వేల ఏండ్ల నాటి మానవ నాగరికత, వికాస ఛాయలు ఇక్కడి మట్టిదిబ్బల మాటున నిక్షిప్తమై ఉన్నాయి. యావద్భారతానికి శాంతి సందేశాన్నిచ్చిన బౌద్ధ ధర్మం విలసిల్లిన పుణ్యధామం ఈ ప్రాంతం. దక్షిణ భారతదేశంలో అతిపెద్దదిగా గుర్తింపు పొందిన బౌద్ధక్షేత్రం ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో వెలుగు చూసింది. నాలుగు దశాబ్దాల కిందట పురావస్తు శాఖ ఆధ్వర్యంలో జరిపిన తవ్వకాల్లో ఇందుకు సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి.
ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు నల్లకొండపల్లి అని పిలిచేవారు. ఇప్పుడు నేలకొండపల్లి అంటున్నారు. పేరు సంగతి అటుంచితే.. ఊళ్లో ఓ భారీ మట్టి దిబ్బ ఉండేది. దాన్ని స్థానికులు ఎర్రదిబ్బ, విరాటరాజు గద్దె అనేవారు. దీని గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉండేవి. 1976, 1984 ప్రాంతంలో పురావస్తు శాఖ ఇక్కడ తవ్వకాలు జరిపింది. ఈ దిబ్బ కింద ఒకప్పుడు సువిశాల బౌద్ధారామం ఉండేదన్న సంగతి వెలుగు చూసింది. అలా, తెలంగాణ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది.
భారీ స్తూపం: ఎన్నో పరిశోధనల తర్వాత బౌద్ధ మతానికి ఈ ప్రాంతం ప్రముఖ కేంద్రంగా ఉండేదన్న అంచనాకు వచ్చారు చరిత్రకారులు. అందుకు తార్కాణమే ఇక్కడి భారీస్తూపం. 14 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో బౌద్ధారామం ఉండేదని తెలుస్తున్నది. రెండు ఎకరాల వైశాల్యంతో .. సుమారు 170 మీటర్ల వ్యాసంతో, 54 అడుగుల ఎత్తుతో ఉన్న బౌద్ధ స్తూపం నేటికీ తథాగతుడి ప్రాభవాన్ని చాటుతున్నది. ఇది దక్షిణ భారతంలోని బౌద్ధ స్తూపాలన్నిటిలోకీ పెద్దది. పరిసరాల్లో బౌద్ధ భిక్షువుల నివాసాలు, వారు ఉపయోగించిన పాత్రలు, ఇతర వస్తువులు వెలుగుచూశాయి. బుద్ధుడి ప్రతిమలు, పద్మపాణి కంచు విగ్రహం, పూసలు బయటపడ్డాయి. శాతవాహనులు, విష్ణుకుండినులు, ఇక్ష్వాకుల పాలన కాలం నాటి నాణేలు బయల్పడ్డాయి. ఇక్కడ దొరికిన విగ్రహాలు, ఇతర పాత్రలను హైదరాబాద్, గుంటూరు మ్యూజియాల్లో భద్రపరిచారు. ఆరామం బయల్పడిన ప్రదేశాన్ని రక్షిత ప్రాంతంగా ప్రకటించి, తవ్వకాలు జరగకుండా నిషేధాజ్ఞలు విధించారు. మరిన్ని తవ్వకాలు జరిపితే, ఎన్నో కొత్త విష యాలు వెలుగు చూస్తాయి.
విదేశీ ప్రతినిధుల రాక: 2017లో హైదరాబాద్లో నిర్వహించిన అంతర్జాతీయ బుద్ధిజం వారోత్సవాలకు హాజరైన విదేశీ ప్రతినిధులు నేలకొండపల్లిని సందర్శించారు. హాంకాంగ్, చైనా, మలేషియా, జపాన్, బ్రిటన్, శ్రీలంక, సింగపూర్, థాయిలాండ్, జర్మని, ఇటలీ.. ఇలా 40 దేశాలకు చెందిన ప్రతినిధులు వారిలో ఉన్నారు. మరోవైపు బౌద్ధం ఓ వెలుగు వెలిగిన ప్రాంతాల అభివృద్ధిపై దృష్టిసారించిన తెలంగాణ ప్రభుత్వం నేలకొండపల్లిలోని స్తూపానికి ‘బుద్ధిజం కారిడార్’లో చోటు కల్పించింది. స్తూపం నిర్మాణం దెబ్బతినకుండా రూ.60 లక్షలను కేటాయించి, నిర్మాణ పనులు చేపట్టింది. రాత్రి వేళలోనూ స్తూపాన్ని సందర్శించేలా నాలుగు వైపులా హైమాస్ట్ లైట్లను, రంగురంగుల విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసింది. స్తూపానికి వెళ్లే రహదారిని అభివృద్ధిపరిచింది.
పెరుగుతున్న పర్యాటకులు: ఘన చరిత్ర కలిగిన నేలకొండపల్లి బౌద్ధస్తూపాన్ని సందర్శించే పర్యాటకుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. స్తూపం దగ్గర పార్క్తోపాటు చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా బొమ్మలు ఏర్పాటు చేశారు. సమీపంలోనే బాలసముద్రం చెరువు ఉండటంతో ప్రకృతి సౌందర్యం కూడా కట్టిపడేస్తున్నది. చెరువులో బోటింగ్కు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. బోటింగ్కు అవకాశం ఇవ్వడంతోపాటు, పురావస్తు మ్యూజియం ఏర్పాటు చేస్తే.. నేలకొండపల్లి చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది. తథాగతుడి శాంతి సందేశాన్ని ప్రజలకు చేరువచేయవచ్చు కూడా.
అడుగడుగున బౌద్ధం
స్తూపం, పరిసరాలే కాదు నేలకొండపల్లి చుట్టుపక్కల కూడా బౌద్ధానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయి. 1977లో ఒక రైతు తన పొలాన్ని దున్నుతుండగా నాగలికి ఏదో అడ్డుతగిలింది. తవ్వగా బుద్ధుడి విగ్రహాలు తొమ్మిది బయటపడ్డాయి. 1991లో ఇక్కడి వాగులో మత్స్యకారులు చేపల కోసం వల వేసినప్పుడు.. బుద్ధుడి విగ్రహం చిక్కింది. ఇలా అడుగడుగునా బౌద్ధ వైభవం ప్రస్ఫుటం అవుతున్నది.
-మైస శ్రీనివాస్