జరిగిన కథ :
వెలనాడును చిత్తుగా ఓడించిన కాకతీయ సైన్యాలు.. ఆ తర్వాత సామంత మండలమైన ద్వీపరాజ్యంపై దండెత్తాయి.
ఓటమి అంగీకరించిన ద్వీపరాజ్య పాలకుడు పినచోడుడు.. వెలనాడు ధనాగారాన్ని కాకతీయులకు అప్పగించాడు.
వెలకట్టలేని సంపదతోపాటు అత్యంత సంపన్నమైన ద్వీపరాజ్యం కాకతీయుల సొంతమైంది. అయితే.. అక్కడ గెలిచినవారికీ, ఓడినవారికీ ఏమాత్రం తేడా కనిపించడం లేదు. అందుకు కారణం.. గణపతిదేవుడి శాసనం.
కాకతీయ మహారాజు గణపతి
దేవులు తీసుకున్న కీలక నిర్ణయం.. ఓడిన పినచోడుడినే ఆ ప్రాంతానికి సామంత ప్రభువుగా కొనసాగించడం.
గెలిచే పరిస్థితి లేనప్పుడు, ఓటమి కను
చూపుమేరకు వచ్చేసినప్పుడు, ప్రాణాలు రక్షించుకుంటూ ఓటమిని ప్రకటిస్తారు రాజులు. రాజకేతనాన్ని అవనతంచేసి రాజచిహ్నాలన్నీ త్యజించి పూర్తిగా లొంగిపోతారు. ఇక్కడ కూడా అదే జరిగింది. కానీ, కాకతీయ సర్వ
సైన్యాధ్యక్షుడు చౌండసేనాని పినచోడ
నాయకుడిని సగౌరవంగా హత్తుకుని..
“మీకు వచ్చిన ఆపద ఏమీలేదు మహారాజా..” అన్నాడు.
“ఇప్పుడు ఈ ద్వీపరాజ్యం కాకతీయ
మహాసామ్రాజ్యంలో భాగం. ఇకపై ఈ ద్వీపరాజ్య ప్రజలకు ప్రభువు.. శ్రీశ్రీశ్రీ గణపతి
దేవులు. ఇది ప్రభువుల ప్రతినిధిగా నా ఆజ్ఞ. దీనిని ఈ ద్వీపరాజ్యమంతా చాటింపు వేయించండి” అని ప్రకటించాడు.
“కాకతీయ సైనికులెవ్వరూ ద్వీపరాజ్యపు ఆస్తులను ధ్వంసం చెయ్యకూడదు. అంతఃపురంలో ప్రవేశించరాదు. ద్వీపరాజ్యం మనదే! ఇక్కడ ఎవ్వరి మానప్రాణాలకు భంగం కలిగించరాదు”.. అని తన సైన్యానికి కూడా ఆజ్ఞ జారీచేశాడు.
ఆయన ప్రకటన.. ద్వీపరాజ్యంలో సంభ్రమాశ్చర్యాలు పుట్టించింది. ద్వీపరాజ్యం ఓటమితో కుంగిపోకుండా విజయోత్సవాల్లో ఓలలాడింది. అంతఃపురం ఊపిరి పీల్చుకుంది.
ఈ విషయాన్ని వార్తాహరుల ద్వారా తెలుసుకున్న ఇతర రాజ్యాల ప్రభువులు ఆశ్చర్య
పోయారు. అప్పటికే స్వాతంత్య్రం ప్రకటించుకున్న మాండలికులు తెల్లబోయారు. ఇదొక కొత్త రాజకీయ పరిణామంగా వారంతా ఆంతరంగిక చర్చల్లో ముచ్చటించుకుంటున్నారు. సైనికశ్రేణులు వెనక్కి మరలక ముందే తనను సామంతరాజుగా ప్రకటించడంతో.. ముందు హాయిగా నిట్టూర్చాడు పినచోడుడు. సంకెళ్లు లేవు. కారాగారం లేదు. పైగా గెలిచినరాజు ఓడినరాజును నమ్మి ఆయననే తిరిగి పాలకుడిగా ప్రకటించడం.. ఇది ఎప్పుడూ ఎక్కడా జరిగినట్లు లేదు.
