వేసవి తాపాన్ని తీర్చుకోవడానికైనా, చినుకుల సాయంత్రం చల్లని కాలక్షేపానికైనా అనేక పానీయాలు అందుబాటులో ఉన్నాయి. కానీ, రూహ్ అఫ్జా ప్రత్యేకతే వేరు. మన దేశంలో పుట్టిన ఈ పానీయం, మరోరెండు దేశాల్లో ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. రూహ్ అఫ్జాకు ఒంట్లోని వేడిని సర్రున గుంజేసే ఆయుర్వేద గుణం ఉంది. అందుకే, ఒక్క ఇండియాలోనే ఏడాదికి నాలుగున్నర కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నది. సరికొత్త రుచులతో తన సరిహద్దులనూ విస్తరించుకుంటున్నది.
రూహ్ అఫ్జా .. వేసవిలో ఇష్టంగా తాగుతారు. వర్షకాలంలో ప్రేమగా పుచ్చుకుంటారు. చలికాలంలోనూ తీయగా చప్పరిస్తారు. ఈ పానీయాన్ని కొన్ని దేశాల్లో దేవతలకు నైవేద్యంగానూ పెడతారు. ఊరేగింపుల్లో హుషారును పంచే పానీయంగా కూడా వాడతారు. బంగ్లాదేశ్లో అయితే వరుడు ఈ సీసాలను తన కొత్త బావమరుదులకు బహుమతిగా ఇస్తాడు. ఏటా కోట్ల రూపాయల లాభాలు వస్తున్నా.. తయారీదారులకు వెళ్లేది మాత్రం15 శాతం లాభాలే. అందులోనే ఉద్యోగుల జీతాలు, తయారీ ఖర్చులు చూసుకోవాలి. మిగిలిన 85 శాతం సొమ్మును సేవా కార్యక్రమాలకు, విద్యాభివృద్ధికి ఉపయోగిస్తారు. ఆ నిధులతో హాస్పిటల్స్ కూడా నడుస్తున్నాయి.
పేటెంట్ ఇండియాదే
రూహ్ అఫ్జా పానీయం మొదట పాకిస్థాన్లో తయారైందని కొందరు పనికట్టుకొని ప్రచారం చేస్తుంటారు. అది అబద్ధం. నిజానికి, పాత ఢిల్లీకి చెందిన యునానీ వైద్యుడు హకీమ్ హఫీజ్ అబ్దుల్ మాజీద్, 1907లో రూహ్ అఫ్జాను తయారు చేశాడు. ఆ సమయంలో భరించలేనన్ని ఎండలున్నాయి. చాలామంది వడదెబ్బకు బలైపోతున్నారు. డీహైడ్రేషన్ బారినపడుతున్నారు. ఇదంతా గమనించాడు అబ్దుల్ మాజీద్. ఇంట్లోనే పరిశోధనలు చేసి, చక్కెర వాడకుండా గులాబీ రేకులు, పండ్లరసాలతో ఓ కషాయాన్ని తయారు చేశాడు. వేడితో ముడిపడిన అన్ని రుగ్మతలనూ పారదోలే శక్తి దీనికి ఉందని గమనించాడు. ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాడు. క్రమంగా వ్యాపారం పెరిగింది. చిన్న దుకాణం కాస్తా పెద్ద ఔషధ తయారీ సంస్థగా రూపొందింది.
‘హమ్దర్ద్’ అనే బ్రాండ్ పేరుతో రూహ్ అఫ్జాను విస్తరించారు. దురదృష్టవశాత్తు 34 ఏండ్ల వయసులోనే మాజిద్ మరణించాడు. అతని భార్య రబీయా బేగం తన ఇద్దరు కుమారులతో కలిసి ‘హమ్
దర్ద్’ను ఓ ట్రస్టుగా ఏర్పాటు చేశారు. 15 శాతం లాభాలను మాత్రమే యాజ మాన్యం వినియోగించుకోవాలని, మిగతా మొత్తాన్ని ప్రజా సంక్షేమానికి ఖర్చు చేయాలని తీర్మానించారు. దేశ విభజనలో మాజిద్ కుటుంబం కూడా ముక్కలైంది. అప్పటి వరకూ హమ్దర్ద్ ట్రస్టుకు ధర్మకర్తలుగా ఉన్న ఇద్దరు కుమారుల్లో ఒకరు పాకిస్థాన్కు వెళ్లారు. అక్కడ ఓ శాఖను ఏర్పాటుచేసి, రూహ్ అఫ్జా ఉత్పత్తి ప్రారంభించారు. ఆ వారసుడు తర్వాత పాకిస్థాన్ సింధ్ ప్రావిన్స్ గవర్నర్ పదవిని కూడా చేపట్టారు. ఇండియాలోని రూహ్ అఫ్జాకూ పాకిస్థానీ రూహ్ అఫ్జాకూ రుచిలో వ్యత్యాసం కనిపిస్తుంది. 1971లో ఈస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్గా అవతరించడంతో అక్కడకూడా తయారీ మొదలైంది. సేవా కార్యక్రమాలు మొదలుపెట్టారు. పెద్ద కుమారుడు హకీమ్ అబ్దుల్ హమీద్ మాత్రం భారతదేశాన్నే మాతృభూమిగా ఎంచుకొన్నారు.