తమ్ముడు కండ్లెదుటే చనిపోయాడు. అన్న హృదయం తల్లడిల్లింది. తోబుట్టువును కాపాడుకోలేక పోయాననే బాధ నీడలా వెంటాడింది. ఇలాంటి కష్టం ఇంకొకరికి రావద్దని సంకల్పించాడు. ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పించి ఎన్నో జీవితాలను కాపాడుతున్నాడు పృథ్వీరాజ్.
అది తమిళనాడు. తీవ్ర రోడ్డు ప్రమాదం జరిగింది. విరుధ్నగర్ జిల్లాలోని అరుప్పుకొట్టాయ్ గ్రామానికి చెందిన రాజేశ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. తల్లడిల్లుతూ అన్నాదురై పృథ్వీరాజ్కు ఫోన్ కాల్ చేశాడు. తాను చేరుకునే లోపు తమ్ముడిని హాస్పిటల్కి పంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ, మారుమూల ప్రాంతం కావడంతో వాహనాలు అందుబాటులో లేవు. అంబులెన్స్లుకూడా లేవు. డబ్బులు ముందే ఇస్తామన్నాకూడా ఒక్క వాహనమూ దొరకలేదు.
ప్రాణాలు కాపాడాలని..
పృథ్వీరాజ్ ఘటనా స్థలానికి చేరుకునే సమయానికి తమ్ముడు రక్తపు మడుగులో పడున్నాడు. తాను తీసుకెళ్లిన వాహనంలో హాస్పిటల్కు తరలించాడు. యాక్సిడెంట్ జరిగిన ప్రాంతం నుంచి హాస్పిటల్ 20 కిలోమీటర్లు. అప్పటికే ఆలస్యమైంది. మార్గమధ్యంలోనే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. తమ్ముడిని కాపాడుకోలేక పోయాననే బాధ పృథ్వీరాజ్ను వెంటాడింది. తన తమ్ముడిలాగా ఏ ఒక్కరి ప్రాణాలు పోవద్దని సంకల్పించాడు. తమిళనాడులోని మారుమూల గ్రామీణప్రాంతాల్లో సర్వే నిర్వహించాడు. సరైన సమయంలో వాహనం లభించక పేద, మధ్యతరగతి ప్రజల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నట్లు గుర్తించాడు. ఏదో ఒకటి చేసి, పేదల ప్రాణాలు కాపాడటం లక్ష్యంగా పెట్టుకున్నాడు.
50% జీతం సేవకే..
పదేండ్లు కష్టపడ్డాడు. 2011లో విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగం సంపాదించాడు. ప్రతి నెలా తన జీతం నుంచి 50శాతం సహాయ నిధిగా పోగు చేశాడు. కొంత మొత్తం జమయ్యింది. ఓ ఎన్జీవోను స్థాపించాడు. తొలుత ఆ నిధితో.. పేదలకు, మారుమూల ప్రాంతాల్లో ఉండేవారికి బ్రెడ్లు, బ్లాంకెట్స్, బట్టలు, మందులు పంచడం ప్రారంభించాడు. కానీ, వాటిద్వారానే పేదల ప్రాణాలు కాపాడలేమని గుర్తించాడు. తన దగ్గర ఉన్న డబ్బుతో రెండు అంబులెన్స్లు కొన్నాడు. విరుధునగర్నుంచి 40 కి.మీ. దూరంలోని హాస్పిటల్స్కు ఈ సేవలను వినియోగించేలా ప్రణాళిక సిద్ధం చేశాడు. అనతికాలంలోనే సత్ఫలితాలు కనిపించాయి. ఈ సేవల్ని మరింతగా విస్తరించాలనుకున్నాడు. మరో వాహనం కొనుగోలు చేశాడు. అప్పటికే నడుస్తున్న అంబులెన్స్ల నిర్వహణ ఖర్చు, ఇంధన వ్యయాలు భారీగా ఉండటంతో ఓ దశలో భరించలేని పరిస్థితి ఎదురైంది. దీంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపేందుకు నిధుల సేకరణ ప్రారంభించాడు. పృథ్వీ సమాజసేవ గురించి తెలుసుకున్న స్నేహితులు, బంధువులు తమ వంతు సాయం చేశారు.
వలంటీర్ వ్యవస్థ
ఒక్కడిగా ప్రారంభమైన పృథ్వీరాజ్ దురై సేవా ప్రయాణం ఇప్పుడు ఒక సమూహ శక్తిగా మారింది. కలిసి పనిచేసేందుకు వందలాది వలంటీర్లు ముందుకొచ్చారు. గతేడాది లాక్డౌన్ సమయంలో ఈ వలంటీర్ వ్యవస్థద్వారా అనేకమంది ప్రాణాలు కాపాడారు. డాక్టర్లుకూడా స్వచ్ఛంద సేవలందిస్తున్నారు. వాట్సప్ గ్రూప్లద్వారా వలంటీర్ల కార్యకలాపాలు జరుగుతాయి. ఎక్కడ ఏ అవసరమున్నా క్షణాల్లో వాలిపోతారు. గత 237 రోజులుగా నిత్యం పేదలకు ఆహార పంపిణీకూడా చేస్తున్నారు. ఇప్పటి వరకు పృథ్వీరాజ్కు 500 మంది దాతలు సహకరించారు. కరోనా వేవ్-2లో తమ అంబులెన్స్లద్వారా ఎంతోమందికి ప్రాణభిక్ష పెడుతూ, తన తమ్ముడిని నిత్యం స్మరించుకుంటున్నాడు పృథ్వీరాజ్ దురై. ‘నలుగురికి ఉపయోగపడితేనే మన జీవితం సార్థకం అయినట్టు. నేను, నా జీవితం అంటూ పరిధిని పరిమితం చేసుకుంటే మన బతుకును మనం ఇరుకిరుకు చేసుకున్నట్టే. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఓ దశలో పరివర్తన తలుపుతడుతుంది. నా విషయంలో అది నా తమ్ముడి మరణం కావచ్చు’ అంటూ తన జీవితంలోని మలుపులను ప్రస్తావిస్తాడు.
100 కిలోమీటర్ల వరకు..
పృథ్వీరాజ్తో కలిసి చదువుకున్న ఓ యువకుడు 2019లో క్యాన్సర్ బారిన పడ్డాడు. అతడు చికిత్స తీసుకునే హాస్పిటల్ 100 కి.మీ. దూరంలో ఉంది. కీమో థెరఫీకోసం, ఔషధాలకోసం తరచూ హాస్పిటల్కు వెళ్లాల్సి వచ్చేది. ఆ మిత్రుడు పృథ్వీసాయం కోరాడు. దీంతో తన సేవల పరిధిని విస్తరించాడు. పృథ్వీరాజ్ దురై సేవలగురించి మీడియా, సోషల్మీడియాద్వారా ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సేవకులు, వ్యాపారవేత్తలు తమ వంతు సాయం చేస్తున్నారు.