‘సుధవ్వా ఇయ్యాల స్కూల్ల్ల ఏం చెప్పిండ్రు బిడ్డా’అన్నాడు దశరథం.‘తాతా మరేమో కొత్తసార్ అచ్చిండు. మంచి ముచ్చట్లు చెప్పిండు. పెద్దలతో ఎట్లుండాలో చెప్పిండు. బతకంగనె సరిపోదు. నలుగురితో కలిసి ఉండాలి. నలుగురిని బతికించాలి. పైసలు కూడవెట్టుడు కాదు తాతా! మనుషులను సంపాదించుకోవాలి’అందా మనవరాలు.ఆ సమాధానం విని ఆశ్చర్యపోతాడా తాత. ఆయనే కాదు ఆ చిట్టితల్లి చెప్పిన మాటలు ఎందరికో స్ఫూర్తి. ‘సంజీవని’ షార్ట్ఫిల్మ్లో చిన్న దృశ్యమిది. సుమారు 33 నిమిషాల నిడివి ఉన్న ఈ చిట్టి చిత్రం ఇంతకు మించిన గట్టి సందేశాన్ని పంచుతున్నది. ‘మనిషి కన్నుమూసిన తర్వాత కూడా ఎనిమిది మందిని బతికించొచ్చు. తనకు ఆయువు తీరినా మరెందరికో ఉసురు పోయొచ్చు’ అని చాటిచెబుతున్నది షార్ట్ ఫిల్మ్ ‘సంజీవని’. కథలోకి వెళ్తే..
అదో పల్లెటూరు. అక్కడో తాత, బామ్మ. వాళ్లకు ముద్దుల మనవరాలు. తండ్రి ఆలనాపాలన, తాతాబామ్మల గారాబంతో ఆ చిన్నారి ఆడిందే ఆట, పాడిందే పాట. తాత ధ్యాసంతా సుధవ్వ పైనే. ఆమె మురిపెమంతా తాత దగ్గరే! ఆ చిట్టి చేతులు ఏం చేసినా దశరథానికి గొప్పే. చిన్న మొక్కనాటితే మర్నాటికి మానైనంత పొంగిపోతాడు. మనవరాలు నాటిన మొక్కను పదిలంగా చూసుకుంటాడు. ఇక ఆమె మాటంటే వేదవాక్కే! మనవరాలి మాటలు ఆయన జీవితాన్నే మార్చేస్తాయి. 30 ఏండ్ల కిందట ఆస్తితగాదాల కారణంగా దూరం చేసుకున్న తమ్ముడిని తన మనవరాలు చెప్పిందని పరుగు పరుగున వెళ్లి పలకరిస్తాడు దశరథం. తమ్ముడిని ఆప్యాయంగా ఇంటికి రమ్మని పిలుస్తాడు. ఆ ఇంట పైకి కనిపిస్తున్న సంతోషంలో ఎవరికీ కనిపించని విషాదం ఒకటి ఉంది. ఓ సంఘటన దశరథం మనసును తీవ్రంగా గాయపరుస్తుంది. ఆయన ఆశలన్నిటినీ ఆవిరి చేస్తుంది. ఇంతకీ ఏంటా సంఘటన. దానికి, అవయవ దానానికి ఉన్న సంబంధం ఏమిటి? తెలుసుకోవాలంటే ‘సంజీవని’ షార్ట్ ఫిల్మ్ చూడాలి.
ఎమ్ఎక్స్ ప్లేయర్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిట్టి చిత్రానికి రచయిత శ్రీనివాసులు, దర్శకుడు మహేశ్! అవయవదానం గొప్పదనాన్ని చూపిన తీరు మనసును కదిలిస్తుంది. మన దేశంలో పన్నెండున్నర లక్షల మందికి ఒక్క అవయవదాత ఉన్నాడన్న కఠిన సత్యం కండ్లు తెరిపిస్తుంది. ‘సంజీవని’ ప్రయత్నం అవయవదానంపై అవగాహన కల్పిస్తుంది.
చిత్రాన్ని వీక్షించడానికి క్లిక్: www.mxplayer.in/shorts/watch-sanjeevani-online-ee6844d19c6f816267d13d873e14c78a?utm_source=mx_android