మనిషి చరిత్రకు మట్టిని మించిన సాక్ష్యం లేదు. ప్రతి పొరా ఓ అధ్యాయమే. తవ్వేకొద్దీ వైభవోజ్వలమైన గతం బయట పడుతుంది. అన్వేషించేకొద్దీ అలనాటి నాగరికత అర్థమవుతుంది. కొండలు గుండెల్లో దాచుకున్న సత్యాలు.. గుహల్లోని గుహ్యమైన రహస్యాలు..రాక్షసగూళ్లలో దాగిన వాస్తవాలు..మట్టిపెంకుల్లోని మార్మికతలు..రాతి పనిముట్లు చెప్పే ముచ్చట్లు..అనేకం, అపారం! అందులోనూ తెలంగాణ గడ్డ.. ప్రపంచ నాగరికతలకే నడకనేర్పిన చోటు. ఇక్కడ, రాకాసి బల్లులు సంచరించాయి. ఇక్కడ, ఆదిమ మానవులు నివాసం ఉన్నారు. ఇక్కడే బట్టకట్టారు. బతకడం నేర్చారు. కానీ,ఈ నిఖార్సయిన చరిత్రను నిజాయతీగా రాయడానికి వలస పాలకుల మనసొప్పలేదు. దీంతో, ఆంధ్రుల చరిత్రకు అనుబంధ అధ్యాయంగానే మిగిలిపోయింది తెలంగాణ వైభవం. మన కవులు మన కవులే కారట. మన వీరులు వీరులే కాదట. మన మూలాలు మనవే కాదంటూ.. శూలాల్లాంటి మాటలతో మనసుల్ని గాయపరిచారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణతో ఆ సాంస్కృతిక దోపిడికి కాలం చెల్లింది. నిన్నటి తప్పులను సరిచేయడానికి, మొన్నటి చరిత్రకు మెరుగులు దిద్దడానికి .. కొత్త చరిత్రకారులు పుట్టుకొచ్చారు. అలా అని, వీళ్లంతా విశ్వవిద్యాలయాల మహరాజ పోషకులేం కాదు. అతి సామాన్యులు. పట్టుదలే పట్టాగా, బృహత్తర బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారు. పాతను పసిగట్టడంలో వీరు మహా నేర్పరులు. వ్యక్తులుగా, బృందాలుగా చరిత్ర శకలాలను పోగేసే పనిలో తలమునకలై ఉన్నారు. ఎవరూ ప్రశ్నించలేనంత పక్కాగా..ఏ స్వార్థశక్తులూ వక్రీకరించలేనంత బలంగా..తెలంగాణ చరిత్రను తిరగ రాస్తున్నారు.రాళ్లపెంకులూ, రాతిగుహలే ప్రపంచంగా బతికే ఆ పౌర చరిత్రకారులలో కొందరి పరిచయం..
నడిచే పుస్తకం.. శ్రీరామోజు హరగోపాల్
నాటి పాలకుల నిర్లక్ష్యనిర్లిప్తతల కారణంగా మరుగున పడిపోయిన చరిత్రను వెలికి తీస్తున్న ‘కొత్త తెలంగాణ చరిత్ర బృందం’లో కీలకవ్యక్తి శ్రీరామోజు హరగోపాల్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు హరగోపాల్ స్వస్థలం. బాల్యంలో ‘అనగనగా ఓ రాజు..’ కథలతో చరిత్రపై ఆసక్తిని పెంచుకున్నారు. 1979లో జరిగిన ఓ సంఘటన ఈ ఉపాధ్యాయుడిని చరిత్ర అన్వేషకుడిని చేసింది. చాడ గ్రామంలో పనిచేస్తున్న సమయంలో.. మద్రాస్నుంచి వచ్చిన ఓ చరిత్రకారుడు, స్థానిక మెట్లబాయి దగ్గర శాసనాన్ని అచ్చు తీసుకుంటున్న దృశ్యం హరగోపాల్ను ఆకట్టుకుంది. శాసనాలను ఎలా అచ్చు
తీయాలో, అందుకు ఎలాంటి పనిముట్లు కావాలో అడిగి తెలుసుకున్నారు. అప్పటినుంచీ చరిత్రను వెతికే పనిలో పడ్డారు. స్వగ్రామం నుంచే చరిత్ర అన్వేషణ మొదలైంది. ఆ ఫలితంగా ‘ఆలేటి కంపణం-కొన్ని చారిత్రక ప్రదేశాలు’ పేరుతో ఓ పుస్తకం రాశారు.
