం, ప్రతి ముగింపులోనూ సుతిమెత్తని హెచ్చరిక. మాఘంలో ఒక్కటైన దంపతులకు ఈ పెండ్లి కథలు దాంపత్య పాఠాలు. ఇప్పటికే కాపురాలు చేసుకుంటున్నవారికి పునశ్చరణ తరగతులు.
బహ్మ-శతరూప
సృష్టిలో తొలి జీవి ఒంటరి. ఆయనకు తోడు కావాలనిపించింది. తొలి మహిళను సృష్టించాడు. తనను పెండ్లి చేసుకోమని అడిగాడు. ఆయన తనకు జన్మనిచ్చినవాడు కాబట్టి, వరుస కుదరదని చెప్పింది. అయినా అతను వినలేదు. ఆమెను పట్టుకోబోయాడు. ఆమె పరుగెత్తింది. పరుగెత్తుతూ పరుగెత్తుతూ ఆవు, ఆడగుర్రం, ఆడబాతు, ఆడజింక.. ఇలా వివిధ రూపాలను ధరించింది. అతనూ అంతే… ఎద్దు, మగగుర్రం, మగబాతు, మగజింక రూపాలను ధరించాడు. ఆ విధంగా భూమిమీదున్న జీవజాలం ఆవిర్భవించింది. ఎన్నో రూపాలను ధరించిన మొదటి మహిళ ‘శతరూప’గా నిలిచిపోయింది. మొదటి తండ్రేమో ప్రజాపతిగా ప్రాచుర్యంలోకి వచ్చాడు. ఆయనే తర్వాత కాలంలో.. పురాణాల ప్రకారం సృష్టికర్త బ్రహ్మ దేవుడయ్యాడు.
ఆది దంపతులు
సతీదేవి మరణానంతరం శివుడు విరాగిగా మారిపోయాడు. హిమాలయాల్లో ఏకాకి జీవితం గడుపుతున్నాడు. అయితే, శివుడి కొడుకు వల్లే తారకాసుర సంహారం జరుగుతుంది. కాబట్టి, దేవతలంతా ఆయనకు ఎలాగైనా పెండ్లి జరిపించాలని ప్రయత్నాలు సాగిస్తారు. అదే సమయంలో మేనక, హిమవంతుల పుత్రిక పార్వతి తాను శివుణ్ని తప్ప ఇంకెవరినీ చేసుకోనని తీర్మానించుకుంటుంది. తన కోరిక తీరడం కోసం తీవ్రమైన తపస్సుకు కూర్చుంటుంది. శివుణ్ని పార్వతిపట్ల ఆకర్షితుణ్ని చేయడానికి మన్మథుణ్ని నియమిస్తారు దేవతలు. ఈ ప్రయత్నంలో చిచ్చరకంటి ఆగ్రహానికి కాలి బూడిదైపోతాడు మన్మథుడు. అయితే, పార్వతి తపస్సుకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు పెండ్లికి అంగీకరిస్తాడు. అలా బూడిద పూసుకున్న దేహంతో, అట్టలు కట్టిన జటలతో, మెడలో పాములతో.. నందిని అధిరోహించి శివుడు అత్తగారింటికి వెళ్తాడు. ఆయన వెంట భూత, ప్రేత, పిశాచ గణాలు బయలుదేరతాయి. ఇలాంటివాణ్ని తమ అల్లుడిగా చేసుకోవడానికి మేనక అంగీకరించదు. దాంతో దేవతలు శివుణ్ని అందంగా అలంకరిస్తారు. దాంతో ఆదియోగి శివయ్య గృహస్థుగా మారిపోతాడు. వారికి కలిగిన సంతానమే కుమారస్వామి. ఈ కథ నేపథ్యంగా కాళిదాసు ‘కుమార సంభవం’ అనే కావ్యాన్ని రచించాడు.
