రక్తపోటుకు ఉప్పు ఓ ముఖ్య కారణమనీ, అది క్రమంగా పక్షవాతం, గుండె జబ్బుల్లాంటి తీవ్ర సమస్యలకు దారి తీస్తుందని తెలిసిందే. అలా అని ఉప్పు వాడకాన్ని నియంత్రించడం అంత తేలిక కాదు. అందుకో మార్గం ఉందంటున్నారు పరిశోధకులు. సోడియం శాతం తక్కువగా ఉండే ఉప్పును వాడితే, ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని తేల్చారు. ఈ పరిశోధన కోసం చైనాలోని 600 గ్రామాల్లో 20 వేల మందికి పైగా అభ్యర్థులను ఎంచుకున్నారు. వీరిలో సగం మందికి, సాధారణ ఉప్పు వాడమని చెప్పారు. మరికొందరికి ప్రత్యామ్నాయ ఉప్పును అందించారు. ఈ ఉప్పులో 75 శాతం సోడియం, 25 శాతం పొటాషియం ఉండేట్లు చూసుకున్నారు. రక్తపోటుకు సోడియం ఎక్కువ తీసుకోవడం ఎంత కారణమో, పొటాషియం తగ్గడం కూడా అంతే కారణం అవుతూ ఉంటుంది. కాబట్టి, ఈ రెండిటినీ సమన్వయం చేస్తూ కొత్తరకం ఉప్పును రూపొందించారు. నాలుగేండ్ల పాటు వీరందరినీ గమనించిన తర్వాత తేలిందేమిటంటే… సోడియం తక్కువగా ఉన్న ప్రత్యామ్నాయ ఉప్పు వాడినవారిలో పక్షవాతం, గుండె సమస్యల తీవ్రత తగ్గాయి.