సరికొత్త ఆధారాలతో
2013లో ‘తెలంగాణ జాగృతి సంస్థ’ చరిత్ర విభాగంలో చేరారు హరగోపాల్. అప్పటి నుంచి చారిత్రక ప్రదేశాలను సందర్శించడంతోపాటు సరికొత్త ఆధారాలతో తెలంగాణ చరిత్రను రాసే పనిలో భాగస్వామి అయ్యారు. నాలుగు వందలకుపైగా గ్రామాలు, నగరాల్లో చారిత్రక యాత్రలు చేపట్టారు. భూపాలపల్లి జిల్లా మైలారం సమీపంలోని నల్లగుట్టల్లో 50కిపైగా సున్నపు గుహలకు తెలంగాణ చరిత్రలో చోటు కల్పించారు. కొమరం భీం జిల్లా కెరమెరి సమీపంలోని శంకర్లొద్ది ప్రాంతంలోని ‘కపిలాయ గుహల’ ప్రాధాన్యాన్ని ప్రపంచానికి వివరించారు. దేవునిగుట్ట మీది ఆలయాన్ని మొట్టమొదటిసారిగా ఆంగ్కర్ వాట్ గుడితో పోల్చిందీ హరగోపాలే. పరడలోని నాగముచుళింద శిల్పాన్ని, శాసనాన్ని, అక్కడి గుట్టమీద బౌద్ధస్తూపాల ఆనవాళ్లను గుర్తించారు.
జనగాం జిల్లా కొన్నె గజగిరిగుట్ట మీద, రాయగిరి చెరువు సమీపంలో, రాయగిరి మల్లన్నగుట్ట మీద బౌద్ధస్తూపాలను వెలికితీశారు. అనేక జైనశిల్పాల ప్రాధాన్యాన్ని అక్షరబద్ధం చేశారు. సైదాపురం మల్లన్నగుట్ట మీద భద్రాచల రామునికన్నా ముందటి సీతారాముల శిల్పాలను గుర్తించారు. సంబంధిత శాసనాలనూ అన్వేషించారు. ఖిలా వరంగల్ శిథిలాలపైనా లోతైన అధ్యయనం చేశారు. కాకతీయ తోరణ ద్వారాలమీద 12 సూర్యుళ్లు, గణపతి, లక్ష్మీదేవి మూర్తులను గుర్తించారు. అనేక రాతిచిత్రాల గురించి చాటిచెప్పారు. చరిత్ర గతిని మలుపు తిప్పే అనేక శాసనాలనూ వెలికితీశారు. వందకుపైగా వీరగల్లులను గుర్తించారు. హరగోపాల్ అన్వేషణలో సామ్రాజ్ఞి రుద్రమకు సంబంధించి అనేక కొత్త విషయాలూ వెలుగుచూశాయి. రుద్రమదేవి మరణకాల నిర్ణయ శాసనాలమీద పరిశోధన చేసి.. రెండు కొత్తశాసనాలను అందులో ప్రస్తావించారు. రుద్రమదేవి గణపతిదేవుడి పెద్దకూతురేనని చెప్పే ‘రెడ్లవాడ శాసనాన్ని’ ఈయనే పరిష్కరించారు.