క్షీరసాగర మథనం
అమృతం కోసం దేవదానవులు పాలసముద్రాన్ని చిలకడానికి నడుంబిగించారు. మందర పర్వతాన్ని కవ్వంగా, సర్పరాజు వాసుకిని తాడుగా చేసుకున్నారు. పర్వతం కుదురుగా ఉండటానికి శ్రీమహావిష్ణువు కూర్మం అవతారాన్ని ధరించాడు. అలా చిలకగా చిలకగా పాల సముద్రం నుంచి అత్యంత విలువైన వస్తువులు వెలికి వచ్చాయి. గుర్రాలు, ఏనుగులు, విల్లులు, శంఖాలతో రాజ్యాధికారం స్థాపితమైంది. చెట్లు, ఆవులు, రత్నాలతో ఆర్థిక శక్తి వర్ధిల్లింది. గంధర్వులు, విద్యాధరులు, కిన్నరులు, అప్సరలతో వినోదం, ఉల్లాసం వెల్లివిరిశాయి. లోకాలను అంతం చేసే కాలకూట విషాన్ని శివుడు గళంలో ధరించాడు. అందులోంచే వచ్చిన సంపదల తల్లి లక్ష్మీదేవి క్షీర సాగర మథనంలో కుదురుగా నిలిచి, లోకోపకారం చేసిన విష్ణువును తన వాడిని చేసుకుంది. అందుకే ఏదైనా శుభకార్యంలో సంకల్పం చెప్పేటప్పుడు ‘ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః, ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః…’ అంటూ పూజ మొదలుపెడతారు. భారతీయ సంస్కృతిలో దాంపత్య జీవితానికి ఉన్న ప్రాధాన్యాన్ని నొక్కి చెబుతారు.
సత్యకామ-జాబాలి
ఉపనిషత్తుల్లోని కథ ఇది. ఓసారి ఓ బాలుడు గౌతమ మహర్షి దగ్గరికి విద్య నేర్పమని వెళ్తాడు. ఆ బాలుడిని నీ తండ్రి ఎవరని అడుగుతాడు గౌతముడు. తన తల్లి ఎప్పుడూ తండ్రి పేరు చెప్పలేదని, తన తల్లి దగ్గరికి వచ్చిన పురుషులు కూడా ఆమెకు తమ పేర్లను చెప్పలేదంటాడు. తన తల్లి జాబాల పేరుమీద తనను జాబాలి అంటారని నిర్భయంగా చెబుతాడు. అతని నిజాయతీకి ఆశ్చర్యపడతాడు గౌతముడు. అలా సత్యాన్ని మాట్లాడటానికి భయపడని, సత్యాన్ని అన్వేషిస్తూ తన దగ్గరికి వచ్చిన ఆ బాలుడికి ‘సత్యకాముడు’ అనే పేరుపెట్టాడు గౌతమ మహర్షి. వివాహ నియమాలు రూపొందడానికి ముందు పిల్లల్ని తల్లుల పేర్లతో పిలిచేవారని ఈ కథ వెల్లడిస్తుంది. అంతేకాదు, ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించిన వ్యక్తులు వారసత్వాన్ని పట్టించుకోరన్న సందేశాన్నీ ఇస్తుంది. తెలుగు వారి తొలి రాజులు శాతవాహనుల్లో గౌతమీపుత్ర, వాశిష్ఠీపుత్ర పేర్లు మాతృనామాల ప్రాధాన్యానికి చారిత్రక సాక్ష్యాలుగా నిలుస్తాయి.
శ్వేతకేతు స్మృతి
మహాభారతంలోని కథ ఇది. ఉద్దాలక మహర్షి కొడుకైన శ్వేతకేతు ఓసారి తన తల్లిని పర పురుషుడితో చూస్తాడు. తర్వాత ఒక స్త్రీ తన ఇష్టం వచ్చినట్లు బతకడానికి స్వేచ్ఛ ఉందా? అలా అయితే ‘నా తండ్రి ఎవరు? నేను నీ కొడుకునేనా?’ అని తండ్రిని ప్రశ్నిస్తాడు శ్వేతకేతు. ‘పితృత్వం భావోద్వేగ సంబంధం. జైవికమైంది కాదు’ బదులిస్తాడు ఉద్దాలకుడు. ఈ సమాధానం శ్వేతకేతుకు రుచించలేదు. దాంతో అతను మహిళ భర్తకు విధేయంగా ఉండేలా వివాహ ధర్మాలను సంకలనం చేశాడు. నేటి దాంపత్య వ్యవస్థకు ఈ సూత్రాలే మూలమని అంటారు.
