Ramayanam | రామాయణం అంటే, రాముడు నడిచిన దారి. అయోధ్య నుంచి లంకానగరం వరకూ సాగిన ప్రయాణమే శ్రీమద్రామాయణ మహాకావ్యం. ఆ విలువల యాత్రలో రాముడికి ఎంతోమంది తారసపడ్డారు. నావలో ఒడ్డు దాటించినవారు, ఎంగిలిపండ్లతో ఆతిథ్యమిచ్చి పుణ్యఫలాలు పొందినవారు, ఎదిరించి నేలకూలినవారు, ఆదరించి అస్ర్తాలను ప్రసాదించినవారు, మోహించి ముక్కుచెవులు కోయించుకున్నవారు, ప్రపత్తితో పరమదాసులైనవారు, పాదస్పర్శతో జడత్వాన్ని వీడినవారు, మోహపీడితులై రామబాణానికి గురైనవారు.. కథా గమనంలో భాగంగానూ వాల్మీకి మహర్షి ఎన్నో పాత్రలను పరిచయం చేస్తారు. ఎన్నో సంఘటలను ఉదహరిస్తారు. ఊహించని మలుపులు తిప్పుతారు. కొన్ని ఘట్టాల్ల్లో అధర్మం ఆర్భాటం చేస్తుంది. అక్కడక్కడా అసత్యం అహంకరిస్తుంది. అప్పుడప్పుడూ విలువల పతనం పతాక స్థాయికి చేరుతుంది. అంతిమంగా మాత్రం.. ధర్మం గెలుస్తుంది. న్యాయం నిలుస్తుంది. ఇదే రామకథాసారం, రామాయణ అంతస్సూత్రం. మనో వాల్మీకం. ఆదికావ్యమనే సరోవరంలో మనం క్షీరనీర న్యాయం తెలిసిన రాయంచలమై విహరిద్దాం. ఆయా పాత్రలలోని మంచిని క్షీరంలా స్వీకరిద్దాం. చెడును నీరంలా విసర్జిద్దాం!
ఏ కథను వింటే హృదయం ఆనందంతో నిండిపోతుందో.. ఏ కావ్యాన్ని కంటే సత్య స్వరూపం ఆవిష్కృతమవుతుందో.. ఏ ఇతిహాసాన్ని మళ్లీ మళ్లీ మననం చేసుకుంటే ధర్మం కరతలామలకం అవుతుందో.. అలాంటి అద్భుతమైన కథకు, అలాంటి అజరామరమైన కావ్యానికి, మహోన్నతమైన ఇతిహాసానికి రూపకర్త.. వాల్మీకి మహర్షి. రామాయణ మహాకావ్యాన్ని లోకానికి అందించిన మహనీయుడు. వాల్మీకిని సంస్కృత భాషకు ఆదికవిగా గుర్తిస్తారు. వాల్మీకంలో ఇరవైనాలుగు వేల శ్లోకాలు ఏడు కాండాలుగా ఉన్నాయి. నాలుగు లక్షల ఎనభై వేల పదాలు ఉన్నాయి. ఇది మహాభారత కావ్యంలో దాదాపు పావువంతు. ప్రసిద్ధ ఆంగ్ల రచన ‘ఇలియడ్’ కంటే నాలుగు రెట్లు పెద్దది. రామాయణంలోని విషయాలు కనీసం లక్ష సంవత్సరాల ప్రాచీనమైనవని ధార్మికులు విశ్వసిస్తారు. తాను శ్రీరాముడి సమకాలీనుడినని పేర్కొన్నాడు వాల్మీకి. రామచంద్రుడు వాల్మీకిని అరణ్యవాసంలో కలిసినట్టు, సీతను వనవాసానికి పంపినప్పుడు, ఆమె మహర్షి ఆశ్రమంలోనే ఉన్నట్టు తెలుస్తున్నది. ఆ ఆశ్రమంలోనే సీతమ్మ.. లవ-కుశులకు జన్మనిచ్చినట్టు, వీరిద్దరి విద్యాభ్యాసం వాల్మీకి శిష్యరికంలోనే జరిగినట్టు రామాయణం ద్వారా తెలుస్తున్నది. ‘పరివర్తనతో మనిషి మహర్షిలా మారగలడు’ అనడానికి నిదర్శనం వాల్మీకి జీవితం.
వశిష్ఠ మహర్షి: దశరథుడి పురోహితుడు. ఇక్షాకుల కులగురువు. తన చేతుల మీదుగానే పుత్రకామేష్టి నిర్వహించాడు. విశ్వామిత్రుని యాగ సంరక్షణకు రామలక్ష్మణులను పంపేలా దశరథుడిని ఒప్పించాడు.
విశ్వామిత్ర మహర్షి: రామలక్ష్మణుల గురువు. రాముడికి బల, అతిబల అస్ర్తాలను ప్రసాదించాడు. తాటకి, మారీచ, సుబాహు వంటి రాక్షసుల సంహారానికి మార్గనిర్దేశం చేశాడు. సీతా స్వయంవరానికి తీసుకెళ్లాడు. అహల్యకు శాప విమోచనం కలిగించాడు.
విష్ణుమూర్తి దశావతారాలలో రాముడు ఏడవ అవతారం. లంకాధిపతి రావణుడి బారినుంచి కాపాడటానికి ఎవరో వస్తారని జనం ఎదురు చూస్తున్నారు. దేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసుల వల్ల మరణం లేకుండా బ్రహ్మ ఇచ్చిన వరంతో రావణుడు విర్రవీగేవాడు. దాంతో దేవతలు, మునులు విష్ణుమూర్తి చెంతకు వెళ్లి రావణాసురుని బారినుంచి ప్రపంచాన్ని రక్షించమని ప్రార్థించారు. మానవ రూపంలో జన్మించాలనీ, పిల్లల కోసం తపిస్తున్న దశరథుడి ముగ్గురు రాణుల గర్భంలో నాలుగు వేర్వేరు రూపాల్లో అవతరించాలని వేడుకున్నారు. అందుకే కౌసల్యకు రాముడిగా, కైకేయికి భరతుడిగా, సుమిత్రకు లక్ష్మణ, శత్రుఘ్నలుగా విష్ణుమూర్తి మానవ రూపంలో అవతరించాడు. అంటే.. దైవం మానుష రూపంలో జన్మించాడు.
రామాయణ మహాకావ్యంలోని ఏడు కాండాలలో రాముని జననం నుంచి.. సరయూ నదిలో రాముడు, అతని సోదరుల అవతార పరిసమాప్తి వరకూ రాముని పాత్ర ప్రయాణం ఉంటుంది. అరణ్యవాసంలో ఉన్న సీతను రావణుడు తీసుకుపోవడంతో, ఆమెను వెతుక్కుంటూ వెళ్తూ సామాన్యుడిలా అన్ని బాధల్నీ అనుభవించాడు. అంటే.. మనిషిగానే పుట్టాడు, మనిషిగానే కష్ట సుఖాలు అనుభవించాడు. ఒక అన్నగా.. తమ్ముళ్లపై అపారమైన ప్రేమను కురిపించాడు రాముడు. తల్లులు వేరైనా.. ఏనాడూ తమ్ముళ్లతో చిన్నగొడవా పడలేదు. శ్రీరాముణ్ని చూసి నేర్చుకోవాల్సిన లక్షణం.. స్థితప్రజ్ఞత. సంతోషానికి పొంగిపోకుండా, బాధకు కుంగిపోకుండా స్థిరంగా ఉన్నాడు. సాయం చిన్నదో.. పెద్దదో, చేసిన ఉపకారానికి కృతజ్ఞతా భావంతో జటాయువు పక్షికి అంత్యక్రియలు నిర్వహిస్తాడు. శత్రువు సోదరుడైన విభీషణుడు శరణు కోరివస్తే.. ఆశ్రయం కల్పిస్తాడు. శరణు ప్రసాదిస్తాడు. బద్ధ శత్రువులైనా.. సాయం అడిగితే కాదనకూడదని ఈ సందర్భంలో ప్రకటితమవుతుంది. కాబట్టే వాల్మీకి మహర్షి శ్రీరాముడిని.. రామో లోకాభిరామః ప్రియంవదః, నిత్యం ప్రశాంతాత్మా, సానుక్రోశః అని కొనియాడాడు.
ఆదిశేషుడి అవతారం లక్ష్మణుడు. మరో పేరు సౌమిత్రి (సుమిత్ర కొడుకు). దశరథుడి ఇంట్లో కౌసల్యకు రాముడు, సుమిత్రకు లక్ష్మణుడు జన్మించారు. బాల్యం నుంచీ రామ
లక్ష్మణులు ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు. రాక్షస సంహారం కోసం విశ్వామిత్రుని వెంట వెళ్లినా, సీతా స్వయంవరంలో శివధనుస్సును చేపట్టినా.. రామన్న వెన్నంటే ఉన్నాడు లక్ష్మణుడు. స్వయంవరంలో రామునికి సీతమ్మ చేతిని అందిస్తే, లక్ష్మణుడికి ఆమె చెల్లెలు ఊర్మిళను ఇచ్చి వివాహం చేశారు. అలా రామునికి లక్ష్మణుడు తమ్ముడే కాదు.. తోడల్లుడు కూడా! లక్ష్మణుడు.. రామునితో జననం, రాముడితో పాటే అరణ్యవాసం. రావణ సంహారం, వనవాసం ముగిసి రామరాజ్యం మొదలైన తరువాత కూడా, లక్ష్మణుడు రాముని సేవకుడిగానే ఉండిపోయాడు. నిరంతరం తన వెన్నంటి నిలిచి, తన ఆజ్ఞలను పాటించిన లక్ష్మణుడి రుణం ఎలాగైనా తీర్చుకోవాలని అనుకున్నాడట రాముడు. అందుకే కృష్ణావతారంలో, లక్ష్మణుడు బలరాముడిగా జన్మించాడు. లక్ష్మణుడు సోదర ప్రేమకు నిలువెత్తు నిదర్శనం, సద్గుణ సంపన్నుడు, ధైర్యశాలి.
భారతీయులకు హనుమంతుడు ఆరాధనీయుడు. ‘అ’ కార, ‘ఉ’ కార, ‘మ’ కారాల కలయికే.. ‘హనుమ’ అనీ, హనుమనామం ప్రణవ స్వరూపమనీ పేర్కొంటారు. హనుమంతుడు సప్త చిరంజీవులలో ఒకడు, శివాంశ సంభూతుడు. ఒకరోజు సీతాదేవి సింధూరం పెట్టుకోవడం చూసిన హనుమంతుడు.. ‘దాని ఉపయోగం ఏమిటి?’ అని సీతాదేవిని అడుగుతాడు. అప్పుడు సీతమ్మ.. ‘శ్రీరాముడి దీర్ఘాయుష్షు కోసం ఇలా చేస్తున్నాను’ అని జవాబు ఇచ్చింది. ఆ క్షణంలో రామదూత.. ‘చిటికెడు సింధూరమే ఇంతచేస్తే.. ఒళ్లంతా సింధూరం పెట్టుకొంటే.. రామ ప్రభువు ఆయుష్షు ఇంకా బాగుంటుంది’ అని భావించి, తన ఒళ్లంతా సింధూరాన్ని రాసుకొని, రాముడి ఆయుష్షు కోసం ప్రార్థిస్తాడు. రాముడిపైన ఉన్న భక్తిని చూసి సీతాదేవి ఒక ముత్యాలహారాన్ని హనుమంతుడికి కానుకగా ఇవ్వగా.. ‘శ్రీరాముడు లేనిది ఏదీ నాకు వద్దు’ అని తిరస్కరిస్తాడు. ‘మరి నీ శరీరంలో శ్రీరాముడు ఉన్నాడా?’ అని ప్రశ్నించగా.. హనుమ తన హృదయాన్ని చీల్చి, అందులో సీతారాములను చూపిస్తాడు. తన భక్తిని చాటుకుంటాడు.