సహజంగా విజయుడైన రాజు తన రాజధాని నుంచి ఓ అమాత్యుణ్ని తన ప్రతినిధిగా పంపిస్తాడు. ఆ వచ్చినవాడి వికృతాలు, అరాచకాలు, ముఖ్యంగా ఓడిన రాజు పట్ల, ఆ రాజుకు చెందిన అంతఃపుర కాంతల పట్ల ప్రవర్తించే తీరు అత్యంత క్రూరంగా ఉంటుంది. ఇప్పుడు ఆ అరాచకానికి తావులేదు. అందుకే, గణపతిదేవునిపై అతనికి చాలా గొప్ప గౌరవం కలిగింది.
ఇది మహాప్రభువులవారి నిర్ణయమంటూ చౌండ
సేనాని చెప్పి, రాజధాని అనుమకొండ నుంచి వచ్చిన అధికారిక లేఖను చూపించినప్పుడు పినచోడుడు కూడా నమ్మలేనట్లు చూశాడు. సంభ్రమాశ్చర్యాల నడుమ..
“నిజమా.. నిజమేనా చౌండనాయకా?” అన్నాడు పినచోడుడు.
నవ్వుతూ తల ఊపాడు చౌండసేనాని.
“యువ కాకతిప్రభువు గణపతిదేవులవారిది
సంకుచిత దృష్టి కాదు మహారాజా! దీర్ఘదృష్టి. కొత్త భావనలకు ఆస్కారమిచ్చే సరికొత్త దృక్కోణం. నేను వారి తండ్రిగారు మహాదేవులను, పెద్దతండ్రి రుద్ర
దేవులవారినీ చూశాను. వారి యుద్ధనీతి, రాజనీతి, సామంతులపట్ల విధానాలు చూశాను. కానీ, యువకులైన గణపతిదేవుల రాజనీతి ఎంతో వినూత్నం. ముందుచూపు కలది. ఇది తప్పక తెలుగు సామ్రాజ్యాన్ని నిర్మించడమే కాదు.. సస్యశ్యామలం చెయ్య
బోతున్నదని నా మనస్సు చెబుతున్నది..” అన్నాడు.
ఎన్నో యుద్ధాలలో ప్రత్యక్షంగా పాల్గొన్న మహా
సైన్యాధ్యక్షుడతను. అరివీర భయంకరులైన శత్రు రాజులను దునుమాడి వారి రాజనీతి వైశారద్యాన్ని, బేరసారాల ధోరణిని ఎదుర్కొన్నవాడు. అటువంటి చౌండుడు కూడా గణపతిదేవుని కొత్త దౌత్యభావనల పట్ల ఆశ్చర్యపోయాడు. అలా అని వాటికి పూర్తి సుముఖుడు కాదు. పూర్తి వ్యతిరేకీ కాదు. ఆ విధానాలను ఆకళింపు చేసుకుంటూ, ఆ రాజాజ్ఞలను పాటిస్తున్నాడు.
శ. సం. 1121 సిద్ధార్థి, చైత్రమాసం.
రాజ్యాభిషక్తుడయ్యాడు ఇరవై ఏళ్ల గణపతిదేవుడు.
అప్పటికి కాకతీయ రాజ్యం.. మహా సామ్రాజ్యంగా రూపు దాల్చలేదు. అతని పెదతండ్రి రుద్రదేవుని కాలానికి పీఠభూమి ప్రాంతమంతా కాకతీయుల అధీనంలోకి వచ్చేసింది. రుద్రదేవుడు కోస్తా తీరప్రాంతాల మీద దండెత్తినా పెద్దగా సాధించిందేమీ లేదు. కొందరితో స్నేహం, కొందరితో వివాహ బంధుత్వాలు ఏర్పడ్డాయి కానీ.. బలిష్ఠులైన వేంగి, కళింగ, వెలనాడు
తదితర రాజ్యాలు కాకతీయుల ఆధిపత్యాన్ని అంగీకరించలేదు. ఉత్తరాన ప్రతిష్ఠాన పాలకులపై చేసిన యుద్ధాలలోనే రుద్రదేవుడు, తండ్రి మహాదేవుడు కూడా మరణించారు.
మొదటి ఏడాది అంతా తనరాజ్యం లోపలి మండలాలు, సాంఘిక పరిస్థితులు, వ్యవసాయం, సహజ వనరులు, వృత్తులు, గ్రామ సమయాలు, వృత్తుల శెట్టిలు, విదేశీ వర్తక వాణిజ్యాలు, గుళ్లూ గోపురాలు, మతాలు, ప్రజల విశ్వాసాలు ఆకళింపు చేసుకోవడానికే వెచ్చించాడు గణపతిదేవుడు.
