క్యాన్సర్ అంటే భయం. ఆ రోగమొస్తే.. ఎందరున్నా ఒంటరే! ప్రాణాంతక వ్యాధి వచ్చిందని చెప్పుకోవడానికి జంకు. చెప్పుకొంటే.. ఎడతెరపిలేని థెరపీలతో సతమత మవుతున్న రోగిని సమాజం బాధగా చూస్తుంది. ‘ఏ పాపం చేశాడో పాపం..’ అని చూసే చూపులు ఆ వ్యాధిగ్రస్తుడికి లేని అపవాదును అంటగడుతుంటాయి. ‘ఆరిపోయే దీపం’గా చూసే జాలి చూపులు సరేసరి! క్యాన్సర్ గురించి అవగాహన లేకపోవడమే ఆ వ్యాధిని పెనుభూతం కేటగిరిలో చేర్చిందని చెబుతుంది నటి, రచయిత్రి, సామాజికవేత్త విజీ వెంకటేశ్. ఇంతకీ ఎవరామె? క్యాన్సర్పై ఆమె చేస్తున్న పోరాటమేంటి?
విజీ వెంకటేశ్ క్యాన్సర్ బాధితులకు ఓ సలహాదారుగా తెలుసు. ఓటీటీలో మలయాళం ఫీల్గుడ్ సినిమాలు చూసే వారికి ‘లైలా’గా తెలుసు. ‘ఉమ్మాచీ’గా బాగా గుర్తు. 71 ఏండ్ల వయసులో తెరంగేట్రం చేసిందామె. విజీ గురించి అంతవరకు ఎవరికీ తెలియని విషయాలు ఆమె నటిగా మారాక వెతికి వెతికి మరీ కనిపెడుతున్నారు అభిమానులు. ఆమె ఇన్స్టాగ్రామ్ రీల్స్ను కండ్లప్పగించి చూస్తున్నారు. పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలు చెవులు రిక్కించి వింటున్నారు. క్యాన్సర్కూ, ఆమెకూ ఉన్న సంబంధం ఏంటో ఆరాలు తీస్తున్నారు.
విజీది చాలా ఈజీగోయింగ్ మనస్తత్వం. సొంత రాష్ట్రం కేరళ. తిరువనంతపురం అమ్మమ్మగారిల్లు. త్రిసూర్ నాన్నమ్మగారి ఊరు. తల్లిదండ్రులతో ఢిల్లీలో పెరిగారు. బీఏ ఇంగ్లిష్ లిటరేచర్ చదివారు. ఆసక్తి ఉన్నా.. ఉద్యోగం చేసే అవకాశం రాలేదు. ముంబయిలో ఓ ఆయిల్ రిఫైనరీ సంస్థలో పనిచేస్తున్న వెంకటేశ్తో విజీ పెండ్లయింది. ఇద్దరు కొడుకులు పుట్టాక ఆ కుటుంబం వెనిజులాకు వెళ్లింది. కొన్నేండ్లు అక్కడే ఉన్నారంతా! బాగానే కూడబెట్టుకున్నారు. కాలం కలిసి రాలేదు. సంపాదించిందంతా కరిగిపోయింది. అమెరికా వెళ్లారు. అక్కడా అంతంత మాత్రంగానే అనిపించింది. లాభం లేదనుకొని స్వదేశానికి వచ్చేశారు. ఇల్లు గడవాలంటే భర్తతోపాటు తనూ సంపాదించాలని నిశ్చయించుకున్నారు. కానీ, ఎంత ప్రయత్నించినా ఉద్యోగాలు రాలేదు. చివరికి క్యాన్సర్ రోగులకు బాసటగా నిలిచే మ్యాక్స్ ఫౌండేషన్ అనే ఎన్జీవోలో కో ఆర్డినేటర్గా రూ.1,500కు కొలువు కుదిరారు. ఇప్పుడు అదే ఫౌండేషన్ ఏషియా రీజియన్ హెడ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఏడు పదుల విజీ సామాజిక మాధ్యమాల్లో బిజీగా ఉంటారు! ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా చేస్తుంటారు. చేనేతను యువత ప్రోత్సహించాలని చెబుతూ కాటన్ చీరలు అందంగా కట్టుకొని చిత్తరువులు అందులో పోస్ట్ చేస్తుంటారు. ఆమె ఇన్స్టా హ్యాండిల్కు దాదాపు నలభై వేల మంది దాకా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఇన్స్టా పోస్టులు మలయాళ దర్శకుడు అఖిల్ సత్యన్ కంటపడ్డాయి. ఆ సమయంలో ‘పాచువుమ్ అద్భుతవిళక్కుం’ కథ అనుకుంటున్నాడు. హీరోగా ఫహాద్ ఫాజిల్ ఫిక్సయ్యాడు. మరో పాత్రలో వినీత్ ఓకే అయ్యాడు. కథను