మీనాక్షీ.. సుందరేశ్వరుల పెండ్లి
రావణుడి నుంచి సీతకు విముక్తి కల్పించడానికి రాముడు లంకకు వెళ్లిన కథ రామాయణంగా అందరికీ పరిచయమే. అయితే దక్షిణాదికి చెందిన ఒక రాకుమారి మాత్రం తనకు తగిన వరుణ్ని వెతుకుతూ ఉత్తర భారతదేశానికి సుదూర ప్రయాణం చేసింది. తమిళనాడులోని మధుర ప్రాంతపు యువరాణి మీనాక్షి కథ ఇది. ఆమెకు పౌరుషం ఎక్కువ. తండ్రి అనంతరం ఆమే రాజ్య బాధ్యతలు స్వీకరించింది. ప్రపంచాన్ని జయించడానికి దండయాత్రకు బయలుదేరింది. అలా భరతవర్షంలోని రాజులందరినీ ఓడించింది. చివరికి కైలాస పర్వతానికి చేరుకుంది. అయితే అక్కడున్న ఓ యోగి మాత్రం ఆమెకు లొంగిపోలేదు. ఆమెకే కాదు ఆయన ఎవరికీ లొంగడు. దాంతో ఆ యోగిని తనతో ద్వంద్వ యుద్ధానికి సిద్ధం కావాలని సవాలు విసిరింది మీనాక్షి. యోగిని బాగా దగ్గరినుంచి చూసిన ఆమె అతనితో ప్రేమలో పడిపోయింది. అలా తన ఓటమిని అంగీకరించిన మీనాక్షి ఆ యోగిని తన రాజధాని మధురైకి ఆహ్వానించింది. తనను పెండ్లి చేసుకోమని కోరింది. ఆమె కోరికను ఒప్పుకొన్న యోగి ఎవరో కాదు సాక్షాత్తూ శివుడే. మధుర మీనాక్షిని పెండ్లాడిన శివుడు సుందరేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు. పెండ్లితో మీనాక్షిలో పౌరుషం తగ్గి స్త్రీ సహజమైన సౌకుమార్యం అంకురించింది. యోగి అయిన శివుడేమో గృహస్థుగా మారిపోయాడు. అంటే పెండ్లి స్త్రీ, పురుషులు ఇద్దరినీ వారివారి బాధ్యతల దిశగా పరివర్తన చెందిస్తుందన్న మాట! మధురైలో మాత్రం అమ్మవారిదే ఆధిపత్యం.
కుండలకేశి కథ
వియ్యానికైనా, కయ్యానికైనా సమవుజ్జీలు ఉండాలంటారు. అందుకే , పెండ్లి నిశ్చయించుకునే ముందు అటు ఏడు, ఇటు ఏడు తరాలు చూస్తారు.
వధూవరులు ఇద్దరూ దాదాపుగా ఒకేరకమైన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక వాతావరణంలో పెరిగినవారైతే.. ఇబ్బందులు తలెత్తవన్న నమ్మకం. ఇదో సహజీవన కొలమానం! ఆ లెక్క తప్పితే కలహాల కాపురమే అవుతుంది. ఆ తీవ్ర పరిణామాలను కళ్లకు కట్టేదే కుండలకేశి కథ. ఓ ధనిక వ్యాపారి కూతురు కుండలకేశి. ఒక నేరస్తుణ్ని ఉరిశిక్ష వేయడానికి తీసుకువెళ్తుంటే చూస్తుంది. అతనితో ప్రేమలో పడుతుంది. అతణ్ని తప్ప వేరెవ్వరినీ పెండ్లి చేసుకోనని మొండికేస్తుంది. చివరికి తన మాటే నెగ్గించుకుంటుంది. అయితే కొన్నేండ్లు గడిచిన తర్వాత కుండలకేశి దాంపత్య జీవితంలో ప్రేమ తగ్గిపోయింది. కలహాలు మొదలయ్యాయి. తగవులు నిత్యకృత్యంగా మారిపోతాయి. భర్త నేరమయ జీవితాన్ని కుండలకేశి ఎత్తిపొడుస్తుంది. ఆవేశంతో ఆమెను చంపబోయాడు భర్త. కానీ విధివశాత్తూ అతనే ఆమె చేతిలో మరణిస్తాడు. దాంతో కుండలకేశి సన్యాసినిగా మారుతుంది. కోరికలే దుఃఖానికి మూలం అన్న బుద్ధుడి బోధనల్లో సాంత్వన పొందుతుంది.