మరో ఏడాది.. ఈ బలిష్ఠులైన రాజ్యాలపై తమ ఎత్తుగడలు, భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలి అనే అంశంపై తన మంత్రిమండలి, రాజనీతి విశ్లేషకులు, యుద్ధ తంత్రజ్ఞులతో మేధోమథన శిబిరం నిర్వహించాడు. దాదాపు రెండుమాసాలు ఆ మేధోమథన శిబిరం కొనసాగింది. వాదోపవాదాలు, కూలంకష చర్చ జరిగాయి. చివరికి గణపతిదేవుని నాయకత్వాన
సాధించవలసిన ఏకైక ఆశయాన్ని రూపొందించారు.
‘కాకతీయ రాజ్యం పూర్తి సామ్రాజ్యరూపం ధరించాలి. ఆసేతుహిమాచలానికి మధ్యస్థంగా ఉన్న ఆంధ్ర భూభాగాన్నంతా ఏకంచేసి, తెలుగు సామ్రాజ్యం స్థాపించాలి. పర రాజ్యంవారే కాదు.. పర దేశీయులు, పర భాషీయులు, పర మతాలవారు కూడా కన్నెత్తిచూడలేని దుర్భేద్యమైన సామ్రాజ్యాన్ని నిర్మించి.. ‘అటు ఆర్యావర్తానికి, ఇటు దక్షిణాపథానికి మనమే వారధులం. కాబోయే భారత సారథులం!’ అని తెలియ
జెప్పాలి’ అని సదస్సు నిర్ణయం.
“తెలుగువారి రాజ్యం కాకతీయ సామ్రాజ్యం.. అది నా కల! మనం స్థాపించబోయే కాకతీయ సామ్రాజ్యం మన విధి విధానాలకు కట్టుబడి ఉండే విభిన్న సామంత మండలాల సమాహారంగా ఉండాలి. ప్రతి మండలంలోనూ మండలాధీశులు స్వతంత్ర ఆలోచనా విధానాలతో పాలన నిర్వహిస్తూ, మన సార్వభౌమత్వాన్ని అంగీకరించే వ్యవస్థ ఉండాలి..” అన్నాడు గణపతి
దేవుడు.
.. ఆ మాటలకు మంత్రాంగ ముఖ్యులంతా నిశ్చేష్టులయ్యారు. శత్రురాజుల తలలు నరికి, వాటితో కందుక క్రీడలాడి.. రాజ్య విస్తరణ చేసి మహావీరులుగా, చక్ర
వర్తులుగా చలామణి కావడమే గొప్పగా కీర్తించబడుతున్న వ్యక్తి.. ప్రస్తుత ప్రపంచ ధోరణిని వదిలేసి, స్వతంత్ర మండలాధీశులు.. సామ్రాజ్య నియమ
నిబంధనలకు కట్టుబడి ఉండటం..
ఈ ఆలోచనా ధోరణి వారికి చిన్నపిల్లల చేష్టగా అనిపించింది. వారు ఈ ఆలోచనా విధానాన్ని ఒప్పుకోలేదు. అలా అని పూర్తిగా తిరస్కరించనూ లేదు. ఆయన వాదనను మేధావులు కూడా కొంత ఆలోచించవలసిన అంశంగానే పరిగణించారు.
అయితే రాజ్యవిస్తరణ తక్షణ అవసరమని మేధో
మథన శిబిరంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. తొలుత సరిహద్దుల్లోని ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర రాజ్యాలపై మంత్రజ్ఞులు పూర్తి నివేదిక రూపొందించారు. ఈ నివేదికలను బట్టి ఉత్తరాన దేవగిరి యాదవులు ఉపేక్షా మాత్రులయ్యారు. ఈశాన్యంలో చాళుక్య చోళులు విచ్ఛిన్నమై అంతర్గత పోరులో ఉన్నారు. పశ్చిమాన హొయసలులు దూరాన ఉన్నారు. కాబట్టి మొదటగా దక్షిణ రాజ్యాలవైపు మొదలెట్టి.. తెలుగు మాట్లాడే సరిహద్దు రాజ్యాలన్నిటినీ జయించడమే లక్ష్యంగా యుద్ధభేరి మోగించాలని గణపతిదేవుని ప్రభుత నిర్ణయించింది.
బెజ్జవాడ ప్రధాన యుద్ధ స్థావరంగా సైన్యాలను మోహరించి అటు ధరణి కోట, దాని పరిసర కొండపడమటి రాజ్యం, చాగి, కొండవీడు, వెలనాడు, పలనాడు, పొత్తపినాడు, పాకనాడు, విక్రమసింహపురి నుంచి కింద కంచి వరకూ దృష్టిపెట్టి.. యుద్ధతంత్రం రూపొందించారు.
కాకతీయ రాజ్యానికి ఉన్న గొప్ప సంపద.. వీర
విధేయత కలిగి రణతంత్ర నిపుణులైన మహా సైన్యాధ్యక్షులు. కాకతి గుండ్యన శ. సం. 906 కాళయుక్తిలో స్థాపించినట్లు చెప్పే కాకతీయ సామ్రాజ్యం.. అనేకమంది మహాయోధుల కారణంగా ఇప్పటికీ
దుర్నిరీక్ష్యంగా ఉంది.
మహాదేవరాజును చంపి కుమారుడు గణపతిదేవుని బంధించి దేవగిరికి తీసుకుపోయిన మహారాజు జైతుగిని ఓడించి.. గణపతిదేవుని తిరిగి అనుమకొండలో రాజ్యాభిషిక్తుడిని చేసి, కాకతీయవంశాన్ని తిరిగి స్థాపించినవాడు.. ‘కాకతిరాజ్య సమర్థ’, ‘కాకతీయ రాజ్యభార ధౌరేయ’ బిరుదాంకితుడు.. మహాయోధుడు శ్రీ రేచర్ల రుద్రసేనాని.
కాకతిరాజ్యంలో రుద్రసేనాని స్థాయి విధేయులు కనీసం పాతికమంది ఉన్నారు. ఆ తర్వాతి స్థాయివాళ్లు దాదాపు వందమంది ఉన్నారు. వీరంతా నిర్దేశించిన రాజ్యాన్ని అవలీలగా సాధించి.. ఆ రాజ్యప్రభువు శిరస్సును బంతిలా ఆడుతూ తెచ్చి కాకతీయ సామ్రాట్టు పాదాలవద్ద ఉంచగలరు.
అలాంటి సైన్యాధ్యక్షులపై నమ్మకముంచి, వారి నాయకత్వాన తగిన సైనిక పటాలాలను ఏర్పరచి.. తాను అనుమకొండలోనే ఉంటూ అందరినీ, అన్నిటినీ సమన్వయపరుస్తూ.. యావత్ భారత రాజ్యాలన్నిటా వినిపించేలా యుద్ధశంఖం పూరించాడు కాకతీయ మహా మండలేశ్వరుడు గణపతిదేవుడు.
ముఖ్యంగా వెలనాడును జయించాలని ఆయన
పట్టుదలగా ఉన్నాడు. అది కాకతీయులకు కొరకరాని
కొయ్యలా ఉంది. గణపతిదేవుని పెదతండ్రి రుద్రదేవులు, తండ్రి మహాదేవులు కూడా సాధించలేకపోయిన రాజ్యమిది. ఆ రాజ్యం ప్రస్తుత పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ప్రభువైన శ్రీ పృథ్వీశ్వరుడి పరిపాలనపై పూర్తి సమాచారం సేకరించి, ఇదే అదనుగా భావించి వెలనాడును గెలిచే బాధ్యతను మహావీరుడు మల్యాల చౌండ సేనాని భుజస్కంధాలపై మోపాడు గణపతిదేవుడు. ఆయన నమ్మకాన్ని వందశాతం నిల
బెట్టాడు చౌండుడు. వెలనాడుతోపాటు ద్వీపాన్ని కూడా సాధించాడు.
కాకతీయ సైన్యం తిరుగు ప్రయాణ సన్నాహాల్లో ఉన్నవేళ.
కాకతీయ వీరులకు ఇచ్చే కానుకలు, గణపతిదేవుడి అంతఃపురానికి పంపవలసిన భూరి బహుమతుల ఏర్పాటులో ఉన్నాడు పినచోడుడు. అప్పుడే అక్కడికి వచ్చిన తమ్ముడు బ్రహ్మయ నాయకుడు.. ఒక పిడుగులాంటి వార్తను అన్న చెవిలో వేశాడు. అప్పటిదాకా తన రాజ్యం తన అధీనంలోనే ఉన్నదన్న ఆనందంలో ఉన్న పినచోడుడు.. ఆ వార్త వినగానే దిగ్భ్రమ చెందాడు.
ఏమిటా వార్త? ఎందుకా దిగ్భ్రమ? అసలేం జరిగింది?
(ఇంకా ఉంది)
-మత్తి భానుమూర్తి