సుహానీ షా.. తొలి భారతీయ మహిళా మెంటలిస్ట్. ఎదుటి మనిషి మనసును పుస్తకంలా చదివేయడం మెంటలిస్ట్ ప్రత్యేకత. ఇందులో మేజిక్ కూడా కలగలిసి ఉంటుంది. ఆరేండ్ల వయసులో సుహానీ తన తండ్రితో కలిసి సొంతూరు ఉదయ్పూర్లో ఓ మేజిక్ షోకు వెళ్లింది. ఇంటికి రాగానే.. తాను ఇంద్రజాలికురాలు అవుతానని ప్రకటించింది. కన్నవారూ ప్రోత్సహించారు. హైస్కూల్ స్థాయిలోనే చదువు ఆపేసి.. దేశమంతా తిరిగి ప్రదర్శనలు ఇచ్చింది. ‘అరవైమంది విద్యార్థులలో ఒకదానిగా క్లాస్రూమ్లో కూర్చోవాల్సిన వయసులో.. అరవైవేల మంది వీక్షకులకు వినోదాన్ని పంచాను’ అని గర్వంగా చెప్పుకొంటుంది సుహానీ. ఆ పరుగులో పడిపోయి ఇంగ్లిష్ మీద ధ్యాసపెట్టలేదు.
తన పరిధిని విస్తరించుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఆ కొరత తెలిసింది. వెంటనే ఇంగ్లిష్, గణితం, సైన్స్ మీద దృష్టిపెట్టింది. ఏ మెంటలిస్ట్ అయినా ఎదుటి మనిషి ఆలోచనల్ని పూర్తిగా చదవలేరు. కొంతమేర తెలుసుకుంటారు. దానికి సైకాలజీ జోడిస్తారు. ఇంద్రజాలాన్ని కలగలుపుతారు. ప్రేక్షకులను అబ్బురానికి గురి చేస్తారు. ‘పురుషాధిక్య ప్రపంచంలో మహిళా మెంటలిస్ట్గా, మెజీషియన్గా నా ప్రయాణం ఏమంత సాఫీగా సాగలేదు. నాకు గైడ్గా, మెంటర్గా ఉండటానికి ఏ పురుషుడూ ముందుకు రాలేదు. కారణం.. ఓ అమ్మాయిని తమంత ఎత్తుకు తీసుకెళ్లడం ఏ మగవాడికీ ఇష్టం ఉండదు. అందుకే, నా దారి నేనే నిర్మించుకున్నాను’ అంటుంది సుహానీ.