ఏకలింగ వివాహాలు
సోమవంతుడు, సుమేధుడు ఇద్దరూ స్నేహితులు. సీమంతిని అనే రాణి పెళ్లయిన జంటలకు ఆవులను ఇస్తున్నదని తెలుస్తుంది. దాంతో సోమవంతుడు భార్యగా, సుమేధుడు భర్తగా రాణి దగ్గర పరిచయం చేసుకుంటారు. ఆవులు ఇస్తూ సీమంతిని ఆ ఇద్దరినీ భార్యభర్తలుగా వర్ధిల్లమని ఆశీర్వదిస్తుంది. ఆమె వాక్శుద్ధి కారణంగా సోమవంతుడు నిజంగానే స్త్రీలా (సోమవతి) మారిపోతాడు. అలా ఒకప్పుడు మిత్రులుగా ఉన్న యువకులు భార్యాభర్తలుగా మారిపోయారు.
రురువు-ప్రియంవద
సావిత్రీ, సత్యవంతుల కథ తెలిసిందే. యముణ్ని అడ్డుకొని పతి ప్రాణాలు దక్కించుకున్న స్త్రీ సతీ సావిత్రి. సాధారణంగా ఇలాంటి విషయంలో మహిళల కథలే ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయి. అయితే, పురుషులు కూడా భార్యల ప్రాణాల కోసం యముణ్ని ప్రార్థించిన ఘట్టాలు అనేకం ఉన్నాయి. అలాంటిదే మహాభారతంలోని రురు, ప్రియంవద కథ. రురు అనే రాజు భార్య పేరు ప్రియంవద. ఆమె అతి సౌందర్యవతి. ప్రియంవద చిన్న వయసులోనే మరణిస్తుంది. తన భార్యను బతికించమని మృత్యుదేవుడైన యముణ్ని ప్రార్థిస్తాడు రురువు. ప్రియంవదకు తన జీవితంలో సగం కాలాన్ని ఇవ్వగలిగితే ఆమెను బతికిస్తానంటాడు యముడు. రురువు ఒప్పుకోవడంతో ప్రియంవద మళ్లీ బతుకుతుంది. అలా తాము మరణించేవరకు రురువు, ప్రియంవద జీవితం హాయిగా సాగించారు.
తార-మండోదరి
ఈశ్వర చంద్ర విద్యాసాగర్ కృషి వల్ల 1856లో వితంతు పునర్వివాహాల చట్టం వచ్చింది. రూపకల్పన సమయానికి భారత గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ. ఒకప్పుడు భారతదేశంలో పునర్వివాహాలు ఉన్నాయని నిరూపించడానికి విద్యాసాగర్ చాలా ఆధారాలే చూపించాల్సి వచ్చింది. తెలుగు వాళ్లకు సంబంధించి ఈ విషయంలో కందుకూరి వీరేశలింగం పంతులు ఆదర్శంగా నిలిచిపోయారు. అయితే పునర్వివాహాలకు సంబంధించిన కథలు రామాయణంలోనే కనిపిస్తాయి.
రుక్షుడనే వానర రాజు కొడుకులు వాలి, సుగ్రీవుడు. తన తర్వాత కిష్కింధను సోదరులు ఇద్దరినీ పంచుకుని పరిపాలించమని సలహా ఇస్తాడు రుక్షుడు. అయితే కాలక్రమంలో పొరపొచ్చం రావడంతో వాలి తన సోదరుడు సుగ్రీవుణ్ని తరిమివేస్తాడు. అంతటితో ఆగకుండా సుగ్రీవుడి భార్య రుమను కూడా తనదిగా చేసుకుంటాడు. చివరికి రాముడి సాయంతో వాలి అడ్డు తొలగించుకుంటాడు సుగ్రీవుడు. కిష్కింధకు రాజైన సుగ్రీవుడు అన్న భార్య తారను కూడా పెండ్లి చేసుకుంటాడు. ఇక రావణుడు చనిపోయిన తర్వాత అతని తమ్ముడు విభీషణుడిని లంకకు రాజుగా పట్టం కడతారు. అన్న భార్య మండోదరిని పెండ్లి చేసుకుని రాజ్యంపై తన అధికారాన్ని ప్రకటించుకుంటాడు విభీషణుడు. రామాయణంలో ఈ రెండు ఘట్టాల్లో మారు మనువుల ప్రస్తావన ఉంది. అయితే వానరులు, రాక్షసులలో జరిగాయి కాబట్టి వీటిని ఉన్నతంగా చూడలేదని అంటారు. ఆంత్రోపాలజీ (మానవశాస్త్రం) ప్రకారం ఈ రకమైన వివాహాలను ‘దేవర న్యాయం’ అని పిలుస్తారు. అంటే భర్త మరణించిన స్త్రీలు మరిదిని చేసుకోవడం.
అగస్త్యుడు లోపాముద్ర
తగినంత సంపాదన లేకపోతే తమ అమ్మాయిని ఇచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రారు. ఒకవేళ ఏ తల్లిదండ్రులైనా ముందుకు వచ్చినా అమ్మాయి ఒప్పుకోదు. సంపాదన తర్వాతే సంసారం అని మొండికేస్తారు. అలా తన భర్తను తగినంత ఆదాయం తీసుకు రావాలని షరతు విధించిన కథ ఒకటి రుగ్వేదంలోనే ఉంది. అగస్త్య మహర్షి తన పితరుల రుణం తీర్చుకోవాలని అనుకున్నాడు. విదర్భ రాజు దగ్గరికి వెళ్లి తనకు తోడుగా ఉండటానికి స్త్రీ కావాలని అడిగాడు. దానికి సమ్మతించిన రాజు లోపాముద్రను ఇచ్చి వివాహం చేశాడు. అయితే ఆమె అగస్త్యుడికి ఓ షరతు విధించింది. కుటుంబ పోషణకు తగినంత ఆదాయాన్ని సమకూర్చమని కోరింది. సరేనన్న అగస్త్యుడు మొదట రాక్షస రాజు ఆతాపి దగ్గరికి వెళ్లాడు. అతను అగస్త్యుడికి బంగారం ఇస్తానని అన్నాడు. అయితే ముందు తాను పెట్టే భోజనం చేయాలని అడిగాడు. దాంతో తన తమ్ముడి వాతాపిని మేకగా మార్చాడు ఆతాపి. వాతాపి మాంసంతో అగస్త్యుడికి వడ్డన చేశాడు. ఆ తర్వాత ఆతాపి తమ్ముణ్ని తన కడుపులోంచి బయటికి రమ్మంటాడని అగస్త్యుడు గ్రహించాడు. ఆ మాట రాకముందే “జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం” అన్నాడు. అంతే మహర్షికి తాను హామీ ఇచ్చిన బంగారు నాణేలు ఇచ్చి పంపించాడు ఆతాపి. మరో సందర్భంలో దేవతలకు కూడా సాయం చేస్తాడు. దాంతో వారు కూడా బంగారం ఇస్తారు. దీంతో లోపాముద్ర కోరినట్లుగా జీవనం సాగిస్తాడు అగస్త్యుడు.
అపాల పెండ్లికూతురాయెనే..
ఇది రుగ్వేదంలోని కథ. అపాలకు చర్మరోగం ఉండటంతో ఆమెకు పెండ్లి కొడుకు దొరకడు. దాంతో విసిగివేసారి హిమాలయాలకు వెళ్తుంది. అక్కడ ఆమెకు సోమలత దొరుకుతుంది. తినబోతుంటే దానినుంచి వచ్చే అమృతాన్ని తనకు ఇమ్మని అడుగుతాడు ఇంద్రుడు. అపాల ఇవ్వడంతో ఏదైనా వరం కోరుకోమని అంటాడు. తనను అందగత్తెగా మార్చమని అడుగుతుంది. ఇంద్రుడు ఆమెను తన రథచక్రం ఇరుసునుంచి బయటికి తీస్తాడు. దాంతో ఆమె పాత చర్మం పోయి, నిగారింపుతో కూడిన కొత్త చర్మం వస్తుంది. అలా అపాల తనకు తగిన వరుణ్ని వెతుక్కోగలుగుతుంది. రుగ్వేద కాలం నాటికే అందానికి ప్రాధాన్యం ఉన్న విషయాన్ని అపాల కథ వెల్లడిస్తుంది.
