కేసీఆర్కు నలభై ఏండ్ల రాజకీయ అనుభవంతో పాటు పన్నెండేండ్ల పాటు ఉద్యమాన్ని నడిపి తెలంగాణ రాష్ర్టాన్ని సాకారం చేయడమే కాక, రెండుసార్లు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. నాయకత్వ లక్షణాలుఆయనలో పుష్కలం. నాలుగైదు భాషల్లో అనర్గళ పాండిత్యం, అందరినీ కలుపుకొని వెళ్లే తత్త్వం, జాతీయస్థాయిలో స్నేహాలు, పరిణతి చెందిన వయసు ఆయనకు అదనపు బలం.
అవును! మొన్న ఐదు రాష్ర్టాల్లో వెలువడిన ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయవర్గాల్లో నలుగుతున్న చర్చాంశం ఇది. ఏడేండ్ల నుంచి దేశాన్ని ఏలుతున్న బీజేపీ కొత్తగా ఈ ఎన్నికల ద్వారా సాధించింది చెప్పుకోదగినదిగా లేకపోవడమే ఇందుకు కారణం. నిజమే.. పశ్చిమబెంగాల్లో గత అసెంబ్లీలో మూడు సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ నిన్నటి ఎన్నికల్లో అంతకు పాతిక రెట్ల స్థానాలను సంపాదించింది. అయితే ఈ విజయం మీద వాస్తవికమైన విశ్లేషణ చేసుకుంటే 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 18 స్థానాలు గెలిచింది. ఆ నిష్పత్తిలో చూసినప్పుడు నిన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సుమారు 120 గెలవాలి. కానీ అలా జరగలేదు. దాదాపు 45 సీట్లను కోల్పోయింది.
ఇక స్టాలిన్ విషయానికి వస్తే ఆయన జీవితంలో మొదటిసారి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ప్రాధాన్యం ముందుగా సొంత రాష్ర్టానికే ఉంటుంది. తండ్రి లాగా ఆయన గొప్ప వక్త కాదు. నాయకత్వ ప్రతిభ ఏమిటో కూడా ఇంకా రుజువు కాలేదు. అనుభవం లేదు. పైగా ఆయనకు తమిళం తప్ప మరొక భాష రాదు. చేతిలో 40 మంది ఎంపీలు ఉన్నప్పటికీ ఆయన జాతీయ రాజకీయాల్లో వేలు పెట్టే సాహసం ఇప్పట్లో చేయరు. కర్ణాటక నుంచి కుమారస్వామి కూడా అంతే.
ఈమాత్రం దానికి ప్రధాని మోదీ బంగ్లాదేశ్ వెళ్లి అక్కడి బెంగాలీలను కూడా మెప్పించడానికి ప్రయత్నించాల్సి వచ్చింది. మజ్లీస్ పార్టీ సహకారంతో ముస్లిం ఓట్లను చీల్చడానికి కూడా ప్రయత్నించారు. ఎన్ని చేసినప్పటికీ తృణమూల్ ఓట్లను, సీట్లను మాత్రం చీల్చలేకపోయారు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల ఓట్లు మాత్రమే తమవైపునకు తిప్పుకోగలిగారు. అంతేకాకుండా తృణమూల్ కాంగ్రెస్లోని ప్రముఖ నాయకులను ప్రలోభపెట్టి, బెదిరించి ఎంపీలను, ఎమ్మెల్యేలను తమవైపునకు ఆకర్షించారు. బీజేపీ అనుసరించిన పద్ధతి చూసిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్కు కనీసం వంద సీైట్లెనా వస్తాయా అనిపించింది కొన్ని సందర్భాల్లో. కానీ, మమతా బెనర్జీ వీరోచితంగా పోరాడి బీజేపీని మట్టికరిపించడమే కాక 80 సీట్ల లోపు వారి బలాన్ని పరిమితం చేసింది. 125 నుంచి 150 మాత్రమే వస్తాయనే సర్వే ఏజెన్సీల అంచనాలను తలకిందులు చేసి గత రెండు అసెంబ్లీ ఫలితాల కన్నా ఎక్కువ స్థానాలు సాధించారు దీదీ. అందువల్లనే 77 సీట్లు గెలిచినప్పటికీ బీజేపీలో ఉత్సాహం కనిపించలేదు.