రామాయణంలో ‘కిష్కింధకాండ’లో హనుమంతుడి పాత్ర ప్రవేశిస్తుంది. శ్రీరాముడి అవతార సమాప్తి వరకూ రాముడి సేవకుడిగానే హనుమంతుడు మనకు కనిపిస్తాడు. ‘నీవు
ఎవరివి?’ అని ఎవరైనా అడిగితే, హనుమంతుడు తన గురించి తాను చెప్పుకొనే మొదటి మాట.. ‘నేను కోసలేంద్రుడిదాసుడిని’ అనే. ఇది హనుమంతుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన వినయగుణం. హనుమంతుడు బలానికి ప్రతీక. అష్టసిద్ధులనూ కలిగి ఉంటాడు. అయినప్పటికీ నిజాయతీ, వినయం, విధేయతల్లో ఎలాంటి మార్పూ లేకుండా అత్యంత సాధారణంగా కనిపిస్తాడు. రాముడి సేవకుడిననే ప్రకటించుకుంటాడు. శ్రీరామునికి, సుగ్రీవునికి మధ్య సంధి కుదర్చడంలో హనుమంతుడు ప్రత్యేక పాత్ర పోషించాడు. హనుమంతుడి చక్కటి మాటతీరు అందుకు ఉపకరించింది. అలాగే అశోకవనంలో సీతమ్మతో జాగ్రత్తగా మాట్లాడాడు. ఇలాంటి మాటతీరును ఈ రోజుల్లో మనం అలవర్చుకుంటే.. మానవ సంబంధాలు మరింత మెరుగవుతాయి.
రామాయణంలో శ్రీరాముడి భక్తురాలు శబరి. రాముని దర్శనం కోసం జీవితాంతం భక్తితో వేచి ఉండి, చివరికి రామ దర్శనం పొందిన ధన్యజీవి. శబరి ఒక గిరిజన మహిళ. తన గురువులకు సేవ చేసుకుంటూ ఆశ్రమంలో ఉండేది. ఈమెను ‘శ్రమణీం ధర్మనిపుణాం’ అని వర్ణిస్తాడు వాల్మీకి. ‘శ్రమణి’ అంటే సన్యాస జీవితంలో ఉన్న స్త్రీ. ధర్మం విషయంలో కూడా ఆమెకు సంపూర్ణమైన అవగాహన ఉంది. శబరి.. మాతంగాశ్రమాన్ని చిమ్మి అలుకు చల్లడంలోనే, ఆమె కోరికలు గుండెల్లో చల్లబడ్డాయి. అక్కడ ముగ్గులు పెట్టడంలోనే ఆమె తల ముగ్గుబుట్టలా మారిపోయింది. పూజకు పూలు సేకరించడంలోనే ఆమె కనుచూపు సన్నగిల్లింది. ఆహారానికి పండ్లు ఏరడంలోనే, ఆమె నోటిపండ్లన్నీ రాలిపోయాయి. మడి
బట్టలు పిండటంలోనే శరీరమంతా ముడుతలు పడిపోయింది.
ఏదైనా పదార్థం తినేముందు దేవుడికి పెడతారు. ఆ తర్వాతే ఆరగిస్తారు. ఇదొక ఆచారం. దేవుడికి అర్పించాక తింటేనే అది ప్రసాదం అవుతుంది. అందుకనే పిల్లలు తెలియక ఎక్కడ తింటారోనని ఎంగిలి చెయ్యొద్దని అంటారు. అయితే, దేవుడైన రాముడు ఒకే ఒక్కరి ఎంగిలి తిన్నాడు. అది శబరి ఎంగిలి! తన చూపు మందగించడం వల్ల పళ్లను చూసి, అందులో మంచివి, పండినవి, పండనివి అని వేరుచేయడం ఆమెకు సాధ్యపడదు. అందువల్ల రాముడు వచ్చినప్పుడు.. తాను కాస్త రుచి చూసి, మంచిమంచి పళ్లను రాముడు, లక్ష్మణుడికి అందిస్తుంది. రామాయణంలో వాల్మీకిశబరిని ఒక రేఖాచిత్రంగా మాత్రమే చూపించాడు. అయినా, పాఠకులు ఆ పాత్ర దగ్గర ఆగి ఆలోచిస్తే చాలు.. అనిర్వచనీయమైన అనుభూతి ఏదో వారి హృదయాన్ని అలముకొంటుంది.
మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి. లోక కల్యాణం కోసం స్వామివారు భూమిపై రకరకాల అవతారాలను ఎత్తారు. అయ్యవారితోపాటు అమ్మవారు కూడా. రామాయణంలో సీతగా, మహాభారతంలో రుక్మిణిగా, కలియుగంలో పద్మావతిగా వివిధ అవతరాలను ఎత్తింది. సీతమ్మను.. జానకి, మైథిలి, వైదేహి, రమ అనే పేర్లతోనూ పిలుస్తారు. మిథిలాపుర నాయకుడైన జనక మహారాజు యాగం కోసం భూమిని దున్నుతుండగా నాగలికి ఒక పెట్టె అడ్డుపడింది. తెరిచి చూడగా అందులో ఒక పసిపాప. నాగటిచాలులో లభించినందుకు ఆమెకు ‘సీత’ అని నామకరణం చేశాడు జనక మహారాజు (నాగటిచాలును ‘సీత’ అని పిలుస్తారు). తల్లి గర్భం నుంచి జన్మించలేదు కాబట్టి ‘అయోనిజ’ అయ్యింది. సీతమ్మకు ఆధ్యాత్మిక తల్లి భూదేవి కాగా.. జనకుడు, అతని భార్య సునయన దత్తత స్వీకరించి, పెంచి పోషించిన తల్లిదండ్రులు.
జనకుడికి నాగటిచాలులో సీత దొరకడం (జననం).. స్వయంవరంలో శ్రీరాముడితో వివాహం.. రాముడితో కలిసి అరణ్య వాసానికి వెళ్లడం.. అక్కడ రావణుడు ఆమెను అపహరించడం.. రామరావణ యుద్ధం.. సీత అగ్ని ప్రవేశం.. అయోధ్యలో నివాసం.. మళ్లీ వనవాసం.. లవకుశులకు జన్మనివ్వడం.. తిరిగి భూమిలో అంతర్ధానం కావడం.. ఇలా రామాయణంలోని ప్రతి మలుపులో సీత పాత్ర మహోన్నతమైంది. క్షమ, దయ, ధైర్యం, వివేకం, ఆత్మాభిమానం కలబోసిన ఉదాత్తమైన వ్యక్తిత్వం ఆమెది. సీత పతిప్రేమనే పరమార్థంగా భావించింది. ఆయన సాహచర్యం కోసం అనేక కష్టాలు అనుభవించింది. సహధర్మచారిణిగా అన్ని సందర్భాల్లోనూ భర్తతో సహకరించింది. ఆయన ప్రభుధర్మ పాలన కోసం అగ్నిప్రవేశం చేసింది. సీత జీవితం.. ఆదర్శమయం.
రామాయణంలో గుహుడు ఒక నిషాద రాజు. శ్రీరాముడి భక్తుడు. గుహుని పరిచయం అయోధ్యకాండ 50వ సర్గతో మొదలవుతుంది. సీతారామ లక్ష్మణుల రాక.. వారికి ఆతిథ్యం ఇవ్వడం.. పడవలో గంగా నదిని దాటించడం.. రాముణ్ని తిరిగి తీసుకెళ్లేందుకు భరతుడు రావడం.. అతనికి ఆతిథ్యం ఇవ్వడం.. అతణ్ని సైన్యంతో సహా వివిధ పడవల్లో గంగానదిని దాటించడం.. చివరగా, గుహుడి ప్రస్తావన రావణ వధానంతరం యుద్ధకాండ చివర్లో 128వ సర్గలో కనిపిస్తుంది. తన క్షేమ సమాచారాన్ని గుహుడికి తెలుపమని శ్రీరాముడు హనుమంతుడికి చెబుతాడు. ఆర్ద్రతతో ఇచ్చే ఆతిథ్యం, భక్తి భావంతో చేసే ఉపకారం.. ఎవరి హృదయాన్ని అయినా ఆకర్షిస్తాయి. అందులోనూ మహాత్ముల హృదయాల్ని మరీ వశం చేసుకొంటాయి. రాముడు తన జీవితంలో గుహుని ఆతిథ్యాన్ని మరువలేదు. అందుకే అయోధ్యకు ఆయన తిరిగి వెళ్తున్నప్పుడు, భరద్వాజ ఆశ్రమం నుంచి హనుమంతుని పంపాడు. గుహునికి తన క్షేమసమాచారం చెప్పించాడు. అతడు తన ఆత్మసఖుడని చెప్పుకొన్నాడు. గుహుడు ఆటవికుడే కావచ్చు. అయినా అతనికి మంచి హృదయం ఉంది. జీవితంలో కొన్ని విలువలున్నాయి. అన్నిటికీ మించి ఆతిథ్యానికీ, ఉపకారానికీ ఉండవలసిన ఉత్తమ మనస్తత్వం ఉంది. అందుచేతనే.. అతనికి రాముడి హృదయంలో స్థానం దొరికింది.
శ్రీరాముడి కీర్తిప్రతిష్ఠలు ఇనుమడించేలా, రామావతార లక్ష్యాన్ని సాధించడంలో రామాయణంలో మూడు స్త్రీ పాత్రలు ప్రేరణగా నిలిచాయి. వారిలో ప్రథమ స్థానం కైకేయిది. ఆమెను ప్రేరేపించిన మంథరది ద్వితీయ స్థానం. ఇక మూడో వ్యక్తి శూర్పణఖ. ఈమె రావణాసురుడి చెల్లెలు. కేకసి, విశ్రావసు కుమార్తె. రావణ, కుంభకర్ణ, విభీషణ, ఖర, దూషణులకు సోదరి. మారీచుడు, సుబాహులకు మేనకోడలు. అంటే.. తాటకి ఈమెకు అమ్మమ్మ. విద్యుజ్జిహ్వుడనే రాక్షసుడు ఈమెను వివాహం చేసుకున్నాడు. ఇతను కాలకేయ వంశానికి చెందినవాడు. రావణాసురుడు లోకాలన్నిటినీ జయించే ఉత్సాహంలో ఒకసారి కాలకేయులతో పోరాడుతూ, పొరపాటున విద్యుజ్జిహ్వుడినీ వధించాడు. అంటే.. శూర్పణఖ వైధవ్యానికి అన్న రావణుడే కారణమయ్యాడు. భర్త మరణంతో దుఃఖితురాలైన శూర్పణఖను రావణుడు ‘తెలియక తప్పు జరిగిపోయింది’ అని చెప్పి ఓదార్చాడు. మనసు కుదుటపడటానికి ఖరుడు, దూషణుడు, త్రిశిరుడు అనే అనుచరులను తోడిచ్చి దండకారణ్యంలో విహరించమని పంపించాడు. అప్పటినుంచి ఒంటరైన ఆమె.. లంకకు, దండకారణ్యానికి మధ్య తిరుగుతూ కాలం వెళ్లదీసేది. రామాయణం అరణ్యకాండలో శూర్పణఖ పాత్ర కనిపిస్తుంది. అనంతరం వాల్మీకి రామాయణంలో ఈవిడ ప్రస్తావన లేదు. కానీ, వివిధ వ్యాఖ్యానాలలో రావణుడి అనంతరం విభీషణుడి రాజ్యంలో కొంతకాలం నివసించి, ఆ తర్వాత మరణించిందని పేర్కొన్నారు. సంయమనం పాటించకపోతే, ఎంతటివారైనా పతనం కాక తప్పదని శూర్పణఖ పాత్ర ద్వారా మరోసారి స్పష్టం అవుతుంది.
బ్రహ్మ మానసపుత్రుడైన పులస్త్యుని కుమారుడు విశ్రావసుబ్రహ్మ (బ్రాహ్మణుడు), దైత్య రాకుమారి కైకసి (రాక్షస స్త్రీ) కుమారుడే రావణాసురుడు. రావణాసురుడి తండ్రి వైపు నుంచి తాత పులస్త్యుడు. ఇతని తండ్రి బ్రహ్మ. రావణాసురుని తల్లి వైపు నుంచి.. తాత మల్యవుడు, అమ్మమ్మ తాటకి. మామ మారీచుడు. రావణాసురుడికి ఆరుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు. భార్య మండోదరి. వీరికి ఏడుగురు కొడుకులు. దశకంఠుడు (పదిమంది జ్ఞానులతో సమానమైన జ్ఞానం కలవాడు), దశముఖుడు, దశగ్రీవుడు ఇతని ఇతర పేర్లు. రావణాసురుడు కైలాస పర్వతాన్ని తన రెండు చేతులతో పెకిలిస్తున్నప్పుడు పరమశివుడు అతని చేతివేళ్లను కాలితో తొక్కుతాడు. అప్పుడు దశకంఠుడు బిగ్గరగా అరవడంతో ఇతనికి రావణుడు (అరుపు = రావణ) అనే పేరు వచ్చింది. రావణుడు పుట్టినప్పుడు రక్తం వర్షంగా కురిసిందట. గద్దలు అరిచాయట. దేవతలు కూడా భయపడ్డారట. రావణుని జన్మ శాప కారణంగా జరిగిందనీ, హిరణ్యకశిపుని వధించడంతో.. ‘కపటంతో స్తంభం నుంచి వచ్చి ఇరవై గోళ్లతో నన్ను చంపితివి, ఇదా పౌరుషం?’ అని ఆక్షేపించాడట. దాంతో విష్ణుమూర్తి.. ‘మరో జన్మలో నీకు ఇరవై బాహువులు, పది శిరస్సులను ఇచ్చి, నేను సామాన్యుడినై సంహరిస్తాను’ అన్నాడట.
