‘ఫోర్బ్స్’ లిస్ట్లో చోటు లభించడం ఓ అరుదైన గౌరవం. మన సింగరేణి బంగారం సయ్యద్ హఫీజ్ ‘టాప్ – 100 డిజిటల్ స్టార్స్’లో 32వ స్థానం దక్కించుకుని.. రేపటి భారతానికి తెలంగాణ ప్రతినిధిగా నిలిచాడు. సాంకేతికతను సామాన్యులకు చేరువ చేస్తున్న ఆన్లైన్ స్వాప్నికుడుసయ్యద్ భాయ్ గురించి..
సామాజిక మాధ్యమాల ద్వారా నెటిజన్లను ప్రభావితం చేస్తున్న ప్రభావ శీలురైన సోషల్ ఇన్ఫ్లు యెన్సర్ల కథనాలతో ‘డిజిటల్ స్టార్స్’ పేరిట ఏటా ఓ జాబితాను విడుదల చేస్తుంది.. ఫోర్బ్స్ ప్రచురణ సంస్థ. అందులో భాగంగా విడుదలైన ‘టాప్-100 డిజిటల్ స్టార్స్’ లిస్ట్లో పెద్దపల్లి జిల్లా యైటింక్లయిన్ కాలనీకి చెందిన సయ్యద్ హఫీజ్ పేరు కూడా ఉంది. యూట్యూబ్లో అతను నిర్వహిస్తున్న ‘తెలుగు టెక్ టట్స్’కు ఈ గుర్తింపు లభించింది.
11 ఏండ్ల కష్టం..
సయ్యద్ హఫీజ్ తండ్రి సింగరేణి ఉద్యోగి. చదువు పూర్తయిన తర్వాత సయ్యద్ గోదావరి ఖనిలో కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ నడిపాడు సయ్యద్. 2011లో ‘Tech Tuts’ (టెక్ టట్స్) పేరుతో యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు. అధునాతన సాంకేతికతపై వీడియోలు రూపొందించి.. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటాడు. ముఖ్యంగా మార్కెట్లోకి కొత్తగా వచ్చే సెల్ఫోన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటాడు. కొత్తగా వచ్చిన ఫోన్లు, వాటి ఫీచర్ల గురించి అర్థమయ్యేలా వివరిస్తుంటాడు. కొత్త ఫోన్లను అన్బాక్స్ చేయడం, వాటి ధరలు, అధునాతన ఫీచర్లు, ఇతర ఫోన్లతో పోలికలు.. ఇలా తన వీడియోలో సమస్త సమాచారం ఉంటుంది. వినియోగదారులను అప్రమత్తం చేస్తూ, సైబర్ క్రైమ్ మీద కూడా విస్తృతంగా ప్రచారం కల్పించాడు. అలా, పదకొండేండ్లలో 16 లక్షల మంది సబ్స్ర్కైబర్లను సంపాదించుకున్నాడు. యూట్యూబ్ నుంచి నెలకు రూ.రెండు లక్షల దాకా ఆదాయం ఆర్జిస్తున్నాడు.
సోషల్ ఫాలోయింగ్..
సోషల్ మీడియా అభిమానులు ‘సయ్యద్ హఫీజ్’ పేరును ఒక్కసారైనా వినే ఉంటారు. సాంకేతికతపై అతనిచ్చే సలహాలు, సూచనలు పాటించే ఉంటారు. సయ్యద్ హఫీజ్ వీడియోలు యూజర్స్ ఫ్రెండ్లీగా ఉంటాయి. సగటు మనిషి సందేహాలకు కచ్చితమైన సమాధానాలు ఇస్తాయి. ఒక్క టెక్నాలజీ అనే కాదు.. సామాన్యులకు అవసరం అవుతుందనుకున్న ప్రతి విషయంపైనా దృష్టి పెడతాడు. వాటిపై లోతైన పరిశోధన చేస్తాడు. పుట్టుపూర్వోత్తరాలు.. వాటివల్ల జనాలకు కలిగే ప్రయోజనాలు కళ్లకు కడతాడు.
‘ఫోర్బ్స్ ఇండియా’ విడుదల చేసిన ‘డిజిటల్ స్టార్స్’ జాబితాలో.. ఎంతోమంది సోషల్ మీడియా స్టార్లు కనిపిస్తారు. వాళ్లంతా వివిధ రంగాలకు చెందినవారు. స్టాండప్ కమెడియన్లు మొదలు సామాజిక ఉద్యమకారుల వరకూ చాలామందే ఉన్నారు. అయితే, అందులో అధికశాతం ఇంగ్లిష్ కంటెంట్తో ఇచ్చేవారే. అధునాతన సాంకేతికతపై సామాన్యులకు ప్రాంతీయ భాషలో అవగాహన కల్పించడం హఫీజ్ ప్రత్యేకత. ఇదే.. తనను ఫోర్బ్స్ దృష్టిలో పడేలా చేసింది. సయ్యద్ వయసు ముప్పై ఏడు. రోజులో ఏ సమయంలో అయినా సగటున ఏడువేల మంది సయ్యద్ వీడియోలను వీక్షిస్తున్నట్టు అంచనా. ‘టెక్నాలజీ అంటే నాకు ప్రాణం. నా ఆలోచనలు ఎప్పుడూ దానిచుట్టే తిరుగుతుంటాయి. మార్కెట్లో ఏ కొత్త ఎలక్ట్రానిక్ పరికరం వచ్చినా.. లోతుపాతులు తెలుసుకునే వరకూ నిద్రపోను. ఆ ఆసక్తే నాకు ఇంత గుర్తింపు తీసుకొచ్చింది. ఈ ప్రయత్నంలో నా వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అంటాడు సయ్యద్ హఫీజ్.
మరికొందరు..
ఈసారి ఫోర్బ్స్ జాబితాలో మరో ఇద్దరు హైదరాబాదీలకూ చోటు దక్కింది. రోహన్ చక్రవర్తి ‘గ్రీన్ హ్యూమర్’తో లిస్ట్లోకి ఎక్కాడు. అతను పర్యావరణం, వాతా వరణంలో మార్పులు తదితర అంశాల మీద సున్నితమైన హాస్యంతో రచనలు చేస్తాడు. షోలు నిర్వహిస్తాడు. యాభై నాలుగో ర్యాంకు సాధించిన దేవరకొండ వరప్రసాద్ మాత్రం పక్కా టెక్కీ. ‘ప్రసాద్టెక్’ అనే యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నాడు. కొత్త గాడ్జెట్స్ గురించి, సరికొత్త టెక్నాలజీ గురించి తన చానల్లో వివరిస్తూ ఉంటాడు. ‘తెలుగువారికి సాంకేతికను పరిచయం చేయడమే నా లక్ష్యం’ అంటాడు దేవరకొండ.
…?మధుకర్ వైద్యుల