గదిలో అడుగుపెట్టగానే.. పిలుపు కోసం ఎదురుచూస్తున్న రోగులు. క్యాబిన్లో చిరునవ్వుతో పలుకరిస్తూ.. బాధలు వింటూ.. ప్రిస్క్రిప్షన్ రాస్తూ.. ఇద్దరు డాక్టర్లు. ఆ సాంత్వన మందులకంటే బలంగా పనిచేస్తున్నది. ఆ ఓదార్పు సగం వ్యాధిని తగ్గిస్తున్నది. ఆ ఆత్మీయ స్పర్శ శస్త్రచికిత్స అవసరమే లేకుండా చేస్తున్నది.
ఆ ఇద్దర్నీ ఇన్నాళ్లూ సమాజం చిన్నచూపు చూసింది. సూటిపోటి మాటలతో బాధపెట్టింది. ఆత్మహత్యకు ప్రేరేపించింది. అయినా సరే.. తామేమిటో నిరూపించుకోవాలన్న తపన.. లక్ష్యం దిశగా అడుగులు వేయించింది. ఆ ట్రాన్స్జెండర్ వైద్యులు.. డా.ప్రాచీ రాథోడ్, డా.రూత్ జాన్ పాల్. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా డాక్టర్ హోదా పొందిన ట్రాన్స్జెండర్లుగా రికార్డు సృష్టించారు ఇద్దరూ.
ఉట్నూర్ టు ఉస్మానియా
డాక్టర్ ప్రాచీ రాథోడ్ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని ఓ మారుమూల గ్రామంలో పుట్టారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు. ఇద్దరు తోబుట్టువులు. ప్రాథమిక విద్య ఉట్నూర్లోనే సాగింది. ఇంటర్ విజయవాడలో పూర్తి చేశారు. తన కూతురు డాక్టర్ కావాలనేది తండ్రి కోరిక. ఆయన కోసమే ప్రాచీ ఆదిలాబాద్ రిమ్స్ (రాజీవ్గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో మెడిసిన్ చదివారు. ఆ తర్వాత హైదరాబాద్లో డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్ చేశారు.
ఒక కార్పొరేట్ దవాఖానలో ఎమర్జెన్సీ ఫిజీషియన్గా పనిచేశారు. కానీ అక్కడ తను ట్రాన్స్ జెండర్ అని తెలియగానే ‘పొమ్మనలేక పొగ బెట్టారు’. పరిస్థితిని అర్థం చేసుకొని తానే రాజీనామా చేశారు ప్రాచీ. ఆ తర్వాత ఆరునెలలు ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఆ సంక్షోభ సమయంలోనూ తల్లిదండ్రుల నుంచి ఎలాంటి మద్దతూ లభించలేదు. నిర్దాక్షిణ్యంగా ఇంట్లోంచి పంపేశారు. ఆ సమయంలో ఆత్మహత్యకు ప్రయత్నించారు. చావు చివరి అంచుల వరకూ వెళ్లొచ్చిన ప్రాచీకి ట్రాన్స్ కమ్యూనిటీ ఆశ్రయం కల్పించింది. బాధల్లో తోడుగా నిలిచింది. అన్నీ తామై కష్టసుఖాలు పంచుకుంది. ఆర్థికసాయం చేసింది. కాబట్టే, తానొక ట్రాన్స్ డాక్టర్గా సమాజం ముందు నిలబడగలిగానని స్థిరంగా చెబుతారు ప్రాచీ.
రిజర్వేషన్ల కోసం పోరాటం
మేమిద్దరం ఎండీ, ఎంఎస్ చేయాలనుకుంటున్నాం. పీజీ ప్రవేశ పరీక్ష రాస్తే.. మాకు మహిళల కేటగిరీలో సీటు ఇచ్చారు. మేం దరఖాస్తు చేసుకున్నదేమో ట్రాన్స్ విభాగంలో. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. మా హక్కుగా రావాల్సిన సీట్ల కోసం హైకోర్టును ఆశ్రయించాం. ప్రభుత్వం కూడా సానుకూల నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాం. ఉస్మానియా దవాఖానాలో.. డ్యూటీ ముగించుకొని అడుగు బయటపెట్టే వరకూ ఎవరూ మమ్మల్ని ట్రాన్స్జెండర్గా చూడరు. తోటి వైద్యులు, సిబ్బంది, రోగులు ఇస్తున్న గౌరవం మాటల్లో చెప్పలేనిది. ఈ అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు.-
– డా.ప్రాచీ రాథోడ్, డా.రూత్ జాన్ పాల్
ఖమ్మం నుంచి హైదరాబాద్
డాక్టర్ రూత్ జాన్పాల్ గతం అవమానాల పుట్ట. ప్రాథమిక విద్య ఖమ్మంలోని గవర్నమెంట్ స్కూల్లో జరిగింది. ఇంటర్ వరకూ క్లాస్ ఫస్ట్. చిన్న వయసులోనే నాన్న చనిపోయారు. కుటుంబ బాధ్యత అన్నయ్య తీసుకున్నారు. జాన్పాల్ను మెడిసిన్ చదివించేందుకు చెమటోడ్చారు. చదువు పూర్తికాగానే ట్రాన్స్జెండర్గా మారిన విషయాన్ని ఇంట్లో చెప్పారు జాన్పాల్. మొదట సంశయించినా తర్వాత ఒప్పుకొన్నారు కుటుంబ సభ్యులు. ‘డిప్లొమా ఇన్ గైనకాలజీ’ తర్వాత ఉద్యోగం కోసం హైదరాబాద్లోని కార్పొరేట్ హాస్పిటల్స్ చుట్టూ తిరిగారు జాన్పాల్. రెజ్యూమేలో ‘ట్రాన్స్ జెండర్’ అనే మాట చూశాక.. అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదెవరూ. తన చదువుకు విలువ లేకపోతున్నందుకు చాలా బాధపడ్డారు జాన్పాల్.
కష్టం కలిపిన స్నేహబంధం
ట్రాన్స్ కమ్యూనిటీ కోసం హైదరాబాద్లోని నారాయణగూడలో ‘మిత్ర క్లినిక్’ ఏర్పాటు చేస్తున్నారని తెలిసి
అక్కడికి వెళ్లారు ప్రాచీ, జాన్పాల్. ఇద్దరూ అప్పటికే ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉండటంతో మెడికల్ ఆఫీసర్లుగా నియమించుకున్నారు ఎన్జీవో నిర్వాహకులు. అలా ప్రాచీ, జాన్పాల్ స్నేహబంధం బలపడింది. ట్రాన్స్జెండర్ల సమస్యలపై మాట్లాడేందుకు తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీతో కలిసి వివిధ హాస్పిటల్స్కు వెళ్లేవారు. ట్రాన్స్ కోసం ప్రత్యేకంగా ఓ వార్డు ఏర్పాటు చేయాలని కోరేవారు.
ఓసారి, ఉస్మానియా సూపరింటెండెంట్ మాటల సందర్భంలో.. మెడికల్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి చెప్పారు. ఇద్దరూ వెంటనే దరఖాస్తు చేసుకున్నారు. రెండువందల మందితో పోటీపడి కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు సాధించారు. ప్రస్తుతం, జనరల్ మెడిసిన్ విభాగంలోని యాంటీరెట్రోవైరల్ థెరపీ(ఏఆర్టీ)లో చీఫ్ మెడికల్ ఆఫీసర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు.
– రవికుమార్ తోటపల్లి