శాసనాల వేటగాడు చొల్లేటి శ్రీనివాస్
వరంగల్ జిల్లా పట్కాల చొల్లేటి శ్రీనివాస్ స్వగ్రామం. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. ప్రవృత్తి రీత్యా తెలంగాణ చరిత్ర ప్రేమికుడు. ఎక్కడికి వెళ్లినా, కండ్లన్నీ చరిత్ర మూలాలపైనే. ఏ శిథిల శిల్పమో కనిపిస్తే టక్కున ఆగిపోతారు. పర్యావరణం అన్నా ప్రాణమే. పురావస్తు శాఖ అధికారుల సాయంతో, గత వైభవాన్ని వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కొత్తకొండ గ్రామంలోని ఒడ్డిగుట్టపై నవీన శిలాయుగపు ఆదిమ మానవుడి ఆనవాళ్లను గుర్తించారు. ఇదే ప్రాంతంలో ఆయుధాలను సానబెట్టేందుకు వాడిన వందకుపైగా బద్దులను కనుగొన్నారు. కొత్తకొండ గుట్టల్లోని ‘ఇల్లరగుండు’ గుహలో ఆదిమ మానవులు ఈటెలకు వాడిన సన్నని రాతి ఆయుధాలను గుర్తించారు. భూపాలపల్లి జిల్లాలోని నయాన గుహాలయం, మైలారం గుహలు శ్రీనివాస్ వెలుగులోకి తెచ్చినవే. ములుగు జిల్లాలోని గడీలగుట్ట వెనక కథల్నీ లోకానికి చాటి చెప్పారు. ముస్తాఫాపూర్ శిలాశాసనం తన కృషితోనే రికార్డులకెక్కింది.
ఆధారాల కట్ట కట్టా శ్రీనివాసరావు
గుడికి వెళ్తే ఎవరైనా దేవుడిని దర్శించుకుంటారు. శఠగోపం పెట్టించుకుంటారు. తీర్థ ప్రసాదాలు తీసుకొని, వచ్చిన దారినే వెళ్లిపోతారు. కట్టా శ్రీనివాసరావు గణపేశ్వర ఆలయ సందర్శన మాత్రం అతడిలోని మూడోకన్నును తెరిపించింది. చరిత్ర జిజ్ఞాసిగా మార్చింది. శ్రీనివాసరావు స్వస్థలం ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి. ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 1998లో మిత్రుడితో కలిసి కూసుమంచి గణపేశ్వరాలయాన్ని సందర్శించారు. అక్కడి శిల్పకళకు ముగ్ధులై, ఆలయ నిర్మాణంపై పుస్తకం రాశారు. ఆ ప్రయత్నంలో అనేక చారిత్రక విషయాలను అధ్యయనం చేశారు. ఆ తర్వాత, చరిత్ర అన్వేషణపై మక్కువ పెంచుకొని, పరిశోధనలను విస్తృత పరిచారు. తన బ్లాగుద్వారా ‘అంతర్లోచన’ పేరుతో అనేక చారిత్రక విషయాలను ప్రపంచానికి తెలియజెప్పారు. హైదరాబాద్ నగరంలోని వీధులపేర్ల వెనకున్న కథలు, అరుదైన ఫొటోలను సేకరించారు. నాగులవంచ గ్రామంలో రెండు డచ్ మొమెంటమోరీ శాసనాలు గుర్తించారు. ఇక్కడ డచ్వారి ఆవాసాలు ఉండేవని నిర్ధారించారు. నాగులవంచ ఒకప్పుడు వర్తక, వాణిజ్య కేంద్రంగా విలసిల్లిందని నిర్ధారించారు. చారిత్రక, సామాజిక, ఆర్థిక కోణాలలో.. తెలంగాణ అలనాటి చరిత్రను కండ్లకు కట్టే నేలకొండపల్లి శాసనం, రాజేశ్వరపురం శివాలయ శాసనం, చొప్పకట్లపాలెం శాసనం, గణపేశ్వరాలయ రెండో శాసనం, సంకీసపురం తామ్రశాసనం వెలికితీశారు. పాల్వంచ అడవుల్లోని ఒంటిగుండు రాతిచిత్రాల ప్రాధాన్యాన్ని చాటిచెప్పారు. అలనాటి రాతి పనిముట్లు, పురాతన నాణేలు, వృక్షజంతు శిలాజాలను సేకరిస్తున్నారు.
శిలాజాల శోధకుడు సముద్రాల సునీల్
చరిత్ర అంటే శాసనాలు, నాణాలు, శిల్పాలు, శిథిల సౌధాలు అని మాత్రమే అనుకుంటాం. కానీ నాగరిక పుట్టకముందు, భాష తెలియక ముందు, మనిషి ఉనికే లేని సమయం నుంచీ అసలు సిసలు చరిత్ర మొదలవుతుంది. దాన్ని వెలికి తీయడమే తన బాధ్యతని అంటారు సముద్రాల సునీల్. తన స్వస్థలం పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట. ప్రస్తుతం మంథని జేఎన్టీయూహెచ్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. బేగంపేట సమీపంలోనే చారిత్రక రామగిరి ఖిల్లా ఉంది. బాల్యంలోనే ఆ కోట గుండెలోతులు తెలుసుకోవాలన్న ఆరాటం మొదలైంది. ఆ కుతూహలం కొద్దీ గోదావరి, ప్రాణహిత పరీవాహక ప్రాంతాల్లోని అనేక శిలాజాలను కనుగొన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో కోట్ల సంవత్సరాల క్రితం జీవించిన జీవరాశులపై పరిశోధనలు చేస్తున్నారు.
రామగుండం ప్రాంతంలో చేప శిలాజాలను గుర్తించారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లిలో రాక్షసబల్లుల ఎముకలు, దంతాల శిలాజాలు కనుగొన్నారు. పలు ప్రాంతాల్లో వృక్ష శిలాజాలను గుర్తించారు. మహారాష్ట్రలోని సిరివంచ వద్ద రాక్షసబల్లి డంగు ఉందన్న విషయాన్ని పురాతత్త్వ అధికారుల దృష్టికి తెచ్చారు. మంచిర్యాల జిల్లా జయపూర్ శివారులో సమ్మక్క దేవతగా కొలుస్తున్నది.. సాక్షాత్తు ఓ జంతువు వెన్నుపూస శిలాజమేని వెలుగులోకి తెచ్చారు. ‘దీనిపై జీఎస్ఐ వారు స్పష్టమైన పరిశోధనలు చేస్తే బాగుంటుంది. ఒకవేళ అది మానవుడి వెన్నుపూస శిలాజమే అయితే, అత్యంత ప్రాచీన మానవ అవశేషాలు తెలంగాణలోనూ ఉన్నాయన్న వాస్తవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వాళ్లమవుతాం’ అంటారు సముద్రాల సునీల్.
శిథిలాల చెలికాడు కొలిపాక శ్రీనివాస్
శ్రీనివాస్ జీవితంలో చరిత్ర ఓ భాగం. బాల్యంలో చారిత్రక శిథిలాలతో ఆడుకున్నారు. మృణ్మయ పాత్రలతో కబుర్లు చెప్పుకొన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూర్ తన స్వగ్రామం. తనది వ్యవసాయ కుటుంబం. పొలంలో దుక్కి దున్నుతున్నప్పుడో, బావి తవ్వుతున్నప్పుడో కుండ పెంకులూ, చిన్నచిన్న విగ్రహాలూ దొరికేవి. వాటి వెనుక ఏదో కథ ఉన్నట్టు అనిపించేది. అదేమిటో కనిపెట్టాలనే ఉత్సుకత కొద్దీ జాగ్రత్తగా దాచి పెట్టుకునేవారు. ఆ జిజ్ఞాసే అతడిని ప్రవృత్తిరీత్యా చరిత్రకారుడిని చేసింది. ఒకరోజు తన పొలంలో దొరికిన పెండెంట్ను ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ హరగోపాల్ చూసి, శ్రీనివాస్ను సంప్రదించారు. పూర్తి వివరాలు తెలుసుకొన్నారు. అప్పటికే చరిత్రమీద ఆసక్తి ఉన్న శ్రీనివాస్, తన గ్రామం నుంచే చరిత్రాన్వేషణ ప్రారంభించారు.