నడిపించే, మలుపు తిప్పే లైలా పాత్రకు విజీ అయితేనే కరెక్ట్ అనుకున్నాడు. ఆమెను సంప్రదించాడు. అప్పటికి ఆమెకు 68 ఏండ్లు. ‘నా వల్ల కాదు బాబు’ అందామె. కథ చెప్పాడు అఖిల్. ‘నో’ చెప్పడానికి రీజన్ కనిపించలేదు. ‘ఓకే’ అనేశారు. చూస్తుండగా షూటింగ్ పూర్తయింది, రిలీజైంది. ‘మ్యాక్స్ ఫౌండేషన్’ సాయం అందించే బాధితులకు, ఇన్స్టాలో తన హ్యాండిల్ ఫాలోవర్లకు మాత్రమే తెలిసిన విజీ పేరు కేరళ అంతా పాకిపోయింది. మొదటి సినిమాలోనే వంద చిత్రాల అనుభవమున్న నటిలా చేసిందని కితాబులొచ్చాయి. ‘ఇప్పుడు నేను కేరళలో ఎక్కడికి వెళ్లినా అందరూ ‘ఉమ్మాచి’ అని పిలుస్తున్నారు. అందులో ఫహాద్ నన్ను అలాగే పిలుస్తుంటాడు. ఒక్కసారిగా సెలెబ్రిటీ అయిపోయా’ అంటారు విజీ.
సినిమా సంగతి అటుంచితే.. విజీ జీవితం రకరకాల మలుపులు తిరిగింది. ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొంది. కానీ, ఆమె పెదాలపై నవ్వు చెరగలేదు. విజీ అత్తయ్య క్యాన్సర్ బాధితురాలు. అమెరికా నుంచి ఇండియాకు వచ్చాక వాళ్ల అమ్మమ్మకు క్యాన్సర్ సోకింది. ఆమె ఉన్నన్నాళ్లూ కంటికి రెప్పలా చూసుకున్నారు. ‘మ్యాక్స్ ఫౌండేషన్’లో చేరాక వందలాది మంది బాధితులకు ధైర్యం నూరిపోశారు. ఫౌండేషన్ తరఫున ఆర్థిక, వైద్య సాయం అందించి ఊరుకోరు. రోగులు మానసికంగా కుంగిపోకుండా ధైర్యం చెబుతుంటారు. కొన్ని నెలల కిందట విజీ భర్త వెంకటేశ్ క్యాన్సర్తో కన్నుమూశారు. ‘మా ఆయనకు క్యాన్సర్ చివరి దశలో ఉండగా నిర్ధారణ అయింది. తర్వాత ఆరు వారాలకే ఆయన కన్నుమూశారు. ముందే నిర్ధారణ అయి ఉంటే.. ఆయన్ను తప్పకుండా కాపాడుకునేదాన్ని’ అంటారు విజీ.
క్యాన్సర్పై అవగాహన కల్పించడమే ఇప్పుడు తన జీవిత లక్ష్యం అంటారామె. ఇందుకోసం సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకున్నారు. గ్లికెవ్ ఇంటర్నేషనల్ పేషెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ (GIPAP)కు నాయకత్వం వహిస్తున్నారు. క్యాన్సర్ బారిన పడకుండా ఉండటానికి, రోగ పీడితులకు అండగా నిలవడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. మరోవైపు పలువురు దర్శకులు తమ సినిమాలో నటించమని విజీని సంప్రదిస్తున్నారు. స్క్రిప్ట్లు వినిపిస్తున్నారు కూడా! అయితే క్యాన్సర్పై తను చేస్తున్న పోరాటానికి ఊతమిస్తుందని అనిపిస్తే సినిమాలు చేయడానికి తనకేం అభ్యంతరం లేదంటున్న విజీకి మనమూ జై కొడదాం!
‘క్యాన్సర్ మహమ్మారి గురించి చర్చించాలంటేనే చాలామందికి జంకు. ఆ తెరలు తొలగించే ఉద్దేశంతో ‘చాయ్ ఫర్ క్యాన్సర్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. మన దేశంలో టీ అడ్డాలో చర్చించినన్ని విషయాలు మరెక్కడా డిస్కస్ చేయరు. అందుకే, తేనీటి సమయాన్ని క్యాన్సర్పై అవగాహన కల్పించే వేదికగా మార్చాలని భావించాను. నలుగురు మాట్లాడుకుంటే విషయం పదిమందికీ చేరువ అవుతుంది. క్యాన్సర్పై ఉన్న
అపోహలను కొంతవరకైనా నియంత్రించే అవకాశం ఉంటుంది.’