కేకే శైలజ .. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. కొవిడ్ సమయంలో కేరళ వైద్యశాఖ మంత్రిగా ఆ మాజీ టీచరమ్మ చూపిన చొరవ, చేసిన సేవలు, తీసుకున్న నిర్ణయాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. ‘ఇది నా విజయమో, మరొకరి విజయమో కాదు. సమష్టి కృషి ఫలితం’ అంటారామె. అప్పటివరకూ ఎలాంటి ప్రాధాన్యమూ లేని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంత్రిగా శైలజ శక్తివంతం చేశారు. నాణ్యమైన విద్య, వైద్యం ప్రజలకు అందించడం పాలకుల బాధ్యతే అని బలంగా నమ్మారు. ‘మై లైఫ్ యాజ్ ఎ కామ్రేడ్’ పేరుతో వెలువరించిన తాజా పుస్తకంలో తన జ్ఞాపకాలను, అనుభవాలను పంచుకున్నారు.
‘ప్రజా సమస్యల మీద పోరాడటానికి రాజకీయ నాయకుడే కానవసరం లేదు. సాధారణ పౌరుడు సరిపోతారు’ అంటారు శైలజ. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా ప్రజా జీవితంలో చాలా కష్టాలు అనుభవించాననీ, అనేక సవాళ్లు ఎదుర్కొన్నాననీ చెబుతారామె. ఎవరి మనోభావాలూ దెబ్బతినకుండానే తాను చెప్పాలనుకున్నవన్నీ పుస్తకంలో చెప్పేశారు. తాను పెరిగిన మలబార్ ప్రాంతం గురించి, తన తాతముత్తాతల త్యాగ నిరతి గురించి, సమాజంలో మహిళల పట్ల ఉన్న అభిప్రాయాల గురించి.. లోతుగా చర్చించారు శైలజమ్మ.