తీజా- బీజా పెండ్లి మజా
పిల్లలు కడుపున పడింది మొదలు దగ్గరి బంధువుల పిల్లలకు ఇస్తామని అనుకునేవాళ్లు ఇప్పటికీ తారసపడతారు. కడుపులో ఉన్నప్పుడే పిల్లలకు పెండ్లిల్లు నిశ్చయం చేసుకునే వాళ్లూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో ఇద్దరు పిల్లలూ ఆడో మగో అయితే ఇబ్బంది తలెత్తుతుంది. అలాంటి సరదా కథే ఈ తీజా- బీజా వివాహం. ఇది రాజస్థాన్ జానపదుల్లో ప్రాచుర్యంలో ఉన్న కథ.
వేర్వేరు ఊళ్లలో ఉండే ఇద్దరు స్నేహితుల భార్యలు గర్భంతో ఉంటారు. రెండు జంటలూ ఓ వేడుకలో కలుసుకుంటారు. తమకు పుట్టబోయే సంతానానికి పెండ్లి చేయాలని అనుకుంటారు. జ్యోతిష్కులూ దానిని సమర్థిస్తారు. అయితే ఇద్దరికీ ఆడ శిశువులే జన్మిస్తారు. ఊళ్లు దూరం కావడంతో ఒకరికి ఆడపిల్ల కాబట్టి మరోజంటకు మగ పిల్లవాడు పుట్టి ఉంటాడని అనుకుంటారు. అలా ఇద్దరు బాలికలు తీజా- బీజా ఒకరికొకరు తమ భర్త కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఓరోజు బీజా బావిలో పడుతుంది. అందులో పడితే ఆడవాళ్లు మగవాళ్లు అవుతారు. బీజా తండ్రి స్నేహితుడికి తన కూతురు అబ్బాయిగా మారిందని వర్తమానం పంపిస్తాడు. అయితే తనకు అసలు కొడుకులే లేరని, ఉన్నది కూతురే అని తీజా తండ్రి బదులిస్తాడు. ఇన్నిరోజులు అల్లుడి కోసమే ఎదురు చూస్తున్నానని, బీజాను వెంటనే పంపించమని కబురు పెడతాడు తీజా తండ్రి. చివరికి తీజా- బీజా ఒక్కటవుతారు.
శశిరేఖ-అభిమన్యుడు
ఉత్తర భారతదేశంలో మేనరికం పెండ్లిల్లు తక్కువ. ఈ సంప్రదాయం దక్షిణ భారతదేశంలో ప్రాచుర్యంలో ఉంది. పాండవుల అరణ్యవాసం సమయంలో వారి పిల్లలు ద్వారకలో ఆశ్రయం పొందారు. వారిలో సుభద్ర, అర్జునుడి సంతానం అభిమన్యుడు కూడా ఉన్నాడు. మేనమామల ఇంట్లో అభిమన్యుడు పెద్దమామ బలరాముడి కూతురు శశిరేఖతో ప్రేమలో పడతాడు. బలరాముడు మాత్రం తన కూతురిని దుర్యోధనుడి కొడుకు లక్ష్మణ కుమారుడికి ఇద్దామని అనుకుంటాడు. అయితే అన్న నిర్ణయాన్ని కాదనలేని కృష్ణుడు ఓ మాయోపాయం తలపెడతాడు. ఘటోత్కచుణ్ని కామరూప విద్యతో శశిరేఖగా మారిపోమని అడుగుతాడు. అలా మాయా శశిరేఖతో లక్ష్మణ కుమారుడు, అసలు శశిరేఖతో అభిమన్యుడి వివాహాలూ జరిగిపోతాయి. జరిగింది తెలిసేటప్పటికే సమయం మించిపోతుంది.