రామాయణంలో అరణ్యకాండ, సుందరకాండ, యుద్ధకాండలలో రావణాసురుడి పాత్ర కనిపిస్తుంది. అరణ్యకాండలో.. వాసుకి పాలిస్తున్న పాతాళలోకానికి వెళ్లి తక్షకుని భార్యను అపహరించి తన భార్యగా చేసుకొంటాడు. కైలాసపర్వతం వైపు వెళ్లి తన సోదరుడైన కుబేరుడిని యుద్ధంలో జయించి పుష్పక విమానాన్ని కాంచన లంకకు తెచ్చుకొంటాడు. స్వర్గానికి వెళ్లి నందనవనాన్ని ధ్వంసం చేస్తాడు. సూర్యచంద్రులను రెండు చేతులతో గట్టిగా పట్టుకొని వారి గమనాన్ని నిరోధిస్తాడు. పూర్తి కావస్తున్న యజ్ఞయాగాదులను ధ్వంసం చేయడమంటే రావణుడికి అత్యంత ప్రీతి. యజ్ఞాలలో ఇచ్చే సోమరసాన్ని ఇంద్రుడు సంగ్రహించకుండా తానే స్వీకరించి, యజ్ఞఫలాన్ని నాశనం చేస్తాడు. సీతను అపహరిస్తాడు. సుందరకాండలో.. అశోకవనంలో సీతను ఉంచుతాడు. యుద్ధకాండలో.. రాముడి చేతిలో రావణాసురుడు మరణిస్తాడు. రావణుడు… వేదవేదాంగాలను ఆపోశన పట్టిన మహాపండితుడు. నిత్య పూజా దురంధరుడు. తపస్వి, గొప్ప రాజనీతిజ్ఞుడు. సంగీత సాహిత్యాలలోనూ ప్రతిభావంతుడు.. ఇన్ని సుగుణాలు ఉన్నప్పటికీ, అతని పతనానికి ప్రధాన కారణం మాత్రం..
‘పరస్త్రీ వ్యామోహం’. పాలకుండలో విషపు చుక్కలా, ఒక్క దుర్గుణం వేయి సుగుణాలను కప్పేస్తుంది. ఏ దేశమైనా, ఏ కాలమైనా ఈ సందేశం అందరికీ వర్తిస్తుంది.
రావణాసురుడు-మండోదరి దంపతుల పెద్ద కొడుకు. జన్మించినప్పుడు అరిచిన అరుపు, మేఘం ఉరిమిన పిడుగు శబ్దంలా ఉండటం వల్ల ‘మేఘనాదుడు’ అని నామకరణం చేశారు. స్వర్గానికి వెళ్లి ఇంద్రుడిని జయించినందున ‘ఇంద్రజిత్తు’ అయ్యాడు. ఈ సందర్భంగా బ్రహ్మ అనుగ్రహం పొంది బ్రహ్మాస్ర్తాన్ని సంపాదించాడు. యుద్ధ సమయంలో ఆకాశంలోకి వెళ్లి మేఘాలలో యుద్ధాలు చెయ్యగలగడం ఇంద్రజిత్తు నైపుణ్యం. ఆదిశేషుని కుమార్తె సులోచన (ప్రమీల నాగకన్య)ను వివాహం చేసుకొన్నాడు. ఇంద్రజిత్తు జన్మించే సమయంలో రావణుడు తన ఆదేశంతో, అన్ని గ్రహాలను ఉత్తమమైన స్థానాలలో ఉంచాడు. అలా.. ఉండీ ఉండీ సరిగ్గా ఇంద్రజిత్తు జన్మించే సమయంలో.. శని తన రెండు కాళ్లనూ ముందు స్థానంలోకి చాపాడు. దాంతో ఇంద్రజిత్తు జన్మించిన సమయంలో శని స్థానం దోష భూయిష్ఠంగా మారింది. దీంతో ఆగ్రహించిన రావణుడు, అప్పటికప్పుడు శని రెండు కాళ్లనూ నరికివేస్తాడు. ఎంతో ప్రతిభావంతుడైన ఇంద్రజిత్తు, శని స్థానం దోషం కావడంతోపాటు అధర్మాన్ని ఆశ్రయించడం వల్ల యుద్ధంలో అకాల మరణం పొందాడు.
పలు గ్రంథాలలో పేర్కొన్న ఏడు యజ్ఞయాగాదులను చేసిన ఏకైక యోధుడు.. ఇంద్రజిత్తు. అవి అగ్నిష్టోమ, అశ్వమేథ, బహుసువర్ణక, గోమేథ, రాజసూయ, వైష్ణవ, మహేశ్వర. ఇంద్రజిత్తు అత్యంత శక్తిమంతమైన వైష్ణవాస్త్రం, బ్రహ్మాస్త్రం, పాశుపతాస్ర్తాలను కలిగి ఉండే మహాయోధుడు. రామరావణ యుద్ధంలో పాల్గొన్న వానరుల్లో సగం వానరులను ఒక్కరోజులోనే సంహరించాడు. ఇంద్రజిత్తు ‘అతి మహారథి’. అంటే.. ఎనభై ఆరు లక్షల నలభైవేల మందితో ఒకేసారి యుద్ధం చేయగలడు. 14 సంవత్సరాలు నిద్రలేని వ్యక్తిద్వారా మాత్రమే తన మరణమనీ, పైగా ఆ 14 సంవత్సరాలు ఆ వ్యక్తి బ్రహ్మచారి జీవితం జీవించాలనీ ఇంద్రజిత్తు వరాన్ని పొందాడు. అలా 14 సంవత్సరాలు బ్రహ్మచర్యం పాటిస్తూ, నిద్రపోకుండా సీతారాముల సేవలో ఉన్న లక్ష్మణుడి చేతులో ఇంద్రజిత్తు మరణించాడు. రావణాసురుడి పెద్దకుమారుడిగా జననం, ఇంద్రుడితో యుద్ధం, బ్రహ్మ నుంచి, శివుడి నుంచి వివిధ అస్ర్తాలు, వరాలు పొందడం.. రామరావణ యుద్ధంలో కీలక పాత్ర పోషించి, చివరికి లక్ష్మణుడి చేతిలో మరణించటంతో ఇంద్రజిత్తు పాత్ర ముగుస్తుంది. మహా పరాక్రమ సంపన్నుడైన ఇంద్రజిత్తు తన శక్తియుక్తుల్ని ధర్మం కోసం కాకుండా, అధర్మం కోసం ఉపయోగించాడు. చివరికి ఇలా మరణించాడు.
