చారిత్రక కాల్పనిక నవల జరిగిన కథ : అనుమకొండలోని ఓ జైనబసది గ్రంథాలయం. ఏదో గ్రంథాన్ని పరిశీలిస్తున్నాడు జాయపుడు. సంధ్య చీకట్లు కమ్ముకుంటుండగా.. తనను కలిసేందుకు అక్కడికి వచ్చాడు పుళిందపుడు. అలా నడుస్తూ మాట్లాడుకుందామని.. బయటికి వచ్చారు ఇద్దరూ. జాయపుని నాట్యాభ్యాసం గురించి అడిగాడు పుళిందపుడు. గురుకులంలో కొత్త నాట్యాలపై జరుగుతున్న పరిశోధనలు చెబుతూ నడుస్తున్నాడు జాయపుడు. అప్పటికే చీకట్లు మరింత చిక్కబడ్డాయి.
జాయపుడు చూసుకోలేదు గానీ.. ఇద్దరూ ఓ సన్ననిడొంక బాటలోకి వచ్చారు. చీకట్లు గాఢమవుతుండగా అప్పుడే అక్కడక్కడా వీధిదీపాలు వెలిగిస్తున్నారు నగర నియోగ ఉద్యోగులు.
అప్పుడో పదిమంది బలాఢ్యులు జాయపుణ్ని హఠాత్తుగా చుట్టుముట్టారు. ఒకడు నోరుమూస్తే.. మరొకడు నడుము పట్టాడు. ఇంకొక ఇద్దరు ఎత్తుకున్నారు. అప్పుడే ఒకడు కళ్లకు నల్లగుడ్డను చుట్టాడు. ఇంకొకడు నోటికి మరోగుడ్డను చుట్టాడు. మరి లిప్తకాలంలో ఎత్తి ఓ గుర్రపుబండిలో పడేశారు. బండి వేగంగా కదిలింది.
ఏమాత్రం ఊహించని సంఘటన.. మరో రెండు లిప్తల కాలంలో కుదురుకున్నాడు జాయప. ఎవరో తనను బంధించారు. పుళిందపుడు వచ్చి బయటికి తీసుకురావడం.. అదీ చీకటిపడే వేళకు వచ్చి సన్నని డొంకలోకి నమ్మకంగా నడిపించడం.. ఏమరుపాటున ఉన్న తనను దుండగులు బంధించి ఎటో తీసుకుపోవడం.. లిప్తల కాలంలోనే అన్నీ వరుసక్రమంలో సరిచూసుకున్నాడు.
కళ్లకు గంతలు కడుతున్నప్పుడే మరో దృశ్యం గోచరమయ్యింది. అది.. తన పక్కన నడుస్తున్న పుళిందపుడు జాగ్రత్తగా పక్కకు తొలగడం. అతణ్ని ఎవ్వరూ ఏమీ చేయకపోవడం. తనను తీసుకుపోతున్న బండిలో పుళిందపుడు లేకపోవడం..
బండి గతుకులబాట వెంట వేగంగా పోతున్నది.గాఢంగా ఊపిరిపీల్చి వదిలాడు. ఇది ఎవరో ప్రణాళిక ప్రకారం చేశారు. వారికి పూర్తి సహకారం అందించినవాడు పుళిందపుడు. సందేహం లేదు. ఇది రాజనగరి పెద్దల పన్నాగమే.. పుళిందపుడు వాళ్ల కోసం ఏ దుస్సాహసానికైనా తోడ్పాటునందిస్తాడు.
కళ్లకున్న గంతలతో అంతా చక్కగా హాయిగా, చూస్తున్నాడు జాయపుడు. అతనికి గాంధారి విద్య తెలుసు. గాంధారి విద్య అంటే.. గంతలు కట్టుకున్న కళ్లకు ఎదురుగా ఉన్నవన్నీ కళ్ల ద్వారా కాకుండా, మనసు ద్వారా కనిపిస్తాయి. చరిత్ర పూర్వయుగాలలో కళ్లు మూసుకుని గంటలకొద్దీ తపస్సు చేసే ఋషులకు ఈ విద్య తెలుసు. తర్వాతి కాలంలో ధృతరాష్ట్రుని భార్య గాంధారి తన భర్తలా కళ్లకు గంతలు ధరించడంవల్ల ఈ విద్యను గాంధారి విద్యగా పిలుస్తున్నారు.