రుక్మిణీ కల్యాణం
మేనమామ కంసుణ్ని చంపిన అనంతరం మగధ రాజు జరాసంధుడు మథురపైకి దండెత్తుతాడు. దాంతో కృష్ణుడు అక్కడినుంచి పారిపోయి పశ్చిమ సముద్ర తీరంలో ఉన్న ద్వారకకు వస్తాడు. ఇలా ఉంటే విదర్భ రాకుమారి రుక్మిణిని చేది పాలకుడు శిశుపాలుడికి ఇచ్చి పెండ్లి చేయాలని అనుకుంటారు. రుక్మిణికి మాత్రం మనసంతా కృష్ణుడిపైనే. తన కోరికను వెల్లడించాలని ఓ పురోహితుణ్ని కృష్ణుడి దగ్గరికి రాయబారం కూడా పంపిస్తుంది. దీనికి సంబంధించి ఆ పురోహితుడు కృష్ణుడిని కలుసుకున్నాడో లేదో అని అనుమానపడే… ‘ఘనుడా భూసురుడేగెనో…’ అన్న పోతన భాగవతం పద్యం ప్రసిద్ధిచెందింది. చివరికి శిశుపాలుడితో పెండ్లి జరిగే సమయానికి రుక్మిణిని కృష్ణుడు అపహరించుకుపోతాడు. రుక్మిణి సోదరుడు రుక్మి వారిని వెంబడిస్తాడు. కృష్ణుడు అతణ్ని యుద్ధంలో ఓడిస్తాడు. రుక్మిణిని ద్వారకకు తీసుకువెళ్తాడు. పెండ్లి వయసుకు వచ్చిన కన్యలకు పెద్దలు భాగవతంలోని రుక్మిణీ కల్యాణం చదవమని సలహా ఇస్తారు. అలా చేస్తే పెండ్లి తొందరగా అవుతుందని నమ్మకం. అయితే ధర్మశాస్త్రాలు శ్రేష్ఠమైనవిగా చెప్పిన పద్ధతిలో రుక్మిణీకృష్ణుల వివాహం జరగకపోవడం గమనార్హం. ఇది జరిగిన పద్ధతి ధర్మశాస్ర్తాల్లోని రాక్షస (పెండ్లిపిల్లను ఎత్తుకెళ్లడం), గాంధర్వ (అమ్మాయి, అబ్బాయి పరస్పర ఇష్టంతో జరిగేది) వివాహాల కోవలోకి వస్తుంది.
శతమానం భవతి
హైందవ ధర్మశాస్త్రాల ప్రకారం ప్రతి మనిషీ నాలుగు ఆశ్రమాలను అనుభవించాలి. అవి బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. వీటిలో మనిషి మనుగడకు కీలకమైనది గృహస్థాశ్రమం. అంటే స్త్రీ, పురుషులు ఒకరికొకరు తోడుగా ఉండటానికి శాస్త్రాన్ని అనుసరించి ఒక్కటవడం. ఈ క్రమంలో పెండ్లిచూపులు, నిశ్చితార్థం, ఎదుర్కోళ్లు, పెండ్లి, మంగళసూత్రం, సప్తపది, అరుంధతీ దర్శనం, అప్పగింతలు, పెండ్లికూతురు, పెండ్లికొడుకు ఊరేగింపులు, తోడు పెండ్లికూతురు, తోడు పెండ్లికొడుకు, నాగవెల్లి, ఇల్లునింపులు ఇలా ఎన్నెన్నో ఆచారాలు వివాహ క్రతువులో వచ్చిచేరాయి. భారతదేశంలో వివాహ ఆచారాల్లో ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. కానీ విశ్వాసాల్లో మాత్రం అందరి నమ్మకం ఒక్కటే. దంపతులు నూరేళ్లు పండంటి కాపురం చేయడమే.
…హర్షవర్ధన్ చింతలపల్లి
Follow us on Google News, Facebook, Twitter , Instagram, Youtube
Read More :
Married life tips | కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
ఈ ఐదు రకాల వ్యక్తులను అస్సలు పెండ్లి చేసుకోవద్దు..!
దంపతుల మధ్య చిచ్చు రేపుతున్న ఆశలు.. ఆందోళనలో పెద్దలు
“కొత్తగా పెళ్లయిన జంటను ఆషాఢంలో ఎందుకు ఒక్కచోట ఉండనీయరు?
30 ఏండ్లు దాటాక పెళ్లి చేసుకుంటే సమస్యలొస్తాయా?