స్వామికార్యం అనేసరికి ప్రతిప్రాణీ తన శక్తి మేర కృషిచేసిన గాథలను అద్భుతంగా వర్ణించింది మహాకావ్యం. ఉడుత.. వారధి కోసం, సంపాతి.. లంకకు మార్గం కోసం, అతని సోదరుడు జటాయువు.. సీతమ్మ ఆనవాలు కోసం, వానరసైన్యం.. రావణుని వధించి ధర్మస్థాపన కోసం.. ఇలా చెప్పుకొంటూ పోతే, ఎన్నో జీవరాశులు శ్రీరాముడికి తోడ్పాటుగా నిలిచాయి. అందులో ఒక ఉదాత్తమైన ప్రాణి.. జటాయువు. ఈ జటాయువు అరణ్యకాండలో వచ్చే ఒక పాత్ర (గద్ద). ఇతను అనూరుడు (సూర్యభగవానుడి రథసారథి), శ్యేని కుమారుడు. సంపాతి ఇతని సోదరుడు. దశరథుడి స్నేహితుడు. రావణుడు సీతను అపహరించడానికంటే ముందే, సీతారామ లక్ష్మణులను జటాయువు కలుసుకొంటాడు. తనను తాను పరిచయం చేసుకొని, రామలక్ష్మణులు ఏదైనా పనిమీద బయటికి వెళ్లినప్పుడు, తాను సీతమ్మకు రక్షణగా ఉంటానని చెబుతాడు. రావణుడు సీతమ్మను అపహరించుకొని వెళ్తున్నప్పుడు నిలువరించడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తాడు. రావణుడితో యుద్ధం చేసి తీవ్రంగా గాయపడుతాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ రాముడు వచ్చాక, జరిగిన విషయం తెలిపి మరణిస్తాడు. జటాయువుకు రాముడే స్వయంగా అంత్యక్రియలు జరిపిస్తాడు. జటాయువు పాత్ర అచ్చపు మైత్రికి ఆదర్శంగా నిలుస్తుంది.
శ్రీరాముడు, సీతకు కలిగిన కవల పిల్లల్లో లవుడు మొదటివాడు. అతని సోదరుడు కుశుడు. లవుడు తల్లిలా గోధుమ వర్ణంలో ఉంటే, కుశుడు తండ్రిలా శ్యామ వర్ణంలో ఉంటాడు. లవుడు తన పేరుతో ‘లవపురి’ నగరాన్ని స్థాపించినట్లు చెబుతారు. అదే ప్రస్తుత లాహెూర్ నగరం. వాల్మీకి మహర్షి ఆశ్రమంలో జననం, వారి శిష్యరికంలో పలు విద్యలలో శిక్షణ పొందడం, రామకథను గానం చేయడం, సీత భూ గర్భ ప్రవేశ సమయంలో రాముడికి లవకుశులు తన పిల్లలే అని తెలవడం, రాముడి అనంతరం రాజ్య పాలన చేయడం.. ఈ విధంగా రామాయణంలో వీరి పాత్ర ఉంటుంది. రామరాజ్యంలో వచ్చిన అపవాదు కారణంగా, అయోధ్య రాజ్యం నుంచి సీతను రాముడు బహిష్కరిస్తాడు. తామసా నది ఒడ్డున ఉన్న వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఆమె ఆశ్రయం పొందుతుంది. అక్కడే లవుడు, కుశుడు జన్మిస్తారు. వారికి వాల్మీకి మహర్షి విలువిద్య, సైనిక నైపుణ్యాలపై శిక్షణనిస్తాడు. రామకథను కూడా నేర్పిస్తాడు. రాముడి అనంతరం లవుడు, కుశుడు రాజ్యాన్ని పరిపాలిస్తారు. వారు లవపురి, కసూర్ నగరాలను స్థాపిస్తారు. రఘురాముడు అతని కుమారులైన లవుడినీ, కుశుడినీ శ్రావస్తి, కుశావతి రాజ్యాలకు రాజులుగా చేస్తాడు.
మహారాజు బిడ్డలే అయినప్పటికీ లవకుశులు, వాల్మీకి ఆశ్రమంలో సామాన్యులుగా ఉండి, గురువుకు సేవలు చేస్తూ విద్యలను అభ్యసించారు. వీరు రామకథను గానం చేసే సమయంలో
శ్రీరాముడు తమ తండ్రి అని వారికి తెలియదు. ఘనమైన వంశ చరిత్ర ఉన్నప్పటికీ అణకువ, వివేకం, పెద్దలపట్ల గౌరవభావం లాంటి ఎన్నో మంచి విలువలను కలిగి ఉన్నారు.
మయుడు రాక్షసుల రాజు. ఇతనికి మయాసురుడు అని కూడా పేరు. లంకాధిపతి అయిన రావణుని భార్య మండోదరి.. మయుని కుమార్తె. అంటే, మయుడు రావణబ్రహ్మకు మామ అవుతాడు. మయుడు ఇంద్రునికి అమరావతి పట్టణాన్ని, కుబేరునికి అలకాపురిని నిర్మించి ఇచ్చాడు. మయుడి తండ్రి కశ్యపుడు (పరశురాముడు ఇతనికి భూమినంతా దానం చేస్తాడు. ఇతనికి అరిష్టనేమి అనే పేరు కూడా ఉంది), తల్లి పేరు దను/దితి. మయుడి భార్య హేమ. వీరి పిల్లలు.. మాయావి, దుందుభి, మండోదరి.