బండి పోయిపోయి ఎక్కడో ఆగింది. జాయపుణ్ని కిందికి లాగారు. ఈడ్చుకుంటూ లోపలికి తీసుకుపోయారు. కింద పడేశారు. మరింతగా జారిపడి వాళ్లకు సహకరించాడు జాయపుడు. ముడుచుకుపోయాడు. భయంతో వణకుతున్నట్లు ముఖం పెట్టాడు.
పిష్టపుర యుద్ధం జరిగిన ఐదేళ్ల తర్వాత.. జాయపునిలోని యుద్ధవీరుడు తిరిగి మేల్కొన్నాడు. శరీరంలోని అణువణువూ కలిసి.. ఫాలభాగాన సర్వశక్తులూ ఏకమవుతున్నాయి. ఒళ్లు విరుచుకున్నాడు.
ఎవరో వచ్చారు. ఆయనకు ఉచితాసనం వేశారు.కళ్లగంతలతోనున్న జాయపుణ్ని చూసి అతనోనవ్వు నవ్వాడు. గుర్తించాడు.. అతను ముమ్మడి నాయకుడు. ఆగంతుకులు జాయపుని నోటికి, కళ్లకు కట్టిన గుడ్డలు తీయబోయారు.
జాయపుడు సున్నితంగా వారించాడు..‘పర్లేదులే! ఉండనివ్వండి’ అన్నట్లు. గుడ్డనుంచి ఏదో అన్నాడు. వాళ్లకు అర్థంకాదు కదా.. నోటిగుడ్డ తొలగించారు. వెనువెంటనే లిప్తల కాలంలో జాయపుడు తన మెడలో ఉన్న చిన్న దారు కాహళిని నోట పెట్టుకుని.. తలఎత్తి పుష్టికొద్దీ వాయించాడు.
అంతే! అప్పుడు మొదలైన నరకబాధలకు వాళ్లంతా ‘ఎప్పుడు చచ్చిపోదామా!?’ అని ఇష్టదైవాలకు మొక్కారు.అది ఎలా మొదలయ్యింది అంటే.. చీకట్లు ముసురుకుంటున్న ఆవేళ, అప్పటికే చెట్లపైకి చేరిన వందలాది పక్షులు ఆ కాహళధ్వనికి గయ్యిమని లేచి రెక్కలు టపటపా కొట్టుకుంటూ పిచ్చిపిచ్చిగా అరుస్తూ, ఆకాశంలో రయ్ రయ్యిన పల్లటీలు కొట్టసాగాయి. అవి భయంతో వణికిపోతున్నాయి. పక్షులు అంత భయంకరంగా మారతాయని ఊహామాత్రంగా కూడా ముమ్మడి బృందానికి తెలియదు. “వాడి మెడలోని.. అదేదో లాగి పారేయండిరా..” అరిచాడు ముమ్మడి.
ఇద్దరు ముందుకు ఉరికి జాయపుని మెడలోని కాహళిని లాగి దూరంగా విసిరేశారు. అదేదో పాములాగా వాళ్లంతా బెదిరిపోయారు.“ఏం ముమ్మడి నాయకా.. భయం వేసిందా!?” అన్నాడు జాయపుడు.అతనిప్పుడు కణకణమండే నిప్పు కణికలపై కూర్చున్న రుద్రమూర్తిలా ఉన్నాడు. వారికే కాదు.. తనకు తానే!ప్రశాంతంగా ఏ శ్మశానంలోనో ధ్యానంలో ఉన్నవాణ్ని ఆహ్వానించి, అవమానించి, చావు కొని తెచ్చుకున్నదక్షునిలా కనిపిస్తున్నాడు ముమ్మడి.