ఒకరకంగా చెప్పాలంటే ఎన్నికల షెడ్యూల్ను కూడా 8 విడతలుగా నిర్ణయించి బీజేపీ తన గొయ్యిని తానే తవ్వుకున్నదని కొందరి అభిప్రాయం. నెలరోజుల పాటు సాగిన ప్రహసనంలో మొదటి విడత పోలింగ్ సమయంలో మోదీకి ఉన్నంత మంచిపేరు తర్వాతి విడతల్లో క్రమంగా తగ్గుతూ వచ్చింది. కొవిడ్ను ఎదుర్కోవడంలో ప్రధాని పూర్తిగా విఫలమైన దృశ్యమే కనిపించింది. ఆక్సిజన్ కోసం, బెడ్స్ కోసం, వ్యాక్సిన్ కోసం, ప్రజల హాహాకారాలు గత నెలలో మిన్నంటాయి. రోజూ 2- 4 లక్షల కేసులు, వేల సంఖ్యలో మరణాలు దేశాన్ని అల్లకల్లోలం చేశాయి. ప్రధాని నిష్క్రియాప్రియత్వం, అసమర్థత కొట్టొచ్చినట్లు గోచరించింది. అవకతవక నిర్ణయాలు తీసుకోవడం, ప్రజల భయాన్ని తొలగించడంలో కేంద్రం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. చివరికి పాక్, భూటాన్ లాంటి దేశాలు సైతం భారత్కు సాయం చేస్తామని ముందుకొచ్చాయంటే మనం బాధపడాలో లేక సంతోషించాలో తేల్చుకోలేకపోయారు జనం.
ఇక తమిళనాడు అసెంబ్లీలో 4 స్థానాలు గెల్చుకున్నప్పటికీ అక్కడ బీజేపీకి అధికారం అనేది మరో యాభై ఏండ్లకైనా అసంభవమనే విషయం అందరికీ తెలుసు. కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడుతుండటంతో బీజేపీ కొద్దిగా సీట్లు తెచ్చుకుంటున్నది. ఏపీలోని తిరుపతి, తెలంగాణలోని నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. 4 దక్షిణాది రాష్ర్టాల్లో జరిగిన లోక్సభ ఉప ఎన్నికల్లో బీజేపీ ఒక్కదాన్ని కూడా గెలవలేకపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో సాధించిన ఒక్క సీటును కూడా నిన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ పోగొట్టుకున్నది. ఈ పరిణామాలన్నింటినీ విశ్లేషిస్తే బీజేపీ ప్రభలు మెల్లగా మసకబారుతున్నట్లు స్పష్టమవుతున్నది. అటు కాంగ్రెస్ పార్టీని చూస్తుంటే రాహుల్గాంధీ చేతగానితనం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. బీజేపీకి ప్రత్యామ్నాయంగా పార్టీని బలోపేతం చేయడంలో కాంగ్రెస్ యువ నాయకుడు విఫలమయ్యాడనే చెప్పాలి.
ఇలాంటి పరిస్థితుల్లో దేశంలోని మిగిలిన బలమైన రాజకీయపార్టీలు బీజేపీ ఏకస్వామ్యానికి తలవంచి కూర్చోవలసిందేనా? ప్రత్యామ్నాయాన్ని నిర్మించి పోరాడటానికి ప్రయత్నించకూడదా?
ప్రస్తుతం దేశంలో చాలా రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, డీఎంకే, అన్నాడీఎంకే, రాష్ట్రీయ జనతా దళ్, జేడీయూ, బిజూ జనతా దళ్, అకాలీదళ్, ఆప్, వీటన్నిటికి తోడుగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చాలా బలమైన నాయకత్వాలు కలిగి ఉన్నాయి. శివసేన, ఎన్సీపీ కూడా బీజేపీ వ్యతిరేకులే.
ఇవన్నీ కలిసి 150- 200 సీట్లను ప్రభావితం చేస్తాయి. రాబోయే రెండేండ్లలో మరికొన్ని ప్రాంతీయ పార్టీలు బలంగా తయారవుతాయి, బీజేపీ ప్రాభవం తగ్గడం మొదలుపెట్టగానే ఈ పార్టీల బలం 300 మ్యాజిక్ మార్కుకు చేరుకుంటుంది.
అయితే వీటన్నింటిని సమన్వయపరిచి ఐక్య సంఘటనగా చేయగల నాయక శ్రేష్ఠుడు కావాలి. దక్షిణాది నుంచి ఈసారి అలాంటి నాయకుడు రావాలని చాలామంది అభిలషిస్తున్నారు. తృణమూల్ అధినేత్రి ప్రతిపక్షాలను ఏకం చేయగలదనడంలో సందేహం లేదు. కానీ, ఆ పార్టీలో ద్వితీయ నాయకత్వం లేదు. మమత శాసించినట్లుగా మరొకరు ఆ పార్టీని నియంత్రించలేరు. ఇక శరద్పవార్ ఇప్పటికే 80 ఏండ్ల వయసు దాటారు. మరో మూడేండ్ల తర్వాత ఆయన దేశ నాయకత్వం వహించే శక్తిని కలిగి ఉంటారనేది సందేహమే. ఆర్జేడీ తేజస్వీయాదవ్ ఉన్నప్పటికీ జాతీయస్థాయిలో ఆయన నిభాయించలేరు. ఇక్కడ కేవలం ఎంపీల బలమే కాకుం డా రాజకీయ అనుభవం, పరిణతి, ఓరిమి, విభిన్న మనస్తత్వాలు కలిగిన నాయకులను కూడగట్టడం అనేవి ప్రధానాంశాలు.