భారతీయ శాస్ర్తాలలో వాస్తు ప్రాచీనమైనది, ప్రసిద్ధమైనది కూడా. ఈ శాస్ర్తానికి కర్తలుగా పేర్కొన్న వారిలో విశ్వకర్మ, మయుడు ముఖ్యమైన వారు. వీరేకాకుండా బృహస్పతి, శుక్రుడు, వశిష్ఠుడు, నగ్నజిత్తు, గర్గుడు మొదలైన శాస్త్రకర్తలు పలువురు ఉన్నారు. భారతీయ విగ్రహ శిల్పానికి, దేవాలయ శిల్పానికి ఆద్యుడు మయుడు. శిల్పాకృతులలో అద్భుతమైనదిగా చెప్పబడే నటరాజ విగ్రహ శిల్పం మయుడు సృష్టించినదే. రామాయణంలో మండోదరి తండ్రిగా మయుడు కనిపిస్తాడు. ఇతను మయరాష్ట్ర అనే పట్టణాన్ని నిర్మించి, తన రాజధానిగా చేసుకొన్నాడు. మయరాష్ట్రనే ఇప్పుడు మీరట్ అని పిలుస్తారు. స్వర్ణ నగరం/ లంకాపురి/ స్వర్ణ లంకను నిర్మించింది కూడా మయుడే. మహాభారతంలో ధర్మరాజుకు ఇంద్రప్రస్థంలో ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మించి ఇచ్చాడు. అదే మయసభగా పేరొందింది.
తల్లిదండ్రుల పట్ల ఎంతటి అంకితభావాన్ని కలిగి ఉండాలో చెప్పే మహోన్నత వ్యక్తిత్వం గల పాత్ర శ్రవణ కుమారుడు. ఇతని తండ్రి శంతనవుడు, తల్లి జ్ఞానవతి. ‘వినికిడి’ అంటే.. శ్రవణ ప్రధానమైన అస్త్రవిద్యతో అనగా ‘శబ్దభేది’తో కొట్టబడిన మునికుమారుని కరుణామయ గాథ శ్రవణమై.. ముని కుమారుని పేరు శ్రవణుడుగా, శ్రావణుడుగా మారిందని భావించవచ్చు. ఏదేమైనా శ్రవణుని చరిత్ర, తల్లిదండ్రుల పట్ల భక్తికి ప్రతీకగా లోకంలో నిలిచిపోయింది. తల్లిదండ్రుల సేవలో తరించిన ఉత్తములైన కుమారులు భారతీయ సాహిత్యంలో చాలామంది కనిపిస్తారు. వృద్ధులైన తల్లిదండ్రులను కావడిలో కూర్చోబెట్టి, స్వయంగా మోస్తూ తీర్థయాత్రలకు తిప్పిన శ్రవణ కుమారుడి కథను రామాయణం వివరించింది. తండ్రి ఆనతి మేరకు రాజ్యాధికారాన్ని వదులుకొని శ్రీరాముడు అడవుల బాటపట్టిన విషయమూ వర్ణించి చెప్పింది. తల్లి దాస్య విముక్తికోసం బ్రహ్మప్రయత్నం చేసి, దేవతలను ఓడించి, అమృతాన్ని సాధించిన గరుత్మంతుడి కథను భాగవతం ప్రకటించింది. యయాతికి తన యవ్వనాన్ని సమర్పించిన కొడుకు పూరుడి కథనూ చెప్పింది. ‘తల్లిదండ్రుల సేవ మినహా నాకు తెలిసినదేదీ లేదు’ అని వినయంగా పలికిన ధర్మవ్యాధుడి కథను భారతం పరిచయం చేసింది. తండ్రి నిమిత్తమై భీషణమైన ప్రతిజ్ఞ చేసి, అపూర్వ త్యాగానికి పాల్పడిన భీష్ముడి కథనూ చిత్రించింది. తల్లి దైన్యస్థితికి తల్లడిల్లి సమస్త రాజవంశ నాశనానికి పూనుకున్న పరశురాముడు, తల్లి కోరిందని ఆత్మలింగం సాధించడానికై పడరాని పాట్లుపడిన రావణాసురుడు, క్షణమాత్రం ఏమరుపాటు లేకుండా తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాచుకున్న ప్రవరాఖ్యుడు, సన్యాసదీక్షలో ఉన్నా తల్లికి ఇచ్చిన మాటకోసం స్వయంగా అమ్మ ఆర్యాంబకు అంత్యక్రియలు నిర్వహించిన ఆదిశంకరులు.. ఇలా జన్మనిచ్చిన వారికోసం పరితపించిన కుమారుల గాథలు సాహిత్యంలో కోకొల్లలుగా కనిపిస్తాయి. చరిత్రలోనూ ఆ తరహా ఆదర్శమూర్తుల ఉదంతాలకు కొదవలేదు.
వాల్మీకి రామాయణంలో శ్రీరాముడి జననానికి ముందే దశరథుని జీవితంలో సంభవించిన విచిత్ర విషాద సంఘటన శ్రవణ కుమారుని వృత్తాంతం. రాముడు వనవాసానికి వెళ్లిన తర్వాత దశరథుడే ఈ వృత్తాంతాన్ని కౌసల్యకు చెప్పుకొంటాడు. రామాయణంలో నామమాత్రంగా కనిపించిన శ్రవణ కుమారుని వృత్తాంతం అనంతర కాలంలో చిగురులు తొడిగి అద్భుతమైన ఇతివృత్తమై, ఎందరో మహాపురుషులకు ఆదర్శప్రాయమైంది.
శక్తిమంతుడైన రాక్షస యోధుడు ప్రహస్తుడు.. రావణుని సేనాధిపతి. తరువాత మహాభారతంలో పురోచనుడిగా దుర్యోధనుని నమ్మకమైన సహాయకుడిగా, లాక్షా గృహ సంఘటనకు కారణమైనవాడిగా పునర్జన్మ పొందాడు. ప్రహస్తుడు నీలుడి చేతిలో మరణిస్తాడు. కొన్ని గ్రంథాలలో లక్ష్మణుడి చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్నాడని ఉన్నది. రావణుడి ఏడుగురు కొడుకులలో ప్రహస్తుడు ఒకడు. లంకానగరపు నాలుగు ప్రముఖ ద్వారాలు, నలుగురి అధీనంలో ఉంటాయి. తూర్పు ద్వారం ప్రహస్తుడి ఆధీనంలో, దక్షిణ ద్వారం మహోదరుడు, మహాపార్శ్వుని అధీనంలో, పడమర ద్వారం ఇంద్రజిత్తు అధీనంలో, ఉత్తర ద్వారం రావణుడి అధీనంలో ఉంటాయి.
