రచనా దవే.. అచ్చమైన బెంగాలీ అమ్మాయి. కోల్కతాలో పుట్టిపెరిగారు. పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూయార్క్ యూనివర్సిటీలో చదువుకున్నారు. ముంబైలోని భాభా అణుపరిశోధన కేంద్రంలో సైంటిస్ట్గా పనిచేశారు. సామాజిక స్పృహ ఎక్కువ. రైతు సమస్యల పట్ల అవగాహన ఉంది. అదే, ‘మైక్రో గో’ అనే సంస్థ ఏర్పాటు దిశగా అడుగులు వేయించింది. సేద్యానికి ఆధునిక పరిశోధనల ఫలితాలను జోడించడం ద్వారా మంచి సాధించవచ్చని అంటారు రచన. ఇప్పటికీ మన వ్యవసాయం జూదంతో సమానమే. మార్కెట్లో పంట విక్రయించి పైసలు అందుకునేదాకా అనిశ్చితే. టమాటా విషయమే తీసుకుందాం. ఆకాశాన్నంటే ధరలు ఉన్నప్పుడేమో పంటల్లేవు.
టమాటాలు విరగ పండినప్పుడేమో ధరలు నేలచూపులు చూస్తాయి. చేతులారా చెత్తకుప్పల్లో పడేయాల్సిన పరిస్థితి. ధర వచ్చే వరకూ నిల్వ చేసుకుందామంటే గిడ్డంగుల కొరత. బయోటెక్నాలజీ సాయంతో కాయగూరల జీవితకాలాన్ని పెంచగలిగితే.. రైతుకు ఎంతో ఉపయోగం. మంచి ధర లభించినప్పుడే విక్రయించుకుంటాడు. మంచి లాభాలనూ అందుకుంటాడు. ‘మైక్రో గో’ ద్వారా రచనా దవే చేస్తున్నదీ ఇదే. ‘ప్రస్తుతానికి ఉల్లి, ఆలూ, టమాటా పంటల కోసం పనిచేస్తున్నాం. ఆహారాన్ని కాపాడుకోవడం అనేది ఆహార భద్రతతో సమానం’ అంటారామె. పంట కోత తర్వాత జరిగే నష్టాన్ని నివారించడం, మార్కెట్కు చేరేదాకా కాయగూరలను కాపాడటం.. ఇదే తన లక్ష్యమని వివరిస్తారు దవే.