దక్షిణాది నుంచి చూసుకుంటే బలమైన నాయకులుగా స్టాలిన్, జగన్మోహన్రెడ్డి, కేసీఆర్ వడపోతలో తేలుతారు. వీరిలో స్టాలిన్, జగన్మోహన్రెడ్డిలు మొదటిసారిగా ముఖ్యమంత్రులు అయ్యారు. వీరు దాదాపు పదేండ్ల సుదీర్ఘ విరామం, పోరాటం తర్వాత అధికారాన్ని సాధించారు. రాష్ట్రంలో తమదైన పాలనతో నిలదొక్కుకోవాలి. జగన్మోహన్రెడ్డి నిలదొక్కుకున్నప్పటికీ రాష్ట్రంలో ఆయన సాధించాల్సింది చాలా ఉంది. ఆయనకు ప్రబల శత్రువు టీడీపీకి ఇంకా 30 శాతం ఓటు బ్యాంకు ఉన్నది. అంతేకాకుండా మరో పదేండ్ల వరకు జగన్మోహన్రెడ్డికి ప్రత్యామ్నాయ నాయకత్వం లేదు. ఈ పరిస్థితుల్లో రాష్ర్టాన్ని వదిలి అనిశ్చితమైన జాతీయ రాజకీయాల జోలికి ఇప్పు డే వెళ్లడం సమంజసం కాదు. ఇక జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి అత్యంత ప్రధానమైన అంశం భాష! జగన్మోహన్రెడ్డి ఆంగ్ల భాషా పరిజ్ఞానం అమోఘం. హిందీ మీద ఆయనకు ఎలాంటి అభినివేశం, పట్టున్నాయో తెలియదు. ఏమైనప్పటికీ జగన్మోహన్రెడ్డికి ఇంకా పాతికేండ్ల రాజకీయ జీవితం ఉన్నది. కాబట్టి ఇప్పుడే ఆయన తొందరపడతారని నేననుకోను.
ఈ పరిస్థితుల్లో బీజేపీని ఎదిరించి పోరాడటానికి దక్షిణాది నుంచి కనిపిస్తున్న నాయకుడు కేసీఆర్ మాత్రమేనని రాజకీయ పండితుల అభిప్రాయం. కేసీఆర్కు నలభై ఏండ్ల రాజకీయ అనుభవంతో పాటు పన్నెండేండ్ల పాటు ఉద్యమాన్ని నడిపి తెలంగాణ రాష్ర్టాన్ని సాకారం చేయడమే కాక, రెండుసార్లు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. నాయకత్వ లక్షణాలు ఆయనలో పుష్కలం. నాలుగైదు భాషల్లో అనర్గళ పాండిత్యం, అందరినీ కలుపుకొని వెళ్లే తత్త్వం, జాతీయస్థాయిలో స్నేహాలు, పరిణతి చెందిన వయసు ఆయనకు అదనపు బలం. గతంలో ఆయన నాయకత్వంలో ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన వచ్చినప్పటికీ, సమయం సరిపోకపోవడంతో కార్యరూపం దాల్చలేదు. కానీ ఈసారి ఆ ప్రయత్నాలు ఫలిస్తాయని చాలామంది విశ్వాసం. దాదాపు అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులు మోదీని వ్యతిరేకిస్తున్నారు. రాష్ర్టాలకు రావాల్సిన ప్రయోజనాల విషయంలో కూడా మోదీ కర్కశంగా వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రులు గుర్రుగా ఉన్నారు. అయితే పరిస్థితుల ప్రభావం వల్ల ఏమీ చేయలేకపోతున్నారు. కానీ, పరిస్థితులు ఏ మాత్రం అనుకూలించినా అందరూ ఒకటైపోతారు.
కేసీఆర్కు ఉన్న మరొక అనుకూల అంశమేమంటే ఆయన తర్వాత నాయకత్వ భారం వహించడానికి కొడుకు కేటీఆర్ సిద్ధంగా ఉన్నారు. తండ్రి దగ్గర అన్ని విషయాల్లో రాటుదేలి తన ప్రతిభను ఇప్పటికే చాటుకున్నారు. పార్టీ మొత్తం కేటీఆర్ నాయకత్వానికి సిద్ధంగా ఉన్నది. తాను లేకపోతే పార్టీ ఏమైపోతుందో అన్న చింత కేసీఆర్కు లేదు. ఆరామ్గా కేసీఆర్ జాతీయ నాయకత్వాన్ని మోయడానికి సిద్ధంగా ఉంటారు. ఈ దిశగా ప్రయత్నాలు మొదలయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. బీజేపీకి రానురాను మోదీ గుదిబండగా మారుతున్నారని ఆ పార్టీలో వినిపిస్తున్న గుసగుసలు!
ఇలపావులూరి మురళీమోహనరావు
(వ్యాసకర్త: సీనియర్ రాజకీయ విశ్లేషకులు)