రామాయణంలో ప్రహస్తుడి పాత్ర యుద్ధకాండలో వస్తుంది. ఎంతోమంది వానరులను సంహరించాక, ప్రహస్తుడు నీలుడి చేతిలో మరణిస్తాడు. అకంపనుడు కూడా మరణించాడని తెలిసిన రావణుడు, ప్రహస్తుని పిలిచి.. ‘యుద్ధానికి ముందుకు వెళదామా వద్దా!’ అని అడుగుతాడు. దానికి ప్రహస్తుడు.. ‘అప్పుడే సీతను రాముడికి అప్పగించమని చెప్పినప్పుడు మీరు కుదరదని చెప్పారు. ఇక యుద్ధమే జరుగుతున్నప్పుడు వెనకడుగు ఎందుకు? మీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను’ అని యుద్ధానికి బయల్దేరతాడు. ధర్మాన్ని ఆశ్రయించాలి, ధర్మాన్ని ఆచరించాలి. సీతమ్మను అప్పగించాలని ప్రహస్తుడు రావణుడితో ధర్మం చెప్పినా, దానిని ఆచరించడంలో విఫలమయ్యాడు. రోగానికి మందు తెలిసినప్పటికీ, దానిని వాడకపోతే ప్రయోజనం ఏమీ లేనట్లుగానే.. ధర్మ విచక్షణ ఉన్నా దానిని ఆచరించకపోతే ప్రయోజనం ఏమీ లభించదు.
భూదేవిని ‘భూమాత’ అని కూడా అంటారు. భువనేశ్వరి, అవని, పృథ్వీ, వారాహి, ధరిత్రి, ధాత్రి, ధరణి, వసుధ, వసుంధర, వైష్ణవి, కశ్యపి, ఉర్వి, ఇరా, మహి, వసుమతి, హేమ వంటి వివిధ పేర్లతోనూ పిలుస్తారు. భూదేవి సీత తల్లి. బ్రహ్మ పురాణం, విష్ణు పురాణం వంటి గ్రంథాల ప్రకారం నరకాసురుడు భూదేవి కొడుకు. నవగ్రహాలలో ఒకడైన అంగారకుడు కూడా భూదేవి కొడుకే. ఈమె సీతకు తల్లి మాత్రమే కాకుండా.. విష్ణువు అవతారమైన వరాహస్వామి భార్య, లక్ష్మీదేవికి మరో రూపంగానూ భావిస్తారు. అదేవిధంగా శ్రీరంగనాథుని భార్య ఆండాళ్ భూదేవి అవతారమని విశ్వసిస్తారు. యజ్ఞం కోసం జనకుడు నేలను దున్నుతుండగా, నాగటిచాలులో సీత దొరికింది. చివరికి రామచంద్రుడికి లవకుశులను అప్పగించి సీత, భూమాతలో ఐక్యం అవుతుంది. ఈ రెండు సందర్భాలలోనూ భూదేవి మనకు రామాయణంలో కనిపిస్తుంది. సీతాదేవి జనన మరణాలు.. మనిషి తల్లి గర్భంలో జన్మించి, మరణించిన తర్వాత భూగర్భంలో కలిసిపోవడం అనేదానికి ప్రతీకగా కనిపిస్తాయి.
జనకుడి తమ్ముడు కుశధ్వజుడు. ఇతనికి ముగ్గురు కూతుళ్లు. ఊర్మిళను లక్ష్మణుడికి, మాండవిని భరతుడికి, శ్రుతకీర్తిని శత్రుఘ్నుడికి ఇచ్చి పెండ్లిచేస్తారు. వీరి పాత్రలు రేఖామాత్రమే అయినా, వ్యక్తిత్వాలు ఆదర్శవంతమైనవి.
కబంధుడి రూపం దూరం నుంచి చూడటానికి మాంసాహారం తినే చెట్టులా భయంకరంగా ఉంటుంది. లక్ష్మణుడు ఈ రాక్షసుడి చేతిలో చిక్కుకుంటాడు. ఆ సమయంలో రాముడు కబంధుడిని సంహరిస్తాడు.
వాలి: సుగ్రీవునితోపాటు పరిచయం అవుతాడు. సుగ్రీవునితో యుద్ధంలో.. రామబాణానికి కూలిపోతాడు.
నలుడు-నీలుడు: నలుడు విశ్వకర్మ కుమారుడు. రామసేతువును నిర్మించాడు. నీలుడు అగ్ని కుమారుడు.వానర సైన్యానికి నాయకుడు. రామరావణ యుద్ధంలో ఇద్దరిదీ కీలక పాత్రే.
.. వీళ్లే కాదు, పది దిక్కులకూ రథాన్ని నడిపిన దశరథుడు.. ఆయన సతీమణులు కౌసల్య, సుమిత్ర, కైకేయి.. అన్నచాటు తమ్ముళ్లు భరత శత్రుజ్ఞులు, బ్రహ్మ మానసపుత్రిక అహల్య.. దుర్బుద్ధి మంథర.. పంచకన్యలలో ఒకరైన తార.. రావణుడి ధర్మపత్ని మండోదరి.. మాయల మారీచుడు.. సప్త చిరంజీవులలో ఒకడైన విభీషణుడు.. వివేకి జాంబవంతుడు.. ఎలా బతకాలో చెప్పేవి కొన్ని, ఎలా మసలుకోవాలో నేర్పించేవి కొన్ని, సామెతలుగా మారినవి కొన్ని, సత్యధర్మాలకు ఉదాహరణలుగా నిలిచినవి కొన్ని.. రామాయణంలోని ప్రతిపాత్రా అక్షయపాత్రే! కాబట్టే, రామకథ విలువల రాచబాటగా మారింది. రాముడు అందరివాడు అయ్యాడు!
ఆధారం: రామాయణ పరివారం
రచన: బుర్రా వెంకటేశం ఐ.ఏ.ఎస్
పేజీలు: 162, వెల: రూ.250
ప్రతులకు: విశ్వ సాహితి ట్రస్ట్,
ఫోన్: 9963 539 139
పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు తొమ్మిదో రోజు అత్తవారింటికి ప్రయాణం చేయకూడదంటారు ఎందుకు ?
Sri Ramanavami Special | శ్రీ రామతత్వమ్ మనకు ఏం బోధిస్తున్నది?
శివుడు- విష్ణువు ఒకటే.. వారిద్దరినీ ఎందుకు కలిపి చూడాలో చెప్పే సందర్భాలివే..
ఇంటి ముందు గుమ్మడి కాయ ఎందుకు కడతారు?