నూటొక్క జీవిత గాథలు
‘Literature is soul of history’ అంటారు పాశ్చాత్య సాహిత్యకారులు. ఉత్తమ తెలంగాణ కథకుల్లో ముందు వరుసలో ఉండే రచయిత కేవీ నరేందర్ కథలు చదివితే మనుషుల జీవితాలే అసలైన చరిత్ర అని ఒప్పుకోక తప్పదు. గత మూడు దశాబ్దాలుగా కేవీ నరేందర్ రాసిన కథల్లోంచి నూటొక్క కథలను ఎంపిక చేసి ‘కథమానం భవతి’ పేరుతో పాఠకులకు అందించారు. ఈ సంకలనంలోని కథలు గడిచిన యాభై ఏండ్లుగా తెలంగాణ పల్లెల్లో జరుగుతున్న మార్పులను ఒడిసిపట్టుకున్నాయి. నిజాం కాలంలో ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆచారాలు, సంస్కృతులు ‘1901 ఓ బలిదానం’, ‘1906 ఓ ప్రేమకథ’ లాంటి కథలు సజీవంగా చిత్రించాయి. ‘దొరుంచుకున్న దేవక్క’, ‘దొర మల్లచ్చిండు’ లాంటి కథలు గ్లోబలైజేషన్కి ముందు తెలంగాణ పల్లెల్లో పరిణామాల్ని చూపుతాయి. ప్రపంచీకరణ ఫలితంగా గ్రామాల్లో వచ్చిన మార్పులు, మారిపోయిన మానవ సంబంధాలతోపాటూ ప్రస్తుత ఐటీ, హైటెక్ యుగం జీవితాలు అన్నీ కూడా మనకు ఈ కథల్లో ఒక చారిత్రక పరిణామ క్రమాన్ని కండ్లకు కడతాయి.
తెలంగాణ కథల్లో మొదటి నుంచి వ్యక్తిగత అంశాల కన్నా సామాజిక సమస్యలే ఎక్కువగా వస్తువులుగా కనిపిస్తాయి. కానీ, కేవీ నరేందర్ కథల్లో ఇందుకు భిన్నంగా మానవ సంబంధాల పట్ల మొగ్గు చూపడం కనిపిస్తుంది. ఈ కథకునిలో కనిపించే మరో ప్రత్యేక లక్షణం పాత్రల్లో గుండెతడి. నడిపోడు, బర్రెలాంటి అరుదైన ఇతివృత్తాలతో కథలు రాసిన ఏకైక కథకుడు కేవీ నరేందర్. అనవసర వర్ణనలు, అవసరం లేని పాత్రలతో గందరగోళం లేకుండా సూటిగా కథ మాత్రమే చెప్పడంతో కథల్లోని క్లుప్తత పాఠకులను ఏకబిగిన చదివిస్తుంది. కథకుడిగా నరేందర్ చేసిన మరో ప్రయోగం సింగిల్ కాన్సెప్ట్ కథలు. ‘అమ్మ కథలు’, ‘నాన్న కథలు’, ‘యుద్ధ్దం కథలు’, ‘సిటీ కథలు’ లాంటి ఒకే కథాంశంతో నరేందర్ రాసిన కథలు తెలుగు కథా సాహిత్యంలో అరుదైన ప్రయోగం. కేవీ నరేందర్ అందించిన ఈ ‘కథామానం భవతి’ చదివిన పాఠకులు శతమానం భవతి అని తప్పక ఆశీర్వదిస్తారు.
