ప్రతి తల్లీ తన బిడ్డల సంతోషమే కోరుకుంటుంది. తాను ఉన్నన్ని రోజులు వారికోసమే కష్టపడుతుంది. లక్ష్మీదేవమ్మ, పద్మావతిల జీవితాలు కూడా ఈ కోవకు చెందినవే. ఉన్నత చదువులు చదివిన తన ఒక్కగానొక్క కుమారుడు రాజేంద్ర అమెరికాలో ఉద్యోగం చేస్తానంటే తన భర్తకు ఇష్టంలేకున్నా పద్మావతి పంపిస్తుంది. తన భర్త చనిపోయినా కూడా కొడుకుపైన ఆధారపడకుండా చివరి దాకా వృద్ధాశ్రమంలోనే కాలం వెళ్లదీసి అక్కడే ప్రాణాలు కోల్పోతుంది. సంపాదనలో పడిపోయిన రాజేంద్రను తల్లి మరణం కలిచివేస్తుంది. ఉద్యోగం వదిలేసి, భార్యతో ఇంటికి చేరిన రాజేంద్రకు ‘అమ్మలేని జీవితం’ అంటే ఏమిటో ఆ క్షణంలో తెలిసొస్తుంది.
ఆమె గుర్తుగా ఆ వృద్దాశ్రమానికి తోచిన సాయం చేస్తూ, తన కూతురిలోనే తన తల్లిని చూసుకుంటాడు. ఇక లక్ష్మీదేవమ్మది మరో గాథ. ఆమె ఆరోగ్యంగా ఉన్నప్పుడు తన ఇద్దరు కొడుకులు, కోడళ్లకు సేవలు చేస్తుంది. పక్షవాతంతో మంచానపడుతుంది. చాకిరి చేసినప్పుడు ఆమెను దేవతలా చూసిన కొడుకు, కోడళ్లు.. ఆమె ఆరోగ్యం దెబ్బతినగానే ఎప్పుడు పోతుందా అని ఎదురు చూస్తుంటారు. వాళ్ల మనసు తెలుసుకున్న లక్ష్మీదేవమ్మ ఆత్మహత్యకు పాల్పడుతుంది. ఆ తల్లి వ్యథ ‘అమ్మా.. నువ్వు చచ్చిపో’ పాఠకులను కన్నీరు పెట్టిస్తుంది. ఈ సమాజంలోని స్త్రీలంతా తమకు పిడికెడు ప్రేమను పంచే మగతోడు ఉంటే చాలు ఇక తమ జీవితం స్వర్గమని భావిస్తుంటారు.
అలాంటి కోవకు చెందిన ఓ ఇంతి కథే ‘ఆమె కోరిక’. వారంలో ఒక్కరోజైనా తన భర్తతో గడపాలనుకుంటుంది వైదేహి. భార్య ముచ్చట తీర్చకుండా క్షణం తీరిక లేకుండా బిజీగా కాలం గడిపేస్తుంటాడు ఆమె భర్త. ఉద్యోగాల పేరిట బిజీగా బతుకీడుస్తున్న నేటి జంటలకు ఈ కథ మంచి పాఠం చెబుతుంది. రచయిత పంతంగి శ్రీనివాసరావు గతంలో వివిధ పత్రికల్లో రాసిన కథలను ‘అమ్మలేని జీవితం’ సంకలనంలో పొందుపరిచారు. ఈ పుస్తకంలో ప్రచురించిన 20 కథల్లో అన్నీ సామాజిక అంశాలతో ముడిపడినవే. మనిషి జీవితం కష్టసుఖాల సమాహారమని ఈ కథాసంపుటి మరోసారి మనకు గుర్తుచేస్తుంది.
రచయిత: పంతంగి శ్రీనివాసరావు
పేజీలు: 140, ధర: రూ.220
ప్రతులకు : 98851 12517
-రాజు పిల్లనగోయిన