చాలాకాలానికి తనలోని ఆ మహాశక్తిని మేలుకొలిపినట్లు.. దానికి ఆకలి కల్పించినట్లు.. ఒళ్లు, కాళ్లు, వేళ్లు, చేతులు విరుచుకున్నాడు జాయపుడు. అతనిలోని కాలభైరవుడు లోలోన రగిలిపోతూ అనుజ్ఞ కోసం అర్రులు చాస్తున్నాడు. పైన పక్షుల అరణ్యరోదన పెరుగుతూ.. తరుగుతూ హృదయ విదారకంగా ఉంది. లక్ష సైనికుల యుద్ధారావం ఆకాశంలో.. కింద మనోజ్ఞమూర్తిలా చిద్విలాసంగా ఉన్నాడు జాయపుడు.
కళ్లకు గుడ్డ అలాగే ఉంది. అయినా జాయపుడు అంత నిబ్బరంగా మాట్లాడటం ముమ్మడిని ఆశ్చర్యపరచింది. ఆ గదిలోని దివిటీల కాంతిలో కాస్త బెరుగ్గా చూస్తూ అన్నాడు ముమ్మడి.“అది.. ఆ వాద్యం.. ఏమిటి? అంత శబ్దం చేసింది?”.వేసుకున్న ప్రణాళిక అంతా తల్లకిందులు అవుతున్నట్లు తెలుస్తున్నది. ఏదో మాట్లాడబోయి ఏదో మాట్లాడుతున్నాడు.“అది నా యుద్ధ శంఖారావం. నీకు తెలిసిన శంఖారావం వేరు. నేను పూరించింది వేరు. పైన తిరుగుతున్న పక్షులన్నీ నా సైన్యం.. యుద్ధానికి ఆవాహన చేశాను.. నిద్రమత్తు వదిలించుకుని వచ్చాయి!”.
పక్షులు తమ కాళ్ల గోళ్లతో, ముక్కులతో ఎవర్నయినా.. ఏ క్షణమైనా తేలికగా చంపడానికి ఉవ్విళ్లూరుతున్నట్లు అందరి తలలకు దగ్గరగా తాకుతూ ఎగురుతున్నాయి. ముసురుకున్న చీకట్లో ఆకుల గలగలలు ఆ పక్షుల ఏడుపునకు తప్పెట్లు వాయిస్తున్నట్లు ఉన్నాయి.
“మరికాసేపు వాయిస్తే.. పైన పక్షులే కాదు. ఈచుట్టుపక్కలనున్న జంతువులన్నీ.. కుక్కలు, నక్కలు, ఆవులు, గేదెలు, పందులు, ఏనుగులు.. గుర్రాలు.. మరేమో.. పాములు.. వందరకాల తాచులు.. చుంచులు.. ఆఖరికి ఎలుకలు అన్నీ వచ్చేస్తాయి ఇక్కడికి..” అని బిగ్గరగా నవ్వి..
“అవన్నీ నా సైన్యం!”.
ఆ చీకటిలో జాయపుని గొంతు వింటుంటే నరకానికి యమధర్మరాజు మృదుమధురంగా ఆహ్వానగానం చేస్తున్నట్లుంది. వింటున్న వాడెవ్వడికీ నోట మాట రావడం లేదు.
“మరో రాగం మార్చానంటే.. మీ శరీరంలోని రక్తనాడులన్నీ చిట్లిపోతాయి. రక్తం చెమటలా స్వేదరంధ్రాల నుంచి ధారగా బయటికి వస్తుంది. అప్పుడు శరీరమంతా ఎర్రగా రక్తపుముద్దలా.. ఇక కాళ్లు – చేతులు – చెవులు – కళ్లు – ముక్కు అంటూ ఏమీ ఉండవు. అన్నీ కలగలసి ఓ మాంసపు ముద్దలా అవుతుంది. యముడి మహిషం వస్తున్న అడుగుల శబ్దం నీకు వినిపిస్తుంది. నీకు నువ్వే చచ్చిపోదామని తీవ్రంగా కోరుకుంటావు. అప్పుడు నేను చంపను. నా కాళ్లు, గెడ్డం పట్టుకుని బతిమలాడతావు. ‘నన్ను చంపేయ్.. చంపేయ్!’.. అని కిందపడి దొర్లి దొర్లి ఏడుస్తావు. నేను మాత్రం కనికరించను సుమా!”.
