భువనేశ్వర్ : కొవిడ్ సెకండ్ వేవ్ విరుచుకుపడుతున్న తరుణంలో ఒడిషా కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న వర్కింగ్ జర్నలిస్టులను కొవిడ్ వారియర్స్ గా గుర్తించాలని నిర్ణయం తీసుకున్నామని ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు.
కరోనా వైరస్ పై వర్కింగ్ జర్నలిస్టులు అవిశ్రాంతంగా సమాచారం చేరవేయడంతో పాటు కొవిడ్-19 సంబంధిత అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నారని ప్రశంసించారు. కొవిడ్19కు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో జర్నలిస్టులు ప్రజలు, ప్రభుత్వానికి విలువైన మద్దతు అందిస్తున్నారని అన్నారు. రాష్ట్రానికి విపత్తు వేళలో జర్నలిస్టులు గొప్ప సేవలు అందిస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది.