ఉన్నత చదువుల కోసం, ఉద్యోగాల కోసం.. అమెరికా, ఆస్ట్రేలియా అంటూ విదేశాల బాట పట్టిన వాళ్లంతా అమ్మచేతి వంటను మిస్సవుతున్నారు. విదేశాలకు వెళ్లే ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు తెలుగువారే. ఏ ప్రవాసుడిని కదిపినా.. అక్కడికి వెళ్లి వృత్తిపరంగా రాణించినా, తిండి విషయంలో మాత్రం మన రుచుల్ని మిస్సవుతున్నామనే బాధ వెంటాడుతున్నదనే చెబుతారు. అలాంటివారికి అచ్చంగా అమ్మచేతి వంటను అందించే ప్రయత్నం చేస్తున్నది.. దేశీ ఆథెంటిక్. హైదరాబాద్కు చెందిన ఈ సంస్థ మూడేండ్లుగా ప్రపంచంలో వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారికి మన రుచుల్ని వడ్డిస్తున్నది. దేశీ ఆథెంటిక్ రుచులకు తెలుగువారితోపాటు విదేశీయులూ ఫిదా అయిపోతున్నారు.
మూడేండ్లలో ఈ సంస్థ 20 మందికి పైగా స్థానిక మహిళలను హోమ్ప్రెన్యూర్లుగా మలిచి ఉపాధి కల్పించింది. వడియాలు, అప్పడాలు, సకినాలు, అరిసెలు, చేగోడీలు, స్వీట్లు, పచ్చళ్లు, మసాలాలు, పొడులతోపాటు ఒకప్పటి చిరుతిళ్లయిన నారింజ మిఠాయి, పిప్పరమెంట్లను కూడా ప్రత్యేకంగా తయారు చేయించి ఎగుమతి చేస్తున్నది. ఇప్పటివరకు దాదాపుగా 38 వేల మందికి పైగా తెలుగువారికి కోరుకున్న రుచులను పార్సిల్ చేసింది. ఆహార పదార్థాలతో పాటు చేనేత దుస్తులు, నిర్మల్, కొండపల్లి, ఏటికొప్పాక కొయ్యబొమ్మలు, ఆయుర్వేద మందులు, పతంజలి ఉత్పత్తులను కూడా అందిస్తున్నది. విదేశాల్లో జరిగే తెలుగు వేడుకలకు కూడా ఇక్కడినుంచే రకరకాల పిండి వంటలను ఎగుమతి చేస్తున్నది. త్వరలోనే వేగన్ ఉత్పత్తులనూ అందుబాటులోకి తెస్తామని అంటున్నారు దేశీ ఆథెంటిక్
వ్యవస్థాపకులు యుగంధర్, రామ్, వరప్రసాద్.