కథమానం భవతి (నూటొక్క కథలు)
రచయిత: కె.వి. నరేందర్
పేజీలు:700, వెల: రూ. 900
ప్రతులకు: కె.శ్రీదేవి, జగిత్యాల, 81793 06464
ముక్కు తిమ్మన ముద్దు పలుకు
పారిజాతాపహరణం.. ఓ అద్భుత ప్రబంధం. నంది తిమ్మన హృదయక్షేత్రంలో విరిసిన నందివర్దనం! పేరుకు కృష్ణస్వామి కావ్యనాయకుడైనా సత్యాదేవి వయ్యారాలూ, వైభోగాల చుట్టూ కథంతా తిరుగుతుంది. నిజానికి సత్యభామ కోపాన్ని, తాపాన్నీ ప్రపంచానికి రసరమ్యంగా పరిచయం చేసింది ముక్కువారే. తెలుగువారి పంచమహాకావ్యాల్లో పారిజాతాపహరణానికి చోటివ్వకపోవడం పంచమహాపాతకమంత సాహితీ దుర్మార్గం! ముక్కు తిమ్మనార్యుల ముద్దుపలుకువల్ల కావచ్చు, కావ్యనాయిక సత్యాదేవి ఏడుపుకూడా ముద్దుముద్దుగానే ఉంటుంది. కథాశిల్పం, పాత్రపోషణ, సమయోచిత వర్ణనలు పండితుల్ని మెప్పిస్తాయి, పామరుల్నీ మైమరిపిస్తాయి. ఒకాకొక సందర్భంలో తెనాలి రామకృష్ణ కవి ఇలా అంటాడు.. ‘ఓ తిమ్మా! నీ కవిత్వంలోని ఠీవి మాలాంటి సామాన్యులకు ఎక్కడ అబ్బుతుంది? బావిలోని కప్పల్లాంటి మామీద నీ కవితా ఝరిని కురిపించవయ్యా’. ఆధునిక జీవితంలోని ఉరుకులు పరుగులతో అలసిపోయిన సామాన్య తెలుగు పాఠకులు కూడా తెనాలివారు చెప్పిన మానసిక స్థితినే అనుభవిస్తున్నారు. బాలాంత్రపు వేంకట రమణగారు బాధ్యత తెలిసిన పెద్దమనిషిగా అలతి అలతి పదాలలో ఈ కవితాఝరిని కురిపించారు. ఓ గొప్పకావ్యాన్ని సవివరంగా పరిచయం చేశారు. అందుకొని ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం! ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్సిజన్ తర్వాత, అంత అపురూపమైంది ఆనందమే కదా!
నంది తిమ్మనార్య విరచిత
పారిజాతాపహరణము (పరిచయం)
రచన: బాలాంత్రపు వేంకటరమణ
పేజీలు: 136 వెల: రూ. 150
ప్రతులకు: 8558899478
మన కవితా వైభవం
‘తెలంగాణ కవితా కల్హారాలు’ మన కవుల పరిచయ గ్రంథం. పాల్కురికి సోమనాథుడి నుంచి సి.నారాయణరెడ్డి వరకు.. దిగ్గజాల సాహితీ వైభవాన్ని అద్దంలా పట్టి చూపుతుంది. దేవతాస్తుతి చేయకుండా గురుస్తుతితో కావ్యాన్ని ప్రారంభించిన పాల్కురికి వారి ప్రత్యేకతను, పోతన కాలంలో దండయాత్రల కారణంగా ఏకశిలానగరి ప్రాభవాన్ని కల్పోయిన తీరును, ఒకానొక సందర్భంలో తీవ్ర అస్వస్థత నుంచి కోలుకొని వచ్చిన ‘అభినవ పోతన’ వానమామలై వరదాచార్యులు ఆత్మీయులతో ‘నేను పోతనా’ అంటూ హాస్యమాడిన ఘట్టం.. ఇలా పుస్తకంలోని పద్నాలుగు వ్యాసాలూ దేనికదే ప్రత్యేకం! భూమయ్య, భాస్కరయోగి, సుజాతారెడ్డి వంటి ప్రముఖుల వ్యాసాలు పుస్తకంలో ఉన్నాయి.
తెలంగాణ కవితా కల్హారాలు
ప్రధాన సంపాదకులు:ఎల్లూరి శివారెడ్డి
పేజీలు: 288; వెల: రూ.170
ప్రతులకు: తెలంగాణ సారస్వత
పరిషత్తు, హైదరాబాద్.
ఫోన్ : 040-24753724
తొలి కిరణాలు (జాతీయ కవన సంకలనం)
సమర్పణ: ఉదయ సాహితీ వేదిక
పేజీలు: 158, వెల: రూ.250
ప్రతులకు: బ్రహ్మయ్య ఆచారి 95813 57107
పోలయ్య కవి 91107 84502