చుట్టుపక్కల గ్రామాల్లోనూ పర్యటిస్తూ, ఆయా ప్రాంతాల విశేషాలు తెలుసుకోవడం మొదలు పెట్టారు. నంగునూరు మండలం నర్మెటలో పంచకూటాలయం మీద పెద్ద అధ్యయనమే చేశారు. అరుదైన వేట వీరగల్లును గుర్తించారు. నంగునూరులో మెసపటోమియా నాగరికతను గుర్తుకుతెచ్చే టెర్రకోట ఎద్దు తలను వెలికితీశారు. జైన బసది ఆనవాళ్లను కనుగొన్నారు. తను వెలుగులోకి తెచ్చిన మూడు సింహాలతో ఉన్న వర్ధమాన మహావీరుడి అధిష్టానపీఠం కూడా అరుదైనదే. రావిరూకులలో సరస్వతీ దేవాలయాన్ని వెలికితీశారు. కొత్తరాతి యుగం నాటి రాతి గొడ్డళ్లు, ఇనుప యుగం నాటి బాణం ములికి, టెర్రకోట పూసలు, బొమ్మలు, పెండెంట్లు, తూకం రాళ్లు తన సేకరణలో అనేకం.
‘ఆదిమ’ పరిశోధకుడు రెడ్డి రత్నాకర్ రెడ్డి
ఆదిమ మానవుల ఆనవాళ్లను గుర్తిస్తూ ‘డిస్కవర్ మ్యాన్’గా, నిత్యం గుట్టలను ఎక్కడం వల్ల ‘హిల్ మ్యాన్’గా గుర్తింపు పొందారు రెడ్డి రత్నాకర్ రెడ్డి. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలోని గంగిపెల్లి రత్నాకర్ స్వస్థలం. తండ్రి బుచ్చిరెడ్డి నుంచి చరిత్ర అన్వేషణను వారసత్వంగా స్వీకరించారు. 1995లో స్వగ్రామంలో తన తొలి చారిత్రక పరిశోధనను చేపట్టారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఆదిమ మానవుల జీవన విధానాలపై పరిశోధనలు చేస్తున్నారు. 2010-11లో జనగామ ప్రాంతంపై విస్తృతంగా పరిశోధించారు. జనగాం జిల్లాలోని 120 గ్రామాల్లో శిలాయుగపు మనుషుల ఉనికిని గుర్తించారు. ఇందులో 100కు పైగా గ్రామాల్లో రాకాసిగూళ్లు, 60 నిలువు రాళ్లు, ఆరు మానవాకృత శిల్పాలు, 30 గుట్టలపై డోల్మైన్ రకపు సమాధులతోపాటు వివిధ కాలాలకు చెందిన 20 శిలాచిత్ర లేఖనమున్న గుట్టలను రికార్డు చేశారు. 40 గ్రామాల్లో కొత్త రాతియుగం నాటి పనిముట్ల కార్ఖానాలను కనుగొన్నారు. 15 గ్రామాల్లో మధ్యశిలా యుగపు సూక్ష్మరాతి పనిముట్లతోపాటు బూడిద సమాధులనూ గుర్తించారు. రెండు చిత్రలేఖన గుహలను ప్రపంచానికి చూపించారు. సుమారు 30 కి.మీ.ల పొడవైన ఏనే గుట్టపై కాలినడకన విస్తృత పరిశోధన చేశారు. అనేక చారిత్రక ఆధారాలను సేకరించి, జనగామలోని స్వగృహాన్నే మ్యూజియంగా మార్చేశారు. ఇందులో శిలాయుగం నాటి అన్ని దశలకు సంబంధించిన రాతి పనిముట్లు, మృణ్మయ పాత్రలు, టెర్రకోట బొమ్మలు, దంతపు పూసలు, గాజులు, మూసలు అనేకం.
నిజాలు ‘సమాధి’ కాకుండా..రాగి మురళి
పాత్రికేయుడికైనా, చరిత్రకారుడికైనా ముందుగా ఉండాల్సింది చారిత్రక స్మృహ. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం పజ్జూరు గ్రామానికి చెందిన రాగి మురళికి బాల్యం నుంచీ చరిత్ర అంటే ఇష్టం. పాత్రికేయ వృత్తిలోకి వచ్చినా, ఆ ఇష్టాన్ని విడవలేదు. తెలంగాణ ఏర్పాటు తర్వాత పురావస్తుశాఖ అధికారులు మురళి స్వగ్రామమైన పజ్జూరు పాటిగడ్డలో తవ్వకాలు చేపట్టారు. విధి నిర్వహణలో భాగంగా నిత్యం తవ్వకాలకు సంబంధించిన వార్తలను రిపోర్ట్ చేసేవారు. ఈ క్రమంలోనే పురావస్తుశాఖ అధికారులతో స్నేహం కుదిరింది. చరిత్రపై నిత్యం చర్చలు జరిగేవి. భూగర్భం ఎవరూ రాయని ఓ చరిత్ర పుస్తకం అన్న విషయం అతడికి అర్థమైంది. అప్పుడే, సూర్యాపేట జిల్లా నెమ్మికల్ గ్రామంలో గుండ్రంగా పేర్చిన రాళ్ల నిర్మాణాలు గుర్తుకొచ్చాయి. వెంటనే అక్కడికి వెళ్లి పరిశోధనలు చేశారు. అలాంటి రాకాసి గూళ్లు చుట్టుపక్కల గ్రామాల్లో భారీసంఖ్యలో ఉన్నట్లు గుర్తించారు. నెమ్మికల్ సమీపంలోని కందగట్ల, నూతనకల్, పాత సూర్యపేట, చక్రాయిగుట్ట, గట్టికల్లు, ఆత్మకూర్ (ఎస్) గ్రామాల్లో ఆదిమ మానవుల సమాధులను, రాతి పనుముట్లనూ కనుగొన్నారు. పెన్పహాడ్లోనూ తొలి చారిత్రక యుగపు ఆనవాళ్లను గుర్తించారు. ఎర్రగడ్డల గూడెంలో 50 పెద్ద గండ్రశిలలతో నిర్మించిన ఆదిమ మానవుడి సమాధిని గుర్తించారు. కట్టంగూర్ మండలం పరడ గ్రామంలో బౌద్ధానికి సంబంధించిన ‘నాగముచిలిత’ అనే అరుదైన ఐదు పడగల లైమ్ స్టోన్ విగ్రహాన్ని వెలుగులోకి తెచ్చారు.
కాకతీయుల వీరాభిమాని అరవింద్ ఆర్య
అరవింద్ ఆర్య.. మరుగున పడ్డ తెలంగాణ చారిత్రక వైభవాన్ని వెలికితీస్తున్న యువకిరణం. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని శివాజీనగర్ అరవింద్ స్వగ్రామం. చిన్నప్పటి నుంచే పురాతన కట్టడాలు, చారిత్రక ప్రదేశాలంటే అపారమైన ఆసక్తి. ఆ ఇష్టమే వరంగల్ జిల్లాలోని చారిత్రక ప్రాంతాలకు లాక్కొని వెళ్లింది. ములుగు జిల్లాలోని ‘దేవునిగుట్ట ఆలయం’ గురించి అరవింద్ రాసిన కథనాలు విదేశీ పురావస్తు శాస్త్రవేత్తలనూ ఆకర్షించాయి. వారు భారతదేశానికి వచ్చి, ఆ కట్టడాన్ని సందర్శించేలా చేశాయి. పలువురు విదేశీ పురాతత్త్వ శాస్త్రవేత్తలతో కలిసి ఆ కట్టడం గురించి పరిశోధనలు చేస్తున్నాడీ యువకుడు. ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు కొండప్రాంతంలో 7 కి.మీ. పొడవున్న పురాతన గోడను గుర్తించారు. వరంగల్ అర్బన్ జిల్లా శివనగర్లో మరుగున పడిపోయిన కాకతీయుల కాలంనాటి మెట్లబావిని వెలుగులోకి తెచ్చాడు. రెడ్లవాడ, గుడి తండా, నరసింహస్వామి దేవాలయ శాసనాలను పరిష్కరించాడు. దీనిద్వారా తెలంగాణ చరిత్రకు సంబంధించి ఎంతో సమాచారం వెలుగులోకి వచ్చింది. కాకతీయులంటే అరవింద్కు తగని మక్కువ. దేవుడిగుట్ట, ఫణిగిరి, వరంగల్ కోట, నైనగుళ్లు, సర్వతోభద్ర దేవాలయం లాంటి చారిత్రక కట్టడాలపై అధ్యయనం చేశాడు. వరంగల్ జిల్లాలోని బృహత్ శిలాయుగం నాటి సమాధులపై పరిశోధన చేశారు. కాకతీయుల వారసులతోనూ తనకు సత్సంబంధాలు ఉన్నాయి. కాకతీయానంతర చరిత్రపై మన ఊహకందని విషయాలను వెలికితీసే పనిలో ఉన్నాడు.
‘చారిత్రక’ స్నేహం సామలేటి మహేష్, అహోబిలం కరుణాకర్
నిజమే, ఒకనాడు ఓ వెలుగు వెలిగిన ఆలయాలు నేడు బాతాఖానీలకు అడ్డాలుగా, పేకాట శిబిరాలుగా మారుతున్నాయి. సిద్దిపేటకు చెందిన సామలేటి మహేష్, అహోబిలం కరుణాకర్ కూడా తమ ఇంటికి దగ్గరల్లోని కాకతీయుల ఆలయాల మొండిగోడలమీద కూర్చుని కబుర్లు చెప్పుకున్నవారే. ఎన్ని విషయాలు మాట్లాడుకున్నా చివరికి ఆ గుళ్లోని అద్భుత శిల్పాలపైనే చర్చ జరిగేది. క్రమంగా వాటి చరిత్ర తెలుసుకోవాలనే ఆసక్తి ఏర్పడింది. ఇద్దరూ కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చారిత్రక ప్రదేశాలను సందర్శించారు. వారానికి ఒకరోజు, ఏదో ఒక గ్రామానికి వెళ్లి పరిశోధనలు చేసేవారు. ఆదిమ మానవుడి ఆనవాళ్లు మొదలుకొని జైనం, బౌద్ధం, శైవం, వైష్ణవం.. ఇలా అన్ని కోణాలనుంచీ చరిత్రను తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. మెదక్ జిల్లా వేల్పుగొండతోపాటు మాచారెడ్డి సమీపంలోని ఎల్లంపేటలో రాతిచిత్రాల గురించి అధ్యయనం చేశారు. ఇల్లంతకుంటలోని అరుదైన భైరవుడి విగ్రహాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. సిద్దిపేట జిల్లా పుల్లూరులో జైనమందిరం ఆనవాళ్లను కనుగొన్నారు. నంగునూర్ మండలం పాలమాకులలో ఆదిమ మానవుల సమాధులను గుర్తించారు. సిద్దిపేట శివాలయంలో తాంత్రిక భైరవుడి విగ్రహాన్ని ఆధారంగా చేసుకుని.. తెలంగాణలో ఓ దశలో ‘తాంత్రిక శైవం’ విలసిల్లిన విషయాన్ని చరిత్రకారులకు గుర్తు చేశారు. పురాతన నాణాలు, ఆదిమ మానవులు ఉపయోగించిన రాతి పనిముట్లు, కుండపెంకులు, మట్టిపూసలు అనేకం సేకరించారీ ఇద్దరు మిత్రులు.
వీరితోపాటు..
వీళ్లే కాదు. ఇప్పటి వరకూ వెలుగు చూడని అనేక చారిత్రక విశేషాలను బాహ్య ప్రపంచానికి చాటిచెప్పిన పరిశోధకులు మరికొందరు ఉన్నారు. తమ పరిశోధనలద్వారా అనేక ఆవిష్కరణలు చేశారు. చరిత్ర అన్వేషణలో విశేష కృషికి తెలంగాణ ప్రభుత్వం నుంచి సన్మానాలూ, సత్కారాలూ అందుకున్నారు.
వేముగంటి మురళీ కృష్ణ
సిద్దిపేట జిల్లా వాసి మురళీ కృష్ణ, పలు గ్రామాల్లో రాతిచిత్రాలను గుర్తించారు. ఎడతనూర్ గ్రామంలో భారీరాళ్ల సమాధులను కనుగొన్నారు. వేలుపుగొండ తుంబేశ్వరాలయంలోని పురాతన విగ్రహాలపై పరిశోధనలు చేస్తున్నారు.
బుగ్గుల శంకర్రెడ్డి
మెదక్ జిల్లాకు చెందిన శంకర్రెడ్డి, మంజీర పరీవాహక ప్రాంతాల్లో విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటివరకూ 25 రాతిచిత్రాలను గుర్తించారు.
ఎంఏ శ్రీనివాసన్
అలుపెరుగని అన్వేషకుడు ఎంఏ శ్రీనివాసన్. వీరిది హైదరాబాద్. మెదక్జిల్లా నాగసానిపల్లితోపాటు సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్ గ్రామంలో పలు చారిత్రక ప్రదేశాలను గుర్తించారు.
బలగం రామ్మోహన్
బాసరలోని పలు పురాతన శాసనాలను వెలుగులోకి తెచ్చారు రామ్మోహన్. నిర్మల్ జిల్లా బాసర వీరి స్వస్థలం. ఇక్కడి పాపహరేశ్వరం ఆలయంలోని శాసనాలు, పురాతన విగ్రహాలపై పరిశోధనలు చేస్తూ, అనేక చారిత్రక అంశాలను గుర్తించారు. తుమ్మ దేవల్రావ్ నిర్మల్జిల్లాకు చెందిన దేవల్రావ్, పురాతన శాసనాలు, విగ్రహాలతోపాటు భారీరాళ్ల సమాధులను కనుగొన్నారు. నిర్మల్జిల్లా కేంద్రంగా పరిశోధనలు నిర్వహిస్తున్నారు.
దడిగ సంతోష్
తెలంగాణలో బౌద్ధానికి తొలి అడుగులుగా భావిస్తున్న బావాపూర్ కుర్రు గ్రామంలో, స్తూపాన్ని గుర్తించారు నిర్మల్ జిల్లాకు చెందిన సంతోష్. దీంతోపాటు భారీ సమాధులు, ఆదిమ మానవులకు చెందిన పనిముట్లనూ కనుగొన్నారు.
ముచ్చర్ల దినకర్ రావు
మహబూబ్నగర్ జిల్లాకు చెందిన దినకర్రావు పలు శాసనాలు, పురాతన విగ్రహాలను కనుగొన్నారు. ‘పాలమూరు దర్శనం’ పేరుతో పుస్తకం రాశారు.