విల్లు ఎక్కు పెడితే.. లక్ష్యం తలవంచాల్సిందే. బంగారం, వెండి, రజతం.. ఏదో ఓ పతకం మెడలో ఆభరణమై మెరవాల్సిందే. పుట్టినగడ్డ మురిసిపోవాల్సిందే. ఈ గెలుపు యాదృచ్ఛికం కాదు. కఠోర సాధన ఫలితం. ఆ కృషికి ప్రభుత్వ సహకారమూ తోడైంది. ‘ఆడపిల్లకు ఆటలెందుకు?’ అంటూసమాజం నుంచి ఎదురైన ప్రశ్నకు తన విల్లుతోనే సమాధానమిచ్చింది ఎలిగేడు మండలం సుల్తాన్పూర్కు చెందిన తానిపర్తి చికిత. తాష్కెంట్లో జరుగనున్న ఏషియన్ గేమ్స్కూ ప్రాతినిధ్యం వహిస్తున్నదీ చిచ్చరపిడుగు.
రైతు కుటుంబం.. పేదరికం.
ఆడపిల్లకు ఆటలెందుకు?
అంటూ సామాజిక వివక్ష.
శిక్షణ వసతులే లేని మారుమూల ప్రాంతం.
.. ఈ సమస్యలేవీ చికితకు అవరోధాలుగా అనిపించలేదు. పార్థుడికి చెట్టు, కొమ్మ, రెమ్మ కాకుండా పక్షి కన్ను మాత్రమే కనిపించినట్టు చికితకు కూడా లక్ష్యమే సర్వస్వమైంది. విల్లంబులే ప్రపంచంగా మారాయి. కాబట్టే, జాతీయ స్థాయిలో జెండా ఎగరేసి.. అంతర్జాతీయంగా పతకాల వేటకు బయల్దేరింది. త్వరలో జరుగనున్న ఏషియన్ గేమ్స్, ఐదేండ్ల తర్వాత రానున్న లాస్ఏంజెల్స్ ఒలింపిక్స్.. ఈ రెండు ప్రతిష్టాత్మక వేదికలనూ దృష్టిలో పెట్టుకుని కఠోర సాధన చేస్తున్నది చికిత.
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ చికిత స్వస్థలం. తానిపర్తి శ్రీనివాసరావు-శ్రీలత అమ్మానాన్నలు. తోబుట్టువు యశ్వంత్. తనకున్న మూడెకరాలలో వ్యవసాయం చేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నారు శ్రీనివాసరావు . చికితకు ఎనిమిదేండ్లు ఉన్నప్పుడే తన కూతురి విలువిద్యా ప్రావీణ్యాన్ని గుర్తించారు శ్రీనివాసరావు. కరీంనగర్లో ఉంటున్న ఓ ఆర్చరీ కోచ్ సాయంతో.. బిడ్డకు తానే పాఠాలు బోధించారు. ఆ కష్టం వృథాగా పోలేదు. 2017-18లో క్రీడా ప్రస్థానాన్ని ప్రారంభించిన చికిత.. గోవాలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించింది. నిరుడు బెంగళూరులో నిర్వహించిన జాతీయ స్థాయి టోర్నీలోనూ పసిడితో ప్రతిభ చాటుకుంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా జూనియర్, సీనియర్ నేషనల్ గేమ్స్లో బహుమతుల పంట పండించింది. నేషనల్ ఆర్చరీ అసోసియేషన్ ముప్పైరెండు మంది కత్తిలాంటి క్రీడాకారులను ఎంపిక చేస్తే.. అందులో తెలంగాణ నుంచి ఒక్క చికిత మాత్రమే అర్హత సాధించింది. నేషనల్ ర్యాంకింగ్ ఆర్చరీ టోర్నమెంట్(ఎన్ఆర్ఏటీ) అనేకానేక వడపోతల తర్వాత సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ స్థాయిలో ఎనిమిది మందిని ఎంపిక చేస్తే… అందులోనూ చికితకు చోటు దక్కింది. ప్రస్తుతం హర్యానాలోని సోనేపట్లో ‘ఖేలో ఇండియా’లో సుశిక్షితులైన కోచ్ల సారథ్యంలో రాటుదేలుతున్నది తను.
అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలన్నదే చికిత లక్ష్యం. ఈ నెల 29 నుంచి మే 6 వరకు ఉజ్బెకిస్థాన్లోని తాష్కెంట్లో జరగనున్న ఏషియన్ గేమ్స్లోనూ పాల్గొననున్నది. ఆమె తమ్ముడు యశ్వంత్ కూడా తండ్రి దగ్గరే ఆర్చరీలో శిక్షణ పొందాడు. జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించాడు. ‘మా జిల్లాకు చెందిన చికిత ఏషియన్ గేమ్స్కు ఎంపికకావడం అభినందనీయం. ఆమెకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నది. ఇప్పటికే రూ. 5 లక్షలు మంజూరు చేశాం. చికిత రాగానే తనకు అవసరమైన ఎక్విప్మెంట్ కూడా అందిస్తాం’ అని ప్రకటించారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ డా. సర్వే సంగీత సత్యనారాయణ. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆర్చరీ అసోసియేషన్ కార్యదర్శి కొమురోజు శ్రీనివాస్, కోచ్ డి. శ్రీనివాస్ కూడా చికిత ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజమే, ఓ సాధారణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి.. అవరోధాలను దాటుకుని, పేదరికాన్ని తట్టుకుని ఓ లక్ష్యాన్ని సిద్ధం చేసుకోవడమే కష్టం. అందులోనూ చికిత గురి చిన్నది కాదు.. అంతర్జాతీయ పతకం. తనకిప్పుడు, తెలంగాణ సమాజం ఆశీస్సులు అవసరం.
ఇప్పటి వరకూ జాతీయ స్థాయిలో సత్తా చాటాను. ఇప్పుడు నా గురి.. ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్లో పతకాలు. పన్నెండేండ్ల క్రితం రాష్ట్రం నుంచి ఒకరు ఏషియన్ గేమ్స్లో ఆర్చరీ విభాగం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు నాకు ఆ అవకాశం వచ్చింది. దాన్ని తప్పక సద్వినియోగం చేసుకుంటాను.
తెలంగాణ ఘనతను ప్రపంచానికి చాటుతాను. కన్నవారికి, ఉన్న ఊరికి గొప్ప పేరు తెస్తాను.
తానిపర్తి చికిత నేషనల్ సబ్ జూనియర్ ర్యాంకర్, పెద్దపల్లి జిల్లా.
…? అంకరి ప్రకాశ్