Ameesha Patel | బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్’, ‘ధురంధర్: ది రివెంజ్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ చిత్రాల కంటే తన 2001 నాటి బ్లాక్బస్టర్ ‘గదర్: ఏక్ ప్రేమ్ కథ’, మరియు 2023 లో వచ్చిన ‘గదర్ 2’ చిత్రాలకే ఎక్కువ మంది ప్రేక్షకులు (ఫుట్ఫాల్స్) థియేటర్లకు వచ్చారని బాలీవుడ్ నటి అమీషా పటేల్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
2026 జూన్ 15 నాటికి అమీషా పటేల్, సన్నీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘గదర్: ఏక్ ప్రేమ్ కథ’ విడుదలై 25 ఏళ్లు పూర్తి కానుంది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. త్వరలోనే తాము 25 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకోబోతున్నాం. అయినప్పటికీ తమ చిత్రం ఇప్పటికీ ఒక ఐకానిక్ సినిమాగా నిలిచిందని అన్నారు. ‘గదర్ 2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల సునామీని సృష్టించిందని, కేవలం థియేటర్లలోకి వచ్చి సినిమా చూసిన ప్రేక్షకుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే, ‘గదర్ 1’, ‘గదర్ 2’ చిత్రాలు ‘ధురంధర్ చిత్రాల కంటే చాలా ఎక్కువ అని అమీషా పేర్కొన్నారు. ప్రేక్షకుల సంఖ్య పరంగా తమ సినిమాలు సాధించిన ఈ విజయం నన్ను ఎంతగానో సంతోషపరిచిందని, భారతీయ సినిమా చరిత్రలో తాను కూడా ఒక భాగమవడం, అంతటి గౌరవాన్ని అందుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు.
1947 దేశ విభజన నేపథ్యంలో తెరకెక్కిన ‘గదర్: ఏక్ ప్రేమ్ కథ’ చిత్రం, ఒక సాధారణ సిక్కు ట్రక్ డ్రైవర్ తారా సింగ్ (సన్నీ డియోల్), విభజన సమయంలో ఒక ఉన్నత ముస్లిం కుటుంబానికి చెందిన సకినా (అమీషా పటేల్) ప్రాణాలను కాపాడటం చుట్టూ తిరుగుతుంది. ఆ తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకుంటారు, అయితే కొన్ని పరిస్థితుల వల్ల వారు విడిపోవాల్సి వస్తుంది. తన భార్యను తిరిగి తీసుకురావడం కోసం తారా సింగ్ పాకిస్తాన్కు ఎలా వెళ్లాడనేదే మొదటి భాగం కథ. ఇక ‘గదర్ 2’ విషయానికి వస్తే, ఈ చిత్రంలో తారా సింగ్ తన కుమారుడు జీతేను రక్షించడం కోసం మరోసారి పాకిస్తాన్ లోకి అడుగుపెడతాడు.