చిమ్మచీకటిలో అతని స్వరం మృత్యు ఆహ్వానగీతికలా.. యమధర్మరాజు ముచ్చట్లు చెబుతున్నట్లు వినిపిస్తున్నది. సమస్త ప్రకృతి పక్షిసమూహంలాగే మరి కొన్ని
లిప్తల్లో అక్కడ వారిపై విరుచుకుపడవచ్చునని వాళ్లకు అర్థమవుతున్నది. వాళ్లకు నిజంగానే అప్పటికప్పుడు చచ్చిపోతే బావుండుననిపిస్తున్నది.
అప్పుడు ఎవ్వరూ ఊహించనంత వేగంగా లేచి ఎగిరి.. ఓ ఆగంతకుడి రొమ్ముపై తన్నాడు జాయపుడు. వాడు అక్కడికక్కడే సుడిగాలికి లుంగలు తిరిగినట్లు
గిర్రుగిర్రున తిరిగి రక్తం కక్కుకున్నాడు. విపరీతంగా దగ్గుతున్నాడు. నవరంధ్రాల్లోంచి రక్తం బయటికి కారింది. దబ్బున వెనక్కి విరుచుకుపడి పోయాడు.
ఎవ్వరికీ నోట మాట రాలేదు. చీకటి పెరిగినకొద్దీ పైన పక్షుల ఏడుపు చీకటితోపాటే పెరుగుతున్నది. నిజంగానే జంతువులేవో దగ్గరికి వేగంగా వచ్చేస్తున్నట్లు.. అందరూ వెర్రి చూపులు చూస్తున్నారు.
కళ్లకు గంతలున్న జాయపుడు మళ్లా నేలపై కూర్చుండిపోయాడు.
నవ్వాడు.. మెల్లగా.. గట్టిగా.. గట్టిగట్టిగా! మళ్లీపక్షులన్నీ బెంబేలెత్తి అరచేలా.. వికటాట్టహాసం..మళ్లా మళ్లా.. దక్షయజ్ఞంలోకి మహాశివుడు ప్రవేశించినట్లు.. నేలపై రుద్రుని త్రిశూలం చేస్తున్న శబ్దంలాంటిది ఏదో.. ఆ దుండగుల చెవులలో మోగుతున్నది.
అక్కడంతా బీభత్సంగా ఉంది.. ఆ చీకటి.. ఆ జాయపుని గొంతు మాటలు.. వెయ్యి గుడ్లగూబలు నోళ్లు తెరచి ఏడుస్తున్నట్లు. అందరికీ ఏదో భయం.. చలి.. హిమాలయలకు దగ్గరగా ఉన్నట్లు.. వణుకు!!
ఇలా మాటలతో చంపెయ్యడం వాళ్లకెప్పుడూ అనుభవంలేదు. ఊహాతీతం!!
అప్పుడు వినిపించింది.. వేగంగా పరిగెత్తుకు వస్తున్న గుర్రపు డెక్కల చప్పుడు. వచ్చివచ్చి ఆగింది. అది విక్రమ. నిజానికి జాయపుని కాహళి వాయించింది తానెక్కడున్నాడో విక్రమకు పంపిన సంకేతం. జంతువులు, పక్షులు దానికి తీవ్రంగా స్పందిస్తాయి. నిలబడలేవు.. కూర్చోలేవు. పిచ్చెక్కిపోతాయి.
ఎవడో విక్రమపై చెయ్యి వెయ్యబోయాడు. మళ్లీ ఎగిరి వాణ్ని ఈడ్చి తన్నాడు. ఆ చీకట్లో వాడు ఎటు వెళ్లి పడ్డాడో ఎవరికీ కనిపించలేదు.
కళ్లగంతలతోనే వెళ్లి విక్రమను తాకాడు. అది ముందుకాళ్లపై ఇంతెత్తున లేచి తానొచ్చినట్లు ప్రకటించింది.“విక్రమా! కాహళి వినిపించిందా!? తోవ తెలిసినట్లు వచ్చేశావ్. అద్భుతం! ధీరగాడు ఏడి? భారీకాయుడు కదా.. మెల్లగా వస్తున్నాడా!? కాస్త ఆలస్యమైనా వీళ్లందర్నీ ఏకకాలంలో తొక్కి తొక్కి చంపేస్తాడులే..”జూలు నిమురుతూ చెబుతున్నాడు.
అది గారాముగా చిన్నగా సకిలిస్తున్నది.కళ్ల ముందు జాయపుడు సృష్టిస్తున్న బీభత్సంముమ్మడికేమీ అర్థం కావడంలేదు. ఏం చేద్దామనుకున్నాడు తను.. జరుగుతున్నదేమిటి? ఇప్పుడు పారిపోవడానికి తోవ ఏమన్నా ఉందో లేదో??
“ఆ కళ్లకు గంతలెందుకు!? తీసెయ్..” అన్నాడు ముమ్మడి.. చెమట తుడుచుకుంటూ.“నాకు లేని సమస్య నీకేమిటి మిత్రసత్తమా!?”.“నీకు శివుడిలా మూడోకన్ను ఉన్నట్లు భావిస్తున్నావా?”.
“ఆ శివుడి సంగతి ఏమోకానీ.. నాకు మూడోనేత్రం ఉన్నట్లు నీకు అర్థమైందికదా.. ఈ తృప్తి చాలు!”.జాయపుని విన్యాసాలు చూస్తుంటే అనవసరంగా అతనితో పెట్టుకున్నానే! అని వాపోతున్నాడిప్పుడు. ఇట్లా నిలబడితే లాభం లేదన్నట్లు అందరూ మూకుమ్మడిగా జాయపునిపై పడ్డారు. అప్పుడే ముమ్మడి కాగడాలు ఆర్పేశాడు. కానీ, అప్పటికే ఆలస్యం జరిగిపోయింది.
కేవలం తలెత్తి అందర్నీ పుష్టిగా కుమ్మాడు జాయపుడు. ఎవరెవరికి ఎక్కడ దెబ్బలు తగులుతున్నాయో తెలియదు కానీ.. అందరూ పెడబొబ్బలు పెడుతున్నారు. జాయపుడు కూడా గుండెలు అదిరిపోయేలా యుద్ధరావాలు చేస్తున్నాడు. అతనికి అంత గొంతుక ఉన్నదని ముమ్మడే కాదు.. అక్కడున్నవారెవ్వరూ ఊహించలేదు.అంతా చీకటి.. కళ్లు పొడుచుకున్నా ఏమీ కనిపించడం లేదు.
జాయపునికి అప్పుడు గుర్తొచ్చింది..తన కంచుకంలో గజ్జెల పట్టీలు ఉన్నట్లు!
(సశేషం)
ఎవ్వరూ ఊహించనంత వేగంగా లేచి ఎగిరి.. ఓ ఆగంతకుడి రొమ్ముపై తన్నాడు జాయపుడు. వాడు అక్కడికక్కడే సుడిగాలికి లుంగలు తిరిగినట్లు గిర్రుగిర్రున తిరిగి రక్తం కక్కుకున్నాడు.విపరీతంగా దగ్గుతున్నాడు. నవరంధ్రాల్లోంచి రక్తం బయటికి కారింది. దబ్బున వెనక్కి విరుచుకుపడి పోయాడు.
-మత్తి భానుమూర్తి
99893 71284