శివ్యనాథ్.. నిత్య యాత్రికురాలు. ప్రయాణాలంటే ప్రాణం. ట్రావెల్ రైటర్గా చాలా కథనాలే పండించారు. కానీ కొత్త ప్రాంతానికి వెళ్లిన ప్రతిసారీ ఓ చేదు సంఘటన ఎదురయ్యేది. కుప్పలకొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు, అవసరానికి మించిన యంత్రాల వాడకం.. భూగోళానికి మంటపెట్టే చర్యల్లా అనిపించేవి. దీంతో తన యాత్రా కథనాల్లో గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలకూ చోటు కల్పించారు. ‘ఆ పెను విపత్తును ప్రస్తావించకపోతే.. ఏ కథనం సంపూర్ణం కాదు’ అంటారామె. అకాల వర్షాలు, హద్దులులేని ఎండలు, సునామీలు.. గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలేనంటూ ఆమె జనాన్ని హెచ్చరిస్తారు.
తన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ‘క్లైమేట్ కాన్షయస్ ట్రావెల్’ అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. తనతోపాటు వచ్చే యాత్రికులకు కొత్త ప్రపంచాన్ని చూపించడమే కాదు, కొత్త ప్రమాదాలనూ గుర్తు చేస్తారు. జీరో వేస్ట్ జీవనశైలి, వేగనిజం తదితర అంశాలను బ్లాగ్, ఇన్స్టాగ్రామ్ ద్వారా చర్చకు పెడతారు. కాబట్టే ఓ పర్యావరణ చైతన్య సంస్థ శివ్యనాథ్ను ‘గ్లోబల్ సస్టెయినబుల్ ఇన్ఫ్లుయెన్సర్స్’ జాబితాలో చేర్చింది. గతంతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరుగుతుండటం ఓ శుభ పరిణామమని అంటారామె. ‘మనం బతకాలంటే భూమిని బతికించుకోవాల్సిందే’ అన్నది శివ్య నిశ్చితాభిప్రాయం.