అది 2017.. జోరు వర్షంలో ఓ కుర్రాడు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్వైపు బైక్పై వెళ్తున్నాడు. ఫుట్పాత్పై వర్షానికి తడిసిముద్దయిన గజగజ వణుకుతున్న ఓ వృద్ధురాలిని చూశాడు. ఏదో పరధ్యానంలో ఇంటికెళ్లిపోయాడు. కానీ, మరుక్షణం నుంచీ ఏదో బాధ గుండెల్ని మెలిపెట్టింది. కారణం ఆ వృద్ధురాలే. పశ్చాత్తాపంతో, స్నేహితులను తీసుకొని మళ్లీ ఆవిడ దగ్గరకు చేరుకున్నాడు. 108 ద్వారా గాంధీ ఆస్పత్రికి తరలించాడు. ‘ఇటువంటి వారికి పూర్తిస్థాయిలో ఆశ్రయం ఎలా?’ అనే ఆ కుర్రాడి ఆలోచనలోంచి వచ్చిందే ‘సెకండ్ చాన్స్’.
జాస్పర్ పాల్ బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. కాలేజీ అయిపోయాక కార్లో మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ, వంద కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాడు. అయితే, తనువెళ్లే దారిలో గాలికి ఓ చెట్టు పడిపోవడాన్ని గమనించలేదు. దగ్గరగా వచ్చేవరకూ ఆ వృక్షం కనబడలేదు. సడన్గా బ్రేక్ కొట్టగానే.. కారు గాల్లో ఎగిరి పల్టీలు కొట్టింది. పెద్ద ప్రమాదమే. జాస్పర్కు మాత్రం ఒంటి మీద చిన్న గీత కూడా పడలేదు. కొద్దిరోజులు ఆ ప్రమాదం గురించే ఆలోచనంతా. అంతపెద్ద విపత్తు నుంచి ఎలా బయటపడ్డాడన్నది ఇప్పటికీ ఆశ్చర్యమే. తను నమ్మే దేవుడే, సమాజానికి సేవ చేసేందుకు ‘సెకండ్ చాన్స్’ ఇచ్చాడనుకున్నాడు.
కొవిడ్ వేళ..
కరోనా మహమ్మారి తెలంగాణను చుట్టిముట్టినవేళ జాస్పర్పాల్ బృందం చాలా అప్రమత్తంగా వ్యవహరించింది. సెకండ్ చాన్స్ సభ్యులు ప్రత్యేక బృందంగా ఏర్పడి విస్తృత సేవలందించారు. క్వారంటైన్లో ఉన్నవారికి, కొవిడ్ రోగులకు ఆహారం సరఫరా చేశారు. ఆక్సిజన్ సిలిండర్లు, మందులు పంపిణీ చేశారు. కరోనాకు గురైన పదిహేను వందల మందికి సేవలందించారు. సెకండ్ చాన్స్కు చెందిన మూడు ఆశ్రమాల్లో ఎంతోమందికి ఆశ్రయం ఇచ్చి, బాగోగులు చూసుకున్నారు. కరోనా సోకిన 150మంది వృద్ధులను నిత్యం వైద్యుల పర్యవేక్షణలో ఉంచి, ఆ వయోధికులు కరోనాపై విజయం సాధించేలా కృషిచేశారు. ఆరోగ్యం క్షీణించిన 11 మందికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించి ప్రాణాలు నిలిపారు. పట్టుమని 26 ఏండ్ల్లు కూడా లేని జాస్పర్ పాల్.. తన సెకండ్ చాన్స్ హోమ్స్లో వీధిపాలైన అభాగ్యులకు పునరావాసం కల్పిస్తూ, బాగోగులు చూస్తున్నాడు. ‘అతి త్వరలోనే నిరుపేదల కోసం ఓ ఆస్పత్రిని ప్రారంభించే ఆలోచన ఉంది. ఇందులో పరీక్షల దగ్గర్నుంచి, వైద్యం, మందులు.. అన్నీ ఉచితమే. ఆ ప్రయత్నంలో మీ అందరి సహకారం కావాలి’ అంటాడు జాస్పర్.
2017 మార్చి..
అభాగ్యుల గురించి ఎవరైనా సమాచారం ఇచ్చినా.. తాను వెళ్లే మార్గంలో నిరుపేదలు ఎదురైనా, దగ్గరకెళ్లి ఆకలి తీర్చి, వివరాలు తెలుసుకొని, పోలీసుల నుంచి క్లియెరెన్స్ తీసుకొని దగ్గర్లోని ఓల్డేజ్ హోమ్స్, అనాథ ఆశ్రమాలకు తీసుకెళ్తాడు జాస్పర్. ఒకవైపు చదువు, మరోవైపు సమాజ సేవతో నిత్యం బిజీగా ఉండే జాస్పర్ పాల్, 2017 మార్చిలో ‘ది సెకండ్ చాన్స్’ పేరిట సైనిక్పురిలో ఓ ఆశ్రమాన్ని ప్రారంభించాడు. తన హోమ్కు వచ్చినవాళ్లకు దేవుడు బతికేందుకు సెకండ్ చాన్స్ ఇవ్వాలన్న తాపత్రయంతో నిస్వార్థంగా సేవ చేస్తున్నాడు. తన హోమ్లోనివారికి రోజూ పాలు, ఆహారం, వారానికి రెండుసార్లు గుడ్లు, నాన్వెజ్ అందిస్తున్నాడు. నిత్యం బీపీ, షుగర్ చెక్చేస్తూ, వారానికి రెండుసార్లు.. ఇద్దరు జనరల్ ఫిజీషియన్లు, ఒక సైకియాట్రిస్టుతో వైద్య పరీక్షలు చేస్తున్నాడు. జాస్పర్ది తమిళనాడులోని కన్యాకుమారి. పెరిగింది, చదివింది అంతా హైదరాబాద్లోనే. నాన్న ఎయిరిండియాలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్, అమ్మ గృహిణి. అన్నయ్య ఇంజినీర